సింగమనేని నారాయణ
సింగమనేని నారాయణ (1943 జూన్ 26 - 2021 ఫిబ్రవరి 25) అనంతపురం జిల్లాకు చెందిన కథారచయిత, విమర్శకుడు.[1] అనంతపురం జిల్లా, బండమీదపల్లిలోని ఓ రైతు కుటుంబంలో జన్మించిన నారాయణ పీయూసీ వరకు అనంతపురంలో చదువుకున్నాడు. తర్వాత తిరుపతిలోని ఓరియంటల్ కళాశాలలో విద్వాన్ చదివాడు. 32 సంవత్సరాలపాటు అనంతపురంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. చిన్నతనం నుంచే సాహితీరంగం వైపు ఆకర్షితుడయ్యాడు. 1960 లో తన మొట్టమెదటి కథ రచించాడు. 19 ఏళ్ళ వయసులో మూడు నవలలు రాశాడు. తొలుత కాల్పనిక సాహిత్యంతో మొదలు పెట్టి తర్వాత మార్క్సిజం వైపు ఆకర్షితుడయ్యాడు. రాయలసీమ రచయితల కథలను సంకలనం చేయడంలో కృషి చేశాడు.
సాహితీ రంగంలో ఆయన చేసిన కృషికి గాను 1997 లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం వారు ఆయనకు అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ పురస్కారం అందించారు. ఇంకా తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సాహితీ పురస్కారం, రాచకొండ రచనా పురస్కారం, పురిపండా అప్పలస్వామి పురస్కారాలను అందుకున్నాడు. 2017 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు కళారత్న పురస్కారం అందించింది.
బాల్యంసవరించు
సింగమనేని నారాయణ అనంతపురం పట్టణానికి దగ్గరలో వున్న బండమీదపల్లి గ్రామంలోని రైతు ఎస్. రామప్ప, సంజమ్మల కు]] జూన్ 23, 1943లో జన్మించాడు. నారాయణ రామప్ప కు ద్వితీయ పుత్రుడు గా జన్మించాడు.మొదటి నుంచి ఐదవ తరగతి వరకు స్వగ్రామమైన బండమీద పల్లి లోనూ తరువాత విద్యాభ్యాసం కోసం అనంతపురం కు వెళ్ళాడు.
కుటుంబంసవరించు
నారాయణకు గోవిందమ్మతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు. కుమారుడు వ్యాపార రంగంలో స్థిరపడగా, ఇద్దరు కుమార్తెలు ఉపాధ్యాయినులుగా స్థిరపడ్డారు. మరో కుమార్తె గృహిణి. పెద్ద అల్లుడు రామాంజనేయులు మహర్షి అనే కలం పేరుతో రచనలు చేస్తుంటాడు.
విద్యసవరించు
అనంతపురంలో ఉన్నత పాఠశాల లో విద్యపూర్తి చేసుకుని తిరుపతిలోని ప్రాచ్యకళాశాలలో విద్వాన్ చదివాడు.
వృత్తిసవరించు
అనంతపురం జిల్లా గ్రామీణప్రాంతాల హైస్కూళ్లలో తెలుగు పండితుడిగా పనిచేసి 2001లో పదవీవిరమణ చేశాడు.
రచనలుసవరించు
ఇప్పటివరకు 43కు పైగా కథలు వ్రాశాడు. మొట్టమొదటి కథ "న్యాయమెక్కడ? "1960లో కృష్ణాపత్రికలో అచ్చయ్యింది. ఈయన కథలు జూదం (1988), సింగమనేని నారాయణకథలు (1999), అనంతం (2007), సింగమనేని కథలు(2012) అనే నాలుగు కథాసంపుటాలుగా వెలువడ్డాయి. సీమకథలు, ఇనుపగజ్జెలతల్లి, తెలుగు కథలు - కథన రీతులు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారి 'తెలుగుకథ' మొదలైన పుస్తకాల సంపాదకత్వం వహించాడు. సంభాషణ పేరుతో ఒక వ్యాస సంపుటిని కూడా వెలువరించాడు. అప్పాజోస్యుల-విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్ ఈయనకు సాహిత్య సేవామూర్తి జీవితకాల సాధన పురస్కారాన్ని 2013లో అందజేసింది. ఆదర్శాలు - అనుబంధాలు, అనురాగానికి హద్దులు, ఎడారి గులాబీలు అనే నవలలు వ్రాశాడు[2].
అవార్డులుసవరించు
- 1997లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయరచయితల సంఘం, గుంటూరు జిలాశాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం.[3]
- 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉగాది సందర్భంగా కళారత్న పురస్కారం[4][5]
మరణంసవరించు
నారాయణ 2021 ఫిబ్రవరి 25న మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రాణాలు విడిచాడు. అంతకు మునుపు ఐదు నెలలుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడ్డాడు. 2021 ఫిబ్రవరి 15న అనంతపురంలోని తన నివాసంలో కళ్ళు తిరిగి పడిపోయాడు. అనంతరం ఆయన్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. పది రోజుల తర్వాత మరణించాడు.[6]
మూలాలుసవరించు
- ↑ ఎం. వి, నాగసుధారాణి. "రాయలసీమ కథలు క్షామ చిత్రణ" (PDF). shodhganga. తిరుపతి: శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 46. Retrieved 1 December 2017.
- ↑ "అనంత దర్శిని - అనంత కథానిక, నవల - జి.ప్రేమ్చంద్ - పేజీ 59". Archived from the original on 2016-03-04. Retrieved 2016-01-11.
- ↑ పెనుగొండ లక్ష్మీనారాయణ (1 January 2020). గుంటూరు సీమ సాహిత్య చరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం. pp. 282–283.
- ↑ 39 మందికి ‘కళారత్న’ 29-03-2017 ఆంధ్రజ్యోతి[permanent dead link]
- ↑ "ఉగాది సందర్భంగా అవార్డులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం". andhrapradesh.suryaa.com. 2017-03-28. Archived from the original on 2022-02-16. Retrieved 2022-02-16.
- ↑ "దివికేగిన సాహితీ సింగం". www.eenadu.net. Retrieved 2021-02-27.