ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

రాయలసీమలో బ్రిటిషు వారిని ఎదిరించిన పాళెగాడు

1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయలకాలం నుండి పాలెగాళ్ళు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు. అట్లాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒకడు. కంపెనీ దొరతనాన్ని ఎదిరించి వీరమరణం పొందాడు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
జననంఉయ్యాలవాడ నరసింహారెడ్డి
కర్నూలు జిల్లాలోని రూపనగుడి
మరణంఫిబ్రవరి 22, 1847
మరణ కారణంఉరి
ఇతర పేర్లుఉయ్యాలవాడ నరసింహారెడ్డి
ప్రసిద్ధిబ్రిటిషు వ్యతిరేఖ తిరుగుబాటుదారుడు
మతంహిందూ మతం
భార్య / భర్తముగ్గురు భార్యలు. పెద్దభార్య సిద్దమ్మ
పిల్లలుదొర సుబ్బయ్య
తండ్రిపెదమల్లారెడ్డి

ప్రారంభ చరిత్ర

18వ శతాబ్దపు తొలిదినాల్లో రాయలసీమలో పాలెగాళ్ళ వ్యవస్థ ఉండేది.కడప జిల్లాలోనే 80 మంది పాలెగాళ్ళుండేవారు. నిజాము నవాబు రాయలసీమ ప్రాంతాలను బ్రిటిషు వారికి అప్పగించడంతో పాలెగాళ్ళు బ్రిటిషు ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. బ్రిటిషు ప్రభుత్వం వారి ఆస్తులు, మాన్యాలపై కన్నేసి, వాటిని ఆక్రమించుకునే ఉద్దేశంతో, వారి అధికారాలకు కోత విధిస్తూ పాలెగాళ్ళ వ్యవస్థను రద్దుచేసి, వారికి నెలవారీ భరణాల ఏర్పాటు చేసింది.

ఉయ్యాలవాడ గ్రామం ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉంది. ఉయ్యాలవాడకు పాలెగాడుగా నరసింహారెడ్డి తండ్రి పెదమల్లారెడ్డి ఉండేవాడు. నరసింహారెడ్డి తాతగారు, నొస్సం జమీదారు చెంచుమల్ల జయరామిరెడ్డి నిస్సంతు కావడంతో నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నాడు. తండ్రి తరపున నెలకు 11 రూపాయల, 10 అణాల, 8 పైసలు భరణంగా వచ్చేది. అయితే తాతగారైన, జయరామిరెడ్డి నిస్సంతుగా మరణించాడనే నెపంతో అతనికి ఇస్తూ వచ్చిన భరణాన్ని మరణంతో రద్దుచేసింది బ్రిటిషు ప్రభుత్వం.

నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామములో జన్మించి, ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవాడయ్యాడని జానపద వీరగాథల వలన తెలుస్తుంది. ఇతను కడప, కర్నూలు, అనంతపురం, బళ్లారి జిల్లాలలో 66 గ్రామాలకు అధిపతి. రూపనగుడి, ఉయ్యాలవాడ, ఉప్పులూరు, గుళ్లదుర్తి, కొత్తకోట మొదలైన గ్రామాలలో ఇతను నిర్మించిన కోటలు, నగరులు ఈనాటికీ ఉన్నాయి.

నరసింహారెడ్డి తల్లి నీలమ్మ ఉయ్యాలవాడ నగరికాపు పెదమల్లారెడ్డి రెండవ భార్య. ఈమె నొస్సం జమీందారు చెంచుమల్ల జయరామిరెడ్డి చిన్న కుమార్తె. నరసింహారెడ్డికి ముగ్గురు భార్యలు. మొదటి భార్య సిద్దమ్మ వలన కొడుకు దొరసుబ్బయ్య జన్మించాడు. రెండవ భార్య పేరమ్మ వలన ఒక కుమార్తె, మూడవ భార్య ఓబులమ్మ వలన ఇద్దరు కుమారులు జన్మించారు.

నరసింహారెడ్డి దగ్గర ఓబళాచార్యుడు అనే ఆస్థానకవి ఉండేవాడు. కర్నూలు ప్రాంతంలో ప్రసిద్ధికెక్కిన కృష్టిపాటి వేంకటకవికవితో ఓబళాచార్యునికి నశ్యం పై సంభాషణాత్మకంగా జరిగిన రెండు పద్యాలను వేటూరి ప్రభాకరశాస్త్రి తమ చాటుపద్యమణిమంజరిలో ప్రస్తావించాడు. ఒకానొక సమయంలో వేంకటసుబ్బయ్య కవి నరసింహారెడ్డి ఆస్థానానికి రాగా, రెడ్డి అతనిని సత్కరించి, కావ్యగానం ఒనర్చవలసిందిగా ప్రార్థించాడు.

తిరుగుబాటు ప్రారంభం

1846 జూన్‌లో నరసింహారెడ్డి తన నెలసరి భరణం కొరకు అనుచరుణ్ణి కోయిలకుంట్ల ఖజానాకు పంపగా, అక్కడి తహసిల్దార్, ఆ వ్యక్తిని తిట్టి, నరసింహారెడ్డి వస్తేనే ఇస్తాను పొమ్మనడంతో రెడ్డి తిరుగుబాటు మొదలైంది. నరసింహారెడ్డి తాతయ్య జయరామిరెడ్డి కాలములోనే అనగా సా.శ.1800 లోనే అంగ్లేయులు నొస్సం సంస్థానమును లోబరుచొకొని, ఈ రాజవంశానికి నెలకు 11 రూపాయలు భరణం ఏర్పాటు చేసారు. సా.శ. 1845 వరకు ఈ భరణం నరసింహారెడ్డికి చెల్లించడం జరిగింది. ఆసంవత్సరం నరసింహారెడ్డి తనకు రావలసిన భరణం కొరకై కోయిలకుంట్ల తహసిల్దారుకు తన భటునుని (కొందరు భటునుని కాక తన కొడుకు దొరసుబ్బయ్యను పంపాడని చెబుతారు) పంపాడు. ఆ తహసిల్దారు అది ఇవ్వకుండా నరసింహారెడ్డి పై దుర్భాషలాడాడు. ఆ భటుడు ఉయ్యాలవాడకు పోయి జరిగిన విషయం తెలిపాడు. అది విన్న నరసింహారెడ్డి అటువంటి అవమానం భరించటం కంటే చావే మేలు అని తలిచాడు. అదే భటునితో నేనే వస్తానని తహసిల్దారుకు కబురుపంపాడు.

మాన్యాలు పోగొట్టుకున్న ఇతర కట్టుబడి దారులు రెడ్డి నాయకత్వంలో చేరారు. వనపర్తి, మునగాల, జటప్రోలు, పెనుగొండ, అవుకు జమీందార్లు, హైదరాబాదుకు చెందిన సలాం ఖాన్, కర్నూలుకు చెందిన పాపాఖాన్, కొందరు బోయలు, చెంచులు కూడా నరసింహారెడ్డితో చేరినవారిలో ఉన్నారు.

1846 జూలై 10 న రెడ్డి 500 మంది బోయసైన్యమును తీసుకొని, పట్టపగలు కోయిలకుంట్ల పట్టణముపై దండెత్తాడు. తహసీల్దారుని పట్టి, తలను నరికి, ధనాగారములో ఉన్న బొదెలవాడు హరిసింగును చంపి, దానిని దోచుకొని, కచ్చేరీ అంతటినీ దగ్ధం చేసి తహసిల్దారు శిరస్సును, హర్సింగు శిరస్సును తెచ్చి నొస్సం దగ్గరనున్న నయనాలప్ప కొండలో గల ఒక శివాలయం గుహలో దాచాడు. కడపలో ఉన్న కలెక్టరకు, పోలీసు సూపరిండెంటుకు ఈ హత్యా విషయం తెలిసి, అన్వేషణ ప్రారంభించారు. వారు రెడ్డిని ప్రశ్నించగా రెడ్డి తనకేమీ తెలియదని తెలుపగా, బహుశ ఔకరాజగు నంద్యాల నారాయణరాజును, వారి బంధువు నంద్యాల వెంకటరమణరాజును బంధించి కారాగారములో ఉంచారు.

అపరాధ పరిశోధకులు తరువాత శివాలయములో ఉన్న శిరస్సులను కొనుగొన్నారు. రెడ్డి గారి అనుచరులగు గోసాయి వెంకన్న, ఒడ్డె ఓబన్న అనువారిని బంధించి నిజానిజాలను తేల్చారు.

బ్రిటిషు ప్రభుత్వం రెడ్డిని పట్టుకోవడానికి సైన్యాన్ని దింపింది. కెప్టెన్ నాట్, కెప్టెన్ వాట్సన్‌ల నాయకత్వాల్లో వచ్చిన దళాలు రెడ్డిని పట్టుకోలేక వెనుదిరిగాయి. రెడ్డిని పట్టి ఇచ్చినవారికి వేయిరూపాయల బహుమానాన్ని బ్రిటిషు ప్రభుత్వం ప్రకటించింది. అటుపై, నరసింహారెడ్డి వేల కొలది సైన్యములను సమకూర్చుకొని గిద్దలూరు దగ్గర వాట్సన్‌తో ఘోర యుద్ధం చేసాడు. సైన్యాన్నంతటినీ నష్టపోయిన రెడ్డి, నల్లమల కొండలలోనికి తప్పించుకొని పారిపోయాడు. ఆంగ్లేయులు ఆతనిని కనిపెట్టటానికి ప్రయత్నాలు చేశారు, కాని ఫలించలేదు.

తరువాత జూలై 23న మరలా కెప్టెన్ వాట్సన్ నాయకత్వంలో వచ్చి గిద్దలూరు వద్ద విడిది చేసి ఉండగా, అర్ధరాత్రి రెడ్డి, తన సైన్యంతో విరుచుకుపడి బ్రిటిషు సైన్యాన్ని పారద్రోలాడు. నరసింహారెడ్డి కుటుంబాన్ని పట్టుకుని కడపలో ఖైదుచేసింది ప్రభుత్వం. వారిని విడిపించుకునేందుకు కడప చేరాడు రెడ్డి. 1846 అక్టోబర్ 6న నల్లమల కొండల్లోని పేరుసోమల వద్దగల జగన్నాథాలయంలో ఉన్నాడని తెలుసుకున్న కడప యాక్టింగ్ కలెక్టర్ కాక్రేన్ సైన్యంతో ముట్టడించదలచాడు.నరసింహారెడ్డి వద్ద ఒక వంటమనిషి ఉండెడెది. బ్రిటీషువారు ఆమెకు లంచమిచ్చి నరసింహారెడ్డిని పట్టుకొన్నారు. ఆవంట మనిషి నరసింహారెడ్డికి విపరీతముగా సారాయి పట్టించి ఆతని తుపాకీలో నీళ్ళు పోసి ఉంచినదట. ఆసమయములో నరసింహారెడ్డిని బంధించి కోయిలకుంట్లకు తెచ్చారు.

వీరమరణం

నరసింహారెడ్డితో పాటు 901 మందిపై కేసు పెట్టారు. వీరిలో 412 మందిపై నేరం రుజువు కాలేదు. 273 మందిని పూచీకత్తుపై వదిలిపెట్టారు. 112 మందికి 14 నుంచి 5 ఏళ్ళ దాకా శిక్షలు పడ్డాయి. కొందరికి ద్వీపాంతర శిక్ష పడింది. వారిలో ఔకు రాజు తమ్ముడొకడు.[1]హనుమచ్చాస్త్రి, జానమద్ది (1994).   సుప్రసిద్ధుల జీవిత విశేషాలు/ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. వికీసోర్స్. 

కడప స్పెషల్ కమిషనర్ కేసు విచారణ జరిపి, నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమేకాక, హత్యలకు, దోపిడీలకు, పాల్పడినట్లు తీర్పు చెబుతూ, ఉరిశిక్ష విధించాడు. 1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా ఉరితీసింది బ్రిటిషు ప్రభుత్వం. విప్లవకారులని భయభ్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి తలను 1877 దాకా కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసే ఉంచారు.

ఒక పాట

ఈ నారసింహారెడ్డి పై ప్రజలలో రెండు వీరగాధానికలును, ఒక వీరగాధయు వ్యాప్తి యందు ఉన్నాయి. దొరవారి నరసిం హ్వ రెడ్డి! నీ దొరతనము కూలిపోయె రాజా నరసిం హ్వ రెడ్డి అనే కోలాటపు పాటను డాక్టర్ తూమాటి దోణప్ప గారు అనంతపుర మండలమున సంపాదించిరి. తంగిరాల వేంకటసుబ్బారావు "వొహువా! నరసింహారెడ్డి! నీ పేరంటే రాజా నరసింహారెడ్డి! అను పిచ్చుకుంట్ల పాటను వీరు సంపాదించిరి. ఈ రెండును లఘువీరగాధలు. ఇవి కాక బొబ్బిలి పాట వరుసలోనున్న పెద్దవీరగాధయు ఒకటి ఉంది.ఇందు కొన్ని విషయములు కొంత భేదముతో ఉన్నాయి.

దొరవారి నరసిం హ్వ రెడ్డి!
నీ దొరతనము కూలిపోయె రాజా నరసిం హ్వ రెడ్డి! || దొర ||
రేనాటి సీమలోనా రెడ్డోళ్ళ కులములోనా
దొరవారీ వమిశానా ధీరుడే నరసిం హ్వ రెడ్డి || దొర ||
కొయిల్ కుంట్లా గుట్టలేంటా కుందేరూ వొడ్డులెంటా
గుర్రమెక్కీ నీవు వస్తే కుంపిణీకీ గుండె దిగులూ || దొర ||
కాలికీ సంకెండ్లు వేసీ చేతీకీ బేడీలు వేసీ
పారాతో పట్టి తెచ్చీ బందికానులొ పెట్టిరీ || దొర || (పారాతో = పహరా తో)
కండ్లకూ గంతాలు గట్టీ నోటినిండా బట్లు పెట్టీ
నిలువునా నీ తలా గొట్టీ కోట బురుజుకు గట్టీరీ || దొర ||
కాసిలో నా తల్లికేమో చావు సుద్దీ తెలిసినాదీ
కన్న కడుపే తల్లటించే గంగలోనా కలిసే || దొర || (ఆ సమయంలో నరసింహారెడ్డి తల్లి కాశీలో ఉన్నట్లు చెబుతారు)

సైరా నరసింహారెడ్డి తెలుగు చలనచిత్రం

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, రేనాటి సూర్యుడుగా కొలవబడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సైరా నరసింహారెడ్డి సినిమా నిర్మించబడింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటించాడు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు.[2]

మూలాలు, వనరులు

  1. సుప్రసిద్ధుల జీవిత విశేషాలు - జానమద్ది హనుమచ్చాస్త్రి పేజీ 50-53
  2. https://web.archive.org/web/20170816094039/http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break104 తెలుగు చలనచిత్రం సైర నరసింహ రెడ్డి

వెలుపలి లంకెలు

  • రేనాటి సూర్యచంద్రులు - తంగిరాల సుబ్బారావు
  • తొలి తెలుగు విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నారసింహారెడ్డి - డి.వెంకటేశ్వరరెడ్డి