ఎం.ఎల్.ఏ.

1957లో విడుదలైన తెలుగు చలనచిత్రం
(ఎం. ఎల్. ఏ. నుండి దారిమార్పు చెందింది)

అభ్యుదయవాది, అభిరుచిగల ప్రముఖ దర్శక నిర్మాత కె.బి. తిలక్ ద్వితీయ చిత్రం ఎం.ఎల్.ఏ. 1957 సెప్టెంబర్ 19న విడుదలయ్యింది. ఆనాటి రాజకీయాల్లోని ముఖ్యాంశం అయిన భూసంస్కరణలను, రాజకీయవేత్తల స్వభావాలను, ఓ చక్కని ప్రేమకథతో కలిపి ఈ సినిమాను తీశారు. సామాజికాంశం, నవ చైతన్యం కలిగించే గూడవల్లి రామబ్రహ్మంగారి ‘‘రైతుబిడ్డ’’, కె.వి.రెడ్డి ‘‘పెద్దమనుషులు’’ తరువాత మరో ఉత్తమ రాజకీయ చిత్రం ఇది.

ఎం.ఎల్.ఎ.
(1957 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బి. తిలక్
తారాగణం కొంగర జగ్గయ్య,
సావిత్రి ,
గిరిజ,
గుమ్మడి వెంకటేశ్వరరావు
జె.వి. రమణమూర్తి,
సూరపనేని పెరుమాళ్ళు,
నాగభూషణం
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల,
ఎస్. జానకి (పరిచయం),
ఏ.ఎం. రాజా ,
జిక్కి
నిర్మాణ సంస్థ అనుపమ ఫిల్మ్స్
భాష తెలుగు

సాంకేతిక వర్గం మార్చు

  • కథ: తాపీధర్మారావు, ఆరుద్ర
  • సంభాషణలు: ఆరుద్ర,
  • సంగీతం- పెండ్యాల నాగేశ్వరరావు,
  • కూర్పు, దర్శకత్వం, నిర్మాత: కె.బి.తిలక్

నటీనటులు మార్చు

కథ మార్చు

ఆ వూరిలో నిస్వార్థ రైతు సేవాసంఘ నాయకుడు భూషయ్య (పెరుమాళ్ళు) అతని కుమార్తె నిర్మల (సావిత్రి) సేవా సమాజంలో పనిచేస్తూ వుంటుంది. నీతి నిజాయితీల పట్ల నమ్మకంగల వ్యక్తి. ఆ వూరిలోని ప్రముఖ రాజకీయవేత్త దామోదరం (గుమ్మడి) నిజాయితీ,మంచితనంగల ప్రభుత్వ ఉద్యోగి దాసు (జగ్గయ్య). ఒకసారి దాసు, దామోదరానికి సాయంచేస్తాడు. దానికి రుజువైన ఉత్తరం దామోదరం వద్ద వుంటుంది. పాపయ్య (నాగభూషణం) ఓ జమిందారు. ఆసారి జరిగే ఎన్నికల్లో దామోదరం తనకు అనుకూలుడైన దాసును నిలబెడతాడు. భూషయ్య కూడా ఎన్నికల నుంచి, విరమించుకొని దాసుకు సపోర్ట్ చేస్తాడు. దాసు ఎన్నికల్లో విజయం సాధిస్తాడు. దాసు, నిర్మల పెళ్ళిచేసుకుంటారు. దాసు స్నేహితుడు రమేష్ (రమణమూర్తి) దాసు చెల్లెలు కమల (గిరిజ) ప్రేమించుకుంటారు. కాని దామోదరం మేనకోడలు లీల (సూర్యకళ) రమేష్‌ను ప్రేమిస్తుంది. రమేష్ లెక్క చేయడు. దాసు భూసంస్కరణల బిల్లును, అసెంబ్లీలో ప్రతిపాదిస్తాడు. తన ఆస్తులు కోల్పోవలసి వస్తుందని దామోదరం, దాన్ని విత్ డ్రా చేసుకోమని, లేకుంటే అతని, పాత అవినీతి తెలిపే ఉత్తరం బయటపెడతానని బెదిరిస్తాడు. దీనివల్ల దాసు వెనక్కి తగ్గుతాడు. భర్తలో నిజాయితి లేదని నిర్మల అతనికి దూరమవుతుంది. దాసుకు చిక్కులు తెచ్చే ఉత్తరాన్ని రమేష్, లీల ద్వారా తెలివిగా చిక్కించుకుని నాశనం చేస్తాడు. ఆ విషయం తెలిసికొన్న దాసు ‘లాండ్ సీలింగ్ చట్టాన్ని’ ప్రవేశపెట్టడం, ప్రజలమెప్పు పొందడం, నిర్మల, దాసులు కలుసుకోవటం, వారిరువురూ కమల, రమేష్‌ల వివాహం జరిపించటం, దామోదరం ఆటలుకట్టడంతో చిత్రం ముగుస్తుంది.[1]

విశేషాలు మార్చు

ఈ చిత్రంలో ‘‘నీ ఆశ అడియాస, చేజారే మణిపూస’’అని సావిత్రి, జగ్గయ్యలపై చిత్రీకరించిన విషాద గీతానికి ఘంటసాలతో కలిసి పాడటం ద్వారా ఎస్.జానకి తెలుగు పరిశ్రమకు గాయనిగా పరిచయమయ్యింది. అలాగే 1954లో ఆంధ్ర నాటక కళాపరిషత్ వారి ప్రదర్శనలో ఉత్తమ నటునిగా ఎంపిక కాబడిన జె.వి.రమణమూర్తి తొలిసారి రెండవ హీరోగా చిత్రసీమకు ఈ సినిమా ద్వారా పరిచయమయ్యాడు.

ఈ చిత్రంలో జగ్గయ్య తన ఎన్నికల గుర్తుగా ఆవూ-దూడ సింబర్ ఉపయోగించటం, ఆ తరువాత 1971లో ఇందిరా కాంగ్రెస్ తమ ఎన్నికల గుర్తుగా ఆవూ-దూడ సింబల్ ఉపయోగించటం విశేషం. కాగా 1957 ‘ఎం.ఎల్.ఏ.’ చిత్రంలో ఎం.ఎల్.ఏ.గా నటించిన జగ్గయ్య 1967లో ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎం.పిగా, కాంగెస్ పార్టీతో గెలవటం ఒక విచిత్రం. కొంగర గోపాలకృష్ణయ్య వ్రాసిన ‘లోగుట్టుతెలుసుకో’ పాటను ఖమ్మంలోని ఒక ప్రదేశంలో చిత్రీకరించారు. నేడక్కడ ఓ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించబడింది. ఈ చిత్రంలోని ఎన్నికలు క్యాంపెయిన్ సన్నివేశాలు ఆ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నూకల రామచంద్రారెడ్డి పోటీచేసిన మెహబూబాబాద్ నియోజకవర్గంలోని, మన్నెగూడెం గ్రామంలో చిత్రీకరించారు. ఎన్నికల ఊరేగింపు సన్నివేశాలను, జీపుయొక్క హెడ్‌లైట్స్ వెలుగులో చిత్రీకరించటం మరో విశేషం.

రష్యానుంచి వచ్చిన సాంస్కృతిక బృంద సభ్యులకు కె.బి.తిలక్ ఈ చిత్ర ప్రదర్శన ఏర్పాటుచేయటమేకాక, వారికి ఒక ప్రింటును పంపటం, వాటికి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ శ్రీశ్రీ వ్రాయటం, మరో ప్రింటును ‘దక్షిణ ఎమెన్’కూ పంపటం జరిగింది. ‘ఎం.ఎల్.ఏ.’ చిత్రాన్ని ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డికి, ఇతర మంత్రులకు రాజధాని హైద్రాబాదులో ప్రదర్శించటం, వారిలో కాసు బ్రహ్మానందరెడ్డివంటి ప్రముఖులెందరో ఈ చిత్రాన్ని ప్రశంసించటం జరిగింది. ఎం.ఎల్.ఏ. చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. ఈ చిత్రం ప్రింటు ప్రస్తుతం అలభ్యం కావటం విచారకరం.

పాటలు మార్చు

  1. ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం - ఘంటసాల, ఎస్. జానకి, రచన: ఆరుద్ర
  2. ఒకసారి కన్నెత్తి చూడు మది నీకోసమే అల్లాడు - జిక్కి
  3. జామిచెట్టుమీదనున్న జాతి రామచిలుక - ఎ. ఎం. రాజా, జిక్కి
  4. నమోనమో బాపూ మాకు న్యాయమార్గమే - సుశీల, మాధవపెద్ది బృందం
  5. లోగుట్టుతెలుసుకొ బాబయా - ఘంటసాల, మాధవపెద్ది, సుశీల బృందం, రచన: కోగంటి గోపాల కృష్ణ
  6. నీ ఆశా అడియాశా చెయి జారే మణిపూస బ్రతుకంతా అమవాసా లంబాడోళ్ళ రాందాసా - ఘంటసాల, ఎస్. జానకి, రచన: ఆరుద్ర

మూలాలు మార్చు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు) - సంకలనంలో సహకరించినవారు: చల్లా సుబ్బారాయుడు

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ఎం.ఎల్.ఏ.&oldid=4149551" నుండి వెలికితీశారు