మాగంటి బాపినీడు

మాగంటి బాపినీడు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న అగ్రశ్రేణి నాయకుడు. తెలుగులో విజ్ఞాన సర్వస్వాన్ని "ఆంధ్ర సర్వస్వము" అన్న పేరుతో ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రచురించాడు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడిన తొలితరం నాయకులలో ఒకడు. ఇతని భార్య మాగంటి అన్నపూర్ణాదేవి కూడా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నది. ఆమె మంచి రచయిత్రి, సమాజ సేవిక.

అన్నపూర్ణ, బాపినీడు

జననం, విద్య మార్చు

బాపినీడు 1895లో ఆగస్టు 14న పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రు గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. ముందు చూపు కలిగిన అతని కుటుంబం కలకత్తాలో అతని విద్యాభ్యాసానికి ఏర్పాటు చేసింది. అక్కడ అనేక రచయితల పరిచయం లభించింది. తరచు శాంతినికేతన్ సందర్శించేవాడు. తరువాత అతను "ఇండియన్ డిఫెన్సు కార్ప్స్"లో చేరాడు. అలాంటి మిలిటరీ శిక్షణ పొందిన మొదటి ఆంధ్రుడు అతనే. కలకత్తాలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేవాడు. బెంగాల్ ఆంధ్రా అసోసియేషన్‌కు కార్యదర్శిగా పని చేశాడు.

1920 లో వీరు అన్నపూర్ణాదేవి ని పెండ్లాడాడు.వివాహం తరువాత బాపినీడు వ్యవసాయ రంగంలో ఉన్నత చదువులకు అమెరికా వెళ్ళాడు. మల్లాడి సత్యలింగ నాయకర్ స్థాపించిన ధార్మిక సంస్థ వారి "మల్లాడి సత్యలింగం ప్రతిభా విద్యార్ధి"గా ఉపకార వేతనం పొందుతూ "న్యూయార్క్ స్టేట్ కాలేజి ఆఫ్ అగ్రికల్చర్"లో బి.ఎస్‌.సి చదివాడు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఎమ్.ఎస్‌.సి పూర్తి చేశాడు. ప్రొఫెసర్ వెబర్ అనే పండ్ల నిపుణుని వద్ద పని చేశాడు. కార్నెల్ విశ్వవిద్యాలయం స్కాలర్‌షిప్పు లభించింది. కార్నెల్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ వ్యవసాయక సంఘం (International Agricultural Society of the Cornell University) కి అతను స్థాపకుడు, మొదటి ప్రెసిడెంట్ కూడాను. కాలిఫోర్నియాలో హిందూస్తాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా పనిచేశాడు. మూడు సంవత్సరాల తరువాత బాపినీడు భారతదేశం తిరిగి వస్తూ మధ్యలో జపాన్ దేశాన్ని సందర్శించాడు. బొంబాయిలో అతను స్టీమర్ దిగిన వెంటనే ఆయన భార్య మగంటి అన్నపూర్ణా దేవి ప్రోత్సాహంతో ఆమె తెచ్చిన ఖద్దరు బట్టలు ధరించి తన విదేశి దుస్తులు (కోటు, బూటు) సముద్రంలో విసిరివేసారు. 1927లో అతని భార్య అనారోగ్యంతో మరణంచింది. ఆమె అతని దీక్షాకార్యక్రమాలలో చేదోడుగా ఉన్న ప్రతిభాశాలిని , స్వాతంత్ర సమర యోధురాలు, సమాజ సేవిక, రచయిత్రి. ఈమె మరణానంతరం 1933లో అన్నపూర్ణాదేవి లేఖలు అనే పేరుతో ఒక పుస్తకంగా ప్రచురించాడు. ఈ పుస్తకానికి పరిచయవాక్యాలు ఉన్నవ లక్ష్మీనారాయణ వ్రాశాడు.

స్వాతంత్ర పోరాటం మార్చు

బాపినీడు 1923లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 1928 లో ఆచార్య ఎన్. జి. రంగా తో కలసి కిసాన్ ఉద్యమం ప్రాంభించాడు. "ఆంధ్ర రైతు సభ" మొట్టమొదటి కార్యదర్శిగా పనిచేశాడు. గోదావరి-కృష్ణా సెటిల్మెంట్ సెంట్రల్ కమిటీలో చురుకుగా పనిచేశాడు. కిసాన్ ఉద్యమాలు నడిపినందుకు ఆరు నెలలు జైలు శిక్ష అననుభవించాడు.

1931 లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని ఒక ఏడాది పాటు జైలులోఉన్నారు. 1937లో మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యాడు. 1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గోని జైలు శిక్ష అననుభవించాడు.

బాపినీడు ఆంధ్ర విశ్వవిద్యాలయం సిండికేట్ మెంబరుగాను, ఆంధ్ర హరిజన సేవక సంఘం కార్యదర్శిగాను కూడా పనిచేశాడు.

బయటి లింకులు మార్చు