పుష్కర్

రాజస్తాన్ లోని నగరం

పుష్కర్ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రం లోని అజ్మీరు జిల్లాలోని ఒక ఊరు పుష్కర్ (Hindi: पुष्कर). అది అజ్మీరు జిల్లాకు వాయవ్యంలో 14 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి 510 (1673) అడుగుల ఎత్తుగా ఉపస్థితమై ఉంది. ఉత్తర భారతదేశంలో ఉన్న ఐదు పవిత్రధామములలో (హిందువుల పవిత్ర తీర్ధాలు) ఇది ఒకటి. ఇది తీర్ధరాజ్ అని హిందువులతో గౌరవించబడుతుంది. పుణ్యక్షేత్రాలలో చక్రవర్తి అయిన ఈ క్షేత్రము విదేశీ భక్తులకు ఒక లక్ష్యక్షేత్రముగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని పురాతన నగరాలలో పుష్కర్ ఒకటి. పుష్కర్ సరస్సును చుట్టి విస్తరించి ఉన్న ఈ నగరనిర్మాణము ఎప్పడు మొదలైందో ఎవరికీ అంచనా లేదు. అయినా పురాణ కథనాలను అనుసరించి ఈ నగరానికి రూపకర్త బ్రహ్మదేవుడని చెప్తున్నాయి. బ్రహ్మదేవుడు ఇక్కడ 60,000 సంవత్సరాల కాలం విష్ణుమూర్తిని దర్శించడానికి యజ్ఞముచేసాడని ప్రతీతి. పుష్కర్‌లో అనేక ఆలయాలు ఉన్నాయి. వీటిలో అనేకం పురాతనమైనవి కాదు. ముస్లిమ్ దండయాత్రలలో అనేకం ధ్వంసం చేయబడ్డాయి. ధ్వంసం చేయబడిన ఆలయాలు పునరుద్ధరించబడ్డాయి. తరువాతి కాలంలో ధ్వంసం చేయబడిన ఆలయాలు పునర్నిర్మించబడ్డాయి.

  ?పుష్కర్
రాజస్థాన్ • భారతదేశం
సుందరమైన పుష్కర్ సరస్సు దృశ్యం
సుందరమైన పుష్కర్ సరస్సు దృశ్యం
సుందరమైన పుష్కర్ సరస్సు దృశ్యం
అక్షాంశరేఖాంశాలు: 26°30′N 74°33′E / 26.5°N 74.55°E / 26.5; 74.55
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 510 మీ (1,673 అడుగులు)
జిల్లా (లు) అజ్మీరు జిల్లా
జనాభా 14,789 (2001 నాటికి)

బ్రహ్మాలయానికి చెందిన అనేక దేవాలయాలు క్రీశ 14వ శతాబ్దంలో నిర్మించబడ్డాయి. ప్రపంచంలో అతి కొన్ని బ్రహ్మదేవుని ఆలయాలు మాత్రమే ప్రస్తుతం జీవించి ఉన్నాయి. మిగిలిన బ్రహ్మదేవుని ఆలయాలు ఉత్తరప్రదేశ్ లోని బిదూరులో ఒకటి, భారతదేశంలో రాజస్థాన్ లోని బర్మర్ జిల్లా సమీపంలోని బలోత్రా అనే పల్లెటూరులో ఒకటి, మదర్ టెంపుల్ ఆఫ్ బిసాకిహ్ ఒకటి, ఇండోనేషియా లోని యోగ్యకర్త లోని ప్రంబనన్ ఒకటి. పుష్కర్6లో 52 ఘాట్లు భక్తుల స్నానార్ధము ఉన్నాయి. పుష్కర్‌లో ఏటా జరిగే ఒంటెల జాతర ప్రపంచ ప్రసిద్ధి పొందింది. దేశదేశాల నుండి పర్యాటకులు పుష్కర్ కెమేల్ ఫెయిర్ అనే ఈ ఉత్సవానికి విచ్చేయడం ఒక ప్రత్యేకత. కొన్ని దశాబ్ధాలుగా పుష్కర్ యొక్క సహజ వాతావరణ కాలుష్యం కలత చెందవలసిన విధంగా పెరిగిందని భావించబడుతుంది. పర్యాటకుల సౌకర్యార్ధం అడవులను నరికివేయడం ఇందుకు ప్రధాన కారణమని భావించబడుతుంది.

క్షేత్రపురాణం మార్చు

 
సరస్వతి ఆలయం నుండి పుష్కర్ దృశ్యం
 
పుష్కర్ ఆలయంలోని బ్రహ్మదేవుడు

రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌కు పదకొండు కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 1580 అడుగుల ఎత్తులో ఉన్న ఒక సరస్సు. ఆ సరస్సు పేరైన పుష్కర్ క్రమంగా ఆప్రాంత మంతటికి స్థిరపడిదింది. ఇక్కడే బ్రహ్మదేవునికి ఒక ఆలయం ఉంది. ప్రపంచంలో మొత్తంలో బ్రహ్మ దేవునికి వున్న ఆలయం ఇదొక్కటే. భారతదేశంలో ఉన్నతీర్థాలలో అతి పవిత్రమైనది ఈ పుష్కర్ తీర్థమే. అందుకే దీన్ని తీర్థ రాజమంటారు. దీన్ని దర్శించక పోతే తీర్థ క్షేత్రాల యాత్ర పూర్తి కానట్టే నని భావిస్తారు హిందూ మతస్తులు. ఈ స్థల పురాణంలో ఒక ఆసక్తి కరమైన కథ కలదు పద్మ పురాణంలో చెప్పబడిన కథను అనుసరించి పూర్వం వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజలను హింసిస్తుంటే, బ్రహ్మ తన చేతిలో వున్న తామర పుష్పాన్నే ఆయుధంగా జేసి ఆ రాక్షసుణ్ణి సంహారించాడట. ఆ పూరేకులు మూడు చోట్ల పడి మూడు సరస్సులుగా ఏర్పడాయి. మొదటిది జేష్ట పుష్కర్, రెండవది మధ్య పుష్కర్, చివరిది కనిష్ఠ పుష్కర్. బ్రహ్మ చేతి (కర) లోని పుష్పం నుండి రాలిన రెక్కతో ఏర్పడిన సరస్సులు కాన వీటికి పుష్కర్ అని పేరు వచ్చింది. బ్రహ్మ లోకకళ్యాణం కొరకు అక్కడ ఒక యజ్ఞాన్ని చేయ సంకల్పించి దానికి రక్షణగా దక్షిణాన రత్నగిరి, ఉత్తరాన నీలగిరి, తూర్పున సూర్యగిరి అనే కొండలను సృష్టించి దేవతల నందరిని ఆహ్యానించాడు. ముహూర్తకాలం ఆసన్నమైనది. ఆహూతులందరు విచ్చేసారు. సావిత్రిని (ఈమెనే సరస్వతి అని కూడా పిలుస్తారు) పిలుచుకొని రమ్మని తన కుమారుడైన నారదుని పంపాడు బ్రహ్మ. నారదుడు వెళ్లే సరికి ఆమె సిద్దంగానే నారదుడు " నువ్వు ఒక్కదానివె వచ్చి అక్కడ ఏంచేస్తావు? మీస్నేహితులను తీసుకరా " అని సలహా ఇచ్చాడు. అందువలన సావిత్రి తనసహచరులైన లక్ష్మి పార్వతులతో కలిసి వద్దామని ఆగిపోయింది. యజ్ఞవాటికయందు అందరు రుషులు, దేవతలు సిద్దంగా ఉన్నారు. ముహూర్త కాలం దగ్గర పడుతున్నది. సావిత్రి జాడ లేదు. ముహూర్త సమయానికి యజ్ఞం ప్రారంబించాలనే తలంపుతో బ్రహ్మ ఇంద్రుణ్ణి పిలిచి ఒక అమ్మాయిని చూడమని చెప్పి ఇంద్రుడు తీసుకు వచ్చిన ఆమెను పెండ్లాడి యజ్ఞాన్ని ప్రారంబిస్తానని చెప్తాడు. దాంతో ఇంద్రుడు సమీపంలో పాలమ్ముకునే ఒక గుర్జర జాతి అమ్మాయి తీసుకొని వచ్చాడు. శివుడు, విష్ణువు సలహామేరకు ఆ అమ్మాయిని గోవులోనికి పంపి శుద్ధిచేసారు. అలాచేస్తే పునర్జన్మ ఎత్తినట్లని ఆ అమ్మాయికి అభ్యంగన స్నానం చేయించి సర్వాలంకారశోభితు రాలిని చేస్తారు, గోవుతో శుద్ధి చేయబడినది గాన ఆమెకు గాయిత్రి అని నామ కరణం చేసి నిర్ణీత సమయానికి యజ్ఞం ప్రారంబిస్తారు. యజ్ఞం పూర్తవుతున్న సమయాన సావిత్రి అక్కడికి వచ్చి, బ్రహ్మప్రక్కన మరొక స్త్రీ కూర్చొని వుండగా చూసి ఆగ్రహించి బ్రహ్మ దేవునితో సహా అక్కడున్న వారినందరిని శపిస్తుంది. భర్తను వృద్దుడై పొమ్మని, అతనికి ఒక్క పుష్కరిణిలో తప్ప మరెక్కడా ఆలయాలు వుండవని శపిస్తుంది. అన్ని యుద్ధాల్లో ఓటమి తప్పదని ఇంద్రుడిని, మానవ జన్మ ఎత్తి భార్య వియోగంతొ బాధపడతాడని విష్ణువును, శ్మశానంలో భూత ప్రేత గణాలతో సహ జీవనం చేయమని శివుణ్ణి, దారిద్ర్యంతో, ఇల్లిల్లు తిరిగి బిక్షాటన చేసుకొని బ్రతకమని బ్రాహ్మణులను, దొంగలచే ధనమంతా పోగొట్టుకొని నిరుపేదగా మారమని కుభేరుడిని శపిస్తుంది. తర్వాత ఆమె రత్నగిరి పైకి వెళ్లి తపస్సు చేసి నదిగా మారిందని అంటారు. ఇప్పుడు ఆ రత్నగిరిపై చిన్న ఆలయం ఉంది. అక్కడే చిన్న సెలఏరు కూడా ఉంది. దీన్నే సావిత్రి నది అని పిలుస్తారు. ఈ దేవతను పూజించి, ఆ నదిలో స్నానం చేస్తే నిత్య సుమంగళిగా వుంటారని భక్తుల నమ్మకం. సావిత్రి వెళ్ళిన తర్వాత బ్రహ్మదేవుడు యజ్ఞాన్ని పూర్తి చేయమని బ్రాహ్మణులను కోరగా దానికి వారు తమను శాపవిముక్తుల్ని చేయమని ఆ తర్వాతే యజ్ఞక్రతువును చేస్తామని అంటారు. అప్పటికే యజ్ఞఫలంతో సిద్దించిన శక్తులతో గాయిత్రీదేవి పుష్కర్ ప్రముఖ తీర్థ క్షేత్రంగా వర్ధిల్లుతుందని ఇంద్రుడు తిరిగి స్వర్గాని గెలుచుకుంటాడని, విష్ణుమూర్తి రామునిగా జన్మిస్తాడని, బ్రాహ్మణులు గురువులుగా గౌరవాన్ని పొందతారని శాపతీవ్రతను తగ్గిచింది. బ్రహ్మ దేవాలయాలు అరుదుగా అక్కడక్కడ ఉన్నా అవి ఈ ఆలయము దాని లాగ వుండవు. బ్రహ్మదేవుడే స్వయంగా స్థలాన్ని నిర్ణయించగా యుగాంతాన విశ్వామిత్రుడు ఈ ఆలయాని కట్టించాడని అంటారు. ప్రపంచంలోకెల్ల పది పుణ్యక్షేత్రాలలో పుష్కర్ ఒకటని భారతదేశంలో హిందువులు దర్శించే మొదటి ఐదు క్షేత్రాలలో ఇది ఒకటని అంటారు. పౌరాణికంగా ప్రశస్తిగాంచిన పంచ సరోవరాల్లో దీని ప్రస్థానం ఉంది.

చరిత్ర మార్చు

 
రాజస్థాన్ లోని కృత్రిమ పుష్కర్ అయిన లేక్ సాగర్
 
పుష్కర్ సరస్సు
 
పుష్కర్ లోని బ్రహ్మదేవుడి ఆలయం

పుష్కర్ అతి పురాతన నగరం. దీని నిర్మాణము జరిగిన సమయలు లెక్కకట్ట్డానికి వీలుకానిది. బ్రహ్మదేవుడు ఈ నగర నిర్మాణనికి కారణమయ్యాడని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ బ్రహ్మదేవుడు రాధా కృష్ణులను ప్రత్యక్షం చేసుకోవడానికి 60,000 సంవత్సరాలు యజ్ఞం చేసాడని పురాణాల కథనాలు చెప్తున్నాయి. బ్రహ్మదేవుడు యజ్ఞము చేయ తలపెట్టి తగిన ప్రదేశము వెదుకుతున్న సమయంలో ఈ ప్రదేశము యజ్ఞానికి అనువైనదిదిగా భావించబడినదని పురాణాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడున్న దేవాలయం 14వ శతాబ్దంలో కట్టిందని, కాని దానికి పూర్వం రెండు వేల సంవత్సరాల క్రితంమే అక్కడ ఆలయం వుండేదని అంటారు. తర్వాత ఆదిశంకరాచార్యుడు ఒకసారి, మహారాజ జనత్ రాజు మరోసారి ఆలయాన్ని పునరుద్దరించారని చరిత్రకారుల నమ్మకం. ఆలయంలోని గోడలకు వెండి నాణేలు అంటించి ఉన్నాయి. భక్తులు తమపేరు చెక్కిన వెండి నాణేలను దేవునికి సమర్పిస్తుంటారు. పాలరాతి మెట్లు ఎక్కి మండపం దాటి గర్బగుడిలోకి వెళ్లగానే హంసవాహనం మీద వున్న చతుర్ముఖ బ్రహ్మవిగ్రహం కనిపిస్తుంది. ఆయన నాలుగు చేతుల్లో వరుసగా అక్షమాల, కమండలం, పుస్తకం, దర్భలు ఉంటాయి. ఆలయ గోడల మీద సరస్వతిదేవి, ఇతర దేవీ దేవతల బొమ్మలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఆలయంలో పూజాదికాలు సనాతనధర్మం ప్రకారమే జరుగు తుంటాయి. గర్బగుడి లోని విగ్రహాన్ని గృహస్థులైన పురుషులు పూజించ రాదు. కేవలం సన్యసించిన వారే పూజించాలి. ఆ సాధువులు కూడా పుష్కర్ లోని పరాశర గోత్రీకులు మాత్రమే అయి వుండాలనేది నిబంధన. గర్బగుడికి ఎదురుగా వున్న మండపంలో వెండితాబేలు ఉంది. ప్రతిఏటా కార్తీక పౌర్ణమితో బాటు ప్రతిపౌర్ణమి, అమావాస్య రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. కార్తీక మాసంలోనే పుష్కర్ జాతర కూడా జరుగుతుంది. ఇది దీపావళి తరువాత వచ్చే ఏకాదశి నాడు మొదలై పౌర్ణమి వరకు జరుగుతుంది. జాతర సమయంలో వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ జాతర హస్తకళలకు పెట్టింది పేరు. ఆలయానికి ఎదురుగా వున్న రెండు కొండలపై వున్న సావిత్రి, గాయత్రి దేవతలను కూడా భక్తులు దర్శించుకుంటారు . సావిత్రి ముఖ కవళికలు కోపంగాను, గాయిత్రి విగ్రహం భయపడు తున్నట్లు ఉంటాయి. ఈ చుట్టుపక్కల ఇంకా అనేక దేవాలయాలున్నాయి. అందులో ముఖ్యమైనది అగస్తేశ్వర ఆలయం ఉంది. అందులోని శివలింగం బ్రహ్మ చేత ప్రతిష్ఠించబడిందని, ఇక్కడ పూజలు చేసి, అభిషేకం చేసిన వారికి మోక్షప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. పెద్దదైన ఈ శివలింగం పై రాగితో చేసిన పాము చుట్టు కొని వున్నట్టుటుంది. శివరాత్రి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. తర్వాత మరో ఆలయం పేరు రంగ్‌జీ ఆలయం ఉంది. ఇక్కడి విష్ణుమూర్తిని రంగ్‌జీ అని పిలుస్తారు. ఈ ఆలయం దక్షిణభారతదేశ శైలిలో వుంటుంది. మరో ముఖ్య మైన ఆలయం వరాహ దేవాలయం. ఇక్కడ విష్ణుమూర్తి వరాహరూపంలో దర్శనమిస్తాడు. ఇంకా ఈ చుట్టుపక్కల అనేక దేవాలయాలున్నాయి.

  • రామణంలో ఈ నగర ప్రస్తావన ఉంది. వశిష్ఠుడు ఇక్కడ తపసు చేసినట్లు వర్ణించబడింది.
  • అరప్సరకాంత మేనక పుష్కరక్షేత్రంలో స్నానం చేసినట్లు వర్ణించబడింది.
  • మహాభారత కథనం ప్రకారం ధర్మరాజు అరణ్యవాస సమయంలో ధర్మరాజుతన తమ్ములతో తీర్ధయాత్రలు చేసిన సమయంలో సింధులోయలోని అడవులవెంట ప్రయాణించి చిన్న చిన్న నదులను దాటి పుష్కర క్షేత్రంలో స్నానం ఆచరించినట్లు వర్ణించబడింది.
  • వామనపురాణ కథనం ప్రహ్లాదుడు తీర్ధయాత్రలు చేసిన సమయంలో పుష్కరక్షేత్రాన్ని దర్శించినట్లు చెప్పింది.
  • మాండోర్ రాజైన గుర్జర ప్రతుహార, నాహదరావ ఈ తీర్ధక్షేత్రాన్ని పునరుద్ధరించారని భావిస్తున్నారు. ఆయన ఈ ప్రదేశాన్ని శుభ్రపరచి తీరాలను నిర్మించి విశ్రాంతి మందిరాలను నిర్మించి స్నాన ఘట్టాలని నిర్మించాడు.
  • రాజపుత్ర గజటర్ అనుసరించి పుష్కర్ చేచి గుర్జర్ల అధీనంలో 700 సంవత్సరాలు ఉందని భావించబడుతుంది. తరువాత కొన్ని ఆలయాలు కన్పతి జోగీల చేత ఆక్రమించబడిందని తెలుస్తుంది.
  • పుష్కర్ క్షేత్రంలో భోపాస్ పేరుతో ఇక్కడ గుర్జర్ల సమూహమే పూజాధి కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
  • పరాశర మహర్షి ఇక్కడ జన్మించినట్లు పురాణ కథనం. ఆయన సంతతి బ్రాహ్మణులు ఈ ప్రదేశం దాని పరసిసర ప్రాంతాలలో కనుగొనబడ్డారు. ప్రఖ్యాత జీన్మాతా ఆలయం పరాశర బ్రాహ్మణుల చేత 1,000 సంవత్సరాలుగా సంరక్షించబడుతుంది. పుష్కర బ్రాహ్మణులు ఇక్కడ స్థానికులేనని భావించబడుతుంది.
  • ప్రఖ్యాత పుష్కర్ కెమేల్ ఫెయిర్ ఇక్కడ నిర్వహించబడుతుంది.
  • రాజపుతానా ఏజెన్సీ కి చెందిన 3,831 మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు.

నామ చరిత్ర మార్చు

సంస్కృతంలో పుష్కర్ అంటే నీలి తామర పుష్పము. హిందువులు దేవునిచేత పంపబడిన హంస ముక్కు నుండి కిందకు జారిన తామరపుష్పము బ్రహ్మయజ్ఞము చేసిన ప్రదేశములో ఏర్పడిన సరస్సు కనుక దానికి పుష్కర్ అనే పేరు వచ్చినదని విశ్వసిస్తున్నారు. పుష్కర్ అనే పదము పుష్కరిణి అనే పదము నుండి వచ్చిందని అంచనా. పుష్పము అంటే పువ్వు కర అంటే చేయి చేతి నుండి జారిన పువ్వు వలన ఏర్పడిన సరస్సు కనుక పుష్కర్ అయ్యిందని విశ్వసిస్తున్నారు.

పుష్కర్ సంత మార్చు

 
2006 పుష్కర్ మేళా
 
పుష్కర్ ఒంటెలసంతలో నీటి కేంద్రం వద్ద ఒంటెలు
 
సాయం సమయంలో పుష్కర్
 
పుష్కర్ ఓంటెల సంతలో అలంకరించబడిన ఒంటె

అయిదు రోజుల పాటు నిరంతరాయంగా జరిగే పల్లెవాసులకు తమ సాధారణ శ్రమజీవనం నుండి కొంత వెసులుబాటు మరింత ఉల్లాసాన్ని ఇస్తుంది. దేశంలోనే అతిపెద్ద పెంపుడు జంతువుల సంతగా పేరొందిన ఈ సంతలో 50,000 ఒంటెలు చుట్టుపక్కల నుండి కొన్ని మైళ్ళ దూరం నుండి తీసుకురాబడి ఇక్కడ అమ్మడం కొనడం వంటి వాణిజ్యం జరుగుతుంది. అతి చురుకుగా సాగే ఈ వ్యాపార సంతలో అనేక ఒంటెలు చేతులు మారుతూ ఉంటాయి. అన్ని ఒంటెలు కడిగి శుభ్రంగా స్నానం చేయబడి, కొన్ని ఆకర్షణీయంగా వివిధ విధాలుగా అలంకరించబడి ఉంటాయి. ఒంటెలను పలు విధములుగా అలంకరించడానికి కావలసిన సామానులు, ఆభరణాలు విక్రయించడానికి అనేక దుకాణాలు కూడా ఉంటాయి. పుష్కర్ ఒంటెల సంతలో పాల్గొనే ఒంటెలు శ్రద్ధగా అలంకరించబడి ఉంటాయి. అవి వెండి, పూసలతో చేసిన ఆభరణములు ధరించి ఉంటాయి. ఒంటెల కాళ్ళకు తగిలించిన కడియలు, గంటల కారణంగా అవి నడుస్తున్నప్పుడు చక్కని ధ్వనులు చేస్తాయి. హిందూదేవుడు అయిన సృష్టికర్త బ్రహ్మదేవుడి ఈ ఆలయములో 400 ఉపాలయములు ఉండడం ఇక్కడి ప్రత్యేకత. హిందూధర్మ పురాణాలు అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించినా పుష్కర్ క్షేత్రాన్ని దర్శించని ఎడల మోక్షం సిద్ధించదని వక్కాణిస్తున్నాయి. హిందూ కాలమానం ప్రకారం పుష్కర్ సంత కార్తిక నవమి నుండి పౌర్ణమి వరకు జరుగుతుంది. చంద్రమానం అనుసరించి ఆచరించబడే ఈ ఉత్సవం సుమారుగా అక్టోబరు, నవంబరు మాసాలలో వస్తుంది. ఒంటెల సంతలలో అతి పెద్దది అయిన ఈ సంత వాణిజ్యం కొరకే జరిగినా అన్ని జాతులకు చెందిన ఉత్తమైనవాటిని ఎంపిక చేసి ఒంటెలకు బహుమతి ప్రదానం కూడా జరుగుతుంది. లెక్కలేనంత మంది ప్రజలు వర్ణమయమైన అలంకరణలతో ఇక్కడకు చేరుకుని పుష్కర్ సరస్సులో స్నానం ఆచరించి బ్రహ్మదేవుడిని ఇతర దేవతలను పూజిస్తారు. ఈ ఉత్సవంలో జరిగే జానపద నృత్యాలు, జానపద సంగీతం, గారడీలు, ఒంటెలు, గుర్రాల పందాలను, సాంస్కృతిక కార్యక్రమాల పోటీలను ఊరు ప్రజలంతా విచ్చేసి చూసి ఆనందిస్తారు. పవిత్రమైన సరస్సుకు ప్రఖ్యాతి చెందిన ఈ పుష్కర్ క్షేత్రం గులాబీ, మల్లెల వాసనలను కూడా వెదజల్లుతూ శోభిల్లుతుంటుంది. అంతర్జాతీయంగా 4,000 నుండి 6,000ల మందికి పైగా విదేశీ పర్యాటకులను ఈ పుష్కర్ ఒంటెల సంత ఆకర్షిస్తుంటుంది. పుష్కర్‌లో 10 నుమ్డి 15 రోజుల వరకు జరిగే సంతలు సంవత్సరానికి 12కు పైగా జరుగుతుంటాయి.

 
లొట్టిపిట్ట సవారి

ఒంటెల సవారీ మార్చు

భారతదేశంలోని ధార్ ఎడారి ని ఒంటెల మీద సవారి చేస్తూ ఎడారి అందాలను తిలకించ వచ్చు. అతిపురాతనమైన ఆరావళి కొండచరియలను, ఇసుక తిన్నెలను చూడవచ్చు. పర్యాటకులను సుందమైన కొండచరియలు, ఇసుక తిన్నెలు, మైమరిపించే సూర్యోదయ సూర్యాస్తమయాలు విపరీతంగా ఆకర్షిస్తాయి. పుష్కర్ సంతలో పర్యాటకులను ఓంటెల సవారీలలో చిన్న చిన్న పల్లెసీమలను చూపుతూ అలాగే పంట కోతలు ఇతర పల్లె వాసుల పనిపాటలు చూసి ఆనందించే అవకాశం కలిగిస్తాయి.

ఇతర ఆకర్షణలు మార్చు

 
రాజస్థానులోని పుష్కర్ సరస్సు లోని స్నానఘట్టం
  • జైపూర్ నుండి దౌసా మీదుగా భాన్ద్రేజ్, బన్గార్హ్, మాధోపూర్ ఓడరేవు లను సందర్శించడానికి అద్దె కార్లు లభ్యం ఔతాయి.
  • పుష్కర్ నగరశివార్ల సమీపంలో ఉన్న అజ్మీరు సందర్శన.
  • అజ్మీర్‌కు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిషన్‌ఘర్. బాని తానిగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదర్శనశాలలో ప్రసిద్ధి చెందిన మినియేచర్ పైంటింగ్స్‌ను చూడవచ్చు.
  • పుష్కర్‌లో ప్రధాన ఆకర్షణ పుష్కర్ సరస్సు. టిబెట్ దేశంలో ఉన్న మానస సరోవరంలా అతిపవిత్రంగా పుష్కర్ సరస్సు భావించబడుతుంది. పుష్కర్ పుణ్యతీర్ధంగా భావించబడడానికి ఈ సరస్సే ప్రధాన కారణం. ఈ సరస్సు విశ్వమానవ సృష్టికర్త బ్రహ్మదేవుడి చేతి నుండి జారిపడిన తామర పూవు కారణంగా ఆ ప్రదేశంలో ఈ సరస్సు ఏర్పడిందని పురాణకథనాలు వర్ణిస్తున్నాయి.
  • బ్రహ్మదేవుడి ఆలయం:- పుష్కర్ ప్రత్యేక ఆకర్షణ త్రిమూర్తులలో ఒకడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఆలయం. బ్రహ్మదేవుడు ప్రధాన దైవంగా పూజింపబడే ఏకైక ఆలయం ఇది. ఆలయంలో బ్రహ్మదేవుడి సంపూర్ణ ఆకారం ప్రతిష్ఠించబడింది.
  • సావిత్రి ఆలయం:- బ్రహ్మదేవుడి భార్య అయిన సావిత్రీదేవి రత్నగిరి మీద కొలువుతీరి ఉంది. సావిత్రి విగ్రహంతో సరస్వతి విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడి ఉంది.
  • పాత పుష్కర్:- పుష్కర్ సరస్సుకు 5 కిలోమీటర్ల దూరంలో ఈ పాత పుష్కర్ సరసు పునర్మించబడింది. భక్తుల చేత పాత పుష్కర్ సరస్సు కూడా సాంస్కృతిక, మతపరమైన గుర్తింపు పొందింది.

జనభా మార్చు

2011 జనాభాగణనను అనుసరించి పుష్కర్ జనసంఖ్య 14,789 ఉంటుందని అంచనా. వీరిలో పురుషులు 54% స్త్రీలు 46% ఉన్నారు. అక్షరాస్త శాతం 69%. ఇది జాతీయ అక్షరాస్యత అయిన 59.55% శాతం కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 77% స్త్రీల అక్షరాస్యత 60%. 6% సంవత్సరాల కంటే పిన్న వయస్కుల శాతం 14%.

ప్రయాణ సౌకర్యాలు మార్చు

  • వాయుమార్గం:- పుష్కర్ అతి సమీప విమానాశ్రయం జయపూర్ లోని సంగనర్ ఎయిర్ పోర్ట్. పుష్కర్‌కు 146 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విమానాశ్రయం నుండి ఢిల్లీ, ముంబాయి, ఇండోర్, కొలకత్తా వంటి ప్రధాన నగరాలతో అనుసంధానించబడి విమానసేవలు పొందవచ్చు.
  • రోడ్డుమార్గం:- అజ్మీర్ ప్రధాన బస్టాండ్ నుండి పుష్కర్ 11 కిలోమీటర్లు ఉంటుంది. రాజస్థాన్ రహదారి మార్గం చాలా సౌకర్యవంతమైన బస్సులను నడుపుతుంటుంది. ఇక్కడ నుండి జయపూర్, అజ్మీర్, ఇండోర్, నగ్డా లకు ప్రతి 15 నిముషాలకు ఒక బస్సు నడుస్తూఉంటుంది.
  • రైలుమార్గం:- పుష్కర్‌కు అతి సమీప రైలు స్టేషను అజ్మీరు రైలు స్టేషను. ఇక్కడ నుండి బ్రాడ్‌గేజ్ మార్గంలో దేశంలోని మహానగారాలైన న్యూఢిల్లీ, ముంబయి, కొలకత్తా, చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు, అహమ్మదాబాద్, ఇండోర్, కాన్పూర్, లక్నో పాట్నా, భోపాల్, ట్రివేండ్రమ్, కొస్చిన్ వంటి నగరాలకు రైళ్ళు నడుస్తుంటాయి. అజ్మీరు నుండి పుష్కర్‌కు బ్రాడ్‌గేజ్ రైలు మార్గంలో రైళ్ళు ఉన్నాయి.

బయటి లింకులు మార్చు

 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=పుష్కర్&oldid=4079988" నుండి వెలికితీశారు