సారథి స్టూడియో బ్యానర్‌పై యార్లగడ్డ రామకృష్ణప్రసాద్ నిర్మించిన భాగ్యదేవత1959 అక్టోబర్ 23వ తేదీన విడుదలైంది[1].

భాగ్యదేవత
(1959 తెలుగు సినిమా)
దర్శకత్వం తాపీ చాణక్య
తారాగణం కొంగర జగ్గయ్య ,
సావిత్రి
సంగీతం మాస్టర్ వేణు
నేపథ్య గానం సత్యం
గీతరచన తాపీ చాణక్య, శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ శ్రీ సారధీ స్టూడియోస్
భాష తెలుగు

సాంకేతికవర్గం మార్చు

  • కథ, సంభాషణలు: తాపీ ధర్మారావు
  • సంగీతం: మాస్టర్ వేణు
  • నృత్యం: వి.జె.శర్మ
  • కళ: వి.సూరన్న
  • ఛాయాగ్రహణం: యూసఫ్ ముఖర్జీ
  • కూర్పు: ఎ.సంజీవ్
  • అసోసియేట్ దర్శకులు: జి కబీర్‌దాస్
  • ప్రొడక్షన్ ఇన్‌ఛార్జి: తమ్మారెడ్డి కృష్ణమూర్తి
  • దర్శకత్వం: తాపీ చాణక్య
  • నిర్మాత: వై.రామకృష్ణప్రసాద్

నటవర్గం మార్చు

కథ మార్చు

కీర్తిశేషుడైన జడ్జి భార్య నిర్మలమ్మ. వారికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె లలిత, చిన్న కుమార్తె సరళ. లలితకు తన మిత్రుడైన తాసీల్దారు కుమారుడు గిరితో పెళ్లి జరిపించమన్న భర్త కోరికమేరకు -లలిత గిరిల పెళ్లి నిశ్చయిస్తుంది నిర్మలమ్మ. మెడిసన్ చదివిన లలిత ఆ పెళ్లిని వ్యతిరేకించి, తాను ప్రేమించిన మూర్తి వద్దకెళ్లి అతన్ని గుళ్లో పెళ్లి చేసుకుంటుంది. తండ్రి కోరిక, కుటుంబం పరువూ నిలపాలని ఆలోచించిన చిన్న కుమార్తె సరళ -తల్లిని, పెళ్లివారిని, గిరిని ఒప్పించి అదే ముహూర్తానికి గిరిని పెళ్లి చేసుకుంటుంది. లలిత -మూర్తి ఆనందంగా జీవిస్తుంటారు. తనను నిరాకరించి అవమానించిందని లలితపై కోపం పెంచుకున్న గిరి -ఆమె ఇంటికి తరచూ వస్తూ చనువు ప్రదర్శించి... భర్త మూర్తిలో అనుమానం రేకెత్తిస్తాడు. లలితను అనుమానించిన మూర్తి ఆమెను మాటలతో హింసించగా, ఇల్లు వదిలిన లలిత.. కంపౌండర్ గోపాలం సాయంతో మగవేషంలో డాక్టరుగా మూర్తివద్దే పనిచేస్తూ తన విషయం చెల్లెలు సరళకు చెప్పుకుంటుంది. దీనికి తన భర్త కారణమని గ్రహించిన సరళ -లలిత కాపురం సరిదిద్దమని భర్తను వేడుకుంటుంది. గిరి తిరస్కరిస్తాడు. ఈలోగా గిరి చేతిలో తుపాకీ పేలి ఒక వ్యక్తి గాయపడతాడు. అయితే గిరి నేరాన్ని సరళ తనమీద వేసుకుని జైలుకెళ్లటంతో గిరిలో మార్పు వస్తుంది. మూర్తివద్దకు బయలుదేరుతూ దారిలో యాక్సిడెంట్‌కు గురవుతాడు. హాస్పిటల్‌లో గిరికి వైద్యం చేయటానికి మూర్తి నిరాకరించటంతో, లలిత అతన్ని కాపాడుతుంది. జామీనుమీద వచ్చిన సరళ అందరికీ నిజం చెప్పటం, అప్పటికే మరోసారి భర్త తిరస్కారానికి గురై లలిత ఆత్మహత్యకు యత్నించటం, స్పృహలోకి వచ్చిన గిరి.. మూర్తిని క్షమాపణకోరి నిజం వెల్లడించటంతో మూర్తిలో మార్పు వస్తుంది. రైలు క్రింద పడబోయిన లలితను -మూర్తి, సరళ అంతాకలిసి కాపాడటం.. ఈ సంసార కథ ఈవిధంగా సుఖంగా నడవడానికి కారణం సరళ మంచితనం, లక్షణాలు అంటూ ఆమె తమపాలిటి ‘భాగ్యదేవత’ అని అందరూ ప్రశంసించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది[1].

పాటలు మార్చు

  1. ఉంటే చాలునా అంటే ఆగునా
  2. తలచిన తలపులు, ఫలమైతే తీయని కలలే - కె.జమునారాణి, - రచన: కొసరాజు
  3. మదిని హాయి నిండెగా విబుడు చెంతనుండగా - పి.సుశీల, ఘంటసాల - రచన: శ్రీశ్రీ
  4. వెతుకాడే కన్నులలోన వెలిగించి - ఘంటసాల, కె జమునారాణి - రచన:శ్రీశ్రీ
  5. హరే హరే రాం, సీతారాం, అంతా ఇంతే ఆత్మారాం - ఘంటసాల - రచన: కొసరాజు
  6. ఓ మాతా ఎటుచూసినా చీకటేనా - సుశీల, మాధవపెద్ది బృందం - రచన: తాపీ ధర్మారావు
  7. మరికొంచెం నిద్దుర కానీ - సుశీల - రచన: తాపీ ధర్మారావు
  8. బావంటే బావ బలే మంచి బావ - కె.జమునారాణి - రచన: కొసరాజు
  9. పాపం ఒకచోట ఫలితం ఒకచోట - మాధవపెద్ది - రచన: తాపీ ధర్మారావు

విశేషాలు మార్చు

  • ఈ సినిమా హైదరాబాదులోని సారథీ స్టూడియోలో నిర్మించబడిన రెండవ సినిమా.
  • తెలుగుతో పాటు తమిళంలో ఈ సినిమాను జెమిని గణేశన్, సావిత్రి, బాలయ్య, రాజసులోచన, నంబియార్ ముఖ్య పాత్రధారులుగా 'భాగ్యదేవతై' అనే పేరుతో నిర్మించారు. తమిళ వర్షన్ కూడా పూర్తిగా హైదరాబాదులో తయారయ్యింది. ఒక తమిళ సినిమా పూర్తిగా ఆంధ్రదేశంలో నిర్మించడం అదే మొదటి సారి. తమిళ సినిమా 1959 జూన్ 12న విడుదలయ్యింది.
  • సినిమాలో బాలయ్య, రాజసులోచన ఉన్న బస్సులో ఓ ప్రయాణికునిగా తమిళ హీరో జెమిని గణేశన్ కనిపిస్తాడు.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (19 October 2019). "ఫ్లాష్ బ్యాక్ @ 50 భాగ్యదేవత". ఆంధ్రభూమి దినపత్రిక. Retrieved 23 June 2020.

బయటిలింకులు మార్చు