యమునా నది

భారతదేశపు నది

యమునా (సంస్కృతం: यमुना, జమున, జమ్నా) ఉత్తర భారతదేశములో గంగానది యొక్క అతిపెద్ద ఉపనది. ఇది గంగా నదికి ఎడమవైపున పుట్టి గంగా నదిని కుడివైపు నుండి కలిసే ఏకైక ఉపనది. 1370 కిలోమీటర్ల పొడవున్న ఈ నది భారతదేశపు నదులలో ప్రముఖమైనది, పవిత్రమైనది. హిమాలయ పర్వతశ్రేణులకు చెందిన కాళింది పర్వతంలో యుమునోత్రి అనే స్థలం దీని జన్మ స్థలం. ఋగ్వేదంలో గంగానదితో పాటు దీన్ని గురించిన ప్రస్తావన కూడా ఉంది. దీనికే సూర్య తనయ అనీ సమానశ్వాస అనే పేర్లు కూడా ఉన్నాయి.

ఆగ్రా వద్ద యమునా నది

పురాణాల్లో ప్రస్థావనసవరించు

భాగవత పురాణంలో శ్రీకృష్ణుని బాల్యంలో చాలా చోట్ల దీని ప్రస్తావన ఉంది. కృష్ణుని తండ్రియైన వాసుదేవుడు కంసుని బారినుంచి తన కుమారుడిన కాపాడటానికి ఈ నదిని దాటవలసి వస్తే అది రెండు పాయలుగా చీలి దారి ఇచ్చిందని ఉటంకించబడి ఉంది. భరతుడు, అంబరీషుడు, శంతనుడు మొదలైన చక్రవర్తులు ఈ నది ఒడ్డున ఎన్నో పుణ్యకార్యాలు నిర్వర్తించారు.[1]అగస్త్య మహర్షి కూడా దీని ఒడ్డున పూజాదికాలు నిర్వహించేవాడని హిందూ పురాణాలు తెలియజేస్తున్నాయి.

యమునానది గమనంసవరించు

 
అలహాబాదులోని త్రివేణీ సంగం. యమున, గంగానదుల సంగమస్థలం.

యమున, హిమాలయ పర్వతాలలో, ఉత్తరాఖండ్ రాష్ట్రములో, హరిద్వార్కు ఉత్తారాన ఉన్న యమునోత్రి వద్ద ఉద్భవిస్తుంది. ఈ నది ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి అలహాబాద్ వద్ద గంగానదిలో కలుస్తుంది. యమునా నది ఒడ్డున ఢిల్లీ, మథుర, ఆగ్రా వంటి నగరాలు ఉన్నాయి. టాన్స్, చంబల్, బెట్వా, కేన్ నదులు యమున యొక్క ప్రధాన ఉపనదులు. ఈ ఉపనదుల్లో టాన్స్ నది అన్నింటికంటే పెద్దది.

ఈనదిలో సంవత్సరమంతటా ప్రవహించే నీటి పరిమాణం, దిశ దాదాపు స్థిరంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం నిర్వహించే మహామేళా, 12 సంవత్సరాల కొకసారి నిర్వహించే కుంభమేళకు విశేష సంఖ్యలోభక్తులు హాజరవుతారు.

వివిధ రాష్ట్రాలలో యమునానది పరీవాహకప్రాంతం
రాష్ట్రం పరీవాహకప్రాంతం (చ.కి.మీ.) పరీవాహకప్రాంతపు శాతం
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ 74,208 21.5
హిమాచల్ ప్రదేశ్ 5,799 1.6
హర్యానా 21,265 6.5
రాజస్థాన్ 102,883 29.8
మధ్య ప్రదేశ్ 14,023 40.6
ఢిల్లీ 1,485 0.4

మూలాలుసవరించు

  1. Hindu Pilgrim Ceners by Swami Harshananda Published by Ramakrishna Math, Bangalore
"https://te.wikipedia.org/w/index.php?title=యమునా_నది&oldid=3691921" నుండి వెలికితీశారు