వి. ఎస్. రమాదేవి' (జనవరి 15, 1934 - ఏప్రిల్ 17, 2013) భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనరు,[2] హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల గవర్నరు. భారతదేశం గర్వించతగ్గ అడ్మినిస్ట్రేటర్ గా ఖ్యాతికెక్కారు. ఒక తెలుగు మహిళ దేశం గర్వించతగ్గ బ్యూరోక్రాట్ గా ఎదిగిన తీరు నేటి మహిళలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే వుంటుంది.

వి.ఎస్.రమాదేవి
వి. ఎస్. రమాదేవి


భారత ప్రధాన ఎన్నికల కమీషనర్
పదవీ కాలం
26 నవంబరు 1990 – 12 డిసెంబరు 1990
ముందు ఆర్.వి.ఎస్.పేరిశాస్త్రి
తరువాత టి.ఎన్.శేషన్

రాజ్యసభ సెక్రటరీ జనరల్
పదవీ కాలం
1 జూలై 1993 – 1997 సెప్టెంబరు 25
ముందు సుదర్శన్ అగర్వాల్
తరువాత ఎస్.ఎస్.సొహోనీ

వ్యక్తిగత వివరాలు

జననం (1934-01-15)1934 జనవరి 15
చేబ్రోలు (ఉంగుటూరు), ఆంధ్రప్రదేశ్, భారతదేశం
మరణం 2013 ఏప్రిల్ 17(2013-04-17) (వయసు 79)[1]
బెంగుళూరు,కర్ణాటక , భారతదేశం
జాతీయత భారతీయులు
వృత్తి సివిల్ సర్వెంటు

వీరు పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలులో 1934, జనవరి 15 తేదీన జన్మించారు. వీరి తల్లిదండ్రులు వి.వి. సుబ్బయ్య, వి. వెంకట రత్నమ్మ. ఏలూరు, హైదరాబాదు నగరాలలో ఎమ్.ఎ., ఎల్.ఎల్.ఎమ్. పూర్తిచేశారు. వీరు 1959లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేయడం మొదలుపెట్టారు. తరువాత గ్రూప్ ఎ ఆఫీసర్ గా కేంద్ర ప్రభుత్వంలో నియమితులయ్యారు. ఇండియన్ లీగల్ సర్వీసులో నియుక్తులై వివిధ హోదాలలో పనిచేశారు. లెజిస్లేటివ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా, లా కమిషన్ మెంబర్ కార్యదర్శిగా, లెజిస్లేటివ్ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. వీరు కస్టమ్స్ ఎక్సైజు అప్పీళ్ల ట్రిబ్యునల్ సభ్యులుగా పనిచేశారు.

వీరు భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనరుగా నవంబరు 1993 సంవత్సరంలో కొంతకాలం ( 26.11.1990 నుండి 11.12.1990 వరకు) పనిచేశారు. జూలై 1993లో రాజ్య సభ సెక్రటరీ జనరల్ గా నియమితులై 1997 వరకు ఆ పదవిలో ఉన్నారు. 1997లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ (26.07.1997 నుండి 01.12.1999 వరకు) గా నియమితులయ్యారు.[3] వీరు ఈ పదవిలో 1997 జూలై 25 నుండి 01 డిసెంబరు 1999 వరకు పనిచేశారు. 1999లో కర్ణాటక గవర్నరుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. కర్ణాటక రాష్ట్రానికి తోలి మహిళా గవర్నర్ ఈవిడే (02.12.1999 నుండి 20.08.2002 వరకు) [4] 2002 ఆగస్టు 21 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఈమె కామన్ వెల్త్ అసోసియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు అధ్యక్షులుగా ఎన్నికైన తొలి ఆసియా దేశస్తులు.[5]

ఈమె తెలుగు భాషలో ఇరవైకి పైగా గ్రంథాలు, నవలలు, కథానికలు, వ్యాసాలు, నాటకాలు రచించారు. ముఖ్యంగా స్త్రీలు-చట్టాలు అంశాలుపై అనేక వ్యాసాలు రాసారు. రచయిత్రిగా వీరిని అఖిల భారత రచయిత్రుల సదస్సులో సత్కరించారు. వీరు ఢిల్లీ ఆంధ్ర వనితా మండలి అధ్యక్షులుగా పనిచేశారు. ఈమె వి. ఎస్. రామావతార్ ను వివాహమాడారు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. వీరిని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది.

రచనలు మార్చు

  • రాజీ
  • మలుపులు
  • మజిలీ
  • అనంతం

పై నవలలను కలిపి ఆమె "నవలా చతురస్రం" అని పిలిచారు. ఈ నాలుగు నవలలలో ప్రధాన పాత్ర రాజేశ్వరి కాబట్టి వీటిని "రాజేశ్వరి నవలా చతురస్రం" అని పేరు పెట్టారు.

మరణం మార్చు

2013, ఏప్రిల్ 17 న తన 79వ ఏట అనారోగ్యంతో బెంగుళూరులో మరణించారు.[6]

మూలాలు మార్చు

  1. DHNS. "Former Governor Ramadevi passes away". Deccan Herald. Retrieved 2024-04-08.
  2. వి. యస్. రమాదేవి (1934), ఢిల్లీ ఆంధ్ర ప్రముఖులు, డా. ఆర్. అనంత పద్మనాభరావు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్,2000, పేజీ: 98.
  3. Past Governors at Raj Bhavan, Himachal Pradesh website.
  4. "V.S. Ramadevi at Raj Bhavan, Karnataka website". Archived from the original on 2012-03-12. Retrieved 2010-10-02.
  5. "The Newsletter of the Commonwealth Association of Legislative Counsel, July 1995" (PDF). Archived from the original (PDF) on 2009-05-18. Retrieved 2009-05-18.
  6. "మాజీ గవర్నర్ వి.ఎస్. రమాదేవి మృతి". తెలుగు వన్. Apr 18, 2013.