వెన్నా వల్లభరావు

రచయిత, అనువాదకుడు

వెన్నా వల్లభరావు రచయిత, అనువాదకుడు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత.

వెన్నా వల్లభరావు
జననం1956
కృష్ణా జిల్లా, బేతవోలు
వృత్తిఅధ్యాపకుడు
ఉద్యోగంఆంధ్ర లయోలా కళాశాల
ప్రసిద్ధిఅనువాదకుడు, రచయిత
మతంహిందూ
తండ్రివెన్నా హనుమంతరావు
తల్లిలక్ష్మీనాగేశ్వరమ్మ

జీవిత విశేషాలు మార్చు

వెన్నా వల్లభరావు కృష్ణా జిల్లా, గుడివాడ మండలం, బేతవోలు గ్రామంలో వెన్నా హనుమంతరావు, లక్ష్మీనాగేశ్వరమ్మ దంపతులకు 1956లో జన్మించాడు. ఇతని ప్రాథమిక విద్య బేతవోలు గ్రామంలో, కాలేజీ విద్య గుడివాడలో పూర్తి అయ్యింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ., "భగవతీ చరణ్ వర్మాకే ఉపన్యాసోమే వ్యక్తి ఔర్ సమాజ్" అనే అంశంపై పరిశోధించి పి.హెచ్.డి పట్టాలను అందుకున్నాడు. ఇతడు తన ఉపాధ్యాయులు యార్లగడ్డ అంకినీడు, కొచ్చెర్లకోట వెంకట సుబ్బారావుల ప్రోత్సాహంతో హిందీ భాషపట్ల మక్కువ పెంచుకున్నాడు. కళాశాలలో చేరే సమయానికే హిందీ ప్రచారసభ వారి అన్ని పరీక్షలు పూర్తి చేశాడు. చదువు పూర్తి అయిన తర్వాత విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో హిందీ అధ్యాపకుడిగా చేరి 2014లో అక్కడే హిందీ విభాగాధిపతిగా పదవీవిరమణ చేశాడు[1].

రచనలు మార్చు

ఇతడు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజులలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, హిందీ విభాగాధిపతి ఆదేశ్వరరావుల ప్రోత్సాహంతో అనువాద రచనకు శ్రీకారం చుట్టాడు. మొదటగా త్రిపురనేని గోపీచంద్ కథల సంపుటి "తండ్రులు కొడుకులు"ను హిందీలోకి అనువదించాడు. అప్పటి నుండి సమకాలీనంగా వస్తున్న కథలు, కవితలను హిందీ నుండి తెలుగుకు, తెలుగు నుండి హిందీలోనికి అనువదించసాగాడు. ఇతడు ఆకాశవాణి విజయవాడ కేంద్రం కోసం జాతీయస్థాయి నాటక పోటీలలో బహుమతులు పొందిన 40 నాటకాలను హిందీ నుండి తెలుగులోనికి అనువదించాడు. పంజాబీ రచయిత్రి అజిత్‌కౌర్ "ఖానా బదోష్" పేరుతో వ్రాసిన ఆత్మకథను "విరామమెరుగని పయనం" పేరుతో తెలుగులోనికి అనువదించాడు. ఈ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. జి.వి.పూర్ణచందు వ్రాసిన తెలుగే ప్రాచీనం అనే పుస్తకాన్ని హిందీలో తెలుగు హీ ప్రాచీన్ హైపేరుతో అనువదించాడు. ఇతడు కేవలం అనువాదాలకే పరిమితం కాకుండా తెలుగు, హిందీ భాషలలో స్వంతరచనలు కూడా చేశాడు. కవిరాజ్ త్రిపురనేని రామస్వామి చౌదరి, అక్షర సత్య్, ఇక్కీస్‌వీ శతాబ్దీకీ తెలుగు కవితా, ఆంధ్రప్రదేశ్‌కే సాంస్కృతిక్ పర్యటన్ క్షేత్ర్ ఔర్ లోక్ కలాయే, ఛోటే కుమార్, రాష్ట్రధ్వజ్‌కే నిర్మాతా పింగళి వెంకయ్య, తెలుగ్ భాషాసాంస్కృతిక చైతన్యయాత్రలు, సాహిత్య వారధి, కవితా భారతి, గురజాడ కథలు - నాటకరూపాలు మొదలైన స్వతంత్ర రచనలు పేర్కొనదగినవి[1].

పురస్కారాలు మార్చు

  • 2011లో "నల్లనివాడు" రేడియో నాటకానికి ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ పురస్కారం.
  • దక్షిణభారత హిందీ ప్రచారసభ వారి సాహిత్యకార్ పురస్కారం.
  • 2017లో "విరామమెరుగని పయనం" రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ వారి అనువాద పురస్కారం[2].
  • 2018లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం వారి ఉగాది పురస్కారం.
  • ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ వారి నుండి "అనువాద సాహిత్య రత్న" బిరుదప్రదానం.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 కప్పగంతు రామకృష్ణ (1 January 2018). "అనువాదం ఆయన జీవననాదం". తెలుగు వెలుగు మాసపత్రిక. 6 (5): 104–105. Archived from the original on 25 సెప్టెంబరు 2020. Retrieved 12 May 2020.
  2. విలేకరి (22 December 2017). "దేవిప్రియకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు". ఆంధ్రజ్యోతి దినపత్రిక. Archived from the original on 1 నవంబరు 2020. Retrieved 12 May 2020.