వేదవ్యాస రంగభట్టర్
వేదవ్యాస రంగభట్టర్ (1946, జనవరి 10 - 2019, ఫిబ్రవరి 20) రంగస్థల నటుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు, పాటల రచయిత. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ప్రాచ్య కళాశాల ప్రధానాచార్యులుగా పనిచేశాడు. శ్రీ మంజునాథ చిత్రంలోని ‘మహాప్రాణ దీపం’ పాటతోపాటు పాండురంగడు, శ్రీరామదాసు, షిరిడీసాయి, అనగనగా ఓ ధీరుడు, ఝుమ్మంది నాదం, జగద్గురు ఆదిశంకర, వెంగమాంబ, ఓం నమో వేంకటేశాయ వంటి 13 చిత్రాలకు పాటలను అందించాడు.
వేదవ్యాస రంగభట్టర్ | |
---|---|
![]() | |
జననం | కోమటిపల్లి, కేసముద్రం మండలం, మహబూబాబాదు జిల్లా, తెలంగాణ | 1946 జనవరి 10
మరణం | 2019 ఫిబ్రవరి 20 తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ | (వయసు 73)
మరణ కారణం | ఊపిరితిత్తుల వ్యాధి |
తండ్రి | రంగరాజభట్టర్ |
తల్లి | రంగనాయకమ్మాళ్ |
జననం సవరించు
వేదవ్యాస రంగభట్టర్ 1946, జనవరి 10న రంగరాజభట్టర్, రంగనాయకమ్మాళ్ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లా, కేసముద్రం మండలంలోని కోమటిపల్లి గ్రామంలో జన్మించాడు.
ఉద్యోగం సవరించు
1968లో తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన ఓరియంటల్ కాలేజీలో సంస్కృత, సాహిత్య ఆచార్యుడిగా చేరాడు. అటు తరువాత శ్రీవేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో ప్రధానాచార్యులుగా బాధ్యతలు నిర్వర్తించి 2004లో ఉద్యోగ విరమణ చేశాడు.[1]
రచనా ప్రస్థానం సవరించు
‘స్వరజ్ఞాన వర్షిణి’ అనే కొత్త సాహిత్య సంగీత స్వర ప్రక్రియను రూపొందించి, వేంకటేశ్వరస్వామిపై 12, 16 స్వర స్థానాలతో 320 కీర్తనల వరకు రాశాడు. ఈ కీర్తనలు సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణిలచే ఆమోదించబడ్డాయి.
రంగస్థల ప్రస్థానం సవరించు
1996లో తిరుపతిలోని మహతి కళామందిరంలో ‘ఎస్వీ నటశిక్షణాలయం’ స్థాపించి ఔత్సాహిక కళాకారులకు పద్యపఠనం, పౌరాణిక నాటకాల్లో ఉచితంగా శిక్షణను అందించాడు. అనేక నాటకాలను రచించి, వాటికి దర్శకత్వం వహించాడు.
సినిమారంగ ప్రస్థానం సవరించు
దర్శకులు కె. రాఘవేంద్రరావు, దర్శక నిర్మాత నారా జయశ్రీ,సోదరుడు జె. కె. భారవి ప్రోత్సాహంతో తెలుగు సినిమాలకు పాటలు రాశాడు. 1986లో విడుదలైన రంగవల్లి సినిమాకు తొలిసారిగా పాటలు పాటలు రాసిన వేదవ్యాస వివిధ సినిమాల్లో దాదాపు 80కి పైగా పాటలు రాశాడు.[2] అయితే శ్రీ మంజునాథ చిత్రంలోని 'మహాప్రాణ దీపం' పాట మంచి పేరును తెచ్చింది. అంతేకాకుండా రోజా, సంఘవి వంటి నటీమణులకు నటనలో శిక్షణ కూడా ఇచ్చాడు.
సినిమాలు సవరించు
- పాండురంగడు
- శ్రీరామదాసు
- షిరిడీసాయి
- ఆ ఒక్కడు (2009): రాధ మనసా
- అనగనగా ఓ ధీరుడు
- ఝుమ్మంది నాదం
- జగద్గురు ఆదిశంకర
- వెంగమాంబ
- ఓం నమో వేంకటేశాయ
- శరభ (2018): హరిహి హోం
అవార్డులు - పురస్కారాలు సవరించు
- నంది అవార్డు (2003)
- వరల్డ్ అమేజింగ్స్ రికార్డ్స్ ఆఫ్ ఇండియా
- తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్
- వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సంస్థ
ఇతర వివరాలు సవరించు
వివిధ సాహితీ, సాంస్కృతిక సంస్థల నుంచి కళాతపస్వి, దర్శకరత్న, కళారత్న, సాహితీ సార్వభౌమ వంటి బిరుదులను అందుకున్నాడు.
మరణం సవరించు
ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధికి తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2019, ఫిబ్రవరి 20 బుధవారం రాత్రి 9 గంటలకు మరణించాడు.[3]
మూలాలు సవరించు
- ↑ సాక్షి, సినిమా (21 February 2019). "సినీ గేయ రచయిత రంగభట్టర్ కన్నుమూత". Archived from the original on 26 February 2019. Retrieved 26 February 2019.
- ↑ ఈనాడు, సినిమా (21 February 2019). "గేయ రచయిత వేదవ్యాస రంగభట్టర్ ఇక లేరు..!". Archived from the original on 26 February 2019. Retrieved 26 February 2019.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలంగాణ ముఖ్యాంశాలు (22 February 2019). "'వేదవ్యాస రంగభట్టర్' ఇకలేరు". Archived from the original on 26 February 2019. Retrieved 26 February 2019.