వేములపల్లి శ్రీకృష్ణ
వేములపల్లి శ్రీకృష్ణ (1917 -8/4/2000) ప్రముఖ కమ్యూనిష్టు నేత, శాసనసభ్యులు, కవి. వీరు "చేయెత్తి జైకొట్టు తెలుగోడా" అనే గేయాన్ని రచించి తెలుగు ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయారు.
వీరు గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా బేతపూడి గ్రామంలో జన్మించారు. వీరు రేపల్లె లో ఉన్నత విద్యనభ్యసించి, గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. వీరు ప్రముఖ కమ్యూనిష్టు నాయకులు పులుపుల వెంకట శివయ్య గారి ప్రోత్సాహంతో 1938లో కమ్యూనిష్టు పార్టీ సభ్యత్వం స్వీకరించారు. వీరు 1948లో గుంటూరు జిల్లా కమ్యూనిష్టు కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
వీరు 1940 దశకంలో సాంస్కృతిక ఉద్యమంలో చురుకుగా పాల్గొని గేయ రచనలోను, వివిధ జానపద కళారూపాలను వెలుగులోకి తేవడానికి సహాయపడ్డారు. 1950 దశకంలో ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ కాలంలో "చేయెత్తి జై కొట్టు తెలుగోడా" అనే గేయాన్ని రచించి తెలుగు ప్రజల హృదయాలలో నిలిచిపోయారు.
వీరు మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. మొదట బాపట్ల నియోజకవర్గం నుండి 1952లో మద్రాసు శాసనసభకు, [1] తరువాత 1962, 1972 ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభ లోనూ సభ్యులయ్యారు. 1964-65 విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యమంలో తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
వీరు 1968 నుండి 1972 వరకు విశాలాంధ్ర దినపత్రిక కు సంపాదకత్వం వహించారు. హైదరాబాదులోని చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ కు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. వీరు ఏప్రిల్ 8, 2000 న హైదరాబాదులో పరమపదించారు. మరణానంతరం తన నేత్రాలను ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేశారు.
పురస్కారాలుసవరించు
- 1998లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయరచయితల సంఘం, గుంటూరు జిలాశాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం.[2]
ఇతరాలుసవరించు
మూలాలుసవరించు
- ↑ "మద్రాసు శాసనసభ సమీక్ష - 1952-57" (PDF). తమిళనాడు శాసనసభ. p. 82. Archived (PDF) from the original on 2020-10-15. Retrieved 2021-11-03.
- ↑ పెనుగొండ లక్ష్మీనారాయణ (1 January 2020). గుంటూరు సీమ సాహిత్య చరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం. pp. 282–283.