తెలంగాణ దళితబంధు పథకం

(దళితబంధు పథకం నుండి దారిమార్పు చెందింది)

తెలంగాణ దళితబంధు పథకం అనేది దళితుల సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పథకం.[1] అర్హులైన దళితులకు ఈ పథకంలో భాగంగా కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయబడుతుంది. తమ అభివృద్ధిని తామే నిర్వచించుకునే దిశగా చైతన్యమై, ఉత్పత్తిలో భాగస్వాములైన నాడే దళితుల సాధికారతకు నిజమైన అర్థం లభిస్తుందన్న ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. పరిశ్రమలను, ఉపాధిని, వ్యాపారాన్ని ఎంచుకుని దళిత సమాజం వ్యాపార వర్గంగా అభివృద్ధి చెందడంకోసం ఈ పథకం ఉపయోగపడుతుంది.[2] 2021, ఆగస్టు 5న యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం, వాసాలమర్రి గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు రూ. 7.60 కోట్ల నిధులను విడుదలజేయడం ద్వారా ఈ పథకం ప్రారంభించబడింది.[3]

తెలంగాణ దళిబంధు పథకం
ప్రాంతంవాసాలమర్రి, తుర్కపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా
ప్రధాన వ్యక్తులుతెలంగాణ ప్రజలు
స్థాపనఆగస్టు 5, 2021
నిర్వాహకులుముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు,
తెలంగాణ ప్రభుత్వం

ప్రారంభం మార్చు

దళితుల కోసం 2021 సంవత్సరం బడ్జెట్‌లో 'సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ స్కీం' పేరుతో వెయ్యి కోట్లు కేటాయించనున్నట్లు 2021, ఫిబ్రవరి 10న నల్లగొండ జిల్లా హాలియాలో జరిగిన బహిరంగసభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించాడు.[4] 2021లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో దళిత ఎంపవర్‌మెంట్‌ స్కీం కోసం వెయ్యి కోట్లు ప్రవేశపెట్టారు.

2021, జూలై 18న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ‘దళిత సాధికారత అమలు పైలట్‌ ప్రాజెక్టు ఎంపిక అధికార యంత్రాంగం విధులు’ అనే అంశంమీద ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ పథకానికి 'తెలంగాణ దళితబంధు పథకం' అనే పేరును కేసీఆర్ ఖరారు చేశాడు.[5][6]

ఈ పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ, విజయం సాధించే దిశగా తీసుకోవాల్సిన కార్యాచరణపై 2021, జూలై 26న ప్రగతి భవన్ లో తొలి అవగాహన సదస్సును జరిగింది. కేసీఆర్ అధ్యక్షతన ఉదయం 11 గంటల నుండి సాయంత్రం వరకు జరిగిన ఈ సమావేశంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని గ్రామానికి నలుగురు చొప్పున (ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు), ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి నలుగురు చొప్పున (ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు) మొత్తం 412 మంది దళిత పురుషులు మహిళలు, 15 మంది రిసోర్సు పర్సన్స్ ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నారు.[7]

2021, ఆగస్టు 4న యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కెసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రకటించాడు.[8] 2021 ఆగస్టు 16న కేసీఆర్ చేతుల మీదుగా లబ్దిదారునికి 10 లక్షల రూపాయల ఉచిత గ్రాంటు ఇవ్వబడింది. ప్రతి సంవత్సరం ఆగస్టు 16వ తేదీన దళితబంధు వేడుకలను ఘనంగా జరుతున్నారు. ప్రతి సంవత్సరం 2 లక్షల మందికి ఈ పథకాన్ని అమలు చేసేలా వార్షిక బడ్జెటులో 20 వేల కోట్లను కేటాయించనున్నారు.

వివరాలు మార్చు

  1. రాష్ట్రంలోని అన్ని దళిత కుటుంబాల వివరాల స్థితి గతులను తెలుసుకొని, నిబంధనలను అనుసరించి లబ్ధిదారులను ఎంపిక
  2. ఈ పథకం ద్వారా తెలంగాణలోని పదిహేను పదహారు లక్షల దళిత కుటుంబాలకు లబ్ధి
  3. లబ్ధిదారుడి నుండి రూ. 10వేలతో ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటుచేసి, లబ్ధిదారుల్లో ఆకస్మికంగా ఏదైనా ఆపద వాటిల్లినప్పుడు ఈ రక్షణ నిధి నుంచి సహాయం అందజేత
  4. పథకం అమలు తీరును గమనించేందుకు ఆరుగురితో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలలో దళిత బంధు కమిటీల ఏర్పాటు

పథకం అమలు మార్చు

  • మొదటగా హుజురాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా 2021, సెప్టెంబరు 14న రూ.10లక్షల చొప్పున 14,400 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమచేసింది. మూడు విడతల్లో కలిపి మొత్తంగా రూ.1,200 కోట్లను లబ్ధిదారులకు అందజేసారు.[9] దళితబంధు పథకంలో భాగంగా సీఐపీఎస్‌, పీఎంఎంఎస్‌వై సహకారంతో 2021 డిసెంబరు నెలలో జమ్మికుంట పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో మత్స్య శాస్త్రవేత్త ప్రభాకర్‌ ఆధ్వర్యంలో హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో దళిత బంధుకు అర్హత సాధించిన దళిత యువతకు చేపల ఉత్పత్తి, మార్కెటింగ్‌, వ్యవస్థాపకతలో నైపుణ్యాభివృద్ధిపై 15 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. తమకు వచ్చే దళిత బంధు నిధులలో శిక్షణలో నేర్చుకున్న మెళకువలతో ఫిషరీస్‌ యూనిట్లు ఏర్పాటు చేసుకోని, చేపల ఉత్పత్తి, పెంపకం చేయనున్నారు.[10]
  • 2022, ఫిబ్రవరి 19న కరీంనగర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన దళితబంధు లబ్ధిదారులలో 146 మంది లబ్ధిదారులకు రూ.15.30 కోట్ల విలువైన 63 యూనిట్లను (51 హార్వెస్టర్లు, 4 జేసీబీలు, 1 జేసీబీ అండ్‌ ట్రాక్టర్‌, 6 డీసీఎం వ్యాన్లు, 1 వరి నాటు యంత్రం) తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, బీసీ సంక్షేమం-పౌర సరఫరాల శాఖామంత్రి గంగుల కమలాకర్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు కొనుమల్ల విజయ, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, ఎస్సీ కార్పోరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, నగర మేయర్‌ సునీల్‌రావు, టీఆర్‌ఎస్‌ హుజూరాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి గెల్లు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.[11]
  • 2022, ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు కలిసి 2వేల మంది లబ్ధిదార్లకు దళితబంధు యూనిట్లు పంపిణీ చేశారు.[12]
  • 2023 మార్చి 9న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రివర్గం సమావేశంతో రెండవ విడత కింద 1,30,000 కుటుంబాలకు దళితబంధు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని, ప్రతి సంవత్సరం ఆగస్టు 16వ తేదీన దళితబంధు వేడుకలను ఘనంగా జరపాలని నిర్ణయం జరిగింది.[13][14] హుజూరాబాద్‌ మినహా మిగిలిన 118 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,100 కుటుంబాల చొప్పున, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోటాలో మరో 200 దళిత కుటుంబాలకు కలిపి 1,30,000 కుటుంబాలకు దళితబంధు పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది.
  • 2023, అక్టోబరు 2న హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌ సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 162 మురుగు వ్యర్థాల రవాణా (సిల్ట్‌ కార్టింగ్‌) వాహనాలను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించి, లబ్ధిదారులకు వాహనాల ప్రొసీడింగ్స్‌ను అందించాడు.[15] ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యేలు గోపీనాథ్‌, గోపాల్‌, వెంకటేశ్‌, నాగేందర్‌, ప్రకాశ్‌గౌడ్‌, సుభాష్‌రెడ్డి, ఆనంద్‌, విఠల్‌రెడ్డి, పాషా ఖాద్రీ, ఎమ్మెల్సీ ప్రభాకర్‌, డిప్యూటీ మేయర్‌ శ్రీలతా శోభన్‌రెడ్డి, పురపాలక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్వింద్‌కుమార్‌, జలమండలి ఎండీ దానకిశోర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌రోస్‌ తదితరులు పాల్గొన్నారు.[16]

ప్రసంశలు మార్చు

  • నీతి అయోగ్: ద‌ళితుల‌ను ఆర్థికంగా, సామాజికంగా బ‌లోపేతం చేసేందుకు అమ‌లు చేస్తున్న ద‌ళిత‌బంధు ప‌థ‌కం నీతి అయోగ్ క‌మిటీ స‌భ్యుల ప్ర‌శంస‌లు అందుకుంది. విశ్వ‌నాథ్ బిష్ణ‌య్ నేతృత్వంలోని నీతి అయోగ్ బృందం 2022 సెప్టెంబరు 16న హుజురాబాద్ ప‌ట్ట‌ణంలో ప‌ర్య‌టించి ద‌ళిత‌బంధు ల‌బ్దిదారులు ఏర్పాటు చేసుకున్న యూనిట్ల‌ను ప‌రిశీలించింది. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యులు కుమార్ జైన్, నిఖిత జాయిన్, యశస్విన్ సరస్వతి, ఇరామయీ, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి సురేష్, జిల్లా నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.[17]

వెబ్‌ పోర్టల్‌ మార్చు

దళితబంధు పథక లబ్ధిదారుల వివరాలు, విజయగాథలను ఆన్‌లైన్‌ ద్వారా అందించేందుకు దళితబంధుకు వెబ్‌ పోర్టల్‌ రూపొందించనున్నారు. ఈ పథకానికి సంబంధించిన అన్ని గ్రామాల్లోని దళితబంధు లబ్ధిదారుల వివరాలు, వారు ఎంచుకున్న యూనిట్లు, వాటిని ఎప్పుడు ప్రారంభించారు? పురోగతి ఎలా ఉన్నది? తదితర వివరాలతోపాటు లబ్ధిదారుల విజయ గాథలు, దళితబంధు పథకం అమలు కోసం క్షేత్రస్థాయిలో స్పెషల్‌ ఆఫీసర్ల వివరాలు, ఆ అధికారుల ఫోన్‌ నంబర్లను కూడా పోర్టల్‌లో పొందుపరచనున్నారు. నిధుల మంజూరు మొదలుకొని యూనిట్ల గ్రౌండింగ్‌ వరకు ప్రతి అంశంపై ఎప్పటికప్పుడు నిరంతర పర్యవేక్షణ కొనసాగించేందుకు వీలయ్యేలా ఈ పోర్టల్‌ను తీర్చిదిద్దుతున్నారు.[18][19]

యూనిట్లు మార్చు

రైస్‌మిల్‌ యూనిట్‌ మార్చు

రాజన్న సిరిసిల్ల జిల్లా, యల్లారెడ్డిపేట్ మండలంలోని పదిరకు చెందిన సుధామల్ల రాజేశ్వరి, సుధామల్ల విజయ్‌కుమార్‌, వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన డప్పుల లింగయ్యలకు దళితుల సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దళితబంధు పథకం మంజూరయింది. 2022 మే నెలలో 30 లక్షలు దళితబంధు డబ్బులు రాగానే మరో 30 లక్షలు బ్యాంకు రుణం తీసుకొని నాలుగు టన్నుల సామర్థ్యంతో కూడిన, అధునాతన యంత్ర పరికరాలతో విజయలక్ష్మి ఇండస్ట్రీస్‌ పేరుమీద రా రైస్‌మిల్లు ఏర్పాటుచేశారు. ఈ రైస్‌మిల్‌ యూనిట్‌ను 2023 మార్చి 27న తెలంగాణ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి. రామారావు ప్రారంభించాడు.[20][21]

మూలాలు మార్చు

  1. Telangana State Portal, Hyderabad (18 July 2021). "దళిత సాధికారతకు 'తెలంగాణ దళిత బంధు'". www.telangana.gov.in. Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
  2. నమస్తే తెలంగాణ, తెలంగాణ (4 August 2021). "Dalitha Bandhu : దళిత బంధు దండోరా". Namasthe Telangana. Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
  3. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (5 August 2021). "హైదరాబాద్: దళిత బంధు కార్యక్రమానికి జీవో విడుదల". andhrajyothy. Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
  4. డైలీహంట్, నమస్తే తెలంగాణ (11 February 2021). "వెయ్యి కోట్లతో దళిత బంధు - Namasthetelangaana". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
  5. హెచ్ఎం టీవి, తెలంగాణ (18 July 2021). "CM KCR: దళిత సాధికరత పథకానికి తెలంగాణ దళిత బంధు పథకం పేరు ఖరారు". www.hmtvlive.com. Sandeep Reddy. Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
  6. నమస్తే తెలంగాణ, తెలంగాణ (18 July 2021). "తెలంగాణ దళిత బంధు". Namasthe Telangana. Archived from the original on 19 July 2021. Retrieved 5 August 2021.
  7. Telangana State Portal, Hyderabad (27 July 2021). "తెలంగాణ దళిత బంధు" అవగాహన సదస్సు". www.telangana.gov.in. Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
  8. సాక్షి ఎడ్యుకేషన్, కరెంట్ అఫైర్స్ (5 August 2021). "తెలంగాణ దళిత బంధు పథకం ఎక్కడ ప్రారంభమైంది?". www.sakshieducation.com. Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
  9. Telugu, TV9 (2021-09-15). "Dalit Bandhu: దళిత బంధు లబ్ధిదారులకు గుడ్‌న్యూస్‌.. ఖాతాల్లో నిధులు జమ చేసిన ప్రభుత్వం." TV9 Telugu. Archived from the original on 2021-12-16. Retrieved 2021-12-16.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  10. "ఫిషరీస్‌ యూనిట్లతో ఆర్థిక ప్రగతి". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-12-07. Archived from the original on 2021-12-16. Retrieved 2021-12-16.
  11. telugu, NT News (2022-02-20). "ఇది దళితబంధు జాతర". www.ntnews.com. Archived from the original on 2022-02-20. Retrieved 2022-02-20.
  12. telugu, NT News (2022-04-15). "సంబురంగా దళితబంధు". Namasthe Telangana. Archived from the original on 2022-04-18. Retrieved 2022-04-18.
  13. "Telangana State Portal రెండవ విడత దళితబంధు అమలు, పోడు భూముల పంపిణీకై కేబినెట్ నిర్ణయం". telangana.gov.in. 2023-03-16. Archived from the original on 2023-03-11. Retrieved 2023-03-16.
  14. "గృహలక్ష్మి పథకం కింద మూడు విడతల్లో రూ3 లక్షలు మంత్రి హరీశ్‌రావు". ETV Bharat News. 2023-03-09. Archived from the original on 2023-03-11. Retrieved 2023-03-16.
  15. "దళితబంధు రెండో విడత ప్రారంభం.. 1.30 లక్షల మందికి రూ. 10 లక్షలు." The Economic Times Telugu. 2023-10-05. Archived from the original on 2023-10-07. Retrieved 2023-10-07.
  16. telugu, NT News (2023-10-03). "Dalith Bandhu | దళితోద్ధరణకే దళితబంధు.. రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి ప్రయోజనం చేకూర్చేలా పథకం: మంత్రి కేటీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-10-04. Retrieved 2023-10-07.
  17. telugu, NT News (2022-09-16). "దళితబంధు ప‌థ‌కంపై నీతి అయోగ్ ప్ర‌శంస‌లు". Namasthe Telangana. Archived from the original on 2022-09-16. Retrieved 2022-09-16.
  18. "దళితబంధుకి ప్రత్యేక పోర్టల్‌.. యాప్‌". Sakshi. 2021-07-26. Archived from the original on 2021-07-25. Retrieved 2023-01-10.
  19. telugu, NT News (2023-01-05). "దళితబంధుకు వెబ్‌ పోర్టల్‌.. ఆన్‌లైన్‌లో లబ్ధిదారుల వివరాలు, విజయగాథలు". www.ntnews.com. Archived from the original on 2023-01-05. Retrieved 2023-01-10.
  20. "దళిత బంధు నిధులతో రైస్‌మిల్లు ఈ యూనిట్‌ రాష్ట్రానికే ఆదర్శం కేటీఆర్‌". ETV Bharat News. 2023-03-27. Archived from the original on 2023-03-27. Retrieved 2023-03-27.
  21. telugu, NT News (2023-03-27). "Dalitha bandhu | దళితబంధుతో రైస్‌మిల్లు.. నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-03-27. Retrieved 2023-03-27.