పంతాలు పట్టింపులు

(పంతాలు-పట్టింపులు నుండి దారిమార్పు చెందింది)

పంతాలు-పట్టింపులు యార్లగడ్డ లక్ష్మీనారాయణ, శంభూ ఫిలిమ్స్ బేనర్‌పై, 1968లో నిర్మించిన చిత్రం. కె.బి.తిలక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఒక విజయవంతమైన మరాఠీ చిత్ర కథను ఆధారం చేసుకుని ఈ చిత్రం రూపొందింది. ఆ చిత్రంలో ‘తమాషా’ నృత్య సన్నివేశాలలో నటించిన నటి ‘లీలాగాంధీ’నే ఈ చిత్రంలోనూ నటించింది.

పంతాలు పట్టింపులు
(1968 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.బి.తిలక్
నిర్మాణం యార్లగడ్డ లక్ష్మీనారాయణ చౌదరి
తారాగణం వాణిశ్రీ ,
శోభన్ బాబు,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
గీతాంజలి,
రమణారెడ్డి
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ శ్రీ శంభు ఫిల్మ్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • మాటలు- పినిశెట్టి,
  • కూర్పు- సత్యం,
  • కళ- ఎ.కె.శేఖర్,
  • పోరాటాలు- పరమశివమ్,
  • ఛాయాగ్రహణం- లక్ష్మణ్‌గోరే,
  • నృత్యం- ఎ.కె.చోప్రా,
  • దొమ్మరి నృత్యాలు - జయరాం,
  • సంగీతం- పెండ్యాల నాగేశ్వరరావు,
  • దర్శకత్వం- కె.బి.తిలక్,
  • నిర్మాత- యార్లగడ్డ లక్ష్మీనారాయణ.

కథ మార్చు

కళల పట్ల మక్కువగల మురళి (శోభన్‌బాబు), తన ఊరు వదిలి వచ్చి పట్నంలో కళారంజని (లీలాగాంధి), అనే నర్తకిని తీర్చిదిద్ది, తాను మృదంగం వాయిస్తూ, ప్రదర్శనలిప్పిస్తుంటాడు. ఒక నాటి నృత్య ప్రదర్శనలో, తన నృత్యానికంటే, అతని మృదంగ విన్యాసానికి ప్రశంసలు రావటంతో కళారంజని అతన్ని నిందించి, అవమానిస్తుంది. ఆమెతో పంతంపట్టి, ఆమెను మించిన నర్తకి తయారుచేస్తానని మురళి, తన ఊరు వెళతాడు తల్లి సరస్వతమ్మ (మాలతి) చెల్లెలు వాణి (రమాప్రభ), బావ హార్మోనిష్ఠు రమణారెడ్డిలను కలుసుకుంటాడు. తన ఆశయసాధనకు తగిన వారుగా ఊరి చివర దొమ్మరి యువతులు జిమ్మి (వాణిశ్రీ), సోనీ (గీతాంజలి)లను ఎన్నుకొని, వారి తండ్రి తాగుబోతు మల్లయ్య (గుమ్మడి) అనుమతితో, వారికి ఆటపాటలు నేర్పించి నృత్య కళాకారిణిలుగా తీర్చిదిద్దుతాడు. వూరివారి చెప్పుడు మాటలు నమ్మిన మల్లయ్య, మురళి పట్నంలో జిమ్మి, సోనీల ప్రదర్శన ఏర్పాటుచేసిన మురళిని అవమానిస్తాడు. కూతుళ్ళను తనతో తీసికెళ్ళిపోతాడు. కాని, మురళిపై నమ్మకంగల జిమ్మి, సోనీలు తండ్రికి చెప్పకుండా మురళితో, వారి బావతో పట్నం చేరి, ప్రదర్శన ఇచ్చి కళారంజనిని ఓడిస్తారు. మరో పదిరోజుల్లో చివరి పోటీ కళారంజనితో వుండగా, జిమ్మికీ సోనీకి, వారిరుఊరు మురళినే ప్రేమిస్తున్న కారణంగా విబేధం కలుగుతుంది. సోనీ అక్కపై కోపంతో, కళారంజని, చెప్పుడు మాటలు విని, ఆమెవద్దకు చేరుతుంది. చివరి పోటీలో, కళారంజనితో జిమ్మి ఒక్కతే పోటీపడి ఆమెను ఓడించగా, అక్కతో పోటీకి సోనీ సిద్ధపడి వారిరువురూ నృత్యం చేస్తుండగా, మురళిని అంతం చేయాలని వచ్చిన మల్లయ్య విసిరిన కత్తి తగిలి, సోనీ మరణించటం, మల్లయ్యను పోలీసులు అరెస్ట్‌చేయగా, జిమ్మితో తన వూరిలో మురళికి వివాహం జరగటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది[1].

విశేషాలు మార్చు

సంగీత దర్శకుడు పెండ్యాలకు అఖిల భారత స్థాయిలో అవార్డును ఈ సినిమా ద్వారా లభించటం విశేషం. మొదట ఈ చిత్రంలో మురళి పాత్రకు ‘కృష్ణ’ను అనుకున్నారు. కారణాంతరాలవల్ల శోభన్‌బాబును తీసుకున్నారు.

పాటలు మార్చు

  1. ఇనుకోరా ఇనుకోరా ఈ మల్లన్న మాటే ఇనుకోరా - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
  2. ఆటా పాటల కృష్ణు డెంతవాడే యశోదా నీకొడుకు - ఎస్.జానకి, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: శ్రీశ్రీ
  3. ఎవరు ఎక్కువ పరమశివ భాగములో - పి. సుశీల, ఎస్. జానకి
  4. ఝుమా ఝుమ్ ఝుమ్ ఝుమా - ఎస్.జానకి, ఎల్. ఆర్. ఈశ్వరి,పట్టాభి బృందం - రచన: కొసరాజు
  5. తైయ్యతై తైయ్యతై ..నమో నమో నటరాజా - బి. గోపాలం - రచన: శ్రీశ్రీ
  6. నాగరికత లేనిదానా నాజూకే లేనిదాన - పి.సుశీల, ఎస్. జానకి బృందం - రచన: శ్రీశ్రీ
  7. నినిన్నే నిన్నే నిన్నే నేను మెచ్చుకున్నా - ఎస్. జానకి,ఎల్.ఆర్. ఈశ్వరి,బి. గోపాలం బృందం - రచన: ఆరుద్ర
  8. నేటిదా ఒక నాటిదా సిరులకొరకు సాగేటి పోటి దేవ దానవుల - పి.సుశీల, బి.గోపాలం బృందం - రచన: శ్రీశ్రీ
  9. పరువపు సొగసరి పిలిచే (అగజానన పద్మార్కం పద్యంతో ) - పి.సుశీల,బి. గోపాలం - రచన: శ్రీశ్రీ
  10. పళ్ళోరయ్యా పళ్ళు మంచి మంచి పళ్ళు - పి.సుశీల, ఎస్. జానకి, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన:కొసరాజు
  11. రమ్మంటె రాడు పెద షోగ్గాడహో షోగ్గాడు - ఎస్.జానకి, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: ఆరుద్ర
  12. రామ రామ శ్రీరామ దయామయ రాక్షస భంజన - పట్టాభి బృందం - రచన: శ్రీశ్రీ

మూలాలు మార్చు

బయటిలింకులు మార్చు