లలితకళాక్షేత్రం తంజావూరు

1565 తళ్ళికోట యుద్ధానంతరం విజయనగర రాజ్యం చిన్నాభిన్నమై పోయింది. రాయల సంతతి వారు కొంతమంది పెనుగొండకూ, మరికొంత మంది చంద్రగిరికీ వెళ్ళారు. మిగిలినవారు తంజావూరుకూ, మధురకూ చేరుకున్నారు. ఈ రెండూ కూడా విజయనగర రాజుల క్రింద సామంత రాజ్యాలుగా వుండేవి. వీటిని పరిపాలించిన నాయక రాజులు చివరి వరకూ ఆంధ్రభాషను పోషిస్తూనేవచ్చారు. తంజావూరు రాజ్యాన్ని 1535 నుండి 1673 వరకు సుమారు 140 సంవత్సరాలు నాయక రాజులు పరిపాలించారు. ఈ వంశంవారు ఆఖరు వరకూ విజయనగర రాజుల పట్ల విశ్వాస పాత్రులుగా వుంటూ వచ్చారు. అచ్యుతరాయలు, రఘునాథరాయలు, విజయరాఘవరాయలు వరుసగా పరిపాలించారు. విజయరాఘవ నాయుకునికి మరొ పేరు మన్నారుదాసు, మధురనాయకుడైన చొక్కనాథునికీ, ఇతనికీ జరిగిన యుద్ధంలో (1674) విజయ రాఘవుడు మరణించాడు. అనంతరం రెండు సంవత్సరాల తరువాతి శివాజీ తమ్ముడైన ఎక్కొజీ తంజావూరును ఆక్రమించాడు. ఒక శతాబ్దం పాటు మహారాష్ట్రులు దాన్ని పరిపాలించారు. ఎవరు పరిపాలించినా ఆ నాటికీ ఈ నాటికీ వారి సంస్కృతి అంతా అచ్చం అలా నిలిచే ఉంది.

సువర్ణయుగంగా శోభిల్లిన నాయకరాజ్య రంగు హంగులు: మార్చు

దక్షిణదేశ చరిత్రలో ఆంధ్రనాయకరాజుల పరిపాలన ఒక సువర్ణయుగమని చెప్పవచ్చు. విజయనగర చక్రవర్తుల కాలంలో లలిత కళలు అభివృద్ధి పొందినట్లే, తంజావూరు నాయక రాజుల కాలంలో కూడా లలిత కళలన్నీ వికాసం పొందాయి. తెలుగు సాహిత్యం, సంగీతం, నాట్యం, శిల్పం, యక్షగాన వాగ్మయం ఒక మహోన్నత స్థానాన్ని అలంకరించాయి. ఆ నాటికీ ఈ నాటికీ ఆ మహావైభోగానికి సాక్ష్యాదారాలుగా అవి తంజావూరులో మనకు దర్శనిమిస్తున్నాయి.

కవి, పండిత పోషణలో ఘనాపాఠి: మార్చు

రఘునాథనాయకుడు సా.శ.. 1600 నుండి 1634 వరకూ రాజ్యాన్ని పరి పాలించాడు. ఈయనకు దాన కర్ణుడనే పేరు కూడా ఉంది. గోవింద దీక్షితుడు ఈ యనకు మంత్రి. ఈయన కర్ణాటక సంగీత శాస్త్రంలో బహుముఖ ప్రజ్ఞాశాలి. అనేక రాగాలను, తాళాలను ఈయన స్వయంగా కల్పన చేశాడు. రఘునాథ నాయకుని ఆస్థానంలో కవులు, పండితులు బహు బాగా పోషింప బడ్డారు. ఈయన ఆస్థానంలో ముద్దు చంద్ర రేఖ అనే రాజ నర్తకి వుండేదట. గోవింద దీక్షితుని ఇరువురు పుత్రులైన భాస్కర దీక్షితుడు, రాజా చూడామణి దీక్షితుడూ లక్ష్మీకుమార తాతాచార్యులూ నృత్య, గాన విద్యల్లో ఆరితేరిన దిట్టలు. రామబాధ్రాంబ మొదలైన వారందరూ రఘునాథుని ఆస్థానం అలంకరించినవారే. ఆయన ఆధ్వర్యంలో తెలుగు సాహిత్యం ఎంతో అభివృద్ధి చెందింది. ఎన్నో యక్షగానాలు నాటక రూపంలో ప్రదర్శింపబడ్డాయి.

సంగీత సాహిత్యదోహదంలో విజయరాఘవుని వితరణ: మార్చు

రఘునాథనాయకుని అనంతరం విజయరాఘవ నాయకుడు రాజ్యానికి వచ్చి 1663 నుండి 1673 వారకూ పరిపాలించాడు. రఘునాథనాయకుని వలెనే ఈయన కూడా సంగీత, సాహిత్య నాట్యకళలను పోషించాడు. మువ్వ గోపాల పద కర్తయైన క్షేత్రయ్య విజయ రాఘవ నాయకుని ఆస్థానంలో చాల సన్మానాలందుకున్నాడు. ఈ క్షేత్రయ్య పదాలు ఈ నాటికి దక్షిణాపథమంతటా బాగా ప్రచారంలో ఉన్నాయి. ఇంకా కళాకారులైన పురుషోత్తమ దీక్షితుడు, పసుపులేటి రంగాజమ్మ, కోనేటి దీక్షితుడు, కావరసు వెంకటపతి సోమయాజి, మన్నారుదేవుడు, మొదలైన వారెందరో యక్షగాన రచయితలు గాను, ప్రదర్శకులు గాను ప్రసిద్ధి పొందారు. నాయకరాజుల కాలంలో 54 మంది కవి పండితులు సంస్కృతాంధ్ర భాషల వ్వాప్తికి తోడ్పడ్డారు. నాయక రాజులు ఎంతోమంది కళాకారులకు మడులు, మాన్యాలు, అగ్రహారాలు ఇచ్చి సన్మానించారు. దేవాలయాలకూ, మఠాలకు, సత్రాలకూ, దేవదాసీలకూ మాన్యాలిచ్చారు.

యక్షగాన నాజ్మయానికి అక్షయమైన భిక్ష: మార్చు

ఈయన హయాములో యక్షగాన వాజ్మయం బహుముఖాల విజృంభించింది. ఈయంజ రాజ దర్బారులో ఒక నాట్య మందిరాన్ని భవ్వంగా నిర్మించి, ఆ రంగస్థలంపై ప్రత్యక్ష్యంగా యక్షగాన ప్రదర్శనాలను ప్రదర్శింప జేశాడు. అనేక ప్రయోగాలను చేయించాడు. రఘునాధాభ్యుదయం అనే విజయరాఘవ నాయకుని నాటకంలో రాజ ప్రాసాదంలోని మనోహర చిత్ర దృశ్యాలూ, అనేక చారిత్రిక ఘట్టాలు వర్ణించబడ్డాయి. ఆంధ్ర తమిళ భాషలను రెంటినీ, కన్నబిడ్డల వలె సమంగా ఆదరించి పోషించారు. ఈ విధంగా దక్షిణ దేశంలో ఆంధ్ర నాయకరాజులు ఒక ఉజ్వలోజ్యల చరిత్రను స్థాపించారు.

తెలుగు కన్నడాలను తలదన్నిన పేరు పెంపులు: మార్చు

యక్షగానాలు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలలోను ఎక్కువ ఖ్యాతిలో వున్నప్పటికీ ఎక్కువ ప్రతిభా వికాసంతో విరాజిల్లినవి తంజావూరు యక్షగానాలు మాత్రమే. రఘునాథరాయల కాలంలో యక్షగానాలు అట్టే అంతగా రాణించక పోయినా, విజయరాఘవ రాయల కాలంలో చాల ఔన్యత్యాన్ని సంపాదించాయి. రఘునాథరాయల కుమారుడైన విజయ రాఘవుడు తండ్రి వలెనే కవులను, గాయకులను, నృత్య శాస్త్రకారులను అపారంగా పోషించాడు. ఈయన స్వయంకవి, నాట్యశాస్త్ర వేత్త;స్వయంగా అనేక రచనలు చేశాడు. వాటిలో ముఖ్యమైనవి యక్షగానాలే. ఈయన కృతులలో ముఖ్యమైనవి:...............

ప్రహ్లద చరిత్ర/ రాజగోపాల విలాసం/ ఉషాపరిణయం. / రఘునాథాభ్యుదయం./ మోహినీ విలాసం. / పూతనాపహరణం, / మంజరీ నాటకం./ సముద్రమథన నాటకం. / కృష్ణవిలాసం. / జానకీ కళ్యాణం. / పుణ్యకతవ్రనాటకం. ఈయన అనేక మంది కవిగాయక నటులకు ఆశ్రమిచ్చాడు. అనేక అన్నదానాలు చేశాడు. అన్నదానాన్ని కథావస్తువుగా తీసుకుని పురుషోత్తమ దీక్షితుడు విడిగా ఒక అన్నదాన నాటకాన్నే రచించాడు. ఈయన తన తండ్రి రఘునాథరాయల చరిత్రను రఘునాథాభ్యుదయమనే యక్షగానంగా వ్రాసి ప్రచారం చేయించాడు.

పాతనుంచి కొత్తకు మార్చు

ఆనాటి యక్షగానాలు పురాణ కథావృత్తాలతో కూడి వుండేవి. కాని విజయ రాఘవుడు మహావీరుని చరిత్రను యక్షగానంగా రచించాడు. ఈ విధంగా విజయ రాఘవుని ఆధ్వర్యంలో యక్షగానాలు అజరామరంగా వెలుగొందాయి. నాయక రాజుల కళాకాంతులను విరజిమ్మే తంజావూరు సరస్వతి మహల్లో దాదాపు 30 యక్షగానాల్లో చాల భాగం క్షత్రియులు వ్రాసినాట్లుగా ఉంది. ప్రథమంలో వ్రాసిన అనేక యక్షగానాల్లో చాల యక్షగానాలు తేలిక భాషలోనూ, ప్రజలందరికీ అర్థమయ్యే గ్రామ్యభాషలోను వ్రాయబడ్డాయి.

బహిరంగ ప్రదర్శనశాల మార్చు

దీనిని 'తిరంవెళి ఆరంగం ' ఆని పిలుస్తారు. ఇది నాయకరాజుల ప్రాసాదంలో సరస్వతీ గ్రంథాలయానికి పడమటి దిక్కుగా, దానిని ఆనుకుని ఉంది. దీని పూర్వ రూపం ఎటువంటిదో తెలియదు. పైన కప్పులేదు. నాలుగు దిక్కుల్లోనూ తక్కిన ప్రాసాదానికి సంబంధించిన ఎత్తైన గోడలున్నాయి. చతురాకారంగా వున్న ఈ ప్రదేశంలో నేల మీద 2000 మంది వరకూ కూర్చునే అవకాశముంది. ఈశాన్య దిశలో ఎత్తైన దిమ్మ ఒకటుండేది. దీని మీద నిలబడి మాట్లాడి నట్లయితే శబ్ద, గ్రహణ యంత్రాల సహాయం లేకుండానే రెండు వేల మందికీ స్పష్టంగా వినిపించేది. 1952 లో పళనియప్పన్ అనే జిల్లా కలెక్టరు దీనిని పునరుద్దరించి, రమణీయమైన రంగస్థలాన్ని నిర్మింపజేశాడు. ఈనాడది బహిరంగ నాటక మండపంలాగ ఉంది. ఒక మూలగా వున్న ఈ రంగస్థలం మీద నిలబడి చూచి నట్లయితే ప్రేక్షక స్థానం వర్తులాకారంగా ఉన్నట్లు కనబడుతుందని నాట్యశాస్త్రంలో పి. యస్. ఆర్. అప్పాగారు తెలియజేశారు.

నాయకరాజుల వరవడినే వెళ్ళిన మహారాష్ట్ర రాజులు: మార్చు

తంజావూరు ఆంధ్రనాయకారాజుల అనంతరం పరిపాలించిన మహారాష్ట్ర రాజులు కూడా తెలుగులో కవులై, కవి పండిత గాయకుల్ని పోషించారు. (సా.శ.్. 1798 - 1832) శరభోజీ ఆస్థాన గాయక, నర్తకులైన చిన్నయ్య, పొన్నయ్య, వడివేలు, శివానందం అనే నలుగురూ సుబ్బరాయ నట్టువవారు పుత్రులు. వీరు నృత్యాన్ని ఏక పాత్రాభినయంగా రూపొందించారు.

తెలుగుతేజ దీపించే తంజావూరు నాట్యం: మార్చు

తంజావూరు రాజాస్థానంలో నృత్యం ఏకపాత్రాభినయ కళారూపంగా అభివృద్ధి చెందింది. అదే నేటి తంజావూరు భరత నాట్యంగా ప్రసిద్ధి పొందింది. ఈ ప్రదర్శనకాలం మూడు గంటలు. ఆ మూడు గంటలూ ఒకే ఒక నర్తకి నృత్యం చేస్తుంది. ప్రక్కనున్న నట్టువనారు పాడే పాటకు అనుగుణంగా ఆభినయం చేస్తుంది. ఇది కేవలం తెలుగు వారు సృష్టించిన నాట్యం. ఈ ఏకపాత్రాభినయ భరతనాట్యం దాదాపు 150 సంవత్సరాల క్రిందటనే రూపొందింది. తంజావూరు భరతనాట్యం కేవలం తెలుగు వారి సృష్టి. ఇందుకు ఉదాహరణ నాయక రాజులూ, మహారాష్ట్ర రాజుల కాలంలో ఎంచి ఏర్పర్చినట్లు తెలుగు వాగ్గేయ కారులూ, తెలుగు నర్తకీ మణులే ఆస్థానాల్లో ఉండడమే. త్యాగరాజు కీర్తనలు, సారంగ పాణి పదాలు, క్షేత్రయ్య మువ్వ గోపాల పదాలు, నారాయణ తీర్థుల వారి తరంగాలు మొదలైనవన్నీ మనకు తదితర సాక్ష్యాదారాలు.

సకలకళా సరస్వతి సరస్వతీమహల్ మార్చు

తెలుగుదేశపు ఈ భరత నాట్యాన్ని తీర్చిదిద్దింది దేవదాసీలూ, రాజనర్తకీ మణులేనని పి.యస్.ఆర్. అప్పారావుగారు నాట్యశాస్త్రంలో వుద్ఘాటించారు. విజయనగర సామ్రాజ్య వైభవం వెలుగొందినన్ని రోజులూ మన భాగవతులు రాయల వారి ఆస్థానంలోనూ, బహువిధాల విస్తరించిన ఆయన సామ్రాజ్యంలోనూ ప్రదర్శనలిస్తూ ప్రజా ప్రభోధాన్ని గావించారు. కాని విజయనగర రాజ్య పతనానంతరము కవి గాయకులతో పాటు మన కళాకారులు కూడా విధి లేక వలస వెళ్ళిపోవలసి వచ్చింది. ఆరోజుల్లో (1581–1614) వరకూ రాజ్యాన్ని పరిపాలించిన ఆంధ్ర రాజులైన అచ్యుతప్ప నాయకుల వారి ఆస్థానంలో వారి ఆదరాభి మానాన్ని పొంది నాట్యకళా సాంప్రదాయలను అభివృద్ధి పరిచారు. తంజావూరు సరస్వతీ మహల్ కవులతోనూ, గాయకులతోనూ, కళాకారులతోనూ అద్వితీయంగా వెలుగొందింది. అచ్యుతప్ప నాయకుల వారు వారి పంచన చేరిన చూచిపూడి బ్రాహ్మణ కుటుంబాల వారందరికీ అగ్రాహారాలను దానంగా ఇచ్చారు. అలా దానం చేసిన వాటిలో కూచిపూడి భాగవతులకు దానం చేసిందే అచ్యుతాపుర ఆగ్రహారం. అచ్యుతప్పనాయకుని దానం కనుకనే దానికి అచ్యుతాపురమనే పేరు వచ్చింది. దీనినే తరువాత మేరటూరనీ, మెలట్టూరని, మేలటూరని వ్వవహరించారు. కాని ఈ నాటితకి తంజావూరు చుట్టు పక్కలవాఅరు మేరటూరనే పిలుస్తున్నారు.

మేలటూరు భాగవతులు: మార్చు

ఆంధ్రదేశంలో కూచిపూడి వీధి భాగవతుల మాదిరే దక్షిణాదిన తంజావూరు జిల్లాలో మేలటూరు, వూర్తుకూడి, శూలమంగళం గ్రామాలలో కూడా భాగవత మేళముల వారున్నారు. ఆంధ్ర ల్రాజుల తంజావూరును పరిపాలించే కాలంలో కూచి పూడి భాగవతుల నానారాజ సందర్శనం చేస్తూ, తంజావూరు ఆంధ్రరాజులను కూడా ఆశ్రయించారు. విజయనగర సామ్రాజ్యంలో కవులు, పండితులు, కళాకారులు అనేకమంది పోషించబడ్డారు. కాని తళ్ళికోట యుద్ధానంతరం రాయల సామ్రాజ్యం అంతరించడంతో ఈ కళాకారులందరూ కుటుంబాలు., కుంటుంబాలుగా చెల్లా చెదురై అనేక మంది అనేక ప్రాంతాలకు వలస పోయారు. అలా వలస పోయిన వారిలో చాలమంది తంజావూరు చుట్టుప్రక్కల స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆనాడు తంజావూరు రాజులు కూడా వీరిని ఆదరించి మాన్యాలూ, ఆగ్రహారాలు వ్రాసి యిచ్చారు. అలా సంపాదించిందే ఈ నాటి మేలటూరు.

అపర సిద్దేంద్రయోగి మార్చు

మహామహుడు సిద్ధేంద్రయోగి కూచిపూడి భాగవతులకు ఎలాంటి వాడో మేలటూరు భాగవతులకు వెంకటరామశాస్త్రి అలాంటివారు. ఈయన 17 వ శతాబ్దంలో ఆంధ్ర దేశం, గోదావరి ప్రాంతం నుంచి దక్షిణదేశానికి వెళ్ళినట్లు ఆధారాలున్నాయి. ఈయన రచించిన వీధినాటకాలు చూస్తే ఈయన కృషి, ప్రతిభ ఎలాంటిదో మనకు బోధపడుతుంది. వీరి రచనలు: ఉషాపరిణయం., హరిశ్చంద్ర, ప్రహ్లద, రుక్మాంగద చరిత్ర, సీతాకల్యాణం, నత్సంగరాజు, రుక్మిణీ కల్యాణం, కంస వధ మొదలైనవి.

మేలతూర్ఫు మేల్బంతి, శూలమంగళం మార్చు

మేలటూరు తరువాత వీధినాటకాలను ప్రతిభావంతంగా ప్రదర్శించ గలిగినవారు శూలమంగళ కళాకారులు. వెంకటరామశాస్త్రి నాటకాలనే కాక, కొరంజి కళారూపాన్ని, కూడా ప్రజారంజకంగా ప్రదర్శించారు. వీరు వీధినాటకాల్లో కొన్ని హాస్య పాత్రల్ని కూడా ప్రవేశపెట్టారు. కథకు ఏ సంబంధమూ లేకుండానే ఈ పాత్రలు ప్రవేశిస్తాయి. ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. ఆలాంటి పాత్రల్లో ఎరుకల సింగి, సింగడు, ఘటనృత్యం చేసేవారు, తురక వేషాలూ' ధరించే ఫకీరు వేషగాళ్ళు మొదలైన వారు వీరి నాటకం తెలుగులో ప్రదర్శింప బడుతున్నా హాస్య చమత్కారాలు మాత్రం తమిళ భాషలోనే సాగుతాయ.

పూత్తుకూడి వీథినాటకాలు: మార్చు

ఇక్కడ కూడా వీధి భాగవతాలు ప్రదర్శించేవారున్నారు. ఈ వూరివారు ముఖ్యంగా మేలటూరివారి నాటకాలనే ప్రదర్శించినా, వెంకటరామశాస్త్రి నాటకాలకు ముందు ప్రదర్శించిన నాటకాలు కూడా ఉన్నాయి. అవి: భామాకలాపం, గొల్ల కలాపం, పార్వతీ పరిణయం, రాథాకృష్ణ విలాసం, మొదలైనవి. అంతేగాక వారు యక్షగానలైన ప్రహ్లద, గొల్లకలాపం, ఉషాపరిణయం, కూచిపూడి సంప్రాదాయాలనే ప్రదార్శించారు. కూచిపూడి సంప్రదాయమే దక్షిణదేశంలో పూత్తికూడి సంప్రదాయంగా వెలుగొందింది.

వివిధరాజుల ఆదరణలో వీథినాటకాలు మార్చు

తంజావూరు రాజులోలో అచ్యుతప్పనాయకుని మరణానంతరం రాజ్య పరిపాలకు వచ్చిన రఘునాథరాయల కాలంలో కూడా ఈ భాగవతాలు ఆదరించబడ్డాయి. తరువాత తంజావూరు రాజ్యాన్ని పారిపాలించి, మహారాష్ట్ర ప్రభువుల కాలంలో కూడా ఈ వీధి భాగవతాలు విశేష ప్రశస్తి పొందాయి. అంతేకాక ఆ నాడు దక్షిణ దేశంలో మైసూరు, పుదుక్కోట మొదలుగాగల సంస్థానాలలో కూడా భాగవతాల ప్రభావం పెరిగింది.

వరదరాజు పెరుమాళ్ళు వసంతోత్సవాలు మార్చు

వీధి భాగవతాలు ఎక్కువగా వైశాఖ మాసంలో జరుగుతాయి. వారం రోజులు జరుగుతాయి. నృసింహ జయంతినాడు ప్రహ్లద నాటకంతో ప్రారంభిస్తారు. ప్రదర్శనాలను తిలకించటానికి వరిసర గ్రామాల ప్రజలు అబాలగోపాలం కదిలి వస్తారు. పాత్రధారులు వారు ధరించే ప్రతిపాత్ర వేషధారణ తోనూ, తంజావూరు రాజస్థాన సంప్రదాయాల ననుసరించి రాజు పాత్రలకు తంజావూరు రాజ దుస్తుల మాదిరినే ధరిస్తారు. బ్రహ్మ, విష్ణు, నృసింహమూర్తి, ఇంద్రుడు, యముడు, మొదలైన పాత్రలకు ముసుగులను ఉపయోగిస్తారు. ప్రదర్శన రోజున, దుష్ట పాత్రలను ధరించే నటులు ఆ రోజంతా ఉపవాసం చేస్తారు.

ప్రదర్శన ప్రారంభం మార్చు

రాత్రి పది గంటలక్లు ప్రదర్శన ప్రారంభమౌతుంది. వీరికి హంగుగా తిత్తి., ముఖవీణ, మృదంగం, తాళపు చిప్పలూ వుంటాయి. వంత పాట పాడేవారు నలుగురుంటారు. ఒకరు పద్యంగానీ ఎత్తుకుంటే మిగిలిన వారందరూ అదే శ్లోకాన్ని వంత పాడుతారు. వీరందరూ ప్రారంభ శ్లోకాలను ఆశుధారగా వల్లించిన అనంతరం సభాంగాణానికి ఒక విచిత్రమైన పాత్ర ప్రవేశిస్తుంది. ఆ పాత్రధారి కొంటెకోణంగి.

కొంటె కోణంగి మార్చు

మన భాగవతాల్లోని మాధవి, సైరింద్రి, ధర్మి, విధూషకుడు, అల్లాటప్పా, కేతిగాడు, సుంకర కొండడు, బంగారక్క, రత్నాల పోలిగాడు, మాదిరే ఈ కొంటె కోణంగి పాత్ర ధారి కూడ. కోణంగి పాత్రధారి ప్రవేశానికి ఒక హద్దూపద్దూ ఏమి లేదు. ప్రదర్శనంలో సమయాను కూలంగా ఎప్పుడు పడితే అప్పుడు ప్రత్యక్షమై ప్రేక్షకుల్ని ఆనంద పరుస్తాడు. పాత్రల మధ్య కలహాలు పెంచుతాడు. వాటిని చమత్కారంగా పరిష్కారిస్తాడు. ఒకేసారి ప్రేక్షకులలో ప్రేక్షకుడై నటిస్తాడు.

చోపుదారు మార్చు

వెంటనే విఘ్నేశ్వర ప్రార్థన ప్రారంభమౌతుంది.వినాయక పాత్రధారి, నృత్యంచేస్తూ నిష్క్రమిస్తాడు. ఆ వెంటనే సభారంగానికి వచ్చే రాజుగారి రాకను గూర్చి కటకమువాడు ప్రవేశించి వెల్లడిస్తాడు. సభవారందర్నీ ఉద్దేశించి, రాజుగారు వస్తున్నారు. గనుక ఎక్కడి వారక్కడ గప్ చిప్ అంటూ వెళ్ళిపోతాడు. ఇతనిని కటికము వాడని చోపుదారని పిలవడం వాడుక. ఈ చోపు దారు చోపుదారూ వచ్చేనే రాజసభకు చోపు దారు వచ్చేనే.... అంటూ ప్రవేశిస్తాడు. ఈ విధంగా ప్రదర్శనాన్ని ప్రజాభిరుచుల ననుసరించి అందరినీ సంతృప్తి పరుస్తూ కాథావిధానం అందరికీ ఆర్థమయ్యే పద్ధతిలో సంగీతం, సాహిత్యం, నృత్యం, శృంగారం, హాస్యం మొదలైన వాటి నన్నింటినీ సమపాళ్లలో నడుపుతాడు. కొంటె కోణంగి చోపుదార్ల నిష్క్రమణాంనంతరం సంప్రదాయం ప్రకారం నృత్యం చేస్తూ ఫలానావారు ప్రవేశిస్తున్నారు. అంటే............ రాజు వెడలె అంటూ రాజు పాత్రలూ, స్త్రీపాత్రలైతే దేవిని చిత్రాంగద దేవినే, భామనే సత్యభామనే అంటూ పాత్రల వ్రవేశం జరుగుతుంది. ఆయా పాత్రధారులు తమ నటనా నిపుణత్వాన్ని నాట్య చమత్కారాన్ని చూపిస్తారు.

తెలుగుతనం మార్చు

మేలటూరు శూలమంగళం ఊత్తుకూడి గ్రామాల్లో ప్రదార్శించే ప్రదర్శనాలన్నీ తెలుగులో వ్రాయబడినవే. ఈ నాటికి మేలటూరు వరదరాజు పెరుమాళ్ళు వసంతోత్సవంలో ప్రదర్శించే యక్షగానాలన్నీ తెలుగే, రాను రాను చరిత్ర గతి మారి తెలుగు నాటకాలను అనువదించి తెలుగులో ప్రదర్శిస్తున్నారు.

అందమైన యక్షగానాలను అందరూ ఆరాధించారు: మార్చు

తంజావూరు రాజుల్లో అచ్యుతప్ప నాయకుని మరణానంతరం రాజ్య పారిపాలనకు వచ్చిన రఘునాథరాయలు, విజయరాఘవ రాయలు కాలంలో కూడ ఈ భాగవతాలు ఆదరించ బడ్డాయి. తరువాత తంజావూరు రాజ్యాన్ని పరిపాలించిన మహారాష్ట్ర ప్రభువుల కాలంలో కూడ ఈ వీథి భాగవతాలు విశేష ప్రశస్తి పొందాయి. అంతేకాదు. అనాడు దక్షిణదేశంలో మైసూరు పుదుక్కోట మొదలుగాగల సంస్థానాలలో కూడ ఈ భాగవతాల ప్రభావం పడింది. ప్రతి గ్రామంలోనూ యక్షగానాలు విరివిగా ప్రదర్శనాలను చూచి ఆనందించడమే కాక వారు కూడ నేర్చుకోవడం జరిగింది. ఆనాటి నుంచీ బ్రాహ్మణ పండితులు ఈ భాగవత మేళాలను సంప్రాదాయ సిద్ధంగా తయారు చేయాలనుకుని వుత్సాహంతో నడుంకట్టి శాస్త్రయుక్తంగా భాగవతాలను నేర్చుకున్నారు. ఆలాంటి శాస్త్రయుక్త భాగవత మేళాలను కలిగిందే మేలటూరు.

క్షేత్రయ్య పదాలకు మొమ్ము మోసింది కూచి పూడి వారే: మార్చు

తంజావూరు ను పాలించిన విజయరాఘవ నాయకుని కాలంలోని క్షేత్రయ్య ఆస్థాన గౌరవాలన్నిటినీ అక్షయంగా పొందాడు. పదాభినయానికి, సాత్వికాభినయనానికి క్షేత్రయ్య పదాలకు విశిష్టంగా ప్రాధాన్యం యిచ్చేవారు. అందువల్ల ప్రదర్శనాలు ఎంతగానో విజయవంతమయ్యేవి. క్షేత్రయ్య పదాలు తమిళదేశంలో కూడ విస్తారంగా ప్రచారంలో వచ్చాయి. ఈ నాటికి తమిళదేశంలో వాటిని పాడుతున్నారు. ఆ పదాలలో మధ్య మధ్య తెలుగు నుడికారాలు అచ్చుగుద్దినట్లు అగుపిస్తూ వున్నాయి. ఈ విధమైన క్షేత్రయ్య పదాలను బహుళ ప్రచారంలోకి తీసుకువచ్చిన వారు కూచిపూడి భాగవతులే. తంజావూరు ఆంధ్రాజుల సమక్షాన ప్రదర్శనాలిచ్చిన నాటినుండీ కృష్ణా జిల్లా కూచిపూడికి, అచ్యుతాపురానికి, వూత్తుక్కాడుకూ బంధమూ, బంధుత్వాలు పెరిగాయి. అక్కడున్న తమిళులపై తెలుగు భాష ప్రభావం పడి వారు కూడ తెలుగు వారుగా మారి, వారి పిల్లల్నీ వీరికివ్వడం, వీరి పిల్లల్ని వారు చేసుకోవడం ద్వారా బంధుత్వాలు పెరిగి పోయి, ఆంధ్రదేశంలో కూచిపూడి కళాక్షేత్రమెలాగో, అలాగె దక్షిణ దేశంలో వూత్తుక్కాడు, మేలటూరు గ్రామాలు కళాక్షేత్రాలుగా వెలుగొందు తున్నాయి

ఆంధ్ర, తమిళ సమరస సాంప్రదాయం మార్చు

కూచిపూడి కళాకారులు ప్రదర్శించే సంగీత నాటకాలకూ, దక్షిణాది సంగీత నాటకాలకూ చాల దగ్గర సాంప్రదాయా లున్నాయి. వారూ వీరు భరత నాట్య సాంప్రదాయాలనే అనుసరిస్తూ వచ్చారు. అంతేకాకుండా తమిళంలో ఆడబడే నాటకాలూ, పాడబడే పాటలూ అన్నీ తెలుగువే. దీనిని బట్టి ఆంధ్ర తమిళ సాంప్రదాయాలకు మూలం ఒక్కటేనని మనకు బోధపడుతూ వుంది. తంఇళులు ఏయే శ్లోకాలను వల్లిస్తున్నారో అదే విధంగా ఆంధ్రులూ కూడ వల్లించారు. వారూ వీరూ కూడా కృష్ణకర్ణామృతం లోని శ్లోకాలనే వుపయోగించారు.

కూచిపూడి భాగవతులు క్షేత్రయ్య పదాలను పాడి అభినయించినట్లే, దక్షిణాది కళాకారులు కూడ ఆ సాంప్రదాయాన్నే అనుసరించారు. ముఖ్యంగా క్షేత్రయ్య పదాలు దక్షిణదేశంలో బహుళ వ్వాప్తిలోకి రావడానికి కారణం కూచిపూడి భాగవతులే నని మనం చెప్పుకోవచ్చు. అంతే కాకుండా తంజావూరుని పాలించిన అచ్యుతనాయకుడు ఆంధ్ర దేశంనుంచి వలస వెళ్ళిన కశావేత్తలను ఆహ్వానించి ఆదరించిన దానిని బట్టి చూచినా క్షేత్రయ్య పదాల ప్రభావం దక్షిణ దేశంలో పడడం కూడ నిజమైనట్లుగా మన గ్రహించ వచ్చు. అందువల్ల తమిళ భాగవత కర్తలు కూడ ఆనాటి నుంచి ఈ నాటివరకూ వంశ పారంపర్యంగా ఆ సాంప్రదాయలనే అనుసరిస్తూ ముందుకు తీసుకు పోతున్నారు. తమిళదేశంలోభాగవత మేళ నాటకాల్లో ప్రసిద్ధి వహించిన వండనల్లూరు మీనాక్షి సుందరంపిళ్ళై ఇటీవలవరకూ నివసించి ఆ ప్రాంతాల్లో కూచిపూడి భరత నాట్య సాంప్రదాయాలనూ, పదాభినయాన్నీ, విద్యార్థులకు నేర్పాడు. దీనిని బట్టి ఆంధ్ర తమిళ దేశాల్లోని నాట్య సాంప్రదాయాలు ఒక్కటే అని వారి వారి పాటలూ, ఆటలూ నిరూపిస్తున్నాయి. అంతే కాక నాయిక ప్రవేశంలో తనకు తనే చరిత్ర చెప్పుకోవడంలోనూ, విదూషక పాత్రలను ప్రవేశ పేట్టడంలోనూ కూడ ఆంధ్ర సాంప్రదాయాలనే అనుసరిస్తున్నారు.

దక్షిణాదిన విజయనగర చక్రవర్తుల కాలంలో కళలు ఎలా అభివృద్ది పొందాయో అలాగే తంజావూరు, మధుర నాయక రాజుల కాలంలో కూడ సంగీత, సాహిత్య, నాట్య, నాటక విధానాలకు, కవి, పండితులకూ, ఆదరణా, పోషణా లభించాయి.తంజావూరు నాయకరాజులకు మంత్రిగా వున్న గోవింద దీక్షితుడు, సంగీత సుధ అనే ఒక శాస్త్ర గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథాన్ని రఘునాథరాయలు రచించినట్లు కూడా చెప్పుకుంటారు. రఘునాథరాయలు నృత్యంలోనూ, గానంలోనూ ఆరితేరిన కళాకారుడు. ఈయన రఘునాథమేళ అనే ఒక క్రొత్త వీణనే సృష్టించాడని ప్రతీతి.

కళల మధురిమను కాపాడిన మధుర నాయకరాజులు మార్చు

అలాగే మధుర ఆంధ్ర నాయకులు కూడా లలిత కళాసంపదలో విజయనగరం, తంజావూరులతో సరిసమానంగా తులతూగుతూ వుండేవారు. వీరి రాజ్యంలో సంగీత నృత్యాలు దేవదాసీలు చేస్తూ వుండేవారు. దేవాలయాలలోనూ, పండిత సభలలోనూ, ఆస్థానలోను, వీరి గాన చకేరీలు జరుగుతూ వుండేవి. పండిత సన్మానాలతో పాటు దేవదాసీలకు కూడా ఇతోధిక పారితోషికాలు, సన్మానాలు జరుగుతూ వుండేవి. విజయరంగ చొక్కనాథుని కాలంలో తిరువేంగడాచార్యుడనే గొప్ప గాయకుడుండే వాడట. క్షేత్రయ్యా, త్యాగరాజూ ఈ కాలంలోనే వర్థిల్లి మధురమైన పద వాగ్మయాన్నీ, గేయ వాగ్మయాన్ని రచించాడు.

సూచికలు మార్చు

మూలాలు మార్చు

యితర లింకులు మార్చు