వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు
శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు (ఏప్రిల్ 27, 1761 - ఆగష్టు 17, 1817) గుంటూరు ప్రాంతమును పరిపాలించిన కమ్మ రాజు. అమరావతి సంస్థాన పాలకుడు.
జననంసవరించు
ఈయన 1761, ఏప్రిల్ 27 న జగ్గన్న, అచ్చమ్మ దంపతులకు జన్మించాడు.
క్రీస్తుశకము 1413 నుండి తీరాంధ్రదేశములోని ఒక భాగమును పాలించిన కమ్మ వాసిరెడ్డి వంశమునకు చెందినవాడు వేంకటాద్రి నాయుడు. కృష్ణా మండలములోని చింతపల్లి వీరి రాజధాని. కమ్మ వాసిరెడ్డి వంశము వారు తొలుత స్వతంత్రులైనను పిమ్మట గొల్లకొండ నవాబులకు తదుపరి బ్రిటిషు వారికి సామంతులుగ వుండిరి. వేంకటాద్రి రాజధానిని కృష్ణానది ఆవల ఒడ్డుననున్న గుంటూరు మండలములోని అమరావతి/ధరణికోటకు మార్చాడు. వేంకటాద్రి గొప్ప కవి పండిత పోషకుడు, మంచి పరిపాలనాదక్షుడు. పిండారీ దండులను ఎదుర్కొని ఆ ప్రాంతములలో అడుగు పెట్టనివ్వని మొనగాడు[1].
కృష్ణా డెల్టా ప్రాంతమందు వందకుపైగా దేవాలయములు కట్టించాడు. వీటిలో అమరావతి, చేబ్రోలు, పొన్నూరు, మంగళగిరి ముఖ్యమైనవి. వేంకటాద్రి నాయుని సైన్యములో వేలమంది సైనికులు, 300 గుర్రాలు, 80 ఏనుగులు, 50 ఒంటెలు, లెక్కలేనని ఎడ్లబండ్లు ఉండేవి. అమరావతి, చేబ్రోలు, చింతపల్లిలలో నాయుని భవనములు సంపదతో తులతూగేవి. పండుగలనాడు పండితులకు, గ్రామపెద్దల కుటుంబాలకు పట్టువస్త్రములు, బంగారు ఆభరణములు బహూకరించబడుతుండేవి. నిరతాన్నదానములు జరుగుతుండేవి.
క్రీ.శ. 1791-92లో వచ్చిన భయంకర ఉప్పెనలో తీరాంధ్ర గ్రామములలో వేలమంది ప్రజలు మరణించారు. మరుసటి సంవత్సరము తీవ్రమైన కరవు వచ్చింది. నాయుడు గారు ఏడు సంవత్సరములుగా పేరుకుపోయిన పన్నులు, మూడున్నర లక్ష్లల బంగారు నాణెములు ప్రజల కొరకు వినియోగించుటకు బ్రిటీషు ప్రభుత్వానికి తెలియచేశారు. మచిలీపట్టణము లోని అధికారులు సానుకూలత వ్యక్తం చేశారు. ఇంతలో గవర్నర్ జనరల్ కార్న్ వాలిస్ సంస్కరణలలో ఈ విషయము మరుగున పడింది.
బ్రిటీషు ప్రభుత్వము నాయనింగారి సైనికులను నిరాయుధులను చేసింది. ఆగ్రహించిన నాయుడు చింతపల్లిని విడచి గుంటూరు మండలములోని ధరణికోట వద్ద అమరావతియను పట్టణము, భవనాలు కట్టించాడు. 1797లో అమరావతి పట్టణము దర్శించిన కోలిన్ మెకంజీ అచటి భవనాలను, నగర నిర్మాణాన్ని ఆసియాటిక్ జర్నల్ లో పలువిధములుగా పొగిడాడు[2].
వేంకటాద్రి పాలనలో చెంచులు దారిదోపిడులు చేయుచు సామాన్య ప్రజలను బాధించుచుండేవారు. మంత్రి ములుగు పాపయారాధ్యుల సలహా పాటించి చెంచులను విందునకు అహ్వానించాడు. భోజనమైన పిమ్మట 150 మంది చెంచు నాయకులను వరుసగా నిలబెట్టి అందరిని వధింపచేశాడు. ఈ వధ జరిగిన ఊరి పేరు నరుకుళ్ళపాడుగా మారింది.
ఆయన చివరిదశలో తీర్థయాత్రలు చేసేందుకు పరివారంతో బయలుదేరి భారతదేశంలోని ఎన్నో తీర్థాలను, క్షేత్రాలను దర్శించారు. వెళ్లిన చోట్లన్నిటా అన్నదాన సత్రాలు స్థాపించారు. కొప్పరాజు సుబ్బరాయకవి కాంచీమహాత్మ్యంలో నాయుడి యాత్రల గురించి పద్యరచన చేశారు. వేంకటాద్రి నాయుడితో పాటుగా ఆయన మంత్రి పొత్తూరి కాళిదాసు కూడా యాత్రలు చేసినట్టు పాపయారాధ్యులు రచించిన సరస హృదయానురంజనములో తెలుస్తోంది. కొన్ని యాత్రలు క్రీ.శ.1802, మరికొన్ని క్రీ.శ.1812-13 సంవత్సరాల్లో చేసినట్టు తెలుస్తోంది.[3] శేషజీవితమును అమరేశ్వరుని పాదాలకడ గడిపినాడు. దేవాలయానికి పెక్కు హంగులు చేసి తొమ్మిదిమంది అర్చకులను నియమించి ఒక్కొక్కరికి 12 ఎకరాలు భూమి ఇచ్చాడు. 1807-09లో మంగళగిరి నరసింహ స్వామి దేవాలయానికి 11 అంతస్తుల గాలి గోపురాన్ని నిర్మింపజేశాడు. ఆయన తండ్రి జగ్గన్న పేరు మీదనే బేతవోలు అనే గ్రామం పేరును జగ్గయ్యపేటగా మార్చాడు. ఆయన తల్లి అచ్చమ పేరు మెదనె అచ్చమ్మపెటగా మారినది.
మరణంసవరించు
వేంకటాద్రి నాయుడు 1817, ఆగష్టు 17 న మరణించాడు.
ముదిగొండ శివప్రసాదు గారు నాయుడుగారిపై 'పట్టాభి' అను చారిత్రక నవల వ్రాశారు.
వనరులుసవరించు
Wikimedia Commons has media related to Vasireddy Venkatadri Nayudu. |
- శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు (Sri Raja Vasireddy Venkadadri Nayudu by K. Lakshminarayana 1963, Ponnuru.)
- http://www.vasireddy.us/history.asp
మూలాలుసవరించు
- ↑ The Journal of Asian Studies Association for Asian Studies, 1965, Vol. 24, No. 1, p. 296, ISSN 0067-7159
- ↑ Indian Monuments, N. S. Ramaswami, 1971, Abhinav Publications, ISBN 0896840913, ప్. 115
- ↑ లక్ష్మీనారాయణ, కొడాలి (1967). చారిత్రిక శ్రీశైలము (ప్రథమ ప్రచురణ ed.).