సురభి నాటక సమాజం

(సురభి నాటక సమాజము నుండి దారిమార్పు చెందింది)

ప్రపంచ ప్రఖ్యాత సురభి నాటక సమాజం 1885లో వైఎస్ఆర్ జిల్లా సురభి గ్రామంలో 'కీచక వధ'నాటక ప్రదర్శనతో మొదలయ్యింది. ఈ సమాజ వ్యవస్థాపకుడు వనారస గోవిందరావు.

1885లో వనారస సోదరులు వనారస గోవిందరావు, వనారస చిన్నరామయ్య కలిసి వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేట మండలములోని సురభి రెడ్డివారిపల్లెలో శ్రీ శారదా వినోదిని నాటక సభను ప్రారంభించారు. సురభిలో ప్రారంభమైన ఈ నాటక సభ కాలక్రమేణ సురభి నాటక సంఘముగా ప్రసిద్ధి చెందినది. రంగస్థలముపై స్త్రీ పాత్రలను స్త్రీలచే ధరింపచేసిన తొలి నాటక బృందము సురభినే. నాటకములోని పాత్రధారులందరూ ఒకే కుటుంబములోని సభ్యులవడము చేత స్త్రీలకు చెడ్డపేరు వస్తుందనే భయము ఉండేది కాదు. బృందములోని సభ్యులకు రంగస్థలమే జీవితముగా సాగేది.

మాయా బజార్ నాటకంలో శశిరేఖగా మారిన ఘటోత్కచుడు, చెలికత్తెలను మగవాని కదలికలతో భయపెట్టుట

స్థాపించిన కొద్దిరోజులలోనే ఈ సమాజము త్వరితగతిన విస్తరించి 50 వేర్వేరు బృందములుగా వృద్ధిచెందినది. ప్రతి బృందము దాదాపు 30 మందికి పైగా సభ్యులతో స్వయము సమృద్ధిగా ఉండేవి. వనారస గోవింద రావుకు ముగ్గురు కుమారులు పదిమంది కుమార్తెలు. వీరి కుటుంబము వ్యాపించిన కొలది బృందములు కూడా వ్యాపించినవి. సినిమా, టీవీల ఆగమనముతో 1974 కల్లా బృందముల సంఖ్య 16కు క్షీణించింది. 1982 నాటికి కేవలము నాలుగు సురభి నాటక బృందాలు మాత్రమే మనుగడలో ఉన్నాయి. ప్రస్తుతము ఆంధ్ర దేశములో సురభి నాటక కళాసంఘము ఆధ్వర్యములో ఐదు నాటక బృందములు పనిచేస్తున్నవి.

శ్రీ ఆర్ నాగేశ్వరరావు సారథ్యంలో శ్రీ వెంకటేశ్వర నాట్యమండలి వారి మాయాబజార్ నటులు

వీరి నాటకాలలో అత్యంత ప్రజాదరణ పొందిన నాటకం మాయాబజార్. ఆభిమన్యుడు, శశిరేఖ వివాహానికి ఘటోత్కచుడు అనే రాక్షసుడు (భీమ, హిడింబ కుమారుడు) తన మాయాజాలంతో జరిగేటట్లు చేయడం ప్రేక్షకులని కడుపుబ్బ నవ్విస్తుంది. కళాకారులు పెద్దగా చదువుకోకపోయిన, సినిమాలో లాగా, సెట్టింగులతో యుధ్ధం జరిగినపుడు, మంటలు సృష్టించటం ఆతరువాత వాన కురిపించడం, అలాగే ఒకే సమయంలో రంగస్థలంపై, అభిమన్యుడు, శశిరేఖ వేరు వేరు సెట్టింగులలో విరహ గీతం పాడటం చాలా ఆకర్షణగా వుంటుంది.

ఇలాంటి నాటక సమాజం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. తొలితెలుగు సినీనటీమణి సురభి కమలాబాయి సురభి కళాకారుల కుటుంబములో పుట్టి పెరిగినదే.

సురభి నాటక సమాజాలు మార్చు

శ్రీ వెంకటేశ్వర నాట్య మండలి మార్చు

సురభి నాటక సమాజాలన్నింటికంటే పెద్దదైన శ్రీ వెంకటేశ్వర నాట్య మండలి 1937లో వనారస గోవిందరావు ఐదవ కూతురు సుభద్రమ్మ, ఆమె భర్త ఆర్. వెంకట్రావు చే స్థాపించబడింది. ప్రస్తుతము ఆ బృందములో వీరి కుమారులు భోజరాజు, సురభి బాబ్జీ (నాగేశ్వరరావు), గణపతిరావులు, వారి కుటుంబములు అంతా కలిపి 62 మంది సభ్యులు కలరు. ఇది ఇప్పటికీ ప్రేక్షకులను రంజింప చేస్తుంది. 60మంది సురభి కళాకారులతో ప్రతి శుక్ర, శని, ఆదివారాలలో హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో నాలుకాలను ప్రదర్శిస్తూనే ఉంది. పబ్లిక్‌ గార్డెన్స్‌లో ప్రభుత్వం వీరికి కొంత స్థలం కేటాయించింది. అందులోనే రేకులతో షెడ్లు వేసుకుని జీవిస్తున్నారు.

శ్రీ వెంకటేశ్శర నాట్య మండలి (సురభి) కార్యదర్శి ఆర్‌. నాగేశ్వరరావు (బాబ్జి). నాగేశ్వరరావుకు కేంద్ర సంగీత నాటక అకాడమీ జాతీయ స్థాయిలో ధియేటర్‌ సంబంధంగా 2011కు అవార్డు ప్రకటించింది. 30 సంవత్సరాల తర్వాత నాటక రంగానికి దక్కిన తొలి జాతీయ గుర్తింపు ఇదే.

ఫ్రాన్స్‌లో 2013 మే 4 వ తేదీ నుంచి 18 వరకు జరిగిన అంతర్జాతీయ ఉత్సవాలలో 44 మందితో కూడిన శ్రీవెంకటేశ్వర నాట్య మండలి మాయాబజార్, భక్తప్రహ్లాద, శ్రీకృష్ణలీలలు, పాతాళ భైరవి నాటక ప్రదర్శనలు ఇచ్చింది. తెలుగులో ప్రదర్శించనున్న ఈ నాటకాన్ని ముందుగా ఇంగ్లీస్‌లోకి, ఆ తర్వాత ఫ్రెంచ్‌లోకి తర్జుమా చేసి డిస్‌ప్లేల ద్వారా చదువుకునే వీలు కల్పించారు. ఫ్రాన్స్‌లో 35 రోజుల పాటు ఈ బృందం మొత్తం 18 నాటకాలను ప్రదర్శించారు.

సప్తతి స్వర్ణోత్సవం మార్చు

సురభి నాటక సమాజం సుప్రసిద్ధి పొంది, తరతరాలుగా కొనసాగుతున్న కుటుంబ నాటక సంస్థ. ఈ సంస్థలో కుటుంబసభ్యులందరూ విధిగా నాటక ప్రదర్శన, రంగాలంకరణ, దర్శకత్వం మొదలైన కళలలో అరితేరి ప్రదర్శనలు ఇస్తూంటారు. వారు తరతరాలుగా కుటుంబంబంతా నాటకాలనే వృత్తిగా చేసుకున్నారు. భార్యా భర్తలిద్దరూ నాటకాల్లో ప్రదర్శనలు చేయడం వల్ల స్త్రీలతో ప్రదర్శనలు ఇప్పించిన తొలితరం నాటి నాటక సంస్థగా పేరొందింది. సురభి నాటక సమాజం 18వ శతాబ్ది చివరి దశకాల్లో వైఎస్ఆర్ జిల్లా సురభి గ్రామంలో 'కీచక వధ'నాటక ప్రదర్శనతో మొదలయ్యింది. ఈ సమాజ వ్యవస్థాపకుడు వనారస గోవిందరావు. సురభి రెడ్డి వారి పల్లెలో ప్రారంభమైన ఈ నాటక సంస్థ సురభి నాటక సంస్థగా పేరొందింది. ఆ సంస్థ 70 ఏళ్ళు నిండిన సందర్భంగా చేసిన ఉత్సవాలలో సంస్థకు, నాటకాలకు సంబంధించిన వివిధ విషయాలతో రూపొందించిన సావనీర్ ఇది.[1]

శ్రీ వెంకటేశ్వర నాట్య మండలి చిత్రమాలిక మార్చు


మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు