ఇంద్ర (సినిమా)
ఇంద్ర 2002 లో బి. గోపాల్ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా ఫ్యాక్షనిజం నేపథ్యంలో వచ్చిన తెలుగు చిత్రం. దీన్నివైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించాడు.
ఇంద్ర (2002 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | బి.గోపాల్ |
నిర్మాణం | సి.అశ్వనీదత్ |
కథ | చిన్ని కృష్ణ |
చిత్రానువాదం | చిన్ని కృష్ణ |
తారాగణం | చిరంజీవి, సోనాలి బింద్రే, ఆరతీ అగర్వాల్, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, అల్లు రామలింగయ్య, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ప్రకాశ్ రాజ్, పునీత్ ఇసార్, ముఖేష్ రిషి, శివాజీ, ఆహుతీ ప్రసాద్, ఎమ్.ఎస్.నారాయణ లక్ష్మీ శర్మ |
సంగీతం | మణి శర్మ |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, హరిహరన్, ఉషా, ఉదిత్ నారాయణ్, శంకర్ మహదేవన్, మల్లికార్జున్, ఆర్.పి.పట్నాయక్, కార్తిక్, కల్పన |
నృత్యాలు | రాఘవ లారెన్స్ రాజు సుందరం |
సంభాషణలు | పరుచూరి సోదరులు |
ఛాయాగ్రహణం | వి.ఎస్.ఆర్.స్వామి |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | వైజయంతీ మూవీస్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
2002,: సంవత్సరానికి ఉత్తమ నటుడు, చిరంజీవి నంది పురస్కారం
కథ సవరించు
బాలుడిగా ఉన్న ఇంద్రసేనా రెడ్డి (చిరంజీవి) సీమలోని ఫ్యాక్షన్ తగాదాలలో తన తండ్రిని కోల్పోతాడు. సీమని కాపాడటానికి తన తండ్రి అన్నదమ్ములలో ఎవ్వరూ ముందుకు రాకపోవటంతో బాల్యదశలోనే ఇంద్ర తన తండ్రి స్థానాన్ని భర్తీ చేస్తాడు. కొన్నేళ్ళ తర్వాత ట్యాక్సీ డ్రైవర్ శంకర్ నారాయణ (చిరంజీవి) కాశీలో గంగానదిలో స్నానం చేస్తుంటే ఒక ముత్యాల హారం దొరుకుతుంది. కాశీలో తన కూతురు పల్లవి (సోనాలి బెంద్రే)కి సంగీతం నేర్పించాలని గవర్నరు చెన్న కేశవ రెడ్డి (ప్రకాశ్ రాజ్)తన కుటుంబంతో సహా గంగలో మునకలు వేస్తుండగా పల్లవి మెడలోంచి జారిన హారమే అది. శంకర్ మేనకోడలు నందిని క్లాస్ మేట్ గా పల్లవి చేరుతుంది. తన మామ మెడలో హారాన్ని చూసిన పల్లవి వారి ఇంటిలోనే ఉంటూ శంకర్ ని ప్రేమిస్తూ ఉంటుంది. కాలేజీ హాస్టల్ లో కాక ఒక ట్యాక్సీ డ్రైవర్ ఇంటిలో తన కూతురు ఉంటుందని తెలుసుకొన్న చెన్న కేశవ రెడ్డి భద్రతా సిబ్బందితో సహా శంకర్ ఇంటిని చుట్టుముడతారు. శంకర్ ని చూసిన చెన్న కేశవ రెడ్డి చేతులెత్తి అతనికి నమస్కరిస్తాడు. లాంచీ డ్రైవర్ అయిన గిరి (శివాజీ) నందినిల ప్రేమని అంగీకరించిన శంకర్ వారి వివాహం జరిపిస్తూ ఉంటాడు. గిరి స్నేహలతా రెడ్డి (ఆర్తి అగర్వాల్) మేనల్లుడు వీర మనోహర రెడ్డి అని తనే స్వయంగా పెళ్ళి పందిరి లోకి నేరుగా వచ్చి శంకర్ ని ఇంద్ర పేరుతో సంబోధించి చెప్పటంతో స్తబ్దుడవుతాడు శంకర్. మూగవాడుగా నటిస్తున్న శంకర్ నమ్మిన బంటు వాల్మీకి (తనికెళ్ళ భరణి)నోరు తెరచి శంకర్ ఇంద్ర సేనా రెడ్డి అని, సీమ క్షేమం కోసం కాశీలో అజ్ఞాతవాసం చేస్తున్నాడని తెలుపుతాడు. అజ్ఞాతవాసం ముగించుకొన్న ఇంద్ర సీమకి తిరిగి వెళ్ళి, దుష్టులైన తన వ్యతిరేకులని సంహరించి శాంతిస్థాపన చేసి అక్కడి ప్రజలకి శాంతి సందేశం అందించటంతో కథ ముగుస్తుంది.
సంభాషణలు సవరించు
ఈ చిత్రంలోని కొన్ని ప్రస్తావించదగిన సంభాషణలు
- నా కూతురు కాశీలో ఉందనుకొన్నాను, సాక్ష్యాత్ కాశీ విశ్వనాథుని పాదాల దగ్గర ఉన్నదని ఇప్పుడే తెలిసింది
- షౌకత్ ఆలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తలవంచుకుని పోతున్నాను. అదే నీ వైపు ఉండి ఉంటే ఇక్కడి నుండి తలలు తీసుకెళ్ళేవాడిని. మా వాడు ఫోన్ చేసేదాకా వచ్చాడు అంటే, మీ అమ్మాయి ఎక్కడిదాకా వచ్చిందో నేను అడగను. పెళ్ళి కావలసిన పిల్లని పది మందిలోకీ పిలిచి పంచాయితీ పెట్టకు, తన మనసు తెలుసుకొని నిఖా పక్కా చేసుకో!
- సింహాసనం పై కూర్చుండే హక్కు అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్ర సేనా రెడ్డి ది
- కాశీకి వెళ్ళాడు, కాషాయం వాడయ్యాడు అనుకున్నారా, వారణాసికి వెళ్ళాడు, తన వరస మార్చుకొన్నాడు అనుకొన్నారా? అదే రక్తం, అదే పౌరుషం. సై అంటే సెకనుకొక తల తీసుకెళతా
- ఇంద్ర సేనా రెడ్డి, మా వెనకనే సీమకి వస్తావు, చంపటానికి కాదు, చావటానికి
- నిన్ను పొడిస్తే 'అమ్మా' అంటావు, నువ్వు ఆ అమ్మ కడుపులోనే పొడిచావు
- వీరశంకర రెడ్డి, మొక్కే కదా అని పీకేయాలని చూస్తే, పీక కోస్తా
- నేను మీ వాడిని, మీతో నే ఉంటాను
ఈ చిత్రంలోని పాటలు సవరించు
- భం భం బోలె శంఖం మ్రోగెలే
- రాధే గోవిందా
- దాయి దాయి దామ్మా
- ఘల్లు ఘల్లు మని
- అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో
విశేషాలు సవరించు
- దాయి దాయి దామ్మా పాటలో చిరంజీవి వేసిన వీణ స్టెప్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
- వివిధ చిత్రాల ద్వారా ఇతర అగ్రహీరోలందరూ అప్పటికే ఫ్యాక్షన్ చిత్రాలలో నటించారు. చిరు కూడా ఫ్యాక్షన్ చిత్రాలలో నటించాలన్న అభిమానుల కోరిక పై ఇంద్ర నిర్మించబడినది.
- అశ్వినీదత్ - చిరంజీవి కలయికతో ఇది మూడవ (హ్యాట్-ట్రిక్) సంచలన విజయం. అంతకు ముందు ఇదే కలయికతో విడుదలైన జగదేకవీరుడు అతిలోకసుందరి, చూడాలని ఉంది భారీ విజయాలు.