ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి

రాజకీయ నాయకుడు

మాజీ మంత్రి, రాజకీయ కురువృద్దుడుగా పేరొందిన ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి (1933 - ఆగష్టు 3, 2013) హైదరాబాదు రాష్ట్రానికి చెందిన తొలితరం కాంగ్రెస్ నాయకులలో ఒకరు.

ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి

జననం మార్చు

ఈయన యాదాద్రి - భువనగిరి జిల్లా, మోత్కూరు మండలం అడ్డగూడూర్ గ్రామంలో 1933లో జన్మించారు.

ఉప్పునూతల రాజకీయ ప్రస్ధానం మార్చు

ఈయన చిన్ననాటి నుంచి రాజకీయాల్లో చురుగ్గాపాల్గొని మంచినేతగా గుర్తింపు పొందారు. స్వంత గ్రామమైన అడ్డగూడూరులో సర్పంచ్‌ పదవి తో రాజకీయం ప్రారంభమైంది. రెండుసార్లు శాసనసభ సభ్యుడిగా, రెండుసార్లు శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. డెయిరీ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా, ఏపీఐఐసీకి ఛైర్మన్ గా, తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలికి ఛైర్మన్ గా పనిచేశారు. వీరు 1947 లో కాంగ్రెస్ లో చేరారు. హైదరాబాద్ రాష్ట్ర విమోచనా ఉద్యమమంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. 1957 లో ఆంధ్ర ప్రదేశ్ లో స్నేహపూరిత వాతావరణం కొరకు సుహృద్భావ సందేశం పేరిట యాత్ర నిర్వహించారు. 1969 లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1969 నుండి 1972 వరకు చిన్న నీటి వనరుల శాఖ మంత్రిగా పనిచేసి, 1974 నుండి 1977 వరకు అబ్కారీ, గనుల శాఖ మంత్రిలో పనిచేశారు.

ఆ తర్వాత మోత్కూర్‌ సమితి ప్రెసిడెంట్‌గా పనిచేశాడు. రాజకీయాల్లో అనేక ఒడిదొడుకులు ఎదుర్కోని మరీ ముందడుగు వేసి తన సత్తాను చాటుకున్నాడు. ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దల లాబీయింగ్‌తో రాష్ట్రంలో రాజకీయాలను శాశించాడు. సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగిన ఆయన తనదైన శైలిలో ముందుకు సాగి అందరి మన్ననలు పొందాడు. తెలంగాణవాదిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎలాంటి నేతనైనా వ్యతిరేకించే వ్యక్తిగా ఆయనకు పేరుంది. రెండుసార్లు శాసన సభ్యులుగా, ఒక సారి ఎమ్మెల్సీగా పనిచేశాడు. ఎమ్మెల్సీగా ఉన్న కాలంలో 1973లో ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రి వర్గంలో ఓడరేవుల మంత్రిగా, జలగం వెంగళరావు మంత్రి వర్గంలో ఎక్సైజ్‌శాఖ మంత్రిగా పనిచేశారు.

రాజకీయాల్లో చక్రం తిప్పిన కురువృద్దులు.. జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో తనదైనముద్ర వేసుకున్న నేత.. జిల్లాలో తిరుగులేని కాంగ్రెస్‌ నాయకులు.. ఢిల్లి పెద్దల లాబీయింగ్‌తో కాంగ్రెస్‌లో ఒకవెలుగు వెలిగిన సీనియర్‌ నేత.. పేరున్న తెలంగాణ వాది.. ఇలా సుదీర్ఘరాజకీయ అనుభవం గడించి రాజకీయ భీష్మాచార్యుడిగా పేరొందారు. మాజీ ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కరరెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావుతో సన్నిహిత సంబంధాలు కలిగిన నేతగా జిల్లాలో చక్రం తిప్పారు. రెండు పర్యాయాలు శాసన సభ్యులుగా, ఒక సారి ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేసి జిల్లా రాజకీయాలను శాసించారు.

జిల్లా కాంగ్రెస్‌లో మంచి క్యాడర్‌ను సంపాదించుకొని ఆయన తన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు డిసిసి అధ్యక్షుడుగా ఉన్న చకిలం శ్రీనివాసరావు, పురుషోత్తంరెడ్డికి వైరం ఉండేది. పురుషోత్తంరెడ్డికి టికెట్‌ రాకుండా మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు ఆశీస్సులతో శ్రీనివాసరావు అడ్డుకోవడంతో జీర్ణించుకోలేని ఆయన వ్యతిరేక శిబిరాన్ని నడిపాడు. పోటీ డిసిసిని ఏర్పాటు చేసి గిరిజననేత ధీరావత్‌ రాగ్యా నాయక్‌ను అధ్యక్షుడుగా ఎంపికచేశారు. అప్పటి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం చురుగ్గా సాగింది. 1999, 2004 మినహా కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఏనాడు పొందలేదు. ఇండిపెండెంట్‌గా, రెబల్‌ అభ్యర్థిగా పోటీచేసి సిపిఐ అభ్యర్థి గుర్రం యాదగిరిరెడ్డి చేతిలో మూడు పర్యాయాలు ఓమిపాలయ్యారు. అయినా వెనుతిరగని నేతగా ముందుకు సాగి రెండుసార్లు టికెట్‌ పొంది విజయం సాధించారు. దివంగత సిఎం వై.యస్. రాజశేఖరరెడ్డి క్యాబినేట్‌లో మంత్రి పదవి దక్కించుకునేందుకు పలుమార్లు ప్రయత్నించారు. అయితే కురువృద్దులైన గాదె వెంకట్‌రెడ్డి, ఎం.సత్యనారాయణరావు లను మంత్రి వర్గంలోకి తీసుకొని ఈయనకు మొండిచేయి చూపించారు. ప్రత్యేక తెలంగాణ వాదిగా గుర్తింపు ఉండడంతో గమనించిన వైఎస్‌ తెలంగాణ ప్రాంతీయ మండలి చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. ఆ పదవిలో కొన్ని రోజులు పనిచేశారు. కోట్ల విజయభాస్కరరెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాలతో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి వ్యతిరేకిగా ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో రామన్నపేట నియోజకవర్గం నకిరేకల్ నియోజకవర్గం లోకి మారింది. ఆ నియోజకవర్గాన్ని ఎస్‌సిలకు కేటాయించారు. దీంతో పురుషోత్తంరెడ్డి భువనగిరి, ఆలేరు లలో ఏదో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. కాని చివరకు తప్పుకొని తన అనుచరగణంగా ముద్రపడిన చింతల వెంకటేశ్వరరెడ్డికి భువనగిరి, బూడిద భిక్షమయ్య గౌడ్‌కు ఆలేరు శాసన సభ్యులుగా టికెట్‌ ఇప్పించారు. వారి గెలుపుకోసం తీవ్రంగా ప్రయత్నించినా భిక్షమయ్యగౌడ్‌ గెలవడం, చింతల ఓటమిపాలయ్యారు.

వైకాపా పార్టీ మార్చు

రాజకీయ చివరిలో, ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో కాంగ్రెస్‌లో చక్రం తిప్పిన ఉప్పునూతల 2012 వ సంవత్సరంలో వైకాసా పార్టీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేరారు. కాంగ్రెస్‌ శాసన సభ్యులు బూడిద భిక్షమయ్యగౌడ్‌, చింతలతో కొంత విభేదాలు తలెత్తడంతో ఆయన వారిని వ్యతిరేకించి పార్టీ మారారు. వైఎస్‌కు వ్యతిరేకిగా ఉన్న ఆయన విభేదాలతో వైఎస్‌ఆర్‌ సిపి తీర్థం పుచ్చుకోక తప్పలేదు. పార్టీలో చేరినా చురుగ్గా రాజకీయాల్లో పాల్గొనలేక పోయారు.

నిర్మాతతో సినీ పరిచయం మార్చు

సినీ రంగంలో కూడా ఆయనకు పరిచయాలు ఉన్నాయి. చివరకు మిగిలేది చిత్రాన్ని సావిత్రితో తీసి నిర్మాతగా సినీరంగంలో పరిచయం పొందారు. అప్పట్లో ఆ చిత్రానికి విశేష ఆదరణ పొంది నంది అవార్డు కూడా లభించింది. అయితే ఒకే ఒక సినిమా తీసి రాజకీయంపై ఉన్న మమకారంతో సినీ రంగానికి దూరమయ్యారు.

మరణం మార్చు

గత కొంతకాలంగా అస్వస్ధతతో బాధపడుతూ హైదరాబాదు‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2013, ఆగష్టు 3 న, 80 సంవత్సరాల వయస్సులో తుది శ్వాస వదిలారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

మూలాలు మార్చు

ఆంధ్రజ్యోతి వెబ్ [permanent dead link]