గుండా మల్లేష్ (జూలై 14, 1947 - అక్టోబరు 13, 2020) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. కార్మిక కుటుంబం నుంచి వచ్చిన గుండా మల్లేష్ అంచెలంచెలుగా శాసన సభ్యులు స్థాయికి ఎదిగాడు. ఈయన ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం, బెల్లంపల్లి శాసనసభ నియోజకవర్గంల నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. శాసనసభలో సి.పి.ఐ పార్టీ శాసనసభా పక్షనేతగా కూడా ఉన్నాడు.[1][2]

గుండా మల్లేష్
In office
1983-1985, 1985-1990,
1994-1999, 2009–2014
నియోజకవర్గంఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం,
బెల్లంపల్లి శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం(1947-07-14)1947 జూలై 14
రేచిని, తాండూరు మండలం, మంచిర్యాల జిల్లా
మరణం2020 అక్టోబరు 13(2020-10-13) (వయసు 73)
హైదరాబాదు, తెలంగాణ
రాజకీయ పార్టీసి.పి.ఐ
జీవిత భాగస్వామిసరోజ
సంతానంఇద్దరు కూతుళ్ళు, ఒక కుమారుడు
తల్లిదండ్రులుపోచమల్లు, లక్ష్మి
వృత్తిరాజకీయవేత్త, మాజీ శాసనసభ సభ్యుడు

జీవిత విషయాలు మార్చు

మల్లేష్ 1947, జూలై 14న పోచమల్లు, లక్ష్మి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, తాండూరు మండలం, రేచిని గ్రామంలో జన్మించాడు. మెట్రిక్యులేషన్ చదివి, బెల్లంపల్లిలోని రామా ట్రాన్స్‌పోర్టులో క్లీనర్‌గా, డ్రెవర్‌గా పనిచేశాడు. తోటి క్లీనర్లు, డ్రెవర్ల సమస్యలపై పోరాడాడు.

మల్లేష్ కు సరోజతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్ళు, ఒక కుమారుడు.

రాజకీయ ప్రస్థానం మార్చు

సింగరేణిలో కార్మికుడిగా చేరిన మల్లేష్ సీపీఐ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాడు. 1970లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయు రాజకీయ నాయకుడిగా మారాడు. మంచి కార్మిక నేతగా పేరు తెచ్చుకున్న మల్లేష్, 8సార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి, 4సార్లు గెలుపొందాడు. ఒకప్పటి ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గ పరిధిలో బెల్లంపల్లి ఉన్న సమయంలో ఆరుసార్లు, బెల్లంపల్లి నియోజకవర్గం ఏర్పాటు తర్వాత 2009, 2014లో రెండుసార్లు సిపిఐ తరపున పోటీ చేసాడు.

1978లో తొలిసారిగా ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి దాసరి నర్సయ్య చేతిలో 3,849 ఓట్లతో ఓడిపోయాడు. తరువాత 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దాసరి నర్సయ్యపై 303 ఓట్ల తేడాతో, 1985 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దాసరి నర్సయ్యపై 4,048 ఓట్ల తేడాతో గెలిచాడు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దాసరి నర్సయ్య చేతిలో 5,932 ఓట్లతో ఓడిపోగా, 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దాసరి నర్సయ్యపై 34,155 ఓట్ల తేడాతో గెలిచాడు. అనంతరం 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమ్రాజుల శ్రీదేవి చేతిలో 5,452 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాడ్డాక 2009లో జరిగిన ఎన్నికల్లో పోటిచేసి కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ పై గెలుపొంది, 12వ శాసనసభలో సభానాయకుడిగా వ్యవహరించాడు. 2014, 2018లలో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య చేతిలో ఓడిపోయాడు.[3]

మరణం మార్చు

కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ 2020, అక్టోబరు 13న మరణించాడు.[4][5]

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. ఈనాడు, తెలంగాణ (13 October 2020). "సీపీఐ సీనియర్‌ నేత గుండా మల్లేశ్‌ కన్నుమూత". www.eenadu.net. Archived from the original on 13 October 2020. Retrieved 13 October 2020.
  2. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (13 October 2020). "మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ కన్నుమూత". www.andhrajyothy.com. Archived from the original on 13 October 2020. Retrieved 13 October 2020.
  3. Telangana Today, Telangana (13 October 2020). "Four-time MLA Gunda Mallesh passes away". Archived from the original on 13 October 2020. Retrieved 13 October 2020.
  4. సాక్షి, తెలంగాణ (13 October 2020). "మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ కన్నుమూత". Sakshi. Archived from the original on 13 October 2020. Retrieved 13 October 2020.
  5. సాక్షి, తెలలంగాణ (13 October 2020). "సీపీఐ నాయ‌కుడు గుండా మ‌ల్లేశ్ క‌న్నుమూత‌". ntnews. Archived from the original on 13 October 2020. Retrieved 13 October 2020.

బయటి లంకెలు మార్చు