పానుగంటి లక్ష్మీ నరసింహారావు
పానుగంటి లక్ష్మీ నరసింహారావు ( ఫిబ్రవరి 11,1865 - జనవరి 1, 1940) తెలుగు సాహితీవేత్త. సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన నరసింహారావును పాఠకలోకం 'కవిశేఖరుడ'నీ, 'అభినవ కాళిదాసు' అనీ, 'ఆంధ్ర అడిసన్' అనీ, 'ఆంధ్ర షేక్ స్పియర్' అనీ బిరుదులతో అభినందించింది.
పానుగంటి లక్ష్మీ నరసింహారావు | |
---|---|
పానుగంటి లక్ష్మీ నరసింహారావు | |
జననం | పానుగంటి లక్ష్మీ నరసింహారావు ఫిబ్రవరి 11, 1865 సీతానగరం, రాజమండ్రి తాలూకా |
మరణం | జనవరి 1, 1940 |
ప్రసిద్ధి | సాహితీవేత్త |
మతం | హిందూ మతము |
తండ్రి | వేంకటరమణయ్య |
తల్లి | రత్నమాంబ |

బాల్యం, విద్యాభ్యాసం సవరించు
రచయితగా పేరుపడిన నరసింహరావు రక్తాక్షి సంవత్సరం మాఘ బహుళ పాడ్యమి నాడు అనగా 1865, నవంబర్ 2న రాజమండ్రి తాలూకా సీతానగరంలో జన్మించాడు. వీరి తల్లిదండ్రులు రత్నమాంబ, వేంకటరమణయ్య. తండ్రి రాజమండ్రిలో పేరుపొందిన ఆయుర్వేద వైద్యులు.
వీరు 1884లో మెట్రిక్యులేషన్, 1886లో ఇంటర్, 1888లో బి.ఎ. పరీక్షలలో ఉత్తీర్ణులైనారు. తరువాత పెద్దాపురం హైస్కూలులో మొదటి అసిస్టెంటుగా ఉద్యోగం చేశారు.
రచనలు సవరించు
పానుగంటి కింది గ్రంథాలను రచించాడు.
సారంగధర చరిత్ర, వృద్ధ వివాహము, రాధాకృష్ణ, నర్మదా పురుకుత్సీయము, సరస్వతి, దుష్టప్రధాని, ఆనందనాథ, కల్యాణరాఘవము, కంఠాభరణము, విజయరాఘవము, కోకిల, విప్రనారాయణ చరిత్ర, విచిత్ర సమావేశము, విచిత్ర మరణము, బుద్ధబోధసుధ, వీరమతి, పూర్ణిమ, ప్రచండ చాణక్యము (ఇత్యాది నాటకములు). హాస్యవల్లరి, పతనము, మంజువాణి, జగన్నాథమూర్తి, మోసము, జలజ, సాక్షి (6 భాగములు)[1]
రచనాశైలి సవరించు
పానుగంటి పంతులు శబ్దవైచిత్రవలచినకవి. ఆంధ్ర వచనరచనలో వీరొక క్రొత్తదారి త్రొక్కిరి. కందుకూరి వీరేశలింగము పంతులుగారు గద్యతిక్కనయేగాని యావిషయము వేఱు. చిలకమర్తికవి పెద్దనవలా రచయితేగాని యదియునువేఱే. పానుగంటివారి రచన మఱియొక విలక్షణమైనది. వీరు వ్యావహారికమునకు దగ్గఱగనుండు గ్రాంథికము వ్రాయుదురు. ప్రతిపదము పరిహాసగర్భితము. ఆక్షేపణ భరితము. చెప్పినదే మార్చి మార్చి భంగ్యంతరముగా జెప్పుట వీరి రచనలో గ్రత్తదనము. చదివినకొలదిని జదువుట కుత్సాహము పుట్టించు రచనమే రచనము. అది పానుగంటికవి సొమ్ము. విషయము గప్పిపుచ్చకుండ, విసుగుపుట్టింపకుండ వేలకొలది నిదర్శనముల జూపుచు వ్రాయుటలో బానుగంటి వారిదే పై చెయ్యి. పాఠకున కొకవిధమైన యుత్సాహము చిత్తసంస్కృతి యావేశము గలిగింపజేయుట కీయన రచన యక్కటైనది.
శ్రీ లక్ష్మినరసింహము పంతులుగారి నాటకములలోని పద్యములు బండివానినుండి పండితునివఱకు బాడుకొని యానందించుచుందురు. నాటకరచనకంటె సాక్షివ్యాసములతో బానుగంటివారికి గొప్పపేరువచ్చింది. సాక్షి వ్యాసములకంటె నాటకరచనలో నరసింహరావు పంతులుగారిని రసవిదు లెల్ల మెచ్చుకొనిరి. పానుగంటివారి నాటకములకు కూచి నరసింహముగారు 'నాంది' వ్రాయుట యొక యాచారము. పంతులుగా రాంగ్లవిశేఖరుడగు 'షేక్స్పియరు' వ్రాసిన యన్నినాటకములు వ్రాయవలె నని సంకల్పించి యొకటిరెండించు మించులో దమ సంకల్పము పూరించుకొనిరి. వానిలో నయిదాఱు 'నాటకములకు--------వచ్చింది. 'రాధాకృష్ణ' వీరి నాటకములలో నాయక రత్నము దానియందు వీరి కవిత పండినది.[1]
సంస్థానాల దివాను సవరించు
వీరు లక్ష్మీనరసాపురం జమిందారిణి రావు చెల్లయమ్మ గారి దివానుగా చేరారు. ఆరు సంవత్సరాల తర్వాత అభిప్రాయభేధాల మూలంగా ఉద్యోగం మానివేశారు. తరువాత ఉర్లాము సంస్థానం లోను, బళ్ళారిజిల్లాలోని ఆనెగొంది సంస్థానంలోను దివానుగా కొంతకాలం పనిచేశారు.
పిఠాపురం మహారాజా శ్రీ సూర్యారావు బహదూరు వారికి మైనారిటీ తీరగా రాజ్యాధికారం చేపట్టిన తర్వాత పంతులుగారిని 1915-16 మధ్య 'నాటక కవి'గా తమ ఆస్థానంలో నియమించారు. వీరి కోరికపై అనేక నాటకాలు వ్రాసారు. వాటి నన్నింటిని మహారాజుగారే అచ్చువేయించారు.
సుమారు ఇరవై సంవత్సరాలు వీరికి జీవితం సుఖంగా జరిగింది. ఆ రోజుల్లో దివాణం తరువాత వ్యయానికి వీరి గృహమే అనేవారు. ఆధునిక శ్రీనాధునిగా జీవించారు.
వాణి సంఘములో చురుకైన సభ్యునిగా ఉండేవాడు.
చరమదశ సవరించు
ఉద్యోగాల వలన, రచనల వలన వీరు విశేషంగా డబ్బు గడించినా దానిని నిలువచేయడంలో శ్రద్ధ కనపరచలేదు. ఆధునిక శ్రీనాధుని వలెనే అనుభవించినన్నాళ్ళూ బాగా అనుభవించి, తుది రోజులలో పేదరికానికి ఋణబాధకు లోనయ్యారు. మహారాజావారు బాగా పోషించినా, పంతులుగారికి తుదిదశలో వైషమ్యాలేర్పడి, తమదగ్గర ఏనాడో చేసిన ఋణం కొరకు వారికి ఇచ్చే నూటపదహారు రూపాయల గౌరవ వేతనం వేతనంలో కొంతభాగం తగ్గించడానికి ఉత్తర్వులు జారీచేశారు. వృద్ధాప్యంలో వీరు అటు ఇటు తిరిగి సంపాదించలేకపోయారు. చేతికి అందివచ్చిన కుమారులు ఉన్నా వారిని ఉద్యోగాలకు పంపలేకపోయారు. కవి శేఖరుని దుస్థితి గురించి పానుగంటి వ్రాసిన లేఖను ఆంధ్రపత్రికలో యర్రవల్లి లక్ష్మీనారాయణ ప్రచురించాడు - నాకెవరును దానధర్మము చేయనక్కరలేదు. తగ్గింపు ధరలకు నూటయాభై సెట్ల పుస్తకాలు యాభై మంది కొని, నా మానుషమును కాపాడినను, నాకు సివిలు ఖైదు తప్పును[2]
1933 నుండి శారీరకంగా, మానసికంగా వీరి ఆరోగ్యం చెడిపోయింది. 1935 లో పిఠాపురంలో సప్తరిపూర్త్వుత్సవాలు పురజనులు సన్మానించారు. ఈ ఉత్సవానికి చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు అధ్యక్షత వహించారు. పరిస్థితులు మారి, తీవ్ర మనస్తాపంతో ఈయన అక్టోబరు 7న, 1940లో మరణించాడు.
సాక్షి వ్యాసాల గురించి ప్రముఖుల అభిప్రాయాలు సవరించు
లక్ష్మీనరసింహారావు పానుగంటి
సాక్షి వ్యాసాలు చదవడం మాననంటి
ఎంచేతనంటే వాటిలో పేనులాంటి
భావానికాయన ఏనుగంటి
రూపాన్నియ్యడం నేనుగంటి. (శ్రీరంగం శ్రీనివాసరావు.)
కొన్ని రచనలు సవరించు
- సాక్షి వ్యాసాలు (వికీసోర్స్లో కొన్ని పూర్తి వ్యాసాలున్నాయి)
- విప్రనారాయణ చరిత్ర
- పాదుకా పట్టాభిషేకం
- కాంతాభిరామము
- రాతి స్తంభము
- కళ్యాణ రాఘవము
- విజయ రాఘవము
- వనవాస రాఘవము
- ముద్రిక
- నర్మదా పురుకుత్సీయము
- సారంగధర
- ప్రచండ చాణక్యము
- రాధాకృష్ణ
- కోకిల
- బుద్ధబోధ సుధ
- వృద్ధ వివాహము
- కంఠాభరణము
- పూర్ణిమ
- సరస్వతి
- వీరమతి
- చూడామణి (నాటకం) - చూడామణి నాటక ఇతివృత్తాన్ని కల్హణుడు రచించిన కాశ్మీర రాజతరంగిణి నుంచి వినయాదిత్యుడనే రాజు, దామోదరశర్మ అనే మంత్రిల యథార్థగాథను స్వీకరించి పెంచి రచించారు.[3]
- పద్మిని (ఆఱంకముల కల్పితనాటకము) (మొదటికూర్పు: 1929)[4]
- మాలతీమాల
- గుణవతి
- మణిమాల
- సరోజిని
- విచిత్ర వివాహము
- రామరాజు
- పరప్రేమ
- మనోమహిమము
- ఆనందవాచకపుస్తకం[5]
వికీ మూలాలలొ సవరించు
- వికీ సోర్స్లో పానుగంటి లక్ష్మీ నరసింహరావు గురించిన విషయాలున్నాయి.
- s:పానుగంటి లక్ష్మీ నరసింహారావు - పానుగంటి లక్ష్మీ నరసింహరావు గురించి వికీసోర్స్లోని పేజీ
- s:సాక్షి సంఘనిర్మాణము - పూర్తి వ్యాసం - వికీసోర్స్లోని పేజీ
మూలాలు సవరించు
- ↑ 1.0 1.1 మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి (1940). " పానుగంటి లక్ష్మీనరసింహరావు". ఆంధ్ర రచయితలు. వికీసోర్స్.
- ↑ శత వసంత సాహితీ మంజీరాలు లో పింగళి వెంకటరావు ఉపన్యాస వ్యాసం - ప్రచురణ : ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ సంఘం, నిజయవాడ (2002)
- ↑ పానుగంటి, లక్ష్మీనరసింహారావు. చూడామణి. Retrieved 9 December 2014.
- ↑ పానుగంటి లక్ష్మీనరసింహారావు (1929). పద్మిని. కాకినాడ: కాకినాడ ముద్రాక్షరశాల. Retrieved 10 September 2020.
- ↑ కూచి, నరసింహం; లక్ష్మీనరసింహారావు, పానుగంటి (1930). ఆనందవాచకపుస్తకము.
- Panuganti Lakshmi Narasimha Rao: Makers of Indian Literature, Mudigonda Veerabhadra Sastry, Sahitya Akademi, New Delhi, 1993. (ISBN 8172014996)[1]
- రాధాకృష్ణ ఆంగ్లానువాదం - Radhakrishna: Panuganti Lakshmi Narasimha Rao, English Translation by Mudigonda Veerabhadra Sastry, Sahitya Akademi, New Delhi, 2002. (ISBN 8126013907)
- కళ్యాణ రాఘవము (Kalyana Raghavamu: Panuganti Lakshmi Narasimha Rao, 1915).ఇంటర్నెట్ ఆర్చీవులో అభ్యం
- నర్మదా పురుకుత్సీయం (Narmadapurukutsiyam: Panuganti Lakshmi Narasimha Rao, 1973) ఇంటర్నెట్ ఆర్చీవులో అభ్యం.
- రాతి స్తంభాలు (Raathi Sthambhamu: Panuganti Lakshmi Narasimharao,1930) ఇంటర్నెట్ ఆర్చీవులో అభ్యం.
- సాక్షి వ్యాస సంపుటి (Sakhi vyaasa samputi) తెలుగుపరిశోధన లో లభ్యం.