ప్రతిఘటన
ప్రతిఘటన టి. కృష్ణ దర్శకత్వంలో 1986 లో విడుదలైన ఒక విజయవంతమైన సినిమా.[1][2] ఇందులో విజయశాంతి, చంద్రమోహన్, రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మూడు నంది పురస్కారాలను అందుకుంది. విజయశాంతికి ఉత్తమ నటిగా, ఎస్. జానకికి ఉత్తమ గాయని గా, హరనాథ రావుకు ఉత్తమ మాటల రచయితగా ఈ పురస్కారాలు దక్కాయి. ఉషాకిరణ్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
ప్రతిఘటన | |
---|---|
దర్శకత్వం | టి. కృష్ణ |
రచన | ఎం. వి. ఎస్. హరనాథ రావు (సంభాషణలు) |
కథ | టి. కృష్ణ (కథ, చిత్రానువాదం) |
నిర్మాత | రామోజీరావు |
తారాగణం | చంద్రమోహన్ , విజయశాంతి, రాజశేఖర్, సుత్తివేలు , చరణ్రాజ్, కోట శ్రీనివాసరావు, సాయికుమార్, నర్రా వెంకటేశ్వరరావు, పి.ఎల్. నారాయణ, వై. విజయ |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1985 |
భాష | తెలుగు |
కథ సవరించు
కాళి అనే గుండా, మంత్రి కాశయ్య కలిసి అందరిపై అరాచకాలు చేసేవాడు. ఝన్సీ అనే లెక్చరర్, సత్యమూర్తి ఇద్దరూ భార్యా భర్తలు. సత్యమూర్తి భయస్తుడు. ఝాన్సీ ధైర్యవంతురాలు. ఎస్సై ప్రకాష్ కాళిని అరెస్ట్ చేస్తాడు. కాళి, ప్రకాష్ ని నడి రోడ్డు పై హత్య చేసాడు. ఈ దారుణం చూసిన ఝాన్సీ, కాళిపై పొలీసుకేసు పెడుతుంది. భర్త, అత్తమామలు ఈ విషయంలో ఆమెను తప్పు పడతారు.పగబట్టిన కాళి, నడివీదిలో ఝాన్సీని వివస్త్రను చేస్తాడు. కాళి వల్ల అన్యాయానికి గురి అయిన ఝాన్సీకి, నాగమ్మ ఇంటిలో ఆశ్రయం దొరికుతుంది. ఝాన్సీ పనిచేసే కాలేజిలో చదువు కోసం వచ్చే విద్యార్థులు కంటే చౌకబారు రౌడీ ల సంఖ్య ఎక్కువ. వారిని అందరిని మారుస్తుంది ఝాన్సీ. కాళి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు. ఎన్నికల ప్రచారంలో కాళి తరుపున ప్రచారం చేస్తానని ఝాన్సీ ముందుకు వస్తుంది. మొదట అనుమానించినా, తరువాత నమ్మతాడు కాళి. నాగమ్మ, స్టూడెంట్స్ అందరూ ఆమెను అపార్థం చేసుకుంటారు. కాళికి వ్యతిరేకంగా ఎన్నకల ప్రచారం చేసిన శ్రీరీశైలం ను కాళీ.చంపేస్తాడు. రిగ్గింగ్ చేసీ, భయపెట్టి కాళి ఎమ్మెల్యే గా భారీ మెజారిటీతో గెలుస్తాడు. విజయోత్సవ సభలో ఆనందంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాళిని, గొడ్డలితో నరికి చంపేస్తుంది ఝాన్సీ.
నిర్మాణం సవరించు
దర్శకుడు టి. కృష్ణ ప్రధాన పాత్రను విజయశాంతి చేతనే వేయించాలనుకున్నాడు. అప్పట్లో ఈ చిత్రంలో నటించడానికి విజయశాంతికి సమయం చిక్కనప్పటికీ అదే సమయంలో ఆమె నటిస్తున్న ఇతర చిత్రాల నిర్మాతలతో మాట్లాడి ఈ సినిమా కోసం సమయాన్ని కేటాయించగలిగింది. ఈ సినిమా నిర్మాణం నెలరోజులలో పూర్తయింది. కన్నడ సినిమాల్లో అప్పటిదాకా కథానాయకుడి పాత్రల్లో నటిస్తున్న చరణ్రాజ్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించడానికి అంగీకరించాడు.[3]
తారాగణం సవరించు
- ఝాన్సీగా విజయశాంతి
- ప్రకాష్ గా రాజశేఖర్
- కాళీగా చరణ్రాజ్
- కాశయ్య గా కోట శ్రీనివాసరావు
- లాయర్ గోపాలకృష్ణ గా చంద్రమోహన్
- కాళీ దగ్గర లాయరు గా రాళ్ళపల్లి
- శ్రీశైలం గా సుత్తివేలు
- నర్రా వెంకటేశ్వర రావు
- వై. విజయ
- వైజాగ్ ప్రసాద్
అవార్డులు సవరించు
- ఉత్తమ నిర్మాతగా రామోజీరావుకు ఫిలింఫేర్ పురస్కారం.
- ఈ దుర్యోధన దుశ్శాసన పాటకు గాను ఎస్. జానకి ఉత్తమ నేపథ్య గాయనిగా నంది పురస్కారాన్ని అందుకుంది.
- విజయశాంతి ఉత్తమ నటిగా నంది పురస్కారం, ఫిలిం ఫేర్ పురస్కారాలు అందుకుంది.
- సంభాషణల రచయిత ఎం. వి. ఎస్. హరనాథ రావుకు నంది పురస్కారం లభించింది.
పాటలు సవరించు
- ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో - రచన: వేటూరి సుందరరామమూర్తి; గానం: ఎస్. జానకి
- వయసు - రచన: వేటూరి సుందరరామమూర్తి; గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి
- హెచ్చరికో హెచ్చరిక - రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
మూలాలు సవరించు
- ↑ "ప్రతిఘటన". telugu.filmibeat.com. Archived from the original on 25 February 2020. Retrieved 26 October 2016.
- ↑ "ప్రతిఘటన". naasongs.com. Archived from the original on 2 November 2016. Retrieved 26 October 2016.
- ↑ Eenadu. "విజయశాంతి మాత్రమే చేయాలని పట్టుబట్టారట! - EENADU". www.eenadu.net. Archived from the original on 2019-10-11. Retrieved 2019-10-11.