వావిలాల గోపాలకృష్ణయ్య

గాంధేయవాది, రాజకీయ నాయకుడు

వావిలాల గోపాలకృష్ణయ్య (సెప్టెంబరు 17, 1906 - 2003 ఏప్రిల్ 29,) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడు, పద్మ భూషణ పురస్కార గ్రహీత. కళా ప్రపూర్ణ బిరుదు గ్రహీత.

బాల్యం మార్చు

1906 సెప్టెంబరు 17న గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వావిలాల నరసింహం, పేరిందేవి దంపతులకు నాలుగో సంతానంగా జన్మించాడు. స్వాతంత్య్రోద్యమ కార్యకర్త. నాయకుడు. ప్రజాప్రతినిధి. వక్త. బహుగ్రంథకర్త. పద్మభూషణ్ పురస్కార గ్రహీత. ఖాదీ దుస్తులతో, చేతిలో ఖాదీ సంచితో నిరాడంబరంగా కనిపించే అజాతశత్రువు, ఆజన్మ బ్రహ్మచారి .

స్వాతంత్రోద్యమంలో మార్చు

భీమవరపు నరసింహారావుతో కలిసి ఇంటింటికీ తిరిగి స్వరాజ్య భిక్ష పేరుతో బియ్యం, జొన్నలు సేకరించి కాంగ్రెస్ కార్యకర్తలకు వాటితో భోజన సదుపాయం కల్పించాడు. పలనాడు పుల్లరి సత్యాగ్రహంలో గార్లపాటి హనుమంతరావు తదితర నాయకులతో కలిసి పాల్గొన్నాడు. ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ సంఘ సభ్యుడిగా ఉన్నాడు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటే, సోవియెట్ పద్ధతిలోనే ఆ సమస్య పరిష్కారం అవుతుందన్నాడు. వావిలాల గోపాలకృష్ణయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ హయర్ స్టడీస్ అనే సంస్థని గుంటూరు అరండల్‌పేటలో ఏర్పాటు చేశారు. చివరి రోజులలో ఆనారోగ్యానికి గురై పక్షవాతంతో గుంటూరు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. శ్వాస కోశ సంబంధమైన వ్యాధితో నిమ్స్‌లో కొంతకాలం వైద్యం చేయించుకొన్న అతను 2003 ఏప్రిల్ 29న పరమపదించాడు.[1]

గ్రంథాలయోద్యమంలో మార్చు

తన 19వ ఏట 1925లోనే గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో 'శారదానిలయం' అనే గ్రంథాలయాన్ని నెలకొల్పాడు. దానిని అభివృద్ధి చేసి పోషించారు. కొంతకాలం తరువాత పంచాయతీకి అప్పగించారు. గ్రామాలలో యువతని సమీకరించి గ్రంధాలయాలు నెలకొల్పడానికి కృషి చేసాడు. గుంటూరు జిల్లా గ్రంధాలయసంఘాభివృద్ధికి పాటుపడ్డాడు. రాష్ట్రసంఘ సహాయకార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా గ్రంథాలయాల విస్తరణకు కృషి చేసాడు. గ్రంధాలయ బిల్లును 1937 లో రూపొందించి, 1949 లో పుస్తక రూపంలో ప్రచురించాడు. 1960 లో అమలులోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంధాలయాల చట్టం నిర్మాణంలో, 1961 లో రాష్ట్ర పౌర గ్రంధాలయ శాఖ , 1967 లో సంచాలక కార్యాలయం, 1971 లో గ్రంధాలయ మంత్రిత్వ శాఖ ఏర్పడటంలో ప్రముఖ పాత్ర వహించాడు. రాష్ట్రం లో గ్రంధాలయ శాసనం అమలును పరిశీలించటానికి ఏర్పాటుచేసిన జస్టీస్ ఎగ్బోట్ సంఘ సభ్యునిగా రాష్ట్రమంతటా పర్యటించి గ్రంథాలయాల అభివృద్ధికి అనేక సూచనలు చేసాడు. దానిలో రాజమహేంద్రవరం లో గౌతమి గ్రంధాలయం కూడా ఉంది.[2]

పదవులు, బిరుదులు మార్చు

  • ఆంధ్రా గాంధీ అని పిలిచే ఇతను సోషలిస్టు
  • 1974 - 77 కాలంలో తెలుగు అధికారభాషా సంఘం అధ్యక్షునిగా పనిచేశాడు.
  • గుంటూరు జిల్లా కాంగ్రెస్ సంఘ సంయుక్త కార్యదర్శిగా పనిచేసాడు
  • గుంటూరు జిల్లా కాంగ్రెస్ సివిక్ బోర్డు సభ్యుడిగా పనిచేసాడు
  • 1952లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి, గెలుపొందాడు. [3]
  • 1955, 62, 67 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి అతను గెలుపొందాడు.

రచనలు మార్చు

గోపాలకృష్ణయ్య తన జీవిత కాలంలో పలు రచనలు చేసాడు. తెలుగులో నలభై అయిదు, ఆంగ్లంలో పదహారు పుస్తకాలు రచించాడు. వాటిలో కొన్ని

  1. 1922లో తొలి రచన 'శివాజీ'
  2. 1947లో మద్రాసు మంత్రివర్గమా ఎక్కడికి?
  3. 1951లో విశాలాంధ్రం
  4. 1976-77 ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయోద్యమం

"వచ్చేదాకా వల్లించు చచ్చేదాకా చదువు" అనేది వారి సూక్తి [2]

మూలాలు మార్చు

  1. ttps://www.rediff.com/news/2003/apr/29ap.htm
  2. 2.0 2.1 శ్రీ రామ నరసింహా రావు, యాతగిరి (October 2010). "గ్రంథాలయోద్యమ నేత వావిలాల". గ్రంధాలయ సర్వస్వము. విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంస్థ. 71 (7): 2.
  3. "మద్రాసు శాసనసభ సమీక్ష - 1952-57" (PDF). తమిళనాడు శాసనసభ. p. 82. Archived (PDF) from the original on 2020-10-15. Retrieved 2021-11-03.

వెలుపలి లంకెలు మార్చు

వనరులు మార్చు