వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 37వ వారం

భారతదేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించే జట్టుకు భారత క్రికెట్ జట్టు అని వ్యవహరిస్తారు. ఇది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అజమాయిషీలో ఉంటుంది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ప్రపంచంలోనే స్పాన్సర్‌షిప్ రూపంలో అత్యధిక డబ్బును ఇచ్చే జాతీయ క్రీడాజట్టుగా నిలిచింది. భారతదేశం మొట్టమొదటి సారిగా 1921లో తొలి క్రికెట్ మ్యాచ్ ఆడింది. కాని అధికారికంగా మొదటి టెస్ట్ మ్యాచ్ 1932, జూన్ 25న ఇంగ్లాండుతో లార్డ్స్ లో ఆడి టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆరవ దేశంగా స్థానం సంపాదించినది. 1900లలో కొందరు భారతీయులు ఇంగ్లీష్ క్రికెట్ టీంలో ఆడటానికి ఇంగ్లాండు వెళ్ళినారు. వారిలో ముఖ్యులు రంజిత్ సింహ్ జీ మరియు దులీప్ సింహ్ జీ. 1926లో ఇంపీరియల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి)లో భారతదేశానికి ఆహ్వానించారు. 1932లో తొలిసారిగా అధికారిక టెస్ట్ మ్యాచ్ సి.కె.నాయుడు నేతృత్వంలో ఇంగ్లాండుతో ఆడింది.


టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌కు తొలి విజయం 1952లో ఇంగ్లాండుపై చెన్నైలో లభించింది. ఆ తరువాతి సంవత్సరం పాకిస్తాన్ పై తొలి సీరీస్ విజయం సాధించింది. 1950 దశాబ్దిలో భారత జట్టు మంచి పురోగతి సాధించింది. 1970 దశకంలో భారత జట్టులో స్పిన్ దిగ్గజాలైన బిషన్ సింగ్ బేడీ, ఎర్రపల్లి ప్రసన్న, చంద్రశేఖర్, వెంకట రాఘవన్ లాంటివారు ప్రవేశించారు. అదే సమయంలో ఇద్దరు ప్రముఖ బ్యాట్స్‌మెన్లు (సునీల్ గవాస్కర్ మరియు గుండప్ప విశ్వనాథ్ లు) కూడా భారత జట్టులో రంగప్రవేశం చేశారు. 1971లో అజిత్ వాడేకర్ నాయకత్వంలో భారతజట్టు ఇంగ్లాండు మరియు వెస్ట్‌ఇండీస్ లపై సీరీస్ విజయం సాధించగలిగింది.


1971లో వన్‌డే క్రికెట్ ప్రారంభమైన తరువాత క్రికెట్‌కు జనాదరణ బాగా పెరిగింది. 1970 దశాబ్దం ద్వితీయార్థం నుంచి టెస్టులలో భారత్ బలంగా తయారైంది. 1976లో క్లైవ్ లాయిడ్ నేతృత్వంలోని వెస్ట్‌ఇండీస్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 403 పరుగుల లక్ష్యాన్ని ఛేదింది భారత్ రికార్డు సాధించింది. ......పూర్తివ్యాసం: పాతవి