సైనికుడు (2006 సినిమా)
సైనికుడు 2006లో గుణశేఖర్ దర్శకత్వంలో విడుదలైన ఒక తెలుగు సినిమా. మహేష్ బాబు, త్రిష, ఇర్ఫాన్ ఖాన్ ఇందులో ప్రధాన పాత్రధారులు. అంతకు ముందే మహేశ్ బాబు హీరోగా సంచలనాత్మకమైన విజయం సాధించిన పోకిరి చిత్రం వెంటనే ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలయ్యింది కాని బాక్సాఫీసు వద్ద పూర్తిగా విఫలమయ్యంది. 2006లో ఈ సినిమాకు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నంది అవార్డు వచ్చింది.
సైనికుడు (2006 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | గుణశేఖర్ |
నిర్మాణం | సి. అశ్వినీదత్ |
రచన | గుణశేఖర్, పరుచూరి సోదరులు |
తారాగణం | మహేష్ బాబు, త్రిష కృష్ణన్, ఇర్ఫాన్ ఖాన్, ప్రకాష్ రాజ్ |
సంగీతం | హ్యారిస్ జయరాజ్ |
కూర్పు | శ్రీకర్ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | వైజయంతి మూవీస్ |
విడుదల తేదీ | నవంబరు 30,2006 |
భాష | తెలుగు |
పెట్టుబడి | 18 కోట్లు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కథాగమనం సవరించు
సిద్ధార్థ (మహేష్ బాబు) ఒక వైద్య విద్యార్థి. స్నేహితులతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. ఒక ఘోరమైన తుఫాన్ తాకిడికి వరంగల్ పరిసరప్రాంతాలు పూర్తిగా జలమయమౌతాయి. సిద్ధార్థ, అతని స్నేహితులు చాలా మందిని రక్షిస్తారు. తుఫాను బాధితులకు ప్రభుత్వ సహాయం అందలేదని తెలుస్తుంది. ఆహార పొట్లాల పంపిణీలో ఒక కుర్రవాడు చనిపోతాడు. ఆ దృశ్యాన్ని చూడలేక పోతాడు సిద్ధార్థ. అయితే తుఫాను బాధితులకు ఏడు కోట్లు విరాళంగా ఇస్తున్నానని ఆ ఏరియాలో పెద్ద దాదా అయిన పప్పూయాదవ్ (ఇర్ఫాన్ ఖాన్) ముఖ్యమంత్రి (కోట శ్రీనివాసరావు)తో చెపుతాడు. త్వరలో జరగ బోయే ఎన్నికలలో నిలబడాలనే ఆలోచనతో విరాళం ప్రకటిస్తాడు. పప్పూయాదవ్ తో గొడవ పెట్టుకొని అతనికి పోటీగా తన స్నేహితుడు అజయ్ ను పోటీగా నిలబెడతాడు సిద్ధార్థ. తానో పెద్ద రౌడీనని తన దారికడ్డువస్తే అడ్డంగా నరికేస్తానని సిద్ధార్థ గ్యాంగును బెదిరిస్తాడు పప్పూయాదవ్. అయినా పోటీనుంది విరమించుకోక పోవడంతో తన బావమరిది అయిన మొండినాని (ప్రకాష్ రాజ్) తో కలసి తనపైనే బాంబ్ బ్లాస్టింగ్ ప్లాన్ చేసుకొని అది సిద్ధార్థ గ్యాంగ్ చేసారని అతడిని జైలుకు పంపిస్తాడు. తరువాత ఎన్నికలలో గెలిచి హోం మంత్రి అయిపోతాడు పప్పూ యాదవ్. పప్పూయదవ్ వరలక్ష్మి అనే అమ్మాయిని (త్రిష) ప్రేమిస్తుంటాడు. వాళ్ళిద్దరకూ పెళ్ళి కుదిరి తాళి కట్టే సమయానికి సిద్ధార్థ వరలక్ష్మిని కిడ్నాప్ చేసి ఎత్తుకు పోతాడు. అతనిపై కేసు నమోదు చేసి అతన్ని వెతుకుతుంటారు పప్పూయాదవ్ మనుషులు. ఆమెను అడ్డు పెట్టుకొని పప్పూయాదవ్ ద్వారా అతని ఎన్నికలు వాగ్దాలను ప్రజలకు ఉపయోగపడే మంచిపనులను జరిపిస్తూ ఉంటాడు సిద్ధార్థ. ముందు సిద్ధార్థ అసహ్యించుకొన్న వరలక్ష్మి తరువాత మెల్లగా అతడిని ఇష్టపడుతుంది. ఆవిషయం తెలిసిన పప్పూయదవ్ ఆమెను అడ్డు పెట్టుకొని సిద్ధార్థను అంతమొందించాలనుకొంటాడు. వరలక్ష్మి ద్వారా కిడ్నాప్ కేసు విత్ డ్రా చేయించి తరువాతి ఎన్నికలలో పప్పూ యాదవ్ను విద్యార్థుల సహాయంతో అడ్డగించి అజయ్ను గెలిపిస్తాడు సిద్ధార్థ. నీ ఒక్క స్నేహితునితో నన్ను అడ్డగించడం నీవల్ల ఏమవుతుంది అన్న పప్పూ యాదవ్ మాటలకు ఒక్కడు బయలు దేరాడు వాడి వెనుక మరొకడు వెనుక మరొకడు ఇలా అందరూ వస్తారు నీలాంటి రౌడీలను తొక్కేస్తారు అంటాడు సిద్ధార్థ సినిమా ముగింపులో.
తారాగణం సవరించు
- సిద్ధార్థ గా మహేష్ బాబు
- వరలక్ష్మి గా త్రిష
- పప్పు యాదవ్ గా ఇర్ఫాన్ ఖాన్
- మొండి నాని గా ప్రకాష్ రాజ్
- ముఖ్యమంత్రిగా కోట శ్రీనివాసరావు
- అజయ్ గా అజయ్
- పోచమ్మ గా తెలంగాణా శకుంతల
- రవి వర్మ
- పప్పు యాదవ్ లాయరుగా నర్సింగ్ యాదవ్
- కొండవలస లక్ష్మణరావు
- పరుచూరి వెంకటేశ్వరరావు
- రఘునాథ రెడ్డి
- రాధాకుమారి
చిత్ర విశేషాలు సవరించు
- భారీగా వేసిన వరద దృశ్యాల చిత్రీకరణ సినిమా యొక్క టెక్నికల్ విలువలను తెలియజేస్తుంది. సంగీతం ఈ సినిమాకు మరొక ప్లస్ పాయింట్.
- ఆంధ్ర ప్రదేశ్లో సంచలనం కలిగించి పరిటాల రవి హత్య కేసుకు సంబంధం కలిగి ఉన్నారని వాఱ్తలలో చెప్పబడే వ్యక్తుల పేర్లు, ఘటనలు కొన్ని (ఉదాహరణ - మొద్దు శీను బదులు మొండినాని) ఈ సినిమాలో అన్యాపదేశంగా చూపారు.
పాటలు సవరించు
- బైలా బైలామో - లెస్లీ లూయిస్, అనుష్కా మంచందానీ (వివా బాండ్), సునీతా సారథి
- మాయేరా - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఉన్నికృష్ణన్ & కవితా కృష్ణమూర్తి
- ఆడపిల్లా అగ్గిపుల్లా - హరిహరన్ & చిత్ర
- సొగసు చూడతరమా - శ్రేయా ఘోషాల్
- ఓరుగల్లుకే పిల్లా - కారుణ్య, మాలతి, కార్తీక్, హరిణి
- గో గో అదిగో - కేకే
ఈ సినిమా పాటలు ఐదు దేశాలలో (భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్) 10 స్థానాలలో ఒకేమారు 2006 అక్టోబరు 21న ఆవిష్కరింపబడ్డాయి. ఇందుకు ప్రత్యేకంగా ఉపగ్రహం లింకు వాడారు.[1] పాటలు జనప్రియమయ్యాయి.[2]
మూలాలు, వనరులు సవరించు
- ↑ "Ashwini Dutt Innovations". idlebrain.com. Retrieved 23 November 2006.
- ↑ ""Sainikudu" slated for Nov. 30". indiaglitz.com. Archived from the original on 18 నవంబరు 2006. Retrieved 24 November 2006.