అడివి బాపిరాజు
అడివి బాపిరాజు (అక్టోబరు 8, 1895 - సెప్టెంబరు 22, 1952) బహుముఖ ప్రజ్ఞాశీలి, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు, నాటక కర్త. చిన్నతనం నుంచే సాహిత్యంపై ఆసక్తి చూపేవాడు. 1922 లో భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని అరెస్టయినాడు. జైలులో ఉండగా శాతవాహనుల నేపథ్యంలో సాగే హిమబిందు అనే నవల ప్రారంభించాడు. బందరు జాతీయ కళాశాలలో ప్రమోద్ కుమార్ ఛటోపాధ్యాయ దగ్గర శిష్యరికం చేసి భారతీయ చిత్రకళలో నైపుణ్యం సాధించాడు. తిక్కన, సముద్ర గుప్తుడు లాంటి చిత్రాలు గీశాడు. భీమవరంలో న్యాయవాద వృత్తి చేస్తూ నారాయణరావు అనే సాంఘిక నవల రాశాడు. ఈ నవలకు ఆంధ్రవిశ్వకళాపరిషత్తు వారి బహుమతి లభించింది. 1934 నుంచి 1939 వరకు బందరు జాతీయ కళాశాల ప్రధానాచార్యుడిగా పనిచేశాడు. అదే సమయంలో కథలు రాశాడు. 1939 లో సినీరంగప్రవేశం చేసి అనసూయ, ధ్రువ విజయం, మీరాబాయి లాంటి సినిమాలకు కళాదర్శకత్వం చేశాడు. 1944 నుంచి 1947 వరకు హైదరాబాదునుంచి వెలువడే మీజాన్ పత్రికకు సంపాదకత్వం వహించాడు. ఈ సమయంలో తుఫాను, గోన గన్నారెడ్డి, కోనంగి నవలలు రచించాడు. 1952 సెప్టెంబరు 22 న మద్రాసులో కన్నుమూశాడు.
అడివి బాపిరాజు | |
---|---|
![]() | |
జననం | భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా | 1895 అక్టోబరు 8
మరణం | 1952 సెప్టెంబరు 22 | (వయసు 56)
ఇతర పేర్లు | బాపిబావ |
వృత్తి | కవి, చిత్రకారుడు, పాత్రికేయుడు, దర్శకుడు |
తల్లిదండ్రులు |
|
తెలుగు దేశమంతటా విస్తృతంగా ప్రచారంలోనున్న "బావా బావా పన్నీరు" పాట ఈయన వ్రాసిందే. సన్నిహితులు, సమకాలీన సాహితీవేత్తలు ఈయన్ని ముద్దుగా "బాపి బావ" అని పిలిచేవారు.
జననం, విద్యాభ్యాసంసవరించు
బాపిరాజు పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరంలో అక్టోబర్ 8, 1895 న ఒక నియోగి బ్రాహ్మణ కుటుంబములో కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు. భీమవరం హైస్కూలులో చదివి, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో బి.ఏ చదివి, మద్రాస్ లా కాలేజ్ లో బి.ఎల్ పట్టం పొంది, కొంతకాలం న్యాయవాద వృత్తి నిర్వహించిన తరువాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించడానికి ఆ పనిని విరమించాడు. 1934 నుండి 1939 వరకు బందరు నేషనల్ కాలేజిలో అధ్యాపకునిగా (ప్రిన్సిపాల్ గా) పనిచేశాడు. 1944లో హైదరాబాదు నుండి వెలువడే తెలుగు దినపత్రిక మీజాన్ సంపాదకునిగా పనిచేశాడు. తరువాత విజయవాడ ఆకాశవాణి రేడియో కేంద్రంలో సలహాదారునిగా ఉన్నాడు. 'నవ్య సాహిత్య పరిషత్' స్థాపించినవారిలో బాపిరాజు ఒకడు. చిత్రకళను నేర్పడానికి గుంటూరులో ఒక ఫౌండేషన్ ప్రారంభించాడు.
బాపిరాజుకు చిన్ననాటినుండి కవితలు రాసే అలవాటు ఉండేది. బాపిరాజు నవల నారాయణరావుకు ఆంధ్ర విశ్వకళా పరిషత్ అవార్డు లభించింది. ఆయన చిత్రించిన చిత్రాలలో సముద్ర గుప్తుడు, తిక్కన ప్రసిద్ధమయ్యాయి. విశ్వనాథ సత్యనారాయణ గేయ సంపుటి కిన్నెరసాని పాటలు బాపిరాజు చిత్రాలతో వెలువడింది.
1922లో సహాయ నిరాకరణోద్యమంలో ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించాడు. తన జైలు జీవితానుభవాలను తొలకరి అనే నవలలో పొందుపరచాడు.
సెప్టెంబరు 22, 1952 న బాపిరాజు మరణించాడు.
చిత్రకళసవరించు
నవరంగ సంప్రదాయ రీతిలో అడివి బాపిరాజు ఎన్నో చిత్రాలను చిత్రించారు. బాపిరాజు చిత్రించిన శబ్ద బ్రహ్మ అనే చిత్రం డెన్మార్కు ప్రదర్శనశాలలో ఉంది. భాగవత పురుషుడు, ఆనంద తాండవం మొదలగు చిత్రాలు తిరువాన్కూరు మ్యూజియంలో ఉన్నాయి. 1951లో అప్పటి మద్రాసు ప్రభుత్వం కోరికపై సింహళంలోని సిగిరియా కుడ్య చిత్రాల ప్రతికృతులను చిత్రించారు.
- వాగ్దేవి
- వేణీ భంగము
- భారతి
- మొదలగునవి
రచనలుసవరించు
నవలలుసవరించు
- నారాయణరావు (1934) - సాంఘికం
- తుఫాను (1945) - సాంఘికం
- గోనగన్నారెడ్డి (1945) - చారిత్రకం
- కోనంగి (1946)- సాంఘికం
- హిమబిందు - చారిత్రకం
- అడవి శాంతిశ్రీ - చారిత్రకం
- అంశుమతి - చారిత్రకం
- నరుడు (1946 ) - సాంఘికం
- జాజిమల్లి (1951) - సాంఘికం
- మధురవాణి (అసంపూర్ణం, పూరణ - దిట్టకవి శ్యామలా దేవి)
- శిలారథం (అసంపూరణం)
- కైలాసేశ్వరుడు (అసంపూర్ణం)
రేడియో నాటికలుసవరించు
- దుక్కిటెద్దులు
- ఉషాసుందరి
- భోగీరలోయ
- నారాయణరావు
- శైలబాల
- పారిజాతం
- నవోదయం
- ఏరువాక
కథాసంపుటాలుసవరించు
- తరంగిణి[1] - 7 కథల సంపుటి
- రాగమాలిక[2] - 9 కథల సంపుటి
- అంజలి - 6 కథల సంపుటి
- తూలికా నృత్యం - 3 కథల సంపుటి
- భోగీర లోయ - 6 కథల సంపుటి
- వింధ్యాచలం - 4 కథల సంపుటి
ప్రసిద్ధి చెందిన కథలుసవరించు
- తూలికా నృత్యం
- హంపి శిథిలాలు
- శైలబాల
- వీణ
- నాగలి
- నేలతల్లి
- బొమ్మలరాణి
- సోమసుత
- సూర్యసుత
కళాదర్శకత్వం వహించిన సినిమాలుసవరించు
- మీరాబాయి (1940)
- అనసూయ (1936)
- ధ్రువ విజయం
- పల్నాటి యుద్ధం
పాటల సంపుటిసవరించు
మరెన్నో కథలు, గేయాలు రచించాడు. కొన్ని కథలు కన్నడ భాష లోకి అనువదింపబడ్డాయి.
మూలాలుసవరించు
వనరులు, బయటి లింకులుసవరించు
- వ్యాసం - ఎమ్.ఎల్.నరసింహారావు 'నూరుగురు తెలుగు ప్రముఖులు' ఆధారంగా వ్రాసినది
- బాపిరాజు కవిత 'శశికళ' ఇక్కడ చూడవచ్చును