గంగా నది

భారతదేశంలో ప్రవహించే ముఖ్యమైన జీవనది
(త్రిపధ గామిని నుండి దారిమార్పు చెందింది)

'గంగానది: Ganga River) భారతదేశంలోను, బంగ్లాదేశ్‌లోను ప్రధానమైన నదులలో ఒకటి. భారతదేశం ఆర్థిక వ్యవస్థ, చరిత్ర, సంస్కృతి గంగానదితో అవినాభావంగా ముడివడి ఉన్నాయి. హిందూమతంలో గంగానదికి ఉన్న ప్రాముఖ్యత అత్యున్నతమైనది. "గంగమ్మ తల్లి" అనీ, "పావన గంగ" అనీ, "గంగా భవాని" అనీ ఈ నదిని హిందువులు స్మరిస్తారు. "నీరు" అన్న పదానికి సంస్కృతంలో "గంగ" అన్న పదాన్ని వాడుతారు.

గంగా నది
View of Ghats across the Ganges, Varanasi.jpg
భౌతిక లక్షణాలు
సముద్రాన్ని చేరే ప్రదేశంబంగాళాఖాతము
పొడవు2,525 కి.మీ.

గంగా నది మొత్తం పొడవు సుమారు 2,525 కి.మీ. (1,557 మైళ్ళు). గంగ, దాని ఉపనదియైన యమున కలిసి విశాలమైన మైదానప్రాంతంలో ప్రవహిస్తున్నాయి. సారవంతమైన ఈ "గంగా-యమునా మైదానం" ఉత్తర భారతదేశం, బంగ్లాదేశ్‌లలో విస్తరించి ఉంది. మొత్తం ప్రపంచ జనాభాలో 8.5 % ప్రజలకు (ప్రతి 12 మందిలో ఒకరికి) ఈ మైదానం నివాసస్థానం. ఈ కారణంగా ఈ ప్రాంతంలో తీవ్రమైన ఆర్థిక, పర్యావరణ, సాంఘిక సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి.

భౌగోళికంసవరించు

ఉత్తరాఖండ్ రాష్ట్రం పరిధిలోని హిమాలయ పర్వతాలలో గంగోత్రి అనే హిమానీనదం (Glacier) లో భాగీరథి నది నది ఉద్భవిస్తున్నది. ప్రవాహ మార్గంలో దేవప్రయాగ వద్ద అలకనందనది దీనితో కలుస్తుంది. అక్కడినుండి దీనిని "గంగ" అంటారు. కొంత దూరం హిమాలయాలలో ప్రహించిన ఈ నది హరిద్వారం వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశిస్తున్నది.

 
బంగ్లాదేశ్, భారతదేశాలలో విస్తరించి ఉన్న గంగానది డెల్టా

మైదానాలలో ప్రవహించే మార్గంలో గంగానదితో కోసి, గోమతి, శోణ వంటి ఉప నదులు కలుస్తాయి. అన్నింటికంటే పెద్దదైన యమునానది అలహాబాదు, (ప్రయాగ) వద్ద గంగానదితో కలుస్తుంది. యమున సాంకేతికంగా గంగకు ఉపనదియైనా గాని, యమున చాలా పెద్ద నది గనుక వేరే నదిగా అన్నివిధాల పరిగణింప వచ్చును. గంగతో పాటు యమునకు కూడా హిందూమతంలో పవిత్ర స్థానం ఉంది. ఈ రెండు నదుల ఒడ్డున ఉత్తరభారతదేశంలో పెద్దవైన నగరాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఢిల్లీ, కాన్పూరు, అలహాబాదు, వారాణసి, పాట్నా, కొలకత్తా వంటివి అలాంటి నగరాలలో కొన్ని.

 
వారాణసిలో గంగానదిపై సూర్యోదయం

అలహాబాదు తరువాత మరెన్నో నదులతో కలిసి గంగానది మహా ప్రవాహంగా మారుతుంది. పశ్చిమ బెంగాల్‌లో మాల్దా వద్ద మొదటిసారి చీలుతుంది. అక్కడినుండి హుగ్లీ నది (గంగానది చీలిక) ప్రారంభమౌతుంది. విశాలమైన గంగా-హూగ్లీ డెల్టా ఇక్కడితో మొదలౌతుంది. కొలకత్తా నగరం హూగ్లీ వడ్డున ఉంది. ప్రధానమైన గంగానదిని మాల్దా తరువాత "పద్మ" నది అంటారు. పద్మ నది బంగ్లాదేశ్‌లో ప్రవేశించిన తరువాత బ్రహ్మపుత్రా నది చీలిక అయిన జమునా నది పద్మతో కలుస్తుంది. ఆతరువాత మేఘనా నది కూడా దీనితో కలుస్తుంది. బంగ్లాదేశ్ మైదానాలలో ఈ మహాప్రవాహం అనేకానేకంగా చీలి అక్కడి సుందర వనాలు డెల్టా గుండా ప్రవహించి, తరువాత బంగాళాఖాతం సముద్రంలో కలుస్తాయి.

సుందర వనాలు (Sundarbans) డెల్టా దట్టమైన mangrove వృక్షాలతో కూడిన అరణ్యం. పర్యావరణ పరంగా విశిష్టమైన చాలా వృక్ష, జంతు సంపదకు ఆలవాలం. ప్రత్యేకించి రాయల్ బెంగాల్ పులి, గంగానది డాల్ఫిన్, ఐరావతి డాల్ఫిన్, మంచినీటి షార్క్ చేప (Glyphis gangeticus) వీటిల్లో ముఖ్యమైనవి.

హిందూమతంలో గంగసవరించు

 
వారాణసిలో దశాశ్వమేధ ఘట్టం

పావన గంగసవరించు

హిందూ మతం ఆచారాల ప్రకారం గంగానది చాలా పవిత్రమైనది. పావనం చేసేది. ఒక్కమారు గంగానదిలో స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలనుండి విముక్తి లభిస్తుందని, చనిపోయే ముందు గంగా జలం మింగితే స్వర్గప్రాప్తి నిశ్చయమనీ నమ్మకం. చనిపోయిన తమ కుటుంబీకుల అస్తికలను గంగానదిలో నిమజ్జనం చేయడానికి దూరదూరాలనుండి వారాణాసికి, గయకు gangaప్రయాగకు, ఇతర గంగానదీ తీర్ధాలకు వస్తారు. గంగా నది జలాన్ని ఒక చిన్న పాత్రలో ఇంటిలో ఉంచుకోవడం శుభప్రథమని భావిస్తారు.

గంగా నది తీరాన కుంభ మేళ, ఛత్‌పూజ వంటి ఉత్సవాలు జరుగుతాయి. కుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద జనసమూహం కూడుకొనే ఉత్సవం. వారణాసి హిందువులకు పరమ పవిత్ర స్థానం.

వేదాలలో గంగసవరించు

పురాతన గ్రంథమైన ఋగ్వేదములోని (10.75) నదీస్తుతిలో తూర్పునుండి పడమరవరకు ఉన్న నదుల పేర్లు చెప్పబడ్డాయి. వాటిలో గంగానది పేరు వచ్చింది. ఋగ్వేదము 3.58.56లో ఇలా చెప్పారు - "వీరులారా! మీ వంశగృహం, మీ పవిత్ర స్నేహం, మీ సంపద అన్నీ జాహ్నవి ఒడ్డున ఉన్నాయి." ఇది గంగ గురించి కావచ్చును.[1]

ఋగ్వేదము 1.116.18-19 లో జాహ్నవి గురించి, గంగానదిలోని డాల్ఫిన్‌ల గురించి రెండు వరుస శ్లోకాలలో ప్రస్తావించారు.[2][3]

పురాతన ఆర్య యుగంలో సింధు, సరస్వతి నదులకు ఎక్కువ ప్రాధాన్యం ఉండేది అనిపిస్తుంది. వేదాల కాలంనుండి గంగానది ప్రాధాన్యత పెరిగినట్లుంది.

త్రిపథగసవరించు

మూడు లోకాల్లో పారే నది కాబట్టి గంగానదిని త్రిపథగ అంటారు. స్వర్గలోకం, భూలోకం, పాతాళలోకం అనేవి ఆ మూడు లోకాలు.

  • స్వర్గలోకంలో మందాకిని,
  • భూలోకంలో గంగ, అలకనంద
  • పాతాళలోకంలో భోగవతి

గంగావతరణ గాధసవరించు

 
గంగావతరణం - రాజా రవివర్మ చిత్రం
 
భగీరథుడు గంగను భువికి దింపుట, మహాబలిపురంలోని కుడ్య చిత్రం

గంగ గురించి, గంగావతరణం గురించి ఆసక్తికరమైన పురాణ గాథలు ఉన్నాయి. భాగవతంలోను, బృహద్ధర్మ పురాణంలోను, దేవీ భాగవతంలోను గంగను గూర్చి పెక్కు గాథలున్నాయి.

జగజ్జనని (అంతర్ధానాంశయై) నిరాకారయైన గంగ బ్రహ్మదేవుని కమండలువునందుండెను. ఒకమారు శంకరుడు రాగము లాలాపించినపుడు నారాయణుడు ద్రవీభవించెను. ఆ పరబ్రహ్మ ద్రవమునకు బ్రహ్మదేవుడు తన కమండలువును తాకించగా నిరాకార గంగ జలమయమయ్యెను. శ్రీ మహావిష్ణువు వామనావతారమున త్రివిక్రముడై ఎల్లలోకములను కొలిచినపుడు బ్రహ్మ తన కమండలములోని ఆ నీటితోనే విష్ణుపాదమును కడిగెను. (బ్రహ్మ కడిగిన పాదము - అన్నమయ్య కీర్తన). ఆ పాదమునుండి ప్రవహించునదే దివ్యగంగ.

సూర్యవంశపు రాజైన సగరునకు వైదర్భి, శైబ్య అను ఇద్దరు భార్యలు. శైబ్యకు అసమంజసుడను కుమారుడు, వైదర్భికి 60వేల మంది కుమారులు కలిగిరి. సగరుని అశ్వమేధ యాగాన్ని భంగం చేయడానికి ఇంద్రుడు యాగదేనువును పాతాళంలో దాచాడు. ఆ అశ్వాన్ని వెతకడానికి వెళ్ళిన సగరుని 60వేల మంది పుత్రులు కపిల మహాముని శాపమున భస్మమై పోయారు. వారికి ఉత్తమగతులు లభించాలంటే దివిజ గంగను పాతాళానికి తేవలసి ఉంది. సగరుడు, అతని కొడుకు అసమంజసుడూ తపసు చేసినా ప్రయోజనం లేకపోయింది. అసమంజసుని కొడుకు అంశుమంతుడు. ఆంశుమంతుని కొడుకు భగీరధుడు.

భగీరధుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగకోసం తపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమై "నేను భూమి మీదికి దిగిరావడానికి సిద్ధంగా ఉన్నాను. కాని నా దూకుడు భరించగల నాధుడెవ్వరు?" అని అడిగింది. భగీరధుడు శివునికోసం తపసు చేశాడు. అనుగ్రహించిన శివుడు దిజ గంగను భువికి రాగానే తన తలపైమోపి, జటాజూటంలో బంధించాడు. భగీరధుని ప్రార్థనతో ఒక పాయను నేలపైకి వదలాడు. భగీరధుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగింది. దారిలో జహ్నముని ఆశ్ర్రమాన్ని ముంచెత్తి, "జాహ్నవి" అయ్యింది. ఆపై సాగరంలో ప్రవేశించి, పాతాళానికి చేరి, సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలుగజేసింది. (' (ఈ కథ బాపు దర్శకత్వంలో సీతాకళ్యాణం అనే తెలుగు సినిమాలో కన్నుల పండువుగా చిత్రీకరింపబడింది.)

స్వర్గంలో "మందాకిని"గా, భూలోకంలో "గంగ" లేదా "అలకనంద"గా, పాతాళంలో "భోగవతి"గా మూడు లోకాల్లో ప్రహించినందున గంగను "త్రిపథగ" అంటారు.

వృత్తాంతముసవరించు

ఒకానొక నది. హిమవంతమునందు పుట్టినందున దీనిని హిమవంతుని కూఁతురు అందురు. ఇది దేవలోకమునందుండి భగీరథుని ప్రయత్నమున భూలోకమునకు వచ్చెను. భగీరథుఁడు, తన ముత్తాతలు అగు సగరపుత్రులు కపిల మహామునియొక్క కోపాగ్నిచేత నీఱుకాఁగా, వారికి సద్గతి కలిగింప తలఁచి గంగను కూర్చి తపస్సు చేసి భూలోకమునకు దిగివచ్చునట్లు ప్రార్థించెను. అప్పుడు ఆమహానది తాను భూలోకమునకు వచ్చునెడ తన ప్రవాహవేగమును ధరింపఁగలవారిని ఒకరిని ఏర్పఱచుకొనిన పక్షమున, తాను వచ్చునట్లు ఒప్పుకొనెను. అంతట భగీరథుఁడు రుద్రునిఁగూర్చి తపము ఆచరించి అతని అనుగ్రహము పడసి, గంగాప్రవాహమును వహింప ప్రార్థించెను. అపుడు గంగ మిక్కిలి అట్టహాసముతో భూమికి దిగి రాసాగెను. అది రుద్రుడు చూచి గంగను తన ప్రక్కకు ఆకర్షించి జటాజూటమునందు నిలిపి పిదప కొంతకాలమునకు భగీరథుని ప్రార్థనచే తన శిరస్సునుండి ఏడుబిందువులను భూమిమీఁద వదలెను. అది కారణముగ రుద్రుడు మందాకినీమౌళి అనఁబడును. ఆబిందువులు పడిన చోటు బిందుసరస్సు అనియు ఆబిందుసరస్సునుండి వెడలి గంగ ప్రవహించును అనియు చెప్పుదురు. అట్లు వెడలి ఆగంగ జహ్నుమహాముని యజ్ఞశాలయందు ప్రవేశింపఁగా అతఁడు కోపించి దానిని పానముచేసి, పిమ్మట భగీరథుఁడు ప్రార్థింపఁగా ప్రసన్నుడై తన చెవినుండి వెడల విడిచెను. ఇందువలన గంగకు జాహ్నవి అను పేరు కలిగెను. మఱియు ఈనది భగీరథుని వెంట పాతాళమునకు పోయెను కనుక దీనిని త్రిజగత్కల్యాణి, త్రిపథగ అని అందురు.

త్రివిక్రమావతారమున విష్ణువు భూమియందు ఒక పాదము ఉంచి రెండవపాదముచే మీఁది లోకమును కప్పునప్పుడు బ్రహ్మాండము పగిలి ఆకాశగంగ ఆయన పాదముగుండ క్రిందికి ప్రవహించినందున దీనికి విష్ణుపది అను పేరు కలిగెను. ఊర్ధ్వలోకములయందు వ్యాపింప చేసిన త్రివిక్రమదేవుని పాదమును బ్రహ్మ తన కమండల జలముచే కడుగఁగా ఆజలముప్రవహించి ఈనది ఏర్పడెను అనియు అది కారణముగ దీనికి విష్ణుపది అను పేరు కలిగెను అనియు కొందఱు చెప్పుదురు. .... [ పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879 ]

పురాణము ప్రకారముసవరించు

ఒకానొక నది. హిమవంతమునందు పుట్టినందున దీనిని హిమవంతుని కూతురు అందురు. ఇది దేవలోకమునందుండి భగీరథుని ప్రయత్నమున భూలోకమునకు వచ్చెను. భగీరథుఁడు, తన ముత్తాతలు అగు సగరపుత్రులు కపిల మహామునియొక్క కోపాగ్నిచేత నీఱుకాఁగా, వారికి సద్గతి కలిగింప తలచి గంగను కూర్చి తపస్సు చేసి భూలోకమునకు దిగివచ్చునట్లు ప్రార్థించెను. అప్పుడు ఆమహానది తాను భూలోకమునకు వచ్చునెడ తన ప్రవాహవేగమును ధరింపఁగలవారిని ఒకరిని ఏర్పఱచుకొనిన పక్షమున, తాను వచ్చునట్లు ఒప్పుకొనెను. అంతట భగీరథుఁడు రుద్రునిఁగూర్చి తపము ఆచరించి అతని అనుగ్రహము పడసి, గంగాప్రవాహమును వహింప ప్రార్థించెను. అపుడు గంగ మిక్కిలి అట్టహాసముతో భూమికి దిగి రాసాగెను. అది రుద్రుడు చూచి గంగను తన ప్రక్కకు ఆకర్షించి జటాజూటమునందు నిలిపి పిదప కొంతకాలమునకు భగీరథుని ప్రార్థనచే తన శిరస్సునుండి ఏడుబిందువులను భూమిమీఁద వదలెను. అది కారణముగ రుద్రుడు మందాకినీమౌళి అనబడును. ఆబిందువులు పడిన చోటు బిందుసరస్సు అనియు ఆబిందుసరస్సునుండి వెడలి గంగ ప్రవహించును అనియు చెప్పుదురు. అట్లు వెడలి ఆగంగ జహ్నుమహాముని యజ్ఞశాలయందు ప్రవేశింపఁగా అతఁడు కోపించి దానిని పానముచేసి, పిమ్మట భగీరథుఁడు ప్రార్థింపఁగా ప్రసన్నుఁడై తన చెవినుండి వెడల విడిచెను. ఇందువలన గంగకు జాహ్నవి అను పేరు కలిగెను. మఱియు ఈనది భగీరథుని వెంట పాతాళమునకు పోయెను కనుక దీనిని త్రిజగత్కల్యాణి, త్రిపథగ అని అందురు.

త్రివిక్రమావతారమున విష్ణువు భూమియందు ఒక పాదము ఉంచి రెండవపాదముచే మీది లోకమును కప్పునప్పుడు బ్రహ్మాండము పగిలి ఆకాశగంగ ఆయన పాదముగుండ క్రిందికి ప్రవహించినందున దీనికి విష్ణుపది అను పేరు కలిగెను. ఊర్ధ్వలోకములయందు వ్యాపింప చేసిన త్రివిక్రమదేవుని పాదమును బ్రహ్మ తన కమండల జలముచే కడుగఁగా ఆజలముప్రవహించి ఈనది ఏర్పడెను అనియు అది కారణముగ దీనికి విష్ణుపది అను పేరు కలిగెను అనియు కొందఱు చెప్పుదురు....................... పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879

రోమ్‌లో గంగసవరించు

 
రోమ్ నగరంలో బెర్నిని అనే శిల్పి నిర్మించిన "ఫౌంటెన్"

ఇటలీ రాజధాని రోమ్ నగరంలో "పియజా నవోనా"(Piazza Navona) అనే కూడలిలో "నాలుగు నదుల ఫౌంటెన్" (Fontana dei Quattro Fiumi) అనబడే ఫౌంటెన్ ఉన్నది. గంగ, నైలు, డాన్యూబ్, ప్లాటా అనే నదులకు సంకేతంగా అందులో నాలుగు జలధారలుంటాయి.

కాలుష్యం సమస్యసవరించు

జనసాంద్రత అధికంగా ఉన్న ప్రదేశాలు గంగానదికి ఇరువైపులా ఉన్నందున, చుట్టుప్రక్కల కాలుష్యాన్ని విడుదలచేసే పరిశ్రమలు, ఇందుకు ఒక ముఖ్య కారణం. అందుకు తోడు ప్రజల గృహాలనుండి వెలువడే మురుగు నీరు రోజూ 100 కోట్ల లీటర్లు గంగలో కలుస్తున్నాయని అంచనా. ఈ పరిస్థితిని నివారించడానికి అడపా దడపా కొన్ని చర్యలు తీసికొన్నారు గాని ఫలితాలు చాలా కొద్ది స్థాయిలో ఉన్నాయి.

గంగానది కాలువసవరించు

19వ శతాబ్దంలో హరిద్వార్ నుండి కాన్పూర్ వరకు త్రవ్వబడ్డ గంగా నది కాలువ, దాని అనేకానేక పిల్ల కాలువలు ఈ సారవంతమైన మైదానంలో వ్యవసాయానికి ముఖ్యమైన నీటివనరు. ఉత్తరప్రదేశ్ మైదానంలో ఆర్ధిక పరిస్థితి అభివృద్ధికి, హరిత విప్లవానికీ ఈ కాలువ ఎంతో దోహదం చేసింది.

గంగా స్నానం , గంగా మహిమలుసవరించు

భారతంలో బీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజు కోరికపై బీష్ముడు గంగానది మహిమలు వర్ణించాడు.అవి ఈ క్రింద వివరించబడినాయి.

  • గంగా, యమున ,సరస్వతులు కలసిన సంగమంలో స్నానం చేసినందువలన కలుగు పుణ్యం యజ్ఞ యాగాది దానాదులు చేసినదానికంటే అధికం.
  • గంగాజలం కొంచమైననూ దేహమునకు సోకిన సకల పాపములు నశించును.స్వర్గం లభించును.
  • నరుని ఎముక గంగానదియందు ఎన్ని సంవత్సరములు ఉండునో అతడు అన్ని సంవత్సరములు స్వర్గమున నివసించును.
  • గంగాస్నానమాచరించిన వారు పరిశుద్ధులగుటయేకాక ఏడు తరముల వారు పరిశుద్ధులగుదురు.
  • గంగా జలం త్రాగిన కలుగు ఫలితం నూరు చంద్రాయణం చేసినదానికంటే అధికం.
  • శిరస్సు, మ్య్ఖం , దేహంలందు గంగా మృత్తిక(మట్టి)ను రాసుకుని స్నానమాచరించిన గరుత్మంతుని చూచి పాములు పారిపోయినట్లు పాపములు దూరమగును.
  • ఆధారం లేని జనులకు గంగ ఆధారమగును. దేవతలకు అమృతము వలె మునులకు గంగ ప్రియమైనది.
  • గంగానది తరంగముల నుండి వచ్చిన గాలి దేహమునకు సోకిన పరమానందము కలిగించుచూ పాపములను దూరం చేయును.
  • మరణకాలమందు గంగను తలచినవారికి మోక్షం లభించును.
  • గంగా నది మహిమలు చెప్పుకొను వారికి పాప భయం, రాజ భయం, చోర భయం, భూత భయం మొదలైన భయములు నశించును.
  • గంగ ఎంతయో పుణ్యరాశి అయినందున ఆకాశము నుండి దిగి వచ్చినప్పుడు ఈశ్వరుడు తలమీద ధరించాడు.
  • గంగ మూడు లోకములందు ప్రవహించి పునీతం లోకాలను చేస్తుంది.
  • భగీరధుడు కపిల ముని శాపం వలన భస్మమైన తన పితరులకు మోక్షప్రాప్తి కలిగించడానికి తపమాచరించి బ్రహ్మలోకం నుండి భూలోకానికి తీసుకు వచ్చాడు.
  • గంగా నది బ్రహ్మలోకం నుండి మేరురూపుడైన విష్ణువు నుండి సూర్యుని నుండి చంద్రుని నుండి శివుని జటాజూటం నుండి హిమవంతం నుండి భూమి మీదకు ప్రవహిస్తుంది.
  • గంగ తొలుత విష్ణు పాదం నుండి ఉద్భవించింది కనుక గంగను భక్తితో శరణుజొచ్చిన మోక్షం నిశ్చయం.
  • గంగ మహిమను బ్రహ్మాది దేవతలు స్తుతి చేస్తుంటారు. నరులకు గంగానది మహిమ వర్ణించుట సాధ్యము కాదు.
  • తన వర్ణాశ్రమ ధర్మములు నిర్వహించుతూ గంగనది మహిమలను మనోవాక్కాయకర్మల స్మరించు వారికి సకల సౌఖ్యములు కలుగును.
  • గంగాదేవి ఇతిహాసమును వ్రాసినను విన్ననూ చదివిననూ సకల వ్యాధులు నశించి పరమ శుభములు కలుగును.

వ్యాఖ్యలుసవరించు

  1. Talageri, Shrikant. (2000) The Rigveda: A Historical Analysis; Talageri, S.: "Michael Witzel - An examination of his review of my book". --Griffith translates JahnAvyAm in this verse as "house of Jahnu", even though in similar verses he uses the "on the banks of a river" translation (see Talageri 2000).
  2. Talageri, Shrikant. (2000) The Rigveda: A Historical Analysis.; Talageri, S.: "Michael Witzel - An examination of his review of my book" 2001.
  3. The Sanskrit term shimshumara refers to the Gangetic dolphin (the Sanskrit term for dolphin is shishula). Talageri 2000, 2001

మూలాలుసవరించు

  • Alley, Kelly D. On the Banks of the Ganga: When Wastewater Meets a Sacred River, University of Michigan press (2002) [ISBN 0-472-06808-3]
  • Berwick, Dennison [1], A Walk Along the Ganges. Account of a 3000-km walk from sea to source beside the river. (Hutchinson, London. Rupa Paperbacks, New Delhi)
  • Darian, Steven G., The Ganges in Myth and History, The University Press of Hawaii, Honolulu (1978) [ISBN 0-8248-0509-7]
  • Newby, Eric, Slowly down the Ganges, Lonely Planet Publications (1998) [ISBN 0-86442-631-3]
  • Ganga The River Goddess - Tales in Art and Mythology, by Sri Nitin Kumar.
  • Edmund Hillary, From the Ocean to the Sky: Jet Boating Up the Ganges, Ulverscroft Large Print Books Ltd (November 1980) ISBN 0-7089-0587-0
  • Stephen Alter, Sacred Waters: A Pilgrimage up the Ganges River to the Source of Hindu Culture. Harcourt; 1 Us ed edition (October 17, 2001). ISBN 0-15-100585-0
  • పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879

బయటి లింకులుసవరించు