నూతలపాటి సాంబయ్య
నూతలపాటి సాంబయ్య నాటకరంగ నిపుణుడు. నటుడిగా, దర్శకునిగా, న్యాయనిర్ణేతగా, విశ్లేషకుడిగా, పరిషత్తు నిర్వాహకుడిగా ఇతడు రాణించాడు. [1]
జీవిత విశేషాలుసవరించు
ఇతడు గుంటూరు జిల్లా నడికుడి గ్రామంలో 1939, జూన్ 19వ తేదీన నూతలపాటి కోటమ్మ, కోటయ్య దంపతులకు జన్మించాడు.[2] ఇతని ప్రాథమిక విద్య నడికుడిలో, మాధ్యమిక విద్య దాచేపల్లిలో గడిచింది.తరువాత గుంటూరులోని ఎ.సి.కాలేజీలో ఇంటర్మీడియట్, మచిలీపట్నంలోని హిందూ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. 1962లో ఇతనికి సరస్వతితో వివాహం జరిగింది. 1965లో కల్వకుర్తిలో ఉపాధ్యాయునిగా ఉద్యోగంలో చేరి 1970లో సత్తెనపల్లి హైస్కూలుకు బదిలీ అయ్యాడు.
నాటకరంగంసవరించు
ఇతడు విద్యార్థి దశలోనే 1954లో చెంచునాయుడు, అలెగ్జాండర్ మొదలైన ఏకపాత్రలను ధరించడం ద్వారా నటనను ప్రారంభించాడు. ఆ సమయంలోనే కొన్ని నాటికలకు దర్శకత్వం వహించాడు.1965లో పినిశెట్టి శ్రీరామమూర్తి వ్రాసిన "పల్లెపడుచు" నాటకాన్ని జనరంజకంగా ప్రదర్శించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. పత్రి జగన్నాథరావు దర్శకత్వంలో "మాస్టర్జీ" నాటకాన్ని తయారు చేసి టికెట్టు నాటక ప్రదర్శనలు ఇచ్చాడు. ఈ నాటకాన్ని అనేక నాటక పోటీలలో ప్రదర్శించి అనేక బహుమతులు పొందాడు. భీశెట్టి లక్ష్మణరావు రచించిన "సమాజం మారాలి", గోళ్ళపాటి నాగేశ్వరరావు వ్రాసిన "సరస్వతీ నమస్తుభ్యమ్", భమిడిపాటి కామేశ్వరరావు వ్రాసిన "మనస్తత్వాలు" అనే నాటకాలు/నాటికలు ఇతనికి మంచిపేరును తెచ్చిపెట్టాయి.
ఇతడు సత్తెనపల్లి ప్రమోద ఆర్ట్స్ ఆడీటోరియం నిర్మాణంలో కృషిచేశాడు. దాదాపు పది సంవత్సరాలు దానికి ప్రోగ్రాం ఇన్ఛార్జ్ గా, స్టేజి డైరెక్టరుగా బాధ్యతలు వహించి రాష్ట్రంలోని అనేక కళాసంస్థలను, ఔత్సాహిక నటీనటులను, కళాకారులను, సంగీత, సాహిత్యవేత్తలను సత్తెనపల్లికి ఆహ్వానించి నెలవారీ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశాడు. 1990 నుండి ప్రగతి కళామండలికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.[3] ఆ సంస్థ తరఫున ప్రతి సంవత్సరం నాటికల పోటీలను నిర్వహిస్తున్నాడు.
సినిమాసవరించు
ఇతడు యు.విశ్వేశ్వర రావు దర్శకత్వంలో వెలువడిన హరిశ్చెంద్రుడు అనే సాంఘిక చిత్రంలో నటించాడు.
సన్మానాలు, బహుమానాలుసవరించు
ఇతడు నాటకరంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా 115కు పైగా ఘన సన్మానాలను పొందాడు. ఇతడు నాటకాలను ప్రదర్శించి ఉత్తమ ప్రదర్శనగా, ఉత్తమ నటుడిగా, ఉత్తమ రచయితగా, ఉత్తమ దర్శకుడుగా అనేక బహుమతులు అందుకున్నాడు. ఇతడు సి.నారాయణరెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు, ఎ.కోదండరామిరెడ్డి వంటి ఎందరో ముఖ్యవ్యక్తుల చేతులమీదుగా అవార్డులు అందుకున్నాడు. 1965లో ఉత్తమ ఉపాధ్యాయునిగా గుంటూరులో రాష్ట్ర గవర్నర్ చేత సత్కరించబడ్డాడు.
బిరుదులుసవరించు
- నాటకబంధు
- విశిష్ట సేవారత్నం
- కళాతేజస్వి
- కళారత్న
- నాటకరంగ కృషీవలుడు
- కళాసారథి
మూలాలుసవరించు
- ↑ అక్కినేని కళాపరిషత్ నాటక పోటీల ముగింపు వేడుకలు Sun, 19 Sep 2010[permanent dead link]
- ↑ నాటకారాధ్యుడు, కళాసారథి నూతలపాటి సాంబయ్య - నటకులమ్ మాసపత్రిక - సెప్టెంబరు 2016 - పేజీలు 1-3
- ↑ ప్రబోధాత్మకంగా సాగిన..04/08/2014[permanent dead link]