పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి

కాలజ్ఞాని
(బ్రహ్మంగారు నుండి దారిమార్పు చెందింది)

శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి (వీరప్పయాచార్యులు) ( సా.శ.1608- సా.శ.1693) సాంధ్రసింధు వేదమనుపేర ప్రఖ్యాతి గాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహా యోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాలద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసిన జగద్గురువు . వైఎస్ఆర్ జిల్లా లోని కందిమల్లయ్యపల్లెలో చాలాకాలం నివసించి కాలజ్ఞానం రచించి సా.శ. 1693లో సజీవ సమాధి నిష్ఠనొందినారు. శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామివారి వలన ప్రసిధ్ది పొందుట చేత కందిమల్లయ్యపల్లె తర్వాతి కాలములో బ్రహ్మంగారిమఠంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఏ వింత జరిగిన ఇది వీరబ్రహ్మేంద్రస్వామివారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ జరిగాయి, జరుగుతున్నాయి.

శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి
జననంసా.శ 1608. [1]
ఇతర పేర్లుబ్రహ్మంగారు
వృత్తికాలజ్ఞాన బోధ
సుపరిచితుడు/
సుపరిచితురాలు
అగామి కాలజ్ఞాన కర్త,
పురోగామి సమాజ సంస్కర్త
జీవిత భాగస్వామిగోవిందమ్మ
పిల్లలుకుమారులు: సిద్ధలింగయ్య, గోవిందయ్య, పోతులూరయ్య, శివరామయ్య, ఓంకారమయ్య
కుమార్తె: వీరనారాయణమ్మ [1]

జననం, బాల్యం గురించిన జనశ్రుతి మార్చు

 
వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం, కందిమల్లయపల్లె

గంగా నది తీరంలో బ్రహ్మాండపురవాసులైన విశ్వబ్రాహ్మణ పుణ్యదంపతులైన పరిపూర్ణయాచార్యులు, ప్రకృతాంబలు సంతానార్ధులై కాశీయాత్ర చేశారు. కాశీనగరంలో పరమశివుడు కలలో కనిపించి విష్ణువు ఆమెకు కుమారుడుగా జన్మిస్తాడని చెప్పాడు. కొంతకాలానికి ప్రకృతాంబ గర్భం ధరించింది. నవమాసాలు నిండుతున్న సమయంలో స్వగ్రామానికి బయలుదేరగా, సరస్వతీ నదీ సమీపంలో మగబిడ్డను స్వస్తీశ్రీ చాంద్రమానేన కీలక నామ సంవత్సర కార్తీక శుద్ధ ద్వాదశినాడు ప్రసవించింది. [1] మరుసటిరోజు పరిపూర్ణయాచార్యులు కాలధర్మం చేశారు. ప్రకృతాంబ సమీపంలోని అత్రి మహాముని ఆశ్రమంలో చేరుకుని తనబిడ్డను పెద్దవాణ్ణి చేయమని కోరి తను కూడా తనువు చాలించింది. కర్ణాటక లోని స్కందగిరి పర్వతసానువులో స్థితమైన పాపాఘ్ని మఠాధిపతులు (ప్రస్తుతం ఇది చిక్‌బళ్లాపూర్ జిల్లా లోని కళవారహళ్లిలో ఉన్నది) అయిన విశ్వబ్రాహ్మణ పుణ్యదంపతులు యనమదల వీరభోజయచార్యులు, వీరపాపమాంబ సంతాన భాగ్యం కోసం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ అత్రి మహాముని ఆశ్రమం చేరుకుంటాడు. సంతాన ప్రాప్తి కై పరితపిస్తున్న ఆ పుణ్య దంపతుల చెంతకు, దైవ స్వరూపులు అయిన బ్రహ్మన్ని అత్రి మహాముని అందజేస్తాడు. "వీరభోజయాచార్య.. ఈ బాలుడు మహా మహిమాన్వితుడు, మునుముందు ఈ బాలుడు ఎన్నో వింతలు చూపించబోతున్నాడు" అంటూ ఆ బాలుని వీరభోజయాచార్య దంపతులకు అందజేస్తాడు. ఆ పిల్లవాడు వీరప్పయాచార్యులు గా పాపాఘ్ని మఠాధిపతి గారింట సనాతన సంప్రదాయాల నడుమ పెరుగుతూ వస్తాడు. (ఈనాడు కర్ణాటక లోని పాపాఘ్ని మఠం బ్రహ్మం గారి ప్రథమ మఠంగా పేరు గాంచి దివ్య క్షేత్రంగా వెలుగొందుతున్నది). అతి చిన్న వయసులోనే, బ్రహ్మం గారు కాళికాంబ పై సప్తశతి రచించి అందరిని అబ్బురపరుస్తాడు. బ్రహ్మం గారి పదవ ఏట వీరభోజయచార్యులు స్వర్గాస్తులవుతాడు. అటు పిమ్మట దేశాటన నిమిత్తమై బయలుదేరబోతు తన తల్లి ఆశీర్వాదాలు కోరతాడు. అందుకు వారి తల్లి నాయన ! వీరంభోట్లయ్య (బ్రహ్మం గారు చిన్న నాడు వీరంభోట్లయ్యగా పిలువబడ్డారు, పాపాఘ్ని ప్రస్తుత మఠాధిపతుల వద్ద దీనికి సంబంధించి శాసనాలు ఉన్నాయి), మఠాధిపత్యం స్వీకరించవలసిన నీవు ఇలా తల్లిని వదిలి పెట్టి దేశాటనకు బయల్దేరితే ఎలాగంటూ శోక సంద్రంలో మునిగి పోతుంది. పుత్రుని మీద ఉన్న మమకారం కారణంగా ఆమె అనుమతిని నిరాకరించగా ఆమెను అనేక విధాలుగా అనునయించి జ్ఞానభోద చేశాడు. ఆ సందర్భంలో ఆయన పిండోత్పత్తి జీవి జన్మ రహస్యాలను తల్లికి చెప్పి ఈ అనుబంధాలు మోక్షానికి ఆటంకమని దానిని వదలమని తల్లికి హితవు చెప్పాడు. శరీరం పాంచభౌతికమని ఆకాశం, గాలి, అగ్ని, పృధ్వి, నీరు అనే అయిదు అంశాలతో చేయబడిందని సమస్త ప్రకృతితో కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము అనే జ్ఞానేంద్రియాలద్వారా సంబంధం ఏర్పరచుకొని జ్ఞానం సంపాదిస్తామని, వీటి ద్వారా 'నేను' అనే అహం జనిస్తుందని, ఆత్మ సాక్షిగా మాత్రమే ఉంటుందని, బుద్ధి జీవుని నడిపిస్తుందనీ, బుద్ధిని కర్మ నడిపిస్తుందని, దానిని తప్పించడం ఎవరికీ సాధ్యపడదనీ, ఈ విషయాన్ని గ్రహించి ఎవరు పరబ్రహ్మను ధ్యానిస్తారో వారు మోక్షాన్ని పొందుతారని బోధించి ఆమె వద్ద సెలవు తీసుకుని దేశాటనకు బయలుదేరాడు.

వీరప్పయాచార్యులు కర్నూలు జిల్లాలోని బనగానపల్లెకు వచ్చునప్పటికి 15యేండ్లు కూడా లేని పసివాడు. అతడొక గుట్టపై ఆ రాత్రి పరుండెను. ప్రాతఃకాలముననే ఆ గుట్టకెదురుగానున్న గృహము నుండి సంపన్నురాలైన గరిమిరెడ్డి అచ్చమ్మ గుట్టపైనున్న చిట్టివానిని ప్రశ్నించెను. ఊరు పౌరులనడిగెను. ఆ బాలుడు పశువులు కాయునని, పశువైద్యము తెలుసునని చెప్పగా అచ్చెమ్మగారు బాలుడిని పశువులకాపరిగా ఉండమనెను. ఇప్పడు ఆ ప్రదేశమున చింతమాను మఠముగా కీర్తిగాంచెను.

అచ్చెమ్మగారిచ్చిన సంగటిముద్దను దీసుకొని వీరప్పయ్య గోవులను తీసుకొని రవ్వలకొండ ప్రాంతమునకు బోయెను. ఆలమందనొకచోట జేర్చి ఒక గీతను గీసెను. గోవులాగీతను దాటజాలెను. ఇక్కడనే వీరప్పయ్య గులజారముల్లుతో తాటిఆకుపై కాలజ్ఞానం వ్రాయుట అరంభించాడు. ఒకరోజు మిగతా గోపాలకులు ఈ విషయాలన్నీ చూచి భయపడి పరుగు పరుగున, అచ్చమ్మ గారికి ఈ విషయాన్ని చేరవేస్తారు. మరుసటి రోజున యథావిధిగా ఆవులను తీసుకుని వెళ్లి చుట్టూ గిరి గీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన గావిస్తూ ఉన్న బ్రహ్మం గారిని చూసి ఆశ్చర్య పోతుంది. అచ్చమ్మ. ఆమె అతనిని చులకనగా జూచినందులకు తన్ను క్షమించమని వేడుకొనెను. జ్ఞానోపదేశం చేయవలసిందిగా అభ్యర్ధించింది. అచ్చమ్మ బ్రహ్మం గారిని దర్శించుకున్న రవ్వలకొండలో ఈనాడు సుందరమైన బ్రహ్మం గారి దేవాలయం ఉన్నది. గుహలో కూర్చుని వ్రాసిన తాళపత్ర గ్రంథాలు మఠంలో నేటికీ భద్రంగా ఉన్నాయి.

బ్రహ్మంగారు అచ్చమాంబకు, ఆమె భర్తకు యాగంటి కొండశిఖరంమీద కాలజ్ఞానమునుపదేశించాడు. ఇతర భక్తులు వారిని అనుసరించి ఆ ఉపదేశాన్ని(ముచ్చట్లు) వినేవారు. కావున యాగంటి సమీప పర్వత ప్రాంతమునకు ముచ్చట్ల కొండ అని పేరు వచ్చింది.

ఆ సందర్భంలో అచ్చమ్మ ఎన్నో ప్రశ్నలు అడిగింది.

  • అచ్చమ్మ:- పరమాత్మ ఎక్కడ ఉన్నాడు?
    • బ్రహ్మంగారు:- పరమాత్మ నీలో నాలో ఈ పశువులలో అన్నిటా అతను ఉనికి ఉంటుంది.
  • అచ్చమ్మ:- అతనిని ఎలా తెలుసుకోగలం?
    • బ్రహ్మంగారు:- అనేక మార్గాలున్నప్పటికీ భక్తి, ధ్యాన మార్గాలు శ్రేష్టమైనవి. భక్తి మార్గం అంటే పరమాత్మను తలచుకుంటూ గడపడం. ధ్యానమార్గంలో ప్రాణాయామం లాంటి వాటి ద్వారా పరమాత్మ గురించి తెలుసుకోవడం.
  • అచ్చమ్మ:- అతను స్త్రీయా? పురుషుడా?
    • బ్రహ్మంగారు:- అతను నిరాకారుడు, నిర్గుణుడు, వర్ణనకు అతీతుడు.

ఇలా చెప్పి వీటిని ఏకాగ్రతతో ధ్యానించమని చెప్పి తరువాత కాలజ్ఞానం గురించి చెప్పాడు.

అచ్చమాంబ బ్రహ్మంగారు తపస్సుచేసుకోటానికి తన గృహ ప్రాంగణంలో నేలమఠం నిర్మించింది. ఈ మఠంలో తపస్సు నిరాటంకంగా జరిగిపోయింది. ఇక్కడే ప్రుట్టు గుడ్డి వాడైన అచ్చమాంబ కొడుకు బ్రహ్మానంద రెడ్డికి చూపు ప్రసాదించాడు. ఇది నవాబుకోట సమీపమున ఉంది. ప్రస్తుతం ఇక్కడ గల శివలింగమునకు బ్రహ్మముగారి వెండి విగ్రహమును తగిలించిరి.

బనగానపల్లెలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటి ఆవరణలో బ్రహ్మంగారు అతనిచే వ్రాయబడిన 14000 కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టి దానిపై ఒక చింత చెట్టు నాటి ఉంచాడు. ఆ గ్రామంలో ఏవైనా ప్రమాదాలు, ఆపదలు కలిగే ముందు సూచనగా ఆ చింతచెట్టు పూలు అన్నీ రాలిపడతాయని అక్కడి ప్రజల విశ్వాసం. ఆ చెట్టు పంగలలో ఎర్రటి రక్తంలా ప్రవహిస్తూ ఉంటుంది. అది ఆరినప్పుడు కుంకుమలా ఉంటుంది. వ్యాధులు, ప్రమాదాలు నివారణ కొరకు దానిని స్వీకరిస్తుంటారు. ఆ చింతచెట్టుకు నిత్యదీపారాధన చేస్తూ ఉంటారు. ఆ చింత చెట్టు కాయలు లోపల నల్లగా తినడానికి పనికిరానివై ఉంటాయి.

బనగానపల్లె నవాబుకు జ్ఞానబోధ మార్చు

 
వీరబ్రహ్మేంద్రస్వామి మఠం, కందిమల్లయపల్లె

బనగానపల్లె నవాబు బ్రహ్మంగారి గురించి విని అతను నిజంగా మహిమాన్వితుడో కాదోనని స్వయంగా తెలుసుకోవాలని అతనిని తన వద్దకు పిలిపించాడు. అతను రాగానే స్వయంగా స్వాగతంచెప్పి, అతనును ఆసీనులను చేసాడు. స్వామివారికి ఫలహారాలు తీసుకురమ్మని సేవకుని ఆజ్ఞాపించాడు. అయినా అతనికి మాంసాహారం తీసుకురమ్మని సేవకునికి ముందుగానే సూచన చేసాడు. నవాబు ఆదేశానుసారం సేవకుడు మాంసాహారం నింపిన పళ్ళెరాన్ని బ్రహ్మంగారి ముందు ఉంచాడు. అతను పళ్ళెరం పైనున్న వస్త్రాన్ని తొలగిస్తే ఫలహారం స్వీకరిస్తానని చెప్పగా, సేవకుడు అలాగే చేసాడు. ఆ పళ్ళెంలోని మాంసాహారం పుష్పాలుగా మారటం అక్కడి వారిని ఆశ్చర్యచకితులను చేసింది. ఈ సంఘటనతో నవాబుకు అతను మహిమలపై విశ్వాసంకుదిరి, అతనిని పలువిధాల ప్రశంసించాడు. ఆ సందర్భంలో బ్రహ్మంగారు నవాబు సమక్షంలో కొన్ని కాలజ్ఞాన విశేషాలు చెప్పాడు. ఆ తరువాత నవాబు అతనుకు డెబ్బై ఎకరాల భూమిని దానంచేసి, దానిని మఠం నిర్వహణకు ఉపయోగించవలసినదిగా కోరి, ఉచిత మర్యాదలతో సత్కరించి సాగనంపాడు.

  • విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుంది. అలా ఏడెనిమిది సంవత్సరాలు ఉండి, ఆ చెట్టు నశిస్తుంది. అది మొదలు దేశంలో తీవ్రమైన కరువుకాటకాలు ఏర్పడతాయి.
  • కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి. ఆ ధాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్ళలో రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారు. జనులు అరచి అరచి చస్తారు.
  • కలియుగం 5000 సంవత్సరాలు గడిచేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరూ మిగలరు. ఆ వంశానికి ఆస్తి అయిన గోవులలో ఒక్క గోవుకూడా మిగలదు.
  • బనగాన పల్లె నవాబు పాలనకూడా క్రమంగా నాశనమౌతుంది. అతనికి వచ్చే ఆదాయం క్షీణిస్తుంది.

కందిమల్లయపల్లె, పెద్దకొమెర్ల జీవితం మార్చు

 
వీరబ్రహ్మేంద్రస్వామి, ఈశ్వరీదేవి గ్రామోత్సవ దృశ్వ చిత్రం, కందిమల్లయపల్లె

ఆపై అతనుకు దేశాటన చేయాలని కోరిక కలగటంతో శిష్యులకు నచ్చచెప్పి దేశాటనకు బయలుదేరాడు. ఆసమయంలో పర్యటిస్తూ కందిమల్లయపల్లె చేరుకున్నాడు. ఆ ఊరు అతనిని ఆకర్షించడంతో అక్కడ నివాసం ఏర్పరుచుకుని మామూలు వడ్రంగిలా కులవృత్తిని చేస్తూ జీవించడం ప్రారంభించాడు.

గ్రామంలో అమ్మవారి జాతర కొరకు చందా ఇవ్వమని పెద్దలు అతనిని కోరగా తాను పేదవాడినని ఏమీ ఇవ్వలేనని బదులిచ్చాడు. వారు అతనిని చులకనచేసి మాట్లాడగా అతను తాను ఏదైనా ఇస్తానని కానీ అమ్మవారి గుడిదగ్గర ప్రజల సమక్షంలో మాత్రమే తీసుకోవాలని కోరాడు. వారు అందుకు సమ్మతించి అమ్మవారి గుడి దగ్గరకు అందరూ చేరారు. అందరి ముందు గుడి ముందు నిలబడి గ్రామ మునసబు చుట్టకాల్చుకోవటానికి అమ్మవారిని ఉద్దేశించి 'పోలేరీ చుట్టకు నిప్పు పట్టుకునిరా ' అని కోరగానే అదృశ్యరూపంలో అమ్మవారు అతనుకు నిప్పు అందించగా ఊరివారు దిగ్భ్రాంతి చెంది అతనును గౌరవించడం మొదలుపెట్టారు. అతను వారికి ధర్మబోధ చేయడం మొదలు పెట్టారు. ఇలా అతను గురించి చుట్టూ ఉండే ప్రదేశాలకు తెలిసి రావడంతో వారు అతనుకోసం తరలి రావడం మొదలుపెట్టారు.

కొంతకాలం తరువాత బ్రహ్మంగారి కందిమల్లయపాలెం విడిచి తిరిగి దేశాటన సాగించాడు. అలా పెద్దకొమెర్ల అనే ఊరు చేరుకుని అక్కడ నివసించసాగారు. అతను అక్కడ సామాన్య జీవితం ప్రారంభించారు. ఆ ఊరిలో ఒక భూస్వామి వ్యాధి బారినపడి మరణించగా అతనిని శ్మశానానికి తీసుకు వెళుతున్న సమయంలో బ్రహ్మంగారు తన ఇంటి ముంగిట నుండి చూసి 'ఏమైందని' అని అడిగాడు. వారు 'అతడు మరణించాడు. శ్మశానానికి తీసుకు వెళుతున్నాం ' అని బదులు చెప్పారు.కానీ బ్రహ్మంగారు 'ఇతడు మరణించలేదుకదా ఎందుకు తీసుకు వెళ్ళడం ఇతనిని దింపుడు కళ్ళెం వద్ద దించండి' అని చెప్పి వారి వెంట వెళ్ళాడు.వారు అతనిపై అవిశ్వాసంతోనే దింపుడు కళ్ళం వద్ద దింపారు. అప్పుడు బ్రహ్మంగారు భూస్వామి శరీరాన్ని తల నుండి పాదం వరకు చేతితో స్పృసించగానే అతను జీవించాడు. అది చూసిన వారంతా అతనుపట్ల భక్తి ప్రదర్శించడం మొదలు పెట్టారు.

బ్రహ్మంగారు చేసిన మహిమలను విశ్వసించని కొందరు అతనును ఎగతాళి చేసే ఉద్దేశంతో సజీవంగా ఉన్న వ్యక్తిని పాడె మీద తీసుకు వచ్చి 'ఇతనికి ప్రాణం పోయండి 'అని వేడుకున్నారు. బ్రహ్మంగారు ధ్యానంలో నిజం తెలుసుకుని 'మరణించిన వ్యక్తికి ఎలా ప్రాణం పోయగలను' అని బదులిచ్చాడు. వెంటనే పాడె మీదున్న వ్యక్తి మరణించడం అందరిని ఆశ్చర్యచకితులను చేసింది. వారు బ్రహ్మంగారిని మన్నించమని వేడగా అతనువారికి బుద్ధి చెప్పి మరణించిన వ్యక్తి తలని చేతితో స్పృజించి ఆతన్ని సజీవుని చేశారు. ఆ తరువాత అక్కడి ప్రజలు అతనును దేవుడిలా కొలవసాగారు. ఊరి ప్రజల కోరికపై అతను వారికి జ్ఞానబోధ చేయడం ప్రారంభించారు. తనవద్దకు వచ్చినవారికి వేదాంతం వినిపిస్తూ కులమతాలకు అతీతంగా అంతా సమసమాజం బాటన నడవాలని బోధించాడు. బ్రహ్మం గారు రాబోయే కాలంలో జరగబోయే విపత్తుల గురించి తన కాలజ్ఞానంలో సుస్పష్టంగా వివరించి, జనులందరిని సన్మార్గంలో నడువమని బోధించాడు.

వివాహం మార్చు

బ్రహ్మంగారి బోధలు విని పెద్దకొమెర్ల లోని ప్రజలు అతను అనుచరులుగా మారారు. ఆ ఊరిలోని శివకోటయ్యాచార్యులనే విశ్వబ్రాహ్మణుడు ప్రారంభంలో బ్రహ్మంగారిని నమ్మకపోయినా తరువాత నమ్మకం ఏర్పడి తన కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం చేస్తానని కోరాడు. అందుకు బ్రహ్మంగారు అంగీకారం తెలపాడు. వివాహానంతరం కొంతకాలం అతను భార్యతో జీవిస్తూ శిష్యులకు జ్ఞానబోధ చేసాడు. ఆరుగురు సంతానం కలిగారు.

సిద్దయ్యను శిష్యునిగా చేసుకొనుట మార్చు

బ్రహ్మంగారు వైదిక మతావలంబీకులైనా కులమతాలకు అతీతంగా వ్యవహరించాడు. స్త్రీల పట్ల ఆదరణను ప్రదర్శిస్తూ తన భావాలను వెలిబుచ్చాడు. అలాగే దూదేకుల కులానికి చెందిన సైదులను తనశిష్యునిగా చేసుకున్నాడు. అతను ఉన్నత భావాలను భక్తి శ్రద్ధలను మెచ్చుకుని తన ప్రియశిష్యుని చేసుకుని అతనుకు అనేక ఉన్నత భోదలు చేసాడు. అతను జ్ఞానంలభించినవాడని ప్రశంసించి జ్ఞానం సిద్దించింది కనుక సిద్దయ్యగా నామకరణం చేసాడు."సిద్ధా" అనే మకుటంతో కొన్ని పద్యాలను అసువుగా చెప్పాడు.

బ్రహ్మంగారిపై ఆరోపణ మార్చు

ఒకరోజు బ్రహ్మంగారికి కడపనవాబు నుండి ఒక లేఖ వచ్చింది. అందులో పీరు సాహెబ్ తన కుమారుడైన సిద్దయ్యను బ్రహ్మంగారు ప్రలోభపెట్టి హిందుగా మార్చాడని ఆరోపణ చేసినందువలన విచారణ నిమిత్తం బ్రహ్మంగారిని రమ్మని నవాబు పంపిన ఆదేశం ఉంది. బ్రహ్మంగారు ఒంటరిగా నవాబును కలుసుకునేందుకు బయలు దేరగా సిద్దయ్య ఇది తనకు సంబంధించిన విషయంకనుక తాను వెళతానని చెప్పి తాను సేవకులతో బయలుదేరాడు. మార్గమధ్యంలో సేవకులకు తెలియకుండా బయలుదేరి ముందుగా కడప చేరుకుని ఊరి బయట బసచేసాడు. అక్కడ అతను ధ్యానంచేస్తూ తనదగ్గరకు అధికంగా వచ్చే మహమ్మదీయ భక్తులకు జ్ఞానబోధచేస్తూ వారి వేషధారణ మార్చి కాషాయ దుస్తులు రుద్రాక్షలు తిలకధారణ చేయిస్తూ వచ్చాడు.ఇది తెలుసుకున్న నవాబు కుపితుడై సిద్దయ్యను తన వద్దకు రమ్మని ఆదేశం పంపాడు.ఆదేశంపై వచ్చిన సిద్దయ్య నిర్భయత్వానికి నవాబు ఆగ్రహించి 'మహమ్మదీయుడివై హిందువుని ఆశ్రయించి నీ మతన్ని అవమానించావు కనుక నీవు శిక్షార్హుడువి ఇందుకు నీ జవాబేమిటి 'అని గద్దించాడు. జవాబుగా సిద్దయ్య చిరునవ్వు నవ్వగా అది చూసి నవాబు మరింత ఆగ్రహించి 'నీకు మహిమలు తెలుసుకదా అవి చూపు లేకుంటే కఠిన శిక్ష వేస్తాను 'అన్నాడు. జవాబుగా సిద్దయ్య 'గురువుగారి ఆజ్ఞ లేనిదే మహిమ చూపకూడదు కాని తప్పని సరి పరిస్థితిలో గురువుగారి మహిమ చూపటానికి ఒకటి ప్రదర్శిస్తాను. మీరు పెద్ద బండ రాయిని తెప్పించండి' అన్నాడు. సిద్దయ్య అక్కడి వారికి ఆపద కలగకూడదని ఖాళీ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆబండను పెట్టించి గురువుగారిని తలచుకుని సలాం చేశాడు. సలాం చేసిన వెంటనే ఆబండ ముక్కలైంది.అది చూసి నవాబు తన తప్పు తెలుసుకొని జ్ఞానబోధ చేయమని కోరగా సిద్దయ్య అది తనపని కాదని తన గురువుగారు తగిన సమయం వచ్చినప్పుడు చేస్తారని చెప్పి తిరిగి వెళ్ళాడు.

కక్కయ్యను శిష్యునిగా చేసుకొనుట మార్చు

బ్రహ్మంగారు తనశిష్యుడు సిద్దయ్యకు యోగవిద్య కుండలినీశక్తి శరీరంలోని యోగచక్రాలు గురించి వివరిస్తూ శరీరం ఒకదేవాలయమని అందులో దేవతలుంటారని కుండలినీ శక్తిని జాగృతం చేయడం ద్వారా వారిని దర్శించవచ్చని వివరిస్తుండగా కక్కయ్య అనే వ్యక్తి ఇదంతా విన్నాడు. కక్కయ్య శరీరంలోని అద్భుతాలు చూడాలన్న ఆతురతతో ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో అతని భార్య నిద్రించడం చూడగానే ఆమె శరీరంలో దేవతలను చూడాలని ఆమెను ముక్కలుగా నరికి వేశాడు. అయినా ఆమె శరీరంలో రక్తమాంసాలు తప్పఏమీ కనిపించకపోవడంతో తనను బ్రహ్మంగారి మాటలు మోసపుచ్చాయని విలపించాడు. అతను మాటలు నమ్మి భార్యను నరికివేసానని బ్రహ్మంగారు దీనికంతా కారణమని అతను దొంగ అని అందరికీ చెప్పాలని అనుకున్నాడు. ముందుగా అతను దగ్గరకు వెళ్ళి అతనిని అడగాలనుకుని బ్రహ్మంగారి దగ్గరకు వెళ్ళి జరిగినది చెప్పి అతనిని దూషించడం మొదలుపెట్టాడు. బ్రహ్మంగారు కక్కయ్య అజ్ఞానానికి ఆశ్చర్యపడి వెంటనే 'కక్కా నేను చెప్పింది అసత్యం కాదు నేను అసత్యం పలకను నిదర్శనంగా నీ భార్యను బ్రతికిస్తాను ' అనిచెప్పి అతని వెంట అతని ఇంటికి వెళ్ళి అతని భార్య శరీరంపై మంత్రజలం చల్లగానే ఆమె నిద్ర నుంచి మేల్కొన్నట్లు లేచి కూర్చుంది. కక్కయ్య బ్రహ్మంగారి మహిమ తెలుసుకుని అతన్ని మన్నించమని పలు విధాల వేడుకుని తనను శిష్యుడిగా చేర్చుకొనమని తాను వెంట నడుస్తానని బ్రహ్మంగారిని వేడుకున్నాడు. బ్రహ్మంగారు ఎవరూ 'నన్ను పూజించవద్దు నాశిష్యులెవరూ నన్ను పూజించరు దేవుడిని అన్వేషిస్తారు అదే అందరికి ఆమోదయోగ్యము నువ్వు కూడా అదే పని చెయ్యి' అని చెప్పి తిరిగి వెళ్ళాడు.

కొంత కాలం తరువాత అతను తిరిగి దేశాటనకు బయలుదేరాడు. అతను ముందుగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించి రాజమండ్రి వరంగల్లులో పర్యటించి హైదరాబాదు చేరాడు.

హైదరాబాదు పర్యటన మార్చు

గోల్కొండ నవాబు బ్రహ్మంగారి గురించి తెలుసుకొని, అతను కొరకు కబురు పంపగా బ్రహ్మంగారు నవాబు వద్దకు వెళ్ళాడు. ముందుగా నవాబు అతనుతో 'మీరు జ్ఞాని అయినా.. దైవాంశసంభూతుడుగా నమ్మలేనని, ఏదైనా మహిమ చూపితే విశ్వసించగలను 'అని పలికాడు. బ్రహ్మంగారు వెంటనే ఒక గిన్నెలో నీళ్ళు తెప్పించమని కోరాడు. సేవకుడు తీసుకువచ్చిన నీటితో దీపం వెలిగించాడు. అది చూసిన నవాబు విశ్వాసం కుదిరిందని జ్ఞానబోధ చేయమని కోరాడు. నవాబు కోరికపై బ్రహ్మంగారు జ్ఞానబోధ చేసాడు.

బనగానపల్లె తిరుగు ప్రయాణం మార్చు

బ్రహ్మంగారు హైదరాబాదు లో కొంతకాలం ఉండి తిరుగు ప్రయాణానికి ఆయత్తమయ్యారు. శిష్యబృందంతో రోజంతా ప్రయాణించి అలసిపోయి ఒక ప్రదేశంలో విశ్రమించారు. అతను తన శిష్యుడైన వెంకటయ్యనుద్దేశించి 'కొంత సమయంలో ఒక అద్భుతం జరగబోతుంది' అని యథాప్రకారం సంభాషించసాగాడు. అక్కడికి కొంత దూరంలో ఏవోమాటలు వినిపించగా అది ఏమిటో తెలుసుకొని వద్దాం రమ్మని శిష్యులతో అక్కడికి వెళ్ళగా అక్కడ ఒక బ్రాహ్మణ స్త్రీ కుష్టువ్యాధిగ్రస్తుడైన భర్త శరీరాన్ని ఒడిలో పెట్టుకొని రోదిస్తూ కనపడింది. బ్రహ్మంగారు ఆమెనడిగి వ్యాధి వివరాలు కనుక్కొని ఆ స్త్రీకి ఊరట కలిగిస్తూ 'మీ గత జన్మ పాపం వలన ఇది సంక్రమించింది నేను మీకు పాపవిముక్తి చేస్తానని చెప్పి బ్రాహ్మణ యువకుని చేతితో తడిమాడు. వెంటనే అతనికి వ్యాధి మాయం అయింది. వారు అతనును కొనియాడి తమ ఊరికి వచ్చి జ్ఞాన బోధ చేయమని కోరగా అతను తగిన సమయం వచ్చినప్పుడు వస్తానని వారిని పంపి వేసాడు.

బ్రహ్మంగారి శిష్యులకు సిద్ధయ్యపై కించిత్తు అసూయ ఉండటం గ్రహించి దానిని పోగొట్టి సిద్దయ్య గురుభక్తిని చాటటానికి ఒక సారి తన శిష్యులందరిని పిలిచి చనిపోయి కుళ్ళి దుర్గంధ భరితమైన కుక్క మాంసాన్ని తినమని శిష్యులందరికి ఆదేశించాడు మిగిలిన శిష్యులందరూ దానికి నిరాకరించగా సిద్దయ్య మాత్రం భక్తిగా దానిని భుజించాడు. ఆ తరువాత బ్రహ్మంగారు మిగిలిన శిష్యులకు సిద్ధయ్య భక్తి ఎలాంటిదో వివరించాడు. అనేక విశిష్ట జ్ఞానబోధలు సిద్దయ్యకు ప్రత్యేకంగా చేసాడు.

విశ్వబ్రాహ్మణులకు తత్వోపదేశం మార్చు

బ్రహ్మంగారు యధావిధిగా దేశాటనకు బయలుదేరి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ నంద్యాల సమీపంలోని ఒక గ్రామంలో భోజనార్ధం విశ్రాంతి తీసుకుంటూ దాహం కోసం ఒక విశ్వబ్రాహ్మణుని ఇంటి ముంగిట నిలబడి మంచి నీళ్ళు ఇమ్మని అడిగాడు. అతను పనిమీద నిమగ్నమై నీళ్ళు ఇవ్వడం కుదరదని ప్రక్కనే ఉన్న బావిలో చేదుకుని త్రాగమని చెప్పాడు. బ్రహ్మంగారు వినకుండా నీళ్ళు కావాలని తిరిగి అడిగాడు. విశ్వబ్రాహ్మణుడు ఆగ్రహించి కరుగుతున్న లోహం తీసుకువచ్చి త్రాగమని అన్నాడు. బ్రహ్మంగారు మారు పలుకక ఆ లోహ ద్రవాన్ని త్రాగి వేసాడు. అది చూసిన విశ్వబ్రాహ్మణుడు భయపడి తాను అపరాధంచేశానని క్షమించమని వేడుకున్నాడు. అందుకు బ్రహ్మంగారు "నాకు అజ్ఞానం మీద తప్ప ఎవరిమీద కోపం లేదు" అని చెప్పాడు. ఆ తరువాత ఆ విశ్వబ్రాహ్మణుని కోరికపై ఆతిధ్యం స్వీకరించి బయలుదేరి కర్నూలు జిల్లాలోని పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుని నంద్యాల చేరుకున్నాడు. నంద్యాలలోని ప్రజలు బ్రహ్మంగారికి భోజనవసతులు కల్పించి ధర్మబోధ విని ఆనందించారు. నంద్యాలలో విశ్వబ్రాహ్మణులను పంచాననం అనేవారు. బ్రహ్మంగారు వారి వద్దకు వెళ్ళి తమకు ఆహారాన్నిచ్చి క్షుద్భాధ తీర్చమని అడిగాడు. వారు అతనిని ఎంత అన్నం అవసరమౌతుందని పరిహసించారు. బదులుగా బ్రహ్మంగారు "మాకు ఎంత అవసరములే మాకడుపు నిండినంత చాలు" అన్నారు. వారు బ్రహ్మంగారిని అవమానించాలని "అలాకాదు మీరు తక్కువ తింటే ఎలా ఒకపుట్టి బియ్యం వండి వడ్డిస్తాం, మీరు అంతా తిని మమ్ములను సంతృప్తి పరచండి" అన్నారు. అందుకు బ్రహ్మంగారు సమ్మతించగా వారు పుట్టెడు బియ్యం వండించి భుజించమని చెప్పారు. అందుకు బ్రహ్మంగారు ఈ పనికి తాను అవసరంలేదని తనశిష్యుడు సిద్దయ్య చాలని అన్నాడు. బ్రహ్మంగారు ఒక్క ముద్ద అన్నం తీసుకుని మిగిలినదానిని తినమని సిద్దయ్యను ఆజ్ఞాపించాడు. సిద్దయ్య అలాగే ఆన్నమంతా తిని ఇంకా కావాలని సైగ చేసాడు. ఇది చూసిన విశ్వబ్రాహ్మణులు నిర్గాంతపోయి తమని క్షమించమని బ్రహ్మంగారిని వేడుకున్నారు. అతను చిరునవ్వుతో తనచేతిలోని అన్నాన్ని సిద్దయ్యకు అందించగా అది ఆరగించిన తరువాత అతని ఆకలి తీరింది. విశ్వబ్రాహ్మణులు బ్రహ్మంగారికి పూజలు చేసి తత్వబోధ చేయమని కోరారు. అతను వారికి జ్ఞానబోధ చేసి అక్కడి నుండి బయలుదేరి అహోబిలం చేరారు.

సమాధి మార్చు

బ్రహ్మంగారు ఒకరోజు కుటుంబసభ్యులను, శిష్యులను సమావేశపరచి కొద్దిరోజులలో సమాధిలో ప్రవేశించబోతున్నట్లు, తనతరవాత, తన కుమారుడు గోవిందయ్యకు మఠాధిపత్యం ఇస్తున్నట్లు ప్రకటించాడు. సిద్ధయ్యకు విశ్వఖ్యాతి కల్పించాలని సిద్దయ్యను పూలు తీసుకురమ్మని అరణ్యానికి పంపి బ్రహ్మంగారు సమాధిలోకి వెళ్ళాడు. సిద్ధయ్య తిరిగి వచ్చి గురువు కోసం విపరీతంగా విలపించ సాగాడు. బ్రహ్మంగారు శిష్యునిపై కరుణించి సమాధిపై రాతిని తొలగించమని ఆదేశించి రాతిని తొలగించిన తరువాత బయటికి వచ్చి సిద్ధయ్యను ఓదార్చాడు. ఆ పై సిద్దయ్య కోరికపై పరిపూర్ణంను బోధించాడు. ఆ తరువాత సిద్ధయ్యకు దండం, కమండలం, పాదుకలు, శిఖాముద్రికను ఇచ్చి తిరిగి సమాధిలో ప్రవేశించాడు.

స్మరణలు మార్చు

బ్రహ్మంగారి మఠం మార్చు

 
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం, బ్రహ్మంగారి మఠం

బ్రహ్మంగారి మఠం ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. కర్ణాటక, తమిళనాడు లతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆధ్యాత్మిక కేంద్రం వైఎస్ఆర్ జిల్లాలోని బ్రహ్మంగారిమఠం మండలంలో వుంది.

బ్రహ్మంగారి కుమార్తె వీరనారాయణమ్మ సంతతికి చెందిన (ఏడవ తరం) వీరభోగ వసంత వేంకటేశ్వర స్వామి 11వ మఠాధిపతి. ఇతను బ్రహ్మంగారి సాహిత్యం, సారస్వతాలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చాడు.[2] ఇతను 2021 మే 8 న కాలంచేశాడు. [3]మఠంలో నిత్యాన్నదానం జరుగుతుంది. బ్రహ్మంగారి పేరుతో పలు విద్యాసంస్థలు వెలిశాయి. ఇంజినీరింగ్ కళాశాల, జూనియర్ కళాశాల, వేద పాఠశాల (తమిళనాడు భక్తుడు పట్నాల సన్యాసి రావు ఏర్పాటు) నడుస్తున్నాయి.

సినిమా మార్చు

ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రాజకీయాలలోనికి రాకముందు మఠంలో 14 రోజులున్నారు. బ్రహ్మంగారి చరిత్రను కూలంకషంగా తెలుసుకొని శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర చిత్రాన్ని నిర్మించాడు.

జలాశయానికి పేరు మార్చు

ముఖ్యమంత్రి అయ్యాక తెలుగుగంగ పధకానికి శంకుస్థాపన చేసి మఠాన్ని ఆనుకొనియున్న జలాశయానికి బ్రహ్మం సాగర్ గా నామకరణం చేశారు.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 కన్నెగంటి రాజమల్లాచారి (1998-03-01). పోతులూరి వీరబ్రహ్మం గారి జీవితం, రచనలు పరిశీలన (డాక్టరేట్ డిగ్రీ పొందిన గ్రంథం). సరోజ పబ్లికేషన్స్. p. 2.
  2. పులికొండ సుబ్బాచారి (2021-05-16). "వీరబ్రహ్మం అడుగుజాడల్లో..." ఆంధ్రజ్యోతి.
  3. "వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి లేని లోటు పూడ్చలేనిది : ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ తిరుపతయ్య". విశ్వసంవాదకేంద్ర. 2021-05-12. Archived from the original on 2021-05-26. Retrieved 2021-05-26.

బయటి లింకులు మార్చు