ఆదిత్య 369

1991 సినిమా

ఆదిత్య 369, 1991లో విడుదలైన తెలుగు సినిమా.[1] బ్యాక్ టు ద ఫ్యూచర్ అనే ఆంగ్ల చిత్రం, ఇంకా హెచ్.జి.వెల్స్ టైం మెషీన్ నుండి స్ఫూర్తి పొంది తీసిన చిత్రం. సైన్స్‌ఫిక్షన్‌ను, చరిత్రను, ప్రేమను, క్రైమ్‌ను జోడించి తీసిన ఈ సినిమా బాలకృష్ణ నటించిన సినిమాలలో ఒక ముఖ్యమైన గుర్తింపును పొందింది.[2]

ఆదిత్య 369
దర్శకత్వంసింగీతం శ్రీనివాసరావు
రచన
నిర్మాతఅనితాకృష్ణ, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం (సమర్పణ)
తారాగణం
ఛాయాగ్రహణం
కూర్పుగౌతంరాజు
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1991 జూలై 18 (1991-07-18)
సినిమా నిడివి
141 ని
దేశంభారతదేశం
భాషతెలుగు

చిత్రకథ మార్చు

1991 లో ప్రొఫెసర్ రాందాస్ అనే శాస్త్రవేత్త తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న ప్రయోగశాలలో కాలంలో ప్రయాణించగలిగే ఒక యంత్రాన్ని తయారు చేయడానికి వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటాడు. చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా అది పనిచేస్తున్నట్లు కనిపించదు. రాజావర్మ అనే స్మగ్లర్‌కు పురాతన వస్తువులు సేకరించడం హాబీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వస్తు సంగ్రహాలయాల నుంచి విలువైన వస్తువులు దొంగతనం చేయడం అతని అలవాటు. అందుకు అవరమైతే ఎంతటి నేరాన్నైనా చేయగలడు. కృష్ణ కుమార్ కి టి.వి.లు తయారు చేసే కంపెనీ ఉంటుంది. అతను రాందాస్ కూతురు హేమను ప్రేమిస్తాడు. ఒకసారి రాజావర్మ మనుషులు సాలార్ జంగ్ మ్యూజియం నుంచి 16వ శతాబ్దం నాటి విజయనగర సామ్రాజ్యానికి చెందిన విలువైన వజ్రాన్ని దొంగిలించడం కోసం ఒక రాత్రి అక్కడికి వెళతారు. ఆ మ్యూజియం చూడటానికి వచ్చి అక్కడ తప్పిపోయిన కిషోర్ అనే కుర్రాడు దొంగతనాన్ని చూస్తాడు. ఆ దొంగలు కిషోర్ వెంటపడగా భవనం పై నుంచి కిందపడబోతున్న అతన్ని కృష్ణ కుమార్ కాపాడతాడు. ఆ దొంగతనం గురించి కిషోర్ కృష్ణకుమార్ తో పాటు ఇంకొంతమందికి చెప్పినా ఎవ్వరూ అతని మాటలు నమ్మరు. నిజానికి దొంగలు అక్కడి వజ్రాన్ని దొంగిలించి దాని స్థానంలో నకిలీ వజ్రాన్ని పెట్టి ఉంటారు.

కిషోర్ కి హేమ ద్వారా ప్రొఫెసర్ రాందాస్ తయారు చేస్తున్న కాలయంత్రం గురించి తెలుస్తుంది. ఒక రాత్రి అతను ఇంకొంత మంది పిల్లలతో కలిసి ఆ యంత్రంలో చొరబడి, దొంగతనం జరిగిన రాత్రి సమయానికి తిరిగి వెళ్ళాలనుకుంటారు. అదే సమయానికి ఒక దొంగను తరుముతూ వచ్చిన ఒక పోలీసు కూడా అందులో ఇరుక్కుపోతాడు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణకుమార్, హేమలు కలిసి ఆ పిల్లల్నందరినీ బయటకు తీసుకువస్తారు కానీ వారు ముగ్గురూ మాత్రం అందులోనే ఇరుక్కుపోతారు. ఆ యాంత్రం కాలంలో వెనక్కి ప్రయాణించి 1526 వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్ళిపోతుంది.

అక్కడ కృష్ణకుమార్ రాయల ఆస్థాన నర్తకి సింహనందినిని దారిదోపిడి దొంగల నుంచి కాపాడతాడు. ఆమె వారిని రాయలవారి సభకు తీసుకుని వెళుతుంది. అక్కడ ఆధునిక దుస్తుల్లో ఉన్న వీరిని చూసి ఆశ్చర్యపోయిన సభికులకు తాము 500 సంవత్సరాల ముందు వాళ్ళమనీ, కాలయంత్రంలో ఇలా వెనక్కి వచ్చామని కృష్ణ కుమార్ చెబుతాడు. రాయలు అతన్ని తమ అతిథిగా గౌరవిస్తాడు. తమ ఆస్థానంలో ఉన్న వజ్రాన్ని, దాని మహిమను గురించి చెబుతాడు. సింహనందిని కృష్ణకుమార్ ని మోహించి అతన్ని పెళ్ళి చేసుకోవాలంటుంది. అందుకు కృష్ణకుమార్ అంగీకరించడు. దాంతో అతని మీద నిందలు వేసి అతన్ని బలవంతంగా పెళ్ళి చేసుకోవాలని చూస్తుంది కానీ ఒక నాట్యపోటీలో హేమ ఆమెను ఓడించి రాజాస్థానం నుంచి బహిష్కృతురాలు అవుతుంది. ఎలాగైనా కృష్ణకుమార్ ని శిక్షించాలని పంతం పట్టిన ఆమె సేనాధిపతితో చేతులు కలిసి అతను వజ్రాన్ని దొంగిలించినట్లు నాటకమాడిస్తుంది. అది రాయలు కళ్ళారా చూసి అతనికి మరణ శిక్ష విధిస్తాడు కానీ అతను ఆ దొంగతనం చేసి ఉంటాడని రాయల మనసు అంగీకరించదు. తన మంత్రి అప్పాజీ సలహాతో ఉరికంబం మీద ఉన్న కృష్ణకుమార్ ను చాటు నుంచి బాణం వేసి తప్పిస్తాడు. తర్వాత వెనక్కి వచ్చి కృష్ణకుమార్ పై జరిగిన కుట్రను కళ్లారా చూసిన తెనాలి రామకృష్ణ కవి ద్వారా నిజం తెలుసుకుంటాడు. భటుల నుంచి తప్పించుకున్న కృష్ణకుమార్, హేమ, పోలీసు కలిసి మళ్ళీ కాలయంత్రం ఎక్కేస్తారు.

అయితే కాలయంత్రం ఈసారి ప్రస్తుత కాలానికి కాకుండా మరో 500 ఏళ్ళు ముందుకు తీసుకు వెళ్ళిపోతుంది. అప్పటికి మూడో ప్రపంచ యుద్ధం జరిగి అణుబాంబుల తాకిడికి గురై భూమి అంతా నివాసయోగ్యం కాకుండా ఉంటుంది. వారు భూమి మీద రేడియేషన్ పరిస్థితులు తట్టుకోలేకుండా ఉంటే ఒక శాస్త్రవేత్త వారిని రక్షిస్తాడు. అతను అందరూ కలిసి భూగర్భంలో నివసిస్తున్నారని చెబుతాడు. అక్కడి వింతలు, విశేషాలన్నీ చూస్తారు. కానీ ఆ శాస్త్రవేత్త వాళ్ళు ఆ వాతావరణంలో ఇమడలేరనీ, వెంటనే మళ్ళీ కాలయంత్రం ఎక్కి ప్రస్తుత కాలానికి వెళ్ళిపోమని చెబుతాడు. వెళ్ళబోయే ముందు తమకు పరిచితమైన రాయలవారి వజ్రాన్ని మళ్ళీ చూస్తారు. దానికి అనుబంధంగా ఉన్న వార్తల్లో కాలయంత్రం చేజిక్కించుకోవడానికి ప్రయత్నించిన రాజావర్మతో పోరాడి కృష్ణకుమార్ దుర్మరణం పాలైనట్లు ఉంటుంది. ఆ విషయం కృష్ణకుమార్, పోలీసు మాత్రమే చూస్తారు. కృష్ణకుమార్ ఆ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని పోలీసు చేత మాట తీసుకుంటాడు. వారు ముగ్గురూ కాలయంత్రం ఎక్కి మళ్ళీ ప్రస్తుత కాలానికి వస్తారు. అప్పటికే కాలయంత్రం కోసం కిషోర్, ప్రొఫెసర్ రాందాస్ ను రాజావర్మ అపహరించి ఉంటాడు. కృష్ణ కుమార్ రాజావర్మ మనుషులతో పోరాడి వారిని విడిపిస్తాడు. కాలయంత్రంలో ప్రవేశించిన రాజావర్మతో పోరాటం సాగిస్తాడు కృష్ణ కుమార్. వారిద్దరి పెనుగులాటలో ఆ యంత్రం పేలిపోతుంది. ఈ లోపు పోలీసు తాము భవిష్యత్తులో చూసిన దుర్వార్తను గురించి అందరికీ చెబుతాడు. అందరూ అతని మరణించాడని దుఃఖిస్తుండగా ఆశ్చర్యంగా కృష్ణకుమార్ అక్కడికి వస్తాడు. ఆ యంత్రం పేలిపోబోయే కొన్ని సెకన్ల ముందే అందులోనుంచి దూకేశానని చెబుతాడు.

తారాగణం మార్చు


నిర్మాణం, అభివృద్ధి మార్చు

ప్రముఖ గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఒకసారి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తో మాట్లాడుతూ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దగ్గరున్న టైం ట్రావెల్ (కాలంలో ప్రయాణం) గురించిన కథ చెప్పాడు. అది విన్న కృష్ణప్రసాద్ వెంటనే ఆయనతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. కృష్ణదేవరాయల కాలం అనగానే ఆయనకు కథానాయకుడు బాలకృష్ణ గుర్తొచ్చాడు. బాలకృష్ణకు వెళ్ళి ఈ విషయం చెప్పగానే ఆయన కూడా ఇందులో నటించడానికి ఒప్పుకున్నాడు. రచయితగా జంధ్యాలను ఎంపిక చేశారు. ఈ సినిమా చిత్రీకరణకు 110 రోజులు పట్టింది. మొదట్లో ఈ సినిమాకు పి. సి. శ్రీరాం ఛాయాగ్రాహకుడు. ఆయనకు అత్యవసరంగా శస్త్రచికిత్స జరపవలసి రావడంతో ఆయన బాధ్యతను వి. ఎస్. ఆర్. స్వామి, కబీల్ లాల్ కి అప్పగించారు.[3]

మొదట్లో సుమారు 1 కోటి 30 లక్షలు అవుతుందనుకున్న బడ్జెట్ తర్వాత మరో 30 లక్షలు అదనంగా అయింది. చిత్రీకరణలో వేసిన సెట్లు, వాటికి కలిగిన ఆదరణ చూసి డిస్ట్రిబ్యూటర్లు ఈ అదనపు సొమ్మును వెచ్చించడానికి ముందుకు వచ్చారు. దీంతో సినిమాకు కోటి 52 లక్షలు ఖర్చు అయింది. మొదట్లో ఈ సినిమాకు యుగపురుషుడు, ఆదిత్యుడు అనే పేర్లు అనుకున్నారు. తర్వాత ఆదిత్య అని పేరు పెట్టి టైం ట్రావెలింగ్ కాబట్టి 369 అనే ఆరోహణా క్రమంలోని అంకెలు చేర్చారు. జులై 18, 1991 న విడుదలైన ఈ చిత్రం మంచి ప్రజాదరణకు నోచుకుంది.[1]

కథానాయికగా మొదట విజయశాంతిని అనుకున్నారు. కానీ ఆమె డేట్స్ సర్దుబాటు కాలేదు. తర్వాత పి. సి. శ్రీరాం కి పరిచయమున్న మోహినికి ఆ అవకాశం దక్కింది. టైం మెషీన్ తయారు చేసే పాత్రకు విభిన్నంగా కనిపించడం కోసం హిందీ నటుడు టిన్నూ ఆనంద్ ని ఎంపిక చేశారు. బాల నటులుగా తరుణ్, రాశి నటించారు.[4]

చిత్రీకరణ మార్చు

1 కోటి అరవై లక్షల ఖర్చు అయిన ఈ సినిమా చిత్రీకరణకు సుమారు 110 రోజులు పట్టింది. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి సెట్స్ ను హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వేశారు. ఇంకా మద్రాసు లోని గోల్డెన్ బీచ్, విజయ వాహిని స్టూడియోస్ లో కూడా కొంత భాగం చిత్రీకరించారు. అడవిలో సన్నివేశాలు తిరుపతికి సమీపంలోని తలకోన అడవుల్లో చిత్రీకరించారు.[1]

పాటలు మార్చు

ఇళయరాజా.

విశేషాలు మార్చు

  • తెలుగు సినిమా ప్రేక్షకులకు అంతగా అలవాటు లేని ఈ విధమైన క్లిష్టతతో కూడుకొన్న కథను తెరకెక్కించి ప్రేక్షకుల ఆదరణ పొందడంలో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ప్రతిభ కనిపిస్తుంది. జంధ్యాల మాటలు, వేటూరి పాటలు, ఇళయరాజా సంగీతం, శ్రీరామ్, స్వామిల ఫొటోగ్రఫీ ఈ చిత్ర విజయానికి బాగా దోహదం చేశాయి.
  • విజయనగర రాజ్యంకాలంలో కృష్ణమోహన్ అనే (తరువాతి కాలంనుండి వచ్చిన) యువకునిగానూ, కృష్ణదేవరాయలుగానూ కూడా బాలకృష్ణ నటించాడు.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 "పాతికేళ్ల 'ఆదిత్య 369'". andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. Archived from the original on 18 జనవరి 2017. Retrieved 16 October 2017.
  2. ఐడిల్ బ్రెయిన్‌లో వ్యాసం Archived 2009-02-19 at the Wayback Machine - రచన: గుడిపూడి శ్రీహరి
  3. Sakshi (18 July 2021). "ఆదిత్య 369 @30: ఆ టైం మెషిన్‌కు స్ఫూర్తి ఎవరో తెలుసా?". Archived from the original on 18 July 2021. Retrieved 18 July 2021.
  4. "Aditya 369: తెర వెనుక జరిగింది ఇది! - 30 years for classic aditya369". www.eenadu.net. Retrieved 2021-07-18.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ఆదిత్య_369&oldid=4158431" నుండి వెలికితీశారు