ఛాయా సోమేశ్వరాలయం

ఛాయా సోమేశ్వరాలయం నల్లగొండ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పానగల్లు గ్రామంలోని ఉన్నది. గర్బగుడిలో శివలింగము వెనుక వున్న గోడపై పగలు మొత్తం కనిపించే, సూర్యరశ్మితో సంభంధం లేని స్తంభాకార నీడ ఇక్కడి విశేషము.[1]

పానగల్లు గ్రామంలో ఉన్న ఛాయా సోమేశ్వరాలయం చిత్రం

సుమారు పదో శతాబ్దంలో పానగల్లుని రాజధానిగా చేసుకొని ప్రస్తుత నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాలను పాలించిన కందూరు చోడులు తమ ఆరాధ్య దైవమైన పరమేశ్వరునికి నిర్మించిన ఆలయాలలో ఇది ఒకటి. సమీపంలో వీరి కోట తాలూకు శిథిలాలున్నాయి. ఇక్కడ లభించిన ప్రతాపరుద్రుని శాసనం ద్వారా కాకతీయ ప్రభువులు కూడా ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేసారనడానికి సాక్ష్యంగా నిలుస్తున్నది. తదనంతర రాజవంశాలు కూడా తమ వంతు సేవలు, కైంకర్యాలు సమర్పించుకున్నారని ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. ఇదే ప్రాంతంలో పానగల్లు మ్యూజియం కూడా ఉంది.

ప్రత్యేకతలు మార్చు

ఈ దేవాలయానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యమైంది ఈ దేవాలయం గర్బగుడిలో గోడపై ఎప్పటికీ కదలకుండా ఒకే స్థానంలో ఉన్నట్లుగా కనపడే నీడ. రెండోది అక్కడికి దగ్గరలోని చెరువులో నీరుంటే గర్భగుడిలో కూడా నీరు ఉబికి రావడం.

దేవాలయం గర్భగుడి గోడపై నిరంతరం పడే నీడ. గర్భగుడి ముఖద్వారం ముందు రెండు స్తంభాలున్నా అన్నివేళలా ఒకే నీడ పడుతుంది. అది వెలుతురు ఉన్నంత సేపు కదలకుండా ఒకే స్థానంలో ఉంటుంది. సూర్యుని గమనంలో మార్పు ఆ నీడను మార్చదు. ఆ నీడ ఎలా పడుతుంది, ఎందుకు అది వెలుతురులో ఉన్నంతవరకూ తన స్థానాన్ని మార్చుకోదు. [2]

ఆలయ విశేషాలు... మార్చు

ఊరికి దూరంగా ఒంటరిగా పొలాల మధ్య ఎలాంటి రాజగోపురం లేకుండా చతురస్రాకారంలో ఉండే మూడు గర్భాలయాలు గల ఈ త్రికూటాలయంలోని ఒక దాంట్లో శ్రీదత్తాత్రేయుడు కొలువై ఉండగా మరొకటి ఖాళీగా ఉంటుంది. తూర్పు ముఖంగా లోతుగా ఉన్న మూడో గర్భాలయంలో మూలవిరాట్టు శ్రీసోమేశ్వర స్వామి దర్శనమిస్తారు. నిరంతరం నీడతో కప్పబడి ఉన్నందున స్వామిని ఛాయా సోమేశ్వరుడు అంటారు. పూర్తిగా రాతి నిర్మాణం అయిన ఆలయంలో చాళుక్యుల శైలి కొంత కనపడుతుంది. మండప స్థంభాలకు రామాయణ, భారత, శివలీలా ఘట్టాలు చెక్కారు. ద్వారపాలక విగ్రహాలు, గర్భాలయ ద్వారం పైనున్న తోరణానికి చెక్కిన సూక్ష్మరూప లతలు, పూలు ఆలయ బయటి గోడలపై ఉన్న శిల్పాలు మనోహరంగా ఉంటాయి. లింగానికి ఎదురుగా నందీశ్వరుడు లేకున్నా, ద్వారానికిరుపక్కలా విఘ్నరాజు వినాయకుడు, నాగరాజు దర్శనమిస్తారు. ఆలయం ప్రాంగణంలో దాడులలో ధ్వంసం చేయబడిన నందులు, ఇతర శిల్పాలు కనుపించి హృదయాన్ని కలవర పరుస్తాయి. చుట్టూ ఉన్న ఉప ఆలయాలు చాలా వరకు ఖాళీగా ఉండగా, ఒక దాంట్లో మాత్రం ఆత్మలింగ రూపంలో లింగరాజు కొలువై ఉంటాడు.

ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఆలయంలో వారి బోర్డు తప్ప మరే రకమైన నిర్వహణ, అభివృద్ధి, సంరక్షణ, రక్షణలకు సంబంధించిన దాఖలాలు కనిపించకపోవడం, కనీసం దీపం వెలిగించే పూజారి కూడా లేకపోవడం శోచనీయం. తమ ఇష్టదైవ ఆలయం ఒక విశిష్ట నిర్మాణంగా ఉండాలన్న రాజుల ఆకాంక్షను తమ ప్రజ్ఞాపాటవాలతో ఒక రూపాన్ని కల్పించిన శిల్పుల మేధస్సును గుర్తించి, దానిని కాపాడి నేర్చుకోవాలి. మన నిర్మాణాల గొప్పదనాన్ని తెలిపే వారసత్వ కట్టడానికి తగిన రక్షణ, గౌరవం, ఆదరంతో కూడిన పోషణ, ప్రచారం కల్పించకపోవడం విచారకరం. భావి తరాలకు ఈ అద్భుత నిర్మాణాన్ని అందించాల్సిన బాధ్యత ఉన్నది.

'ఛాయ' మిస్టరీ వీడినది మార్చు

ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.

గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ విషయాలనే ప్రయోగాత్మకంగా నిరూపించాడు సూర్యాపేటకు చెందిన మనోహర్‌.

ఎలా కనిపెట్టాడు?

శేషగాని మనోహర్‌ గౌడ్‌ సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర పిజీ కాలేజ్‌లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం గ్రూప్స్‌కి ప్రిపేర్‌ అవుతున్నారు. ఆరేడేళ్ల క్రితం ఒకరోజు కోడి శ్రీనివాస్‌ అనే స్నేహితుడు ఆయన్ని ఛాయా సోమేశ్వరాలయానికి తీసుకెళ్లాడు. అక్కడి నీడ గురించి చెప్పి 'నీకు ఫిజిక్స్‌ అంటే ఇష్టం కదా. నువ్వు ఎందుకు ఈ నీడ రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించకూడదు' అని ప్రోత్సహించాడు. ఆ రోజు నుంచి ఆ మిస్టరీ మనోహర్‌ని వెంటాడింది. ఎలాగైనా ఆ రహస్యాన్ని చేధించాలని ఒంటరిగా వెళ్లి ఆ గుళ్లో ఎన్నోసార్లు కూర్చునేవాడు. అక్కడి నిర్మాణాన్ని అణువణువు పరిశీలించాడు. కొలతలు తీసుకున్నాడు. ఆ గుడికి దక్షిణం వైపు ప్రధాన ద్వారం ఉంటుంది, తూర్పు, పడమర, ఉత్తరంవైపు మూడు గర్భగుళ్లు ఉంటాయి. పడమర వైపు ఉన్న గర్భగుడిలోని శివలింగంపైనే నీడ పడుతుంది. మిగిలిన రెండు గుళ్లలో అంతా చీకటిగా ఉంటుంది. మధ్యలో నాలుగు స్తంభాలుంటాయి. ప్రధాన ద్వారం వద్ద, మూడు గర్భగుళ్ల ముందు సిమెట్రిక్‌ సిస్టమ్‌లో ఎనిమిది స్తంభాలుంటాయి. మధ్యలో నిలబడి ఏ గర్భగుడివైపు చూసినా వాటి నిర్మాణం ఒకేలా ఉంటుంది. ఇదే నమూనాలో థర్మాకోల్‌తోగుళ్లను, కొవ్వొత్తులను స్తంభాలుగా ఉపయోగించి ఆలయాన్ని రూపొందించాడు మనోహర్‌. చీకటి గదిలో టార్చిలైటుని సూర్యునిగా ఉపయోగిస్తూ ఎన్నో ప్రయోగాలు చేశాడు. అలా ఎన్నో రాత్రులు చీకటిలో గడిపి విజయాన్ని సాధించాడు. వందల ఏళ్లుగా గర్భగుడిలో దాగి ఉన్న ఆ రహస్యాన్ని వెలుగులోకి తెచ్చాడు.

ఛాయా సోమేశ్వరాలయం కాకతీయుల కాలం నాటి నిర్మాణశైలిని కలిగి ఉంటుంది. ఆ కాలంలోనే భౌతిక శాస్త్రం ఆధారంగా కాంతిని దారిమళ్లించి ఒక నీడని గర్భగుడిలో పడేలా చేయడం చూసి ఆశ్చర్యపోయాడు మనోహర్‌. తను కనుగొన్న విషయాన్ని ఇలా చెప్పుకొచ్చాడు. "ఈ గుడిని పరిక్షేపణ కాంతి ఆధారంగా నిర్మించారు. మనం తెలుసుకోవాలనుకున్నది రెండు విషయాలు... ఒకటి.. నీడ ఏ స్తంభానిది?, రెండు.. ఏ దిశ నుంచి వచ్చే కాంతిది? అని. గుడి నిర్మాణం ఆధారంగా నేను చేసిన ప్రయోగాల్లో అది తేలింది. అలాగే ఆ నీడ ఒకే స్తంభానిది కాదు.. నాలుగు స్తంభాలది. కాంతి కూడా రెండు వైపుల నుంచి వస్తుంది. నీడ పడే గర్భగుడికి ఎదురుగా అంటే తూర్పు గుడి పక్కన రెండు వైపుల నుంచి కాంతి లోపలికి వస్తుంది. ఇది నాలుగు స్తంభాలకు తగిలి పరిక్షేపణం చెందుతుంది. ఆ పరివర్తనం అంతా గర్భగుడిలోని శివ లింగంపై ప్రతిఫలించేలా నిర్మాణం చేశారు. ఇక్కడ మళ్లీ రెండు అనుమానాలు. నిర్మాణం అంతా ఒకేలా ఉన్నప్పుడు, మిగిలిన రెండు గర్భగుళ్లలో కూడా నీడ పడాలి కదా? రెండోది.. సూర్యకాంతి ఆధారంగా వచ్చే నీడ అయితే కదలాలి కదా. మరి స్థిరంగా ఎందుకు ఉంటుంది? సూర్యుడు తూర్పున ఉద యించి పడమటికి కదులుతాడు. దీన్ని సన్‌ ట్రాక్‌ అంటారు. అందుకే పడమర వైపు గుళ్లో మాత్రమే నీడ పడేలా కట్టారు. నీడపడే గుడి పక్కన కాంతి వచ్చే ప్రదేశంలో విగ్రహాలు పెట్టి అడ్డువేశారు. అందుకే తూర్పు గర్భగుడిలో నీడ పడదు. అలాగే ఉత్తరం వైపు గుళ్లో పడకుండా దక్షిణం వైపు ఖాళీగా వదిలేశారు. అటువైపు కూడా కట్టి ఉంటే ఉత్తరం గుళ్లో కూడా నీడపడేది. వాహ్‌! ఆ కాలంలోనే భౌతికశాస్త్రం ఆధారంగా అద్భుతమైన కట్టడాన్ని నిర్మించిన కుందూరు చోళులకు హ్యాట్సాఫ్‌.

మూలాలు మార్చు

  1. విశాలాంధ్ర, నల్లగొండ (28 May 2011). "కళా నిలయాలు.... ఈ దేవాలయాలు..!". Archived from the original on 6 ఆగస్టు 2019. Retrieved 6 August 2019.
  2. http://www.suryaa.com/sunday/article-125764[permanent dead link]

వెలుపలి లంకెలు మార్చు