నిజామాబాదు ఐటీ టవర్

తెలంగాణ రాష్ట్రం, నిజామాబాదు నగరంలో ఉన్న ఐటీ టవర్

నిజామాబాదు ఐటీ టవర్ తెలంగాణ రాష్ట్రం, నిజామాబాదు నగరంలో ఉన్న ఐటీ టవర్. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ సేవలు విస్తరించాలన్న ఉద్దేశ్యంతో నిజామాబాదు నగరంలో 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో 50 కోట్ల వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం జీప్లస్‌ 3 అంతస్తులతో ఈ ఐటీ టవర్‌ను నిర్మించింది.[1] 2023, ఆగస్టు 9న ఈ ఐటీ టవర్ ప్రారంభించబడింది.

నిజామాబాదు ఐటీ టవర్
నిజామాబాదు ఐటీ టవర్ భవనం
సాధారణ సమాచారం
రకంఐటీ టవర్
ప్రదేశంనిజామాబాదు, తెలంగాణ
నిర్మాణ ప్రారంభం2018, ఆగస్టు 1
పూర్తి చేయబడినది2023
ప్రారంభం2023, ఆగస్టు 9
వ్యయం50 కోట్లు
యజమానితెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ
సాంకేతిక విషయములు
నేల వైశాల్యం49,460 sq ft (4,595 m2)

ప్రతిపాదన మార్చు

హైదరాబాదు నగరంతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో ఐటీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా 2017, సెప్టెంబరు 17న మంత్రి కేటీఆర్ నిజామాబాద్‌లో ఐటీ టవర్ ని ప్రకటించాడు.

2017, అక్టోబరు 9న నిజామాబాద్‌కు ఐటీ టవర్ ఏర్పాటుకోసం ప్రభుత్వం 50 కోట్లు మంజూరు చేసిన పత్రాన్ని ఎంపీ కవిత, ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు మంత్రి కేటీఆర్ అందజేశాడు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఈ టవర్ నిర్మాణం కోసం భూమిని సేకరించింది.

శంకుస్థాపన మార్చు

2018, ఆగస్టు 1న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, అప్పటి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కలసి ఈ ఐటీ టవర్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశాడు.[2] ఈ కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే ఎ. జీవన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్‌ ఆమేర్‌, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, అప్పటి ఎమ్మెల్సీలు వి.గంగాధర్ గౌడ్, డి. రాజేశ్వర్ రావులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

నిర్మాణం మార్చు

నిజామాబాదులోని గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో బైపాస్‌ రోడ్డులోని నూతన కలెక్టరేట్‌ భవనం పక్కనున్న 3.5 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఈ ఐటీ టవర్‌ నిర్మించబడింది. మొత్తం 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీప్లస్‌ 3 అంతస్తులతో దీని నిర్మాణం జరిగింది. ఎకరం భూమిలో ఐటీ టవర్‌ను నిర్మించగా, భవిష్యత్తులో ఐటీ టవర్‌ను విస్తరించడానికి మిగిలిన 2.5 ఎకరాల భూమిని కేటాయించారు.[1]

ప్రారంభం మార్చు

2023, ఆగస్టు 9న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ ఐటీ టవర్‌ను ప్రారంభించి, అందులోని వివిధ కంపెనీల్లో ఎంపికైనవారికి నియామక పత్రాలు అందజేశారు.[3][4] ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖామంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి, ఎంపీ కేతిరెడ్డి సురేష్‌రెడ్డి, టీఎస్​ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే ఎ. జీవన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్‌ ఆమేర్‌, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[5]

కార్యకలాపాలు మార్చు

దాదాపు 50వేల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉండడం వల్ల ఇందులో 15 కంపెనీలు ఏర్పాటు చేయవచ్చు. దీనిద్వారా దాదాపు 750 మంది వరకు స్థానికంగా ఉండే యువతకు ఉద్యోగాలు రానున్నాయి.[6]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 telugu, NT News (2022-12-18). "ఇందూరుకు ఐటీ కిరీటం". www.ntnews.com. Archived from the original on 2022-12-19. Retrieved 2023-07-12.
  2. "KTR, Kavita lay foundation for T-Hub in Nizamabad". The News Minute (in ఇంగ్లీష్). 2018-08-01. Archived from the original on 2021-09-23. Retrieved 2023-07-12.
  3. Pavan (2023-08-09). "KTR inaugurates IT Tower in Nizamabad, interacts with employees". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2023-08-09. Retrieved 2023-08-09.
  4. Latha, Suma (2023-08-09). "నిజామాబాద్‌ ఐటీ టవర్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌". Vaartha. Archived from the original on 2023-08-09. Retrieved 2023-08-09.
  5. "KTR To Inaugurate Nizamabad IT Hub : నిజామాబాద్ లో ఐటీ టవర్ ను ప్రారంభించిన కేటీఆర్.. నిరుద్యోగులకు హామీ". ETV Bharat News. 2023-08-09. Archived from the original on 2023-08-09. Retrieved 2023-08-09.
  6. ABN (2022-01-03). "సిద్ధమవుతున్న ఐటీ టవర్‌". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-07-12. Retrieved 2023-07-12.

వెలుపలి లంకెలు మార్చు