పండరంగని అద్దంకి శాసనము

తెలుగు శాసనాలు
విష్ణుకుండినులు
తూర్పు చాళుక్యులు
పశ్చిమ చాళుక్యులు
రాష్ట్రకూటులు
ఇతర వంశములు
సామ్రాజ్య చోళులు
కాకతీయులు
రెడ్డి రాజులు
రేచర్ల రెడ్లు
రేనాటి చోళులు
వైడుంబులు
చిందులు
తూర్పు గాంగులు
గజపతులు
కుతుబ్‌షాహీలు
మొఘల్‌ సామ్రాజ్యము
సూచిక I
సూచిక II

పండరంగని అద్దంకి శాసనంగా ప్రఖ్యాతమైనది తెలుగులో అత్యంత ప్రాచీనమైన పద్య శాసనం. సా.శ.848లో పండరంగడు తను సాధించిన విజయాలను శాసనంలో తెలుగు పద్యరూపంలో చెక్కించారు. తెలుగు సాహిత్యం సా.శ.9వ శతాబ్ది నాటికే పద్య ఛందోరూపం వరకు అభివృద్ధి చెందినట్లుగా నిర్ధారించేందుకు ఇది ముఖ్యమైన ఆధారం.[1] అప్పటికి దాదాపుగా 3 శతాబ్దులు గడచినాకానే నన్నయ రచించిన తొలి తెలుగు కావ్యం శ్రీమదాంధ్ర మహాభారతం రచన జరిగింది.

చారిత్రిక నేపథ్యం మార్చు

గుణగ విజయాదిత్యుని సేనానిగా పండరంగడు 12 బోయకొట్టాలను విజయం సాధించిన సందర్భంగా ఆయనను ప్రస్తుతిస్తూ చేసిన రచన పద్యరూపాన్ని తీసుకుంది. 12 బోయకొట్టాలు (మండలాలు) గెలిచినందుకు ఈ పద్యశాసనంలో కీర్తించారు. 848లోనే గుణగ విజయాదిత్యుడు వేయించిన కందుకూరి పద్యశాసనంలో కూడా వర్ణితుడు పండరంగడే కావడం అతని సామర్థ్యాన్ని, ప్రఖ్యాతిని వెల్లడిస్తోంది. ఈ శాసనాన్ని కొమర్రాజు వెంకట లక్ష్మణరావు పరిష్కరించి, ప్రకటించారు. దీనిలో తరువోజ ఛందస్సుకు చెందిన పద్యం లభిస్తోంది.[2]

పండరంగడు అనే చాళుక్య సేనాని పండ్రెండు బోయకొట్టముల మీద దాడి చేసి స్వాధీనంచేసుకొని,బోయరాజ్యపు ప్రధాన కొట్టము, కట్టెపు దుర్గాన్ని నేలమట్టం చేసి, కందుకూరును బెజవాడవలె ప్రధాన పట్టణముగా బలిష్టము గావించెను. ఆదిత్య బటరునికి కొంతభూమి దానమిచ్చెను. నెల్లూరును పరశురామప్రీతి గావించెను

-అన్నది ఈ శాసనానికి సరళమైన నేటి తెలుగులో అనువాదం[3].

శాసన పాఠ్యం మార్చు

పట్టంబు గట్టిన ప్రథమంబు నేడు
బలగర్వ మొప్పగ బైలేచి సేన
పట్టంబు గట్టించి ప్రభు బండరంగు
బంచిన సామంత పదువతో బోయ
కొట్టము ల్వండ్రెండు గొని వేంగినాటి
గొఱల్చియ త్రిభువనాంకుశ బాణ నిల్చి
కట్టెపు దుర్గంబు గడు బయల్సేసి
కందుకూర్బెజవాడ గవించె మెచ్చి.

ప్రాధాన్యత-ప్రాచుర్యం మార్చు

తెలుగు సాహిత్యంలో పద్యరచన కాలాన్ని స్పష్టపరిచేందుకు నిర్ధారించేందుకు ఈ శాసనం ఉపకరించడంతో ఇది తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రాధాన్యత కలిగివుంది. 2013 సంవత్సరంలో కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళై వ్రాసిన బోయకొట్టములు పండ్రెండు చారిత్రిక నవల ఈ శాసనాన్ని ఆధారం చేసుకుని అప్పటి స్థితిగతులు పునర్నిర్మించి వ్రాశారు. చాళుక్య-పల్లవ రాజుల మధ్య యుద్ధాలు, రాజకీయాలు మొదలైన వాటితో అల్లుకున్న ఈ నవల పాఠకులలో ఆసక్తి రేకెత్తించింది.[4] పండరంగని అద్దంకి శాసనానికి గౌరవచిహ్నంగా అద్దంకిలో శాసన ప్రతిరూపాన్ని స్థూపంగా స్థాపించారు. ఈ స్థూపం ఏర్పాటుకు అద్దంకికి చెందిన సృజన సంస్థ, ప్రకాశం జిల్లా రచయితల సంఘం, అద్దంకి ప్రజలు కృషిచేశారు.[5] [6]

మూలాలు మార్చు

  1. గౌరీదేవి, వి (ఏప్రిల్ 2, 2012). "తెలుగు.. కొడిగట్టిపోతున్న వెలుగు!". ఆంధ్రభూమి. Retrieved 7 December 2014.[permanent dead link]
  2. వేటూరి, ప్రభాకరశాస్త్రి (2009). సింహావలోకనము. తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం. Retrieved 7 December 2014.
  3. కారుసాల, శ్రీనివాసరావు (జూన్ 16, 2014). "జిల్లా సాహితీ ప్రియులను అలరించేచారిత్రక నవల బోయ కొట్టములు పన్నెండు". ప్రజాశక్తి. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 8 December 2014.
  4. సిరాశ్రీ. "బోయకొట్టములు పండ్రెండు సమీక్ష". గోతెలుగు.కాం. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 7 December 2014.
  5. కరణం, బాలసుబ్రహ్మణ్యం పిళ్ళై (డిసెంబరు 2013). బోయకొట్టములు పడ్రెండు (ఎందరి సహకారం వ్యాసంలో) (1 ed.). కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళై. p. XXIV.
  6. ఎస్., మురళి (12 December 2012). "Addanki inscription, pride of Prakasam district". The Hindu. Retrieved 4 March 2015.