ఎస్.వి.భుజంగరాయశర్మ

ఎస్.వి.భుజంగరాయశర్మ (డిసెంబరు 15, 1925 - ఆగష్టు 17, 1997) కవి, విమర్శకుడు, నాటక రచయిత.

శ్రీరాం వేంకట భుజంగరాయశర్మ
జననంశ్రీరాం వేంకట భుజంగరాయశర్మ
(1925-12-15)1925 డిసెంబరు 15
India కొల్లూరు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం1997 ఆగస్టు 17
మద్రాసు
ఉద్యోగంవిశ్వోదయ కళాశాల
ప్రసిద్ధికవి, విమర్శకుడు, చిత్రకారుడు, నటుడు, ప్రయోక్త, విద్యావేత్త
పదవి పేరుప్రిన్సిపాల్
మతంహిందూ

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

ఇతడు 1925, డిసెంబరు 15వ తేదీన గుంటూరు జిల్లా, కొల్లూరు గ్రామంలో ఒక విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతని ప్రాథమిక విద్య, సెకండరీ విద్య కొల్లూరులో ముగిసింది. తరువాత నెల్లూరులోని వెంకటగిరిరాజావారి కళాశాలలో ఇంటర్‌మీడియెట్ చదివాడు. ఇంటర్‌మీడియెట్ పరీక్ష్ ఉత్తీర్ణుడయ్యాక వాల్తేరులోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు అభిమాన విషయంగా బి.ఎ.(ఆనర్సు)లో చేరి డిగ్రీని పొందాడు. ఇతనికి ఏటుకూరి వెంకట నరసయ్య, పింగళి లక్ష్మీకాంతం, దువ్వూరి వెంకటరమణశాస్త్రి గురువులు.

ఉద్యోగం మార్చు

ఆనర్స్ డిగ్రీ సంపాదించిన తరువాత కొంత కాలం చెన్నైలోని పచ్చయప్ప కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. పిమ్మట తన మిత్రుడైన దొడ్ల రామచంద్రారెడ్డిని ప్రోత్సహించి కావలిలో 1951లో 'విశ్వోదయ' విద్యా సాంస్కృతిక సేవా సంస్థ స్థాపింపచేశాడు. ఆ సంస్థ తరఫున నడిచిన 'విశ్వోదయ' కాలేజీలో తెలుగువిభాగం అధిపతిగా, ఆ తరువాత ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. ఈ కళాశాల లోగోను ఇతడే సృష్టించాడు. కళాశాల ప్రార్థనాగీతం కూడా ఇతడే వ్రాశాడు. ఆచార్య జి.ఎన్.రెడ్డి, వకుళాభరణం రామకృష్ణ మొదలైన వారు ఇతని శిష్యులలో కొందరు. ఇతడు అధికార భాషా సంఘం సభ్యుడిగా వ్యవహరించాడు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యయనమండలి చైర్మన్‌గా కూడా సేవలనందించాడు. ఇతడిని ఆ విశ్వవిద్యాలయం డి.లిట్‌తో సత్కరించింది.

నాటకరంగం మార్చు

యూనివర్సిటీలో చదువుకునే రోజులలో ఇతడు అనేక నాటకాలలో వేషాలు వేశాడు. ముద్దుకృష్ణ రచించిన అశోకం నాటకంలో ప్రధానపాత్ర, అనార్కలి నాటకంలో సలీం, విశ్వంభర నాటకంలో ప్రధాన పాత్ర, మెక్‌బెత్ నాటకంలో మెక్‌బెత్ పాత్ర ఇతనికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇతడు రచించిన అనేక నృత్య రూపకాలను వెంపటి చినసత్యం కూచిపూడి నాట్యబృందం దేశ విదేశాల్లో ప్రదర్శించింది. అప్పుడు ఆ బృందంతో పాటు ఇతడు కూడా అమెరికాలో పర్యటించాడు. పట్రాయని సంగీతరావు, వెంపటి చినసత్యంలతో కలిసి కూచిపూడిత్రయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. వారు ముగ్గురూ కలిసి రాసిన శ్రీకృష్ణ పారిజాతం, చండాలిక, కల్యాణ శాకుంతలం, శ్రీనివాస కల్యాణం,కళ్యాణ రుక్మిణి వంటి నృత్యరూపకాలు పేరుగాంచాయి. ఇవి ఆధునిక యక్షగానాలుగా పేరుపొందాయి.

రచనలు మార్చు

ఎవరూ ఇంతవరకూ దృష్టి పెట్టడానికి సాహసించని పరిశోధనాత్మక అంశాలను ఎంచుకోవడం భుజంగరాయశర్మ గొప్పతనం. ఇవి చాలా చిన్న అంశాలుగా పైకి కనిపించినా వీటికి పరిశోధన, అధ్యయనం ఎక్కువగా అవసరమవుతాయి. ఉదాహరణకు, ఒక భర్తను అర్థం చేసుకోవడమే కష్టసాధ్యమైన పరిస్థితిలో ద్రౌపది ఏకంగా అయిదుగురు భర్తలను ఎలా అర్థం చేసుకుందన్నది ఎవరికైనా ఆసక్తికరమే. ఇతడు తన 'విధి వంచిత ద్రౌపది' అనే వ్యాసంలో ద్రౌపది మనోగతాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు. అదే విధంగా ఇతడు శకుంతల, సత్యభామ, రాధ వంటి పాత్రలను కూడా విభిన్న కోణాల నుంచి విశ్లేషించాడు. ఈ నాయికల బాహ్య సౌందర్యం గురించి కాకుండా వారి అంతస్సౌందర్యానికి ఇతడు పెద్దపీట వేశాడు. ఇక ఊర్వశి పాత్ర గురించి కూడా శర్మ అద్భుత విశ్లేషణ జరిపాడు. పురాణ కథల్లో ఊర్వశి పాత్రను చిత్రీకరించిన తీరు నుంచి ఇటీవల రవీంద్రుడు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, చలం వంటి వారు మలచిన తీరు వరకూ ఆయన వివిధ కవుల, భావ కవుల ఊర్వశి చిత్రీకరణను తన 'సాహిత్యోర్వశి' వ్యాసంలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తూనే ఆమె ఏ విధంగా స్త్రీపురుషుల మధ్య తరగని ఆకర్షణకు, కరగని అనురాగానికి ప్రతిరూపంగా నిలిచిందో చక్కని పదజాలంలో వివరించాడు. ఇతడు వ్రాసిన కవితా వాల్మీకం, తిక్కన్నగారివి సూర్యోదయాలు రెండు, నన్నయ్యగారి నాటకీయత, చిత్రాంగి, సత్య, ఆత్రేయ పద్యకవిత, కృష్ణశాస్త్రి, ఆచంట శారదాదేవిగారి వానజల్లు వంటి వ్యాసాలన్నీ పాఠకులను, పరిశోధనాభిలాషులను ఓ కొత్త, వినూత్న తెలుగు సాహితీ ప్రపంచంలోకి తీసుకువెడతాయి. ఇతడు రంగులరాట్నం, ఎర్రమల్లెలు మొదలైన సినిమాలకు గీతాలను వ్రాశాడు. ఇతని రచనలన్నీ రెండు సంపుటాలలో వెలువడినాయి.

మూలాలు మార్చు

  • ఆదివారం ఆంధ్రజ్యోతిలో జి.రాజశుక యస్వీ భుజంగరాయశర్మ సంపూర్ణ రచనలు పై సమీక్ష.
  • విశ్వబ్రాహ్మణ సర్వస్వము - విశ్వబ్రాహ్మణ ప్రముఖులు (ప్రథమ భాగము) - రాపాక ఏకాంబరాచార్యులు - పేజీలు 466-469