ముప్పవరపు వెంకయ్య నాయుడు

భారత ఉప రాష్ట్రపతి
(ఎం.వెంకయ్య నాయుడు నుండి దారిమార్పు చెందింది)

ముప్పవరపు వెంకయ్య నాయుడు (జననం 1 జూలై 1949) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2017 నుండి 2022 వరకు భారతదేశానికి 13వ ఉపరాష్ట్రపతిగా పని చేశాడు. వెంకయ్య నాయుడు మోడీ మంత్రివర్గంలో కేంద్ర హౌసింగ్ & పట్టణ పేదరిక నిర్మూలన, పట్టణాభివృద్ధి & సమాచార, ప్రసార మంత్రిగా పని చేశాడు.[1][2][3]

ముప్పవరపు వెంకయ్య నాయుడు
ముప్పవరపు వెంకయ్య నాయుడు


భారతదేశ 13వ ఉపరాష్ట్రపతి
పదవీ కాలం
11 ఆగస్టు 2017 – 11 ఆగస్టు2022
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
ముందు ముహమ్మద్ హమీద్ అన్సారి
తరువాత జగదీప్ ధన్కర్

మాజీ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు , పట్టణాభివృద్ధి మంత్రి
పదవీ కాలం
26 మే 2014 – 17 జులై 2017
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
ముందు కమల్ నాథ్

పట్టణ పేదరిక నిర్మూలన శాఖా మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
26 మే 2014
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
ముందు గిరిజా వ్యాస్

వ్యక్తిగత వివరాలు

జననం (1948-06-23) 1948 జూన్ 23 (వయసు 75)
చవటపాలెం , నెల్లూVరు, మద్రాసు రాష్ట్రము
(ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్), భారతదేశం
జీవిత భాగస్వామి ఉష
సంతానం హర్షవర్ధన్, దీపా వెంకట్
నివాసం ఢిల్లీ
పూర్వ విద్యార్థి ఆంధ్ర విశ్వవిద్యాలయం
మతం హిందూ

వెంకయ్య నాయుడు 2002 నుండి 2004 వరకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా  పని చేశారు.[4] ఆయన అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధికి కేంద్ర  మంత్రిగా పని చేశారు.[5][6] వెంకయ్య నాయుడును 2024లో భారత ప్రభుత్వం రెండవ అత్యున్నత పౌర పురస్కారం  పద్మవిభూషణ్ తో ఆయనను గౌరవించింది.[7][8]

బాల్యం విద్యాభ్యాసం మార్చు

వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, చవటపాలెం గ్రామంలో జూలై 1, 1949న కమ్మ వ్యవసాయ కుటుంబంలో రంగయ్యనాయుడు, రమణమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన నెల్లూరులోని వి.ఆర్. హై స్కూల్ లో చదివాడు. అతను విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లా నుండి వి.ఆర్ కళాశాల నుండి రాజకీయాలు & దౌత్య అధ్యయనాలలో బ్యాచిలర్స్ డిగ్రీని, తరువాత అంతర్జాతీయ న్యాయశాస్త్రంలో ప్రత్యేకతతో న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీని పొందాడు.[9] ఆయన తన కాలేజీ రోజుల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో స్వయంసేవక్‌గా ఉన్నాడు.

వెంకయ్య నాయుడు నెల్లూరులోని వీఆర్ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా, 1973-74లో ఆంధ్రా యూనివర్శిటీ కాలేజీల స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా పని చేశాడు.

జీవిత విశేషాలు మార్చు

2002లో జానా కృష్ణమూర్తి తరువాత భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టి 2004, అక్టోబర్ 18 వరకు ఆ పదవిలో తన సేవలందించాడు. రెండు సార్లు ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నికైనాడు. భారతీయ జనతా పార్టీకు చెందిన అనేక రాష్ట్ర, జాతీయ పదవులను పొంది దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించాడు. ఆ తరువాత రాజ్యసభకు ఎన్నికై ఆ పదవిలో కొనసాగుతున్నాడు. 2010 మే 8న శాసనసభలో, రాజ్యసభలో, భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు చేసిన ప్రసంగాలను ఆయన మిత్రబృందం "అలుపెరుగని గళం విరామమెరుగని గళం." పేరుతో సంకలనం చేసి విడుదల చేయించారు..

రాజకీయ జీవితం మార్చు

1973-74లో ఆంధ్ర విశ్వవిద్యాలయపు విద్యార్థినాయకుడిగా ఉన్నప్పుడే అతనిలో రాజకీయ లక్షణాలు ఏర్పడ్డాయి. 1977 నుంచి 1980 వరకు జనతా పార్టీ యువ విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. అదే సమయంలో 1978లో తొలిసారిగా ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికైనాడు. 1980 నుంచి శాసనసభలో భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించాడు. 1983లో మళ్ళీ అదే స్థానం నుంచి రెండో పర్యాయం శాసనసభ్యుడుగా ఎన్నికై 1985 వరకు కొనసాగినాడు. 1980లో అఖిల భారతీయ జనతా పార్టీ యువ విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనాడు. 1985లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా నియమించబడి 1988 వరకు కొనసాగి ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. 1993నుండి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించాడు. 1998లో రాజ్యసభకు ఎన్నుకోబడినాడు. 2000లో అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా పనిచేసాడు. 2002 జూలై 1 నుంచి 2004, అక్టోబర్ 5 వరకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షపదవిలో సేవలందించి మహారాష్ట్ర ఎన్నికలలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశాడు.[10] 2005 ఏప్రిల్లో భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్ష పదవిని స్వీకరించాడు. ప్రస్తుతం రాజకీయాలకు రాజీనామా చేసి ఉపరాష్ట్రపతిగా నామినేషన్ దాఖలు చేసాడు.

ప్రమాదాలు మార్చు

జీవితం తొలి నాళ్ళ నుంచి ప్రమాదాల నుంచి బయటపడుతూ చిరంజీవిగా, అజాత శత్రువుగా ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఎదుగుతూ వచ్చారు.

ఆయన జీవితంలో తొలి ప్రమాదం నెలల పిల్లాడిగా ఉన్నప్పుడే ఎదురైంది. వెంకయ్య నాయుడు గారి అమ్మ ఎద్దు పొడవటం వల్ల పరమపదించారు. ఎద్దు పొడిచినప్పుడు ఆమె చేతుల్లో నాయుడు గారు ఉన్నారు. వెంటనే ఆమె పిల్లాడిగా ఉన్న వెంకయ్య గారికి ప్రమాదం జరగకుండా గడ్డి వాము వైపునకు విసిరారు. ఆయన సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. తల్లి మాత్రం వెంకయ్య గారిని నెలల పిల్లాడిగా ఉన్నప్పుడే అనాథను చేసి వెళ్ళిపోయారు. ఇలా నెలల వయసులోనే ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటన తల్లి మనసుకు ఉదాహరణగానూ మనం చెప్పుకోవచ్చు. ఓ వైపు ఎద్దు పొడిచినా క్షణాల వ్యవధిలో బిడ్డను కాపాడుకున్న ఆ తల్లి మనసును కీర్తించటానికి అన్ని భాషల్లో ఉన్న పదాలు సరిపోవేమో.

రెండు సార్లు వెంకయ్యనాయుడికి తృటిలో పెద్ద ప్రమాదాలు తప్పాయి. 2005, జనవరి 29న బీహార్ లోని గయ పర్యటనలో ఉండగా మావోయిస్టులు అతని హెలికాప్టర్కు నిప్పంటించారు. అప్పడు నాయుడు ఎన్నికల సభలో ప్రసంగిస్తున్నాడు. వెంటనే తేరుకొని తప్పించుకున్నాడు. మరోసారి 2007, జూలై 15న ఉత్తర ప్రదేశ్ లోని లక్నో విమానాశ్రయం సమీపంలో అతను ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హైడ్రాలిక్ బ్రేకులు విఫలం కావడంతో అత్యవసరంగా కిందికి దిగాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు చిన్న గాయాలతో బయటపడ్డాడు.

వ్యక్తిగత జీవితం మార్చు

1971, ఏప్రిల్ 14న వెంకయ్య నాయుడు వివాహం చేసుకున్నాడు. భార్య పేరు ఉష. వారి సంతానం ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అతని కుమార్తె దీపా వెంకట్ స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ.[11] ఆమె నెల్లూరు లోని అక్షర విద్యాలయకు కరెస్పాండెంట్ గా ఉన్నారు.

పరాయి బాషా కంటే మాతృబాషా బాగా గౌరవించే మనిషి. మాతృబాషా కళ్లు వంటిది అని అలాగే పరాయి బాషా కళ్లద్దాలు వంటిదని చెబుతుంటారు. కళ్ళు ఉంటేనే కళ్లద్దాలు వాళ్ళని అలాగే మాతృ బాషా వస్తేనె వేరే భాష నేర్చుకోవాలని ఆయన ఉద్దేశం.

ఉపరాష్ట్రపతి మార్చు

దేశ ప్రథమ పౌరుడి పదవి తరువాత రెండవ అతిపెద్ద పదవి అయిన ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య నాయుడు ఎన్నుకోబడినాడు.

 
ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తున్న వెంకయ్య నాయుడు

అత్యున్నత పురస్కారం మార్చు

2024: రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అవార్డును కేంద్రం ప్రకటించింది.[12]

మూలాల జాబితా మార్చు

  1. "An emotionally integrated India offers the best defence against both internal and external threats and challenges". Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2020-08-11.
  2. PTI (25 June 2014). "Venkaiah Naidu, BJP's south Indian face gets second stint in government". Indian Express. Archived from the original on 3 July 2014. Retrieved 25 June 2014.
  3. EENADU (30 April 2024). "ఉద్దండుల బరి హైదరాబాద్‌.. వెంకయ్యనాయుడు ఎప్పుడు పోటీ చేశారంటే?". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.
  4. "Naidu's journey from pasting party posters to being Vice President". Rediff. PTI. 5 August 2017. Archived from the original on 8 June 2022. Retrieved 12 August 2022.
  5. "BJP wins all seats from Rajasthan - the Hindu". The Hindu. 11 June 2016. Archived from the original on 11 June 2016. Retrieved 12 June 2016.
  6. "Cabinet reshuffle: Portfolios of Modi's ministers". 5 July 2016. Archived from the original on 12 August 2022. Retrieved 5 July 2016.
  7. "Padma Awards 2024: Former VP Venkaiah Naidu, actor Chiranjeevi, dancer Vyjayanthimala honoured with Padma Vibhushan". The Times of India. 25 January 2024. ISSN 0971-8257. Retrieved 25 January 2024.
  8. "Padma Awardees List 2024" (PDF). Padma Awards. 25 January 2024. Retrieved 28 January 2024.
  9. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-05-27. Retrieved 2008-06-24.
  10. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-06-12. Retrieved 2008-06-24.
  11. "Venkaiah Naidu: A true friend of Telangana, Andhra Pradesh". deccanchronicle.com/. 2017-07-18. Retrieved 2018-01-28.
  12. "Padma Awardees List 2024" (PDF). Padma Awards. 25 January 2024. Retrieved 25 January 2024.

బయటి లింకులు మార్చు