నోబెల్ బహుమతి

1895లో ఆల్ఫ్రెడ్ నోబెల్చే స్థాపించబడిన బహుమతి
(నోబెల్ పురస్కారం నుండి దారిమార్పు చెందింది)

నోబెల్ బహుమతులు భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, సాహిత్యంలో, వైద్యశాస్త్రంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు, ప్రపంచ శాంతికి కృషిచేసిన మహానుభావులకు ప్రతియేటా బహూకరిస్తుంటారు. ఈ ఐదు బహుమతులు ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 నాటి వీలునామా ప్రకారం 1901లో ప్రారంభించబడ్డాయి (నోబెల్ మరణించిన 5 సంవత్సరాల తరువాత). ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్దం ఆర్థికశాస్త్ర బహుమతి మటుకు 1969 నుండి బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ద్వారా ఇవ్వడం జరుగుతోంది. ఈ ఆరు బహుమతులు అత్యధిక పారితోషికంతో పాటు పేరు ప్రఖ్యాతలకు నిదర్శనం. ప్రతీ సంవత్సరం, ఒక్క శాంతి బహుమానం తప్ప మిగతా ఐదు బహుమతులు నోబెల్ వర్ధంతి, డిసెంబరు 10 నాడు, స్టాక్ హోంలో ఇస్తారు. వివిధ రంగాలలో విశేషమైన కృషి/పరిశోధనలు చేసిన, విప్లవాత్మక విధానాలు/పరికరాలతో శాస్త్రాన్ని ముందంజ వేయించిన, మానవ సమాజానికి ఆ శాస్త్రంతో అత్యంత సహాయాన్ని అందించిన వ్యక్తులకు, సంస్థలకు (శాంతి బహుమతి మాత్రమే) ఇవ్వబడుతుంది.

Nobel Prize
A golden medallion with an embossed image of Alfred Nobel facing left in profile. To the left of the man is the text "ALFR•" then "NOBEL", and on the right, the text (smaller) "NAT•" then "MDCCCXXXIII" above, followed by (smaller) "OB•" then "MDCCCXCVI" below.
Awarded forContributions that have conferred the greatest benefit to humankind in the areas of Physics, Chemistry, Physiology or Medicine, Literature, Economics and Peace.
దేశం
  • Sweden (all prizes except the Peace Prize)
  • Norway (Peace Prize only)
అందజేసినవారు
Reward(s)A gold-plated green gold medal, a diploma, and a monetary award of 10 million SEK
మొదటి బహుమతి1901; 123 సంవత్సరాల క్రితం (1901)
Last awarded2022
Number of laureates609 prizes to 975 laureates (as of 2021)
వెబ్‌సైట్https://www.nobelprize.org/ Edit this on Wikidata

నోబెల్ పురస్కారం ప్రదానం చేసే రంగాలు: మార్చు

 
సర్ ఆల్ఫ్రెడ్ నోబెల్

నోబెల్ పురస్కారం 6 ప్రముఖ రంగాలలో ఇవ్వబడుతుంది. అవి,

నోబెల్‌ బహుమతి ఒక అత్యున్నత పురస్కారం, ఒక మహా స్వప్నం. మనదేశంలో పుట్టినవారుగానీ, ఈ దేశ పౌరసత్వం స్వీకరించిన వారు గానీ, ఈ దేశ వారసత్వం ఉన్నవారు గానీ నోబెల్‌ బహుమతి ప్రవేశపెట్టిన నూట పది సంవత్సరాలలో ఇప్పటి వరకూ కేవలం ఎనిమిది మందిని మాత్రమే నోబెల్‌ బహుమతి వరించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో శాస్తవ్రేత్తలు నోబెల్‌ బహుమతి కోసం యాభై సంవత్సరాల పాటు ఎదురుచూచిన వారు ఉన్నారంటే దాని గౌరవం ఏపాటిదో తెలుసుకొనవచ్చు. ఏవిధంగా చూచినా నోబెల్‌ బహుమతి వంటి విశిష్ట సత్కారం ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదనటం అతిశయోక్తి కాదు.

నోబెల్‌ పుట్టుక మార్చు

విజ్ఞానం అనంతం. కాలం, దేశం, జాతి వంటి అవధులు దానికి వుండవు. అందుకే విజ్ఞాన ఖనులైన మహనీయులను మనం అన్ని విధాలుగా సత్కరించడం అవసరం. ఈ సత్కార్యాచరణ జరిపించాలనే సదుద్దేశంతో ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ తాను సంపాదించిన యావదాస్తితో 1900 సంలో నోబెల్‌ సంస్థలను స్థాపించి 1901 సం. నుండి నోబెల్‌ బహుమతి ప్రకటించి సత్కరించడం విశేషం.

నోబెల్‌ ఉద్దేశ్యం మార్చు

ప్రతి సంవత్సరం జాతి మత ప్రాంత వివక్ష లేకుండా ‘మానవజాతి మేలుకోసం’ మహత్తరమైన కృషి చేసిన వారికి ఇవ్వబడతాయి. ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ అనే స్వీడిష్‌ శాస్తవ్రేత్త తన వీలునామాలో తనకు గల యావదాస్తి 90 లక్షల డాలర్ల విలువైన ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం నుంచి ప్రతి సంవత్సరం అయిదు రంగాలలో బహుమతులను ఏర్పాటు చేయాలని నిర్దేశించాడు. భౌతిక, రసాయానిక, శరీర నిర్మాణ లేక వైద్య శాస్త్రాలలోను ఆదర్శవంతమైన, అత్యున్నత ప్రమాణాలు కలిగిన గ్రంథానికిగాను సాహిత్యంలోనూ, అంతర్జాతీయ రంగంలో శాంతికిగాను విశిష్ట సేవ చేసినందుకు ఈ బహుమతులు ఇవ్వాలని ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ తన విల్లులో ప్రతిపాదన చేసాడు.

నోబెల్‌ ఎంపిక - అర్హత మార్చు

బహుమతికి అర్హులైన వారిని ఎంపిక చేసుకోవడానికి విస్తృతమైన పరిశోధన అనుసరిస్తారు. తద్వారా జరిపే మూల్యాంకన విధానమే ఇప్పటికీ ‘నోబెల్‌ బహుమతి’ ఘనతకు, గౌరవానికి కారణం. నోబెల్‌ బహుమతికి అర్హులను ఎన్నిక చేయటానికి కొందరు వ్యక్తులను ముందుగా ఎంపికచేస్తారు.. అందుకుగాను ఎన్నిక చేయబడిన వ్యక్తులలో ఒకరు సిఫారసు చేస్తూ నోబెల్‌ బహుమతి పొందటానికి అర్హులని వ్రాత మూలకంగా తెలియపరిస్తే అర్హత పొందగల్గుతారు. నోబెల్‌ బహుమతి ప్రకటించే సంస్థలు దాదాపు ఆరువేల మంది వ్యక్తులను ప్రతిపాదించటానికి లేక నామ్నీకరణం చేయటానికి ఆహ్వానిస్తారు. నోబెల్‌ శాంతి బహుమతి మాత్రం కేవలం సంస్థలకే ఇవ్వడం జరుగుతుంది. నోబెల్‌ కమిటీ తన సన్నాహక కార్యక్రమాన్ని ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రారంభిస్తుంది. బహుమతి ప్రదాన కమిటీలు పూర్తి నిర్ణయాలు అధికారాలు ఉన్న సంఘాలు, ఏకగ్రీవంగా కమిటీ చేసిన ఏ ప్రతిపాదననైనా బహుమతి నిర్ధాయక సంఘం తోసిపుచ్చవచ్చు. బహుమతి నిర్ధాయక సంఘంవారి అంతిమ నిర్ణయం తిరుగులేనంది. ఆ నిర్ణయాలకు ఇక పునర్విచారణ ఉండదు.

నోబెల్‌ బహుమతి విలువ మార్చు

నోబెల్‌ బహుమతి ప్రదానోత్సవం ప్రతి సంవత్సరం ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ వర్ధంతి అనగా డిసెంబరు 10వ తేదీ నాడు జరిగింది. ఈ బహుమతి ప్రదానోత్సవం స్టాక్‌హోమ్‌లోని సమావేశ మందిరంలో జరుగుతుంది. స్వీడన్‌ రాజు చేత ప్రతీ బహుమతి గ్రహీతకు ఒక యోగ్యతాపత్రం, బంగారు పతకం, బహుమతి ధనం, నిర్థారక పత్రాలనూ బహుకరిస్తారు. నోబెల్‌ బహుమతికై ఇచ్చే ధనం చాలా ఎక్కువగానే ఉంటుంది. నోబెల్‌, తాను స్థాపించిన పరిశ్రమలపై వచ్చే ఆదాయాన్ని కొంత భాగం దీనికి మళ్ళించినందువల్ల ఈ మొత్తం సంవత్సరం, సంవత్సరం మారుతూ వుంటుంది. దీని విలువ భారతీయ విలువ ప్రకారం దాదాపు 300 కోట్ల రూపాయలు ఉండవచ్చని అంచనా.

నోబెల్‌ బహుమతి పొందిన భారతీయులు మార్చు

భారతీయులు గాని, భారత సంతతికి చెందిన వారు గానీ, భారత పౌరసత్వం స్వీకరించినవారు గానీ మొత్తం ఎనిమిది మంది నోబెల్‌ బహుమతి పొందారు.

రవీంద్రనాథ్‌ టాగూర్‌, (1913) మార్చు

ఆధునిక కాలంలో భారతీయ కవిత్వానికి ఒక మైలురాయిగా నిలిచి దేశ విదేశాలలో భారతీయ కీర్తి పతాకను ఎగురవేసిన మహా కవులలో ఆధునికుడు రవీంద్రనాథ్‌ టాగూర్‌. ప్రపంచంలో ఒకే కవి వ్రాసిన రెండు గీతాలను రెండు దేశాలు తమ జాతీయ గీతాలుగా చేసుకున్న ఘనత గల ఒక మహాకవి రవీంద్రనాధ్‌ టాగూర్‌. భారత, బంగ్లాదేశ్‌ రెండింటికి అతను వ్రాసిన గీతాలే జాతీయ గీతాలు. ఇంతేగాకుండా తన కవితా సంపుటం ‘గీతాంజలి’కి 1913వ సంవత్సరపు సాహిత్యంలో నోబెల్‌ బహుమతి పొంది భారత కీర్తి బావుటాను ఎగురవేసిన భారత ముద్దుబిడ్డ నోబెల్‌ బహుమతి పొందిన మొదట ఆసియావాసి. సంపూర్తిగా సలలితమైన కొత్తవైన, సొగసైన పద్యాలతో అతనిలో నిబిడీకృతమై ఉన్న నైపుణ్యంతో, కవితా చాతుర్యాన్ని పాశ్చాత్య సాహిత్యంలో కొంత భాగమైన ఇంగ్లీషు భాషలో తన స్వంత పదాలతో వ్యక్తపరచినందులకు నోబెల్‌ బహుమతి అతనికి ఇవ్వబడింది. గాంధీ, నెహ్రుల తరువాత భారతదేశంలో ప్రసిద్ధులైన వ్యక్తులలో రవీంద్రనాధ్‌ టాగూర్‌ ఒకరు.

సర్‌ సి.వి.రామన్‌ (1930) మార్చు

భారతదేశానికి ప్రాచీనకాలం మంచి విజ్ఞాన శాస్త్రంలో కొంత కృషి చేసిన కీర్తి ఉంది. కానీ తురుష్కుల పరిపాలనలో దేశం వెయ్యి సంవత్సరాలకు పైగా అణగి మణగి ఉండటంతో మన విజ్ఞాన శాస్త్ర జ్ఞాన సంపద లుప్తం అయింది. ఆసక్తి అడుగంటి పోయింది. అలాంటి సమయంలో, దేశాన్ని ప్రపంచ విజ్ఞానశాస్త్ర పటం మీదకు చేర్చ గలిగినవాడు, నేటికి నాటికి కూడా పూర్తి భారతీయుడై ఉండి తన విజ్ఞాన శాస్త్ర్త పరిశోధనలకు నోబెల్‌ బహుమతిని పొందిన మహామహుడు ఒక్కడు ఉన్నాడు. అతనే సర్‌ చంద్రశేఖర్‌ వెంకటరామన్‌. వాల్తేరులో ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాశాల శాస్త్ర సాంకేతిక శాఖ సంపూర్ణ అభివృద్ధికి అతను చాలా గొప్ప నిర్మాణాత్మక పాత్రవహించాడు. 1954 లో భారత ప్రభుత్వం మొట్టమొదటిసారిగా దేశంలో అత్యుత్తమ బిరుదు ‘భారతరత్న’ను ప్రవేశపెట్టి సర్వేపల్లి రాధాకృష్ణన్‌, చక్రవర్తుల రాజగోపాలాచారి, సి.వి.రామన్‌కు ప్రధానం చేసింది.

హర్‌గోవింద్‌ ఖొరానా (1968) మార్చు

1968వ సంవత్సరపు శరీరధర్మ శాస్త్రం లేక వైద్య శాస్త్రానికి నోబెల్‌ బహుమతి గెలుచుకున్న ముగ్గురిలో హర్‌గోవింద్‌ ఖొరానా ఒకరు. మిగిలిన ఇద్దరు అమెరికాకు చెందిన కార్నెల్‌ విశ్వవిద్యాలయ ఆచార్యులు రాబర్ల్‌ డబ్ల్యు. హాలీ, రెండవ వాడు హర్‌గోవింద్‌ ఖురానా, మూడవ వ్యక్తి బెథెస్టాలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌లో పనిచేస్తున్న పరిశోధకులు మార్షల్‌ డబ్ల్యు. నిరెన్‌బెర్గ్‌. అవిభక్త భారతదేశాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వం వారు పరిపాలిస్తున్న కాలంలో పశ్చిమ పంజాబ్‌ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌ గ్రామంలో హిందూ దంపతులకు జన్మించాడు. రాయ్‌పూర్‌ గ్రామం కేవలం వంద మంది జనాభా గల చిన్న గ్రామం. బాగా పేద కుటుంబం అయినా ఖురానా తండ్రి కొడుకును బాగా చదివించాడు. 1945లో అప్పటి ప్రభుత్వ సహకారంతో ఇంగ్లాండుకు వెళ్ళి లివర్‌పూల్‌ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌.డి చేసే అవకాశం లభించింది. విజ్ఞాన శాస్త్రంలోమాలిక్యులర్‌ బయాలజీ’ అనే కొత్త శాఖకు పునాది వేసి ఇందులో విశేషమైన కృషి చేసాడు. 1958 నుండి 1968 వరకు కేవలం 5 సార్లు మాత్రమే వైద్యశాస్త్రంలో అత్యుత్తమ కృషికి ఇవ్వబడిన నోబెల్‌ బహుమతి జన్యుశాస్త్రంలో జరిగిన పరిశోధనకు ఇవ్వటం మాలిక్యులర్‌ బయాలజీ ప్రాముఖ్యాన్ని తెలుపుతుంది.

మదర్‌ థెరిస్సా (1979) మార్చు

మానవ సేవ కన్నా మిన్న లేదని చాటిన మహిళామణి మదర్‌ థెరిస్సా. ఈ దేశంలో పుట్టకపోయినా, ఈ దేశంలోని ఆపన్నులు, ఆర్తులు, ఆపదలో ఉన్నవారిని ఆదుకొనుటలో ఆమెను మించిన వారు లేరు. ప్రపంచంలోని గొప్ప మహిళామణులలో ఎవరు అంటే ఆమె పేరు పేర్కొనకుండా వేరొకరి పేరు చెప్పటానికి కుదరదు. అందుకే ఆమె ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన వనిత అనటంలో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు. 1929 జనవరి 6భారతదేశంలోని కలకత్తా నగరం చేరుకుంది. అప్పటినుండి విద్యాబోధన చేస్తూ... 1947లో పేదరికాన్ని స్వీకరిస్తున్నట్లు ప్రమాణం చేసింది. ‘శాంతినగర్‌’ అనే పేరుతో అసన్‌సోల్‌ నగరం ఒక కాలనీ కట్టుకునేటట్లు కుష్టు రోగం గలవారిని ప్రోత్సహించింది. స్ర్తీ ధార్మిక సమాఖ్య, మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీ అనే ధార్మిక సంస్థను నెలకొల్పింది. పద్మశ్రీ పురస్కారం, భారతరత్న లాంటి అత్యున్నత పురస్కారాలు మదర్‌ థెరిస్సాకు అందించారు. ఆమె చేసిన సేవలు శాంతి బోధనకు ప్రపంచ అత్యున్నత పురస్కారం నోబెల్‌ శాంతి బహుమతి ఆమెను వరించింది.

సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌ (1983) మార్చు

భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతిని పొందిన భారత సంతతికి చెందిన రెండవ వ్యక్తి సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌. సర్‌ సి.వి.రామన్‌ లాగానే ఇతను కూడా దక్షిణ భారత దేశానికి చెందినవాడే. అతను చికాగో విశ్వవిద్యాలయ పరిశోధన సభ్యులలో ఒకరిగా 1937వ సంవత్సరం జనవరి నెలలో చేరాడు. అప్పటినుంచి చివరివరకూ అతను సుదీర్ఘకాలం పాటు అంటే 60 సంవత్సరాలకు పై ఆ విశ్వవిద్యాలయంలోనే పనిచేసాడు. చంద్రశేఖర్‌ ఇరవై వరకు గౌరవ పట్టాలు పొందాడు. ఇరవై ఒక్క ప్రముఖ సంస్థలలో సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 1983లో నోబెల్‌ బహుమతితో సహా ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు పొందాడు. అతను గౌరవ స్మృతి చిహ్నంగా 1999లో అమెరికా ప్రయోగించిన ‘ఎక్స్‌రే అంతరిక్ష ఖగోళ దర్శిని’కి ‘చంద్రా’ అని పేరుపెట్టడం అతనికి దక్కిన అరుదైన గౌరవం.

అమర్త్యసేన్‌ (1998) మార్చు

అర్థశాస్త్రంలో నోబెల్‌ బహుమతిని అందుకున్న వారిలో భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే ఏకైక వ్యక్తి ప్రొఫెసర్‌ అమర్త్యసేన్‌. మొత్తం ప్రపంచ దేశాలు, అర్థశాస్త్రం మీద నూతన దృష్టిసారించిన వ్యక్తి అమర్త్యసేన్‌. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని శాంతినికేతన్‌లో పుట్టిన అమర్త్యసేన్‌కు పేరు పెట్టింది. రవీంద్రనాథ్‌ టాగూర్‌. అమర్త్యసేన్‌ ప్రపంచ ఆర్థికశాస్త్రంలో దారిద్య్రం, కరువులకు అన్వ యించేటట్లుగా నైతిక, తాత్త్విక అసమానతలు వివరించాడు. అతని బహుముఖ ప్రజ్ఞకు 1998లో అతనికి ఆర్థిక శాస్త్రంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నోబెల్‌ బహుమతి వరించింది. అదే సంవత్సరం భారతదేశపు అత్యంత ప్రతిష్ఠాత్మక ‘భారతరత్న’ బిరుదు ఇవ్వబడింది. ఇప్పటివరకు అర్థశాస్త్రంలో నోబెల్‌ బహుమతి పొందిన ఏకైక మేధావి.

విద్యాధర్‌ సూరజ్‌ నయిపాల్‌ (2001) మార్చు

విద్యాధర్‌ సూరజ్‌ నయిపాల్‌ పూర్వీకుల రీత్యా భారత సంతతికి చెందినవాడు. అతని తాతలనాడే వెస్టిండీస్‌లోని ట్రినిడాడ్‌ దీవికి వ్యవసాయక్షేత్రాలలో కూలీలుగా పనిచేయటానికి వెళ్ళారు.అతనికి గ్రేట్‌ బ్రిటన్‌ పౌరునిగా పరిగణనతో నోబెల్‌ బహుమతి ఇవ్వబడింది. కానీ, అతని పూర్వీకులు భారతీయ సంతతికి చెందిన వారు కావడం వలన మనం ప్రస్తావించడం జరుగుతుంది. మనోగోచారమైన, అర్థవంతమైన నిశితమైన పరిశీలనను తన రచనలలో ఏకం చేయ గలిగిన ప్రజ్ఞ, అణచివేయబడిన చరిత్రల ఉనికిని వాటితో ప్రతిఫలింపచేసినందుకు సాహిత్యంలో వి.ఎస్‌.నయిపాల్‌కు నోబెల్‌ పురస్కారం లభ్యమైంది.

వెంకట్రామన్‌ రామకృష్ణన్‌ (2009) మార్చు

సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌, విద్యాధర్‌ సూరజ్‌ నయిపాల్‌ల తరువాత నోబెల్‌ పురస్కారం అందుకున్న, విదేశాల్లో స్థిరపడిన మరో భారత సంతతి శాస్తవ్రేత్త వెంకట్రామన్‌ రామృష్ణన్‌.ఇతను జీవరసాయన శాస్తజ్ఞ్రుడు. తమిళనాడులోని చిదంబరంలో 1952 సంవత్సరములో జన్మించాడు. తండ్రి ఉద్యో గరీత్యా గుజరాత్‌కు వెళ్ళడంతో బాల్యం, విద్యాభ్యాసమంతా బరోడాలో గడిచింది. మహారాజా శాయాజీరావు విశ్వవిద్యాలయంలో బీయస్సీ ఫిజిక్స్‌ చదివాడు. తర్వాత అమెరికా వెళ్ళి భౌతికశాస్త్రంలో పీహెచ్‌.డీ చేసి అక్కడే స్థిరపడ్డాడు. రైబోసోముల రూపం, ధర్మాలపై చేసిన పరిశోధనలకు గాను రసాయన శాస్త్రంలో 2009 నోబెల్‌ పురస్కారం లభించింది.

గాంధీకి నోబెల్‌ బహుమతి రాని కారణం మార్చు

ఇది ప్రపంచంలోని అనేకులకు వచ్చే ఇంకొక సందేహం. 1937, 1938, 1939, 1947 సంవత్సరాలలో మహాత్మా గాంధీ పేరు నోబెల్‌ శాంతి బహుమతి కోసం ప్రతిపాదించడం జరిగింది. 1937లోను, అటు తరువాత కొంతకాలం పాటు అతని అనుచరులకే అర్థం కాని సిద్ధాంతాలున్నాయని నోబెల్‌ కమిటీవారు అతని పేరును తుది జాబితాలో చేర్చలేదు. 1947లో పాకిస్తాన్‌ ఏర్పాటు విషయంలో వివాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో అతనికి అవార్డు ఇవ్వకూడదని కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1948లో నోబెల్‌ శాంతి బహుమతి కోసం మహాత్మా గాంధీని ఎంపిక చేశారు. అయితే అతను ఆ సంవత్సరం జనవరి 30వ తేదీన తుపాకీ గుండ్లకు బలి అయ్యాడు. అప్పట్లో ఉన్న నియమం ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితులలోనే మరణించిన వ్యక్తులకు నోబెల్‌ బహుమతులు ప్రకటించాలనేది నిబంధన. గాంధీ ఒక సంస్థకు ప్రతినిధి కాదు. మరణ విల్లును వ్రాయలేదు. బహుమతి ఎవరికి అందజేయాలో నోబెల్‌ సంస్థకు తెలియకపోవడంతో ప్రతిపాదన విరమించుకోబడింది. ఒక అర్హులు ఎవ్వరూ లేకపోవడంతో ఆ సంవత్సరం నోబెల్‌ శాంతి బహుమతి ఎవ్వరికీ ఇవ్వలేదు. అంతేగాని కొందరు ఊహించినట్లుగా అతను బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా ఉద్యమం నడపటం వలన, తెల్లవారికి వ్యతిరేకంగా నల్ల వారి తరపున ఉద్యమాలకు నాయకత్వం వహించటం వలనే మహాత్మా గాంధీకి నోబెల్‌ బహుమతి ఇవ్వలేదనే వాదం సరియైంది కాదు. ఇలా ఈ బహుమతుల మీద ఎన్నో ప్రశంసలు, ఎన్నో విమర్శలు ఉన్నాయి.

ఇవీ చూడండి మార్చు

మూలం మార్చు

  1. "THE SVERIGES RIKSBANK PRIZE IN ECONOMIC SCIENCES IN MEMORY OF ALFRED NOBEL".

వెలుపలి లంకెలు మార్చు

  • సూర్య ఆదివారం అనుబంధం / కూనిరెడ్డి శ్రీనివాస్
  • సౌజన్యం: సూర్య తెలుగు దినపత్రిక వార్తా పత్రిక ఆదివారం అనుబంధం: