పథేర్ పాంచాలి
పథేర్ పాంచాలి (బెంగాలీ-pɔt̪ʰer pãtʃali, తెలుగు అర్థం-చిన్న దారి పాట) సత్యజిత్ రే దర్శకత్వంలో, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్మించిన 1955 నాటి బెంగాలీ చలనచిత్రం. 1928లో బిభూతి భూషణ్ బందోపాధ్యాయ్ రాసిన పథేర్ పాంచాలి నవల ఈ సినిమా కథకు ఆధారం. ఇది సుప్రసిద్ధ భారతీయ దర్శకుడు సత్యజిత్ రే దర్శకత్వం వహించిన తొలి సినిమా. అపు చిత్రత్రయంలో పథేర్ పాంచాలి మొదటిది - దీనిలో అపు బాల్యం చిత్రీకరించారు. ఈ చిత్రం 1955లో నిర్మించబడిన సినిమాలలో ఉత్తమ బెంగాలీ సినిమాగా జాతీయ చలన చిత్ర పురస్కారాన్ని పొందింది.
ఇతివృత్తం సవరించు
బెంగాలీ బ్రాహ్మణ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అపు అనే పిల్లాడి బాల్యం ఇందులో ప్రధాన ఇతివృత్తం. ప్రధానంగా కథంతా బెంగాల్ లోని ఓ పల్లెటూర్లో సాగుతుంది. అపు తల్లిదండ్రులు సర్బజయ, హరిహరరాయ్, అతని అక్క దుర్గ. పూజారిగా పనిచేస్తున్న హరిహరరాయ్ కుటుంబం పేదరికంతో బాధపడుతూ ఉంటుంది. హరిహరరాయ్ వరుసకు అక్కగారైన ముసలి స్త్రీ ఇందర్ ఠాకూర్న్ కూడా వారితోనే నివసిస్తూంటారు. కొన్నాళ్ళకు ఇందర్ మరణిస్తారు. అంతేకాక దురదృష్టవశాత్తూ యుక్తవయస్సుకు వచ్చిన దుర్గ కూడా మరణిస్తుంది. ఇల్లు పాడుపడిపోతుంది, ఇలాంటి స్థితిగతుల మధ్య పల్లెటూళ్ళో జీవించలేక హరిహరరాయ్, సర్బజయ, అపు కలకత్తా వలస వెళ్ళిపోవడంతో సినిమా ముగుస్తుంది.[1]
సిబ్బంది సవరించు
నటీనటులు సవరించు
- హరిహరరాయ్ గా కానూ బెనర్జీ
- సర్బజయ రాయ్ గా కరుణ బెనర్జీ
- అపూర్బ రాయ్ (అపు) గా సుబీర్ బెనర్జీ
- దుర్గా రాయ్ (చిన్నతనం) గా రుంకీ బెనర్జీ
- దుర్గా రాయ్ (యుక్తవయసు) గా ఉమా దేశ్ గుప్తా
- ఇందిర్ ఠాకూర్న్ గా చునిబాలా దేవి
- పాఠశాల మాస్టారు ప్రసన్నగా తులసీ చక్రబొర్తి
సాంకేతిక నిపుణులు సవరించు
- దర్శకుడు - సత్యజిత్ రే
- నిర్మాత - పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
- నేపథ్య సంగీతం - రవి శంకర్
- ఛాయాగ్రాహకుడు - సుబ్రతా మిత్రా
- కూర్పు - దులాల్ దత్తా
నిర్మాణం సవరించు
అభివృద్ధి సవరించు
1928లో బిభూతిభూషణ్ బందోపాధ్యాయ్ రాసిన పథేర్ పాంచాలి నవల ఎప్పుడు ప్రజాదరణ కోల్పోతే అప్పుడే ఆపివేసే షరతు మీద పత్రికలో ప్రచురితమై మంచి పాఠకాదరణ పొందింది. తర్వాతి సంవత్సరమే ప్రచురితమై, బెంగాలీ సాహిత్యంలో నిలిచిపోయిన పాత్రగా అపు, నవలగా పథేర్ పాంచాలి నిలిచాయి. 1940ల్లో శాంతినికేతన్లో లలిత కళల్లో చదువుకుని బయటకి వచ్చి కథకుడు, చిత్రకారుడు సత్యజిత్ రే భారతీయ సినిమాల్లో ప్రేమ పాటలు, మార్మిక పురాణాలు తప్ప జనజీవితం స్ఫూర్తినివ్వకపోవడంపై చాలా అసంతృప్తి కలిగివుండేవారు. అందుకే బెంగాలీ గ్రామీణ జీవిత వాస్తవాన్ని, వారి ఆశల్ని, కలల్ని ప్రతిబింబించిన పథేర్ పాంచాలి నవలను సినిమాగా మలిచారు.[1]
మూలాలు సవరించు
- ↑ 1.0 1.1 విష్ణుభొట్ల, లక్ష్మన్న (నవంబరు 2008). "రహదారి పాట - `పథేర్ పాంచాలి' సత్యజిత్ రాయ్ సినిమా". ఈమాట. Retrieved 8 April 2016.