మదర్ థెరీసా

అల్బేనియాలో జన్మించిన భారత పౌరసత్వం పొందిన రోమన్ కేథెలిక్ సెయింట్

మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/),గా జన్మించిన అల్బేనియా[2][3] (Albania) దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని. భారతదేశ [4] పౌరసత్వం పొంది మిషనరీస్ ఆఫ్ ఛారిటీని (Missionaries of charity) భారతదేశంలోని కోల్కతా (కలకత్తా) లో, 1950 లో స్థాపించింది. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారత దేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసింది.

మదర్ థెరీసా
మదర్ థెరీసా
జననం(1910-08-26)1910 ఆగస్టు 26
(యుస్కుబ్, ఓట్టోమాన్ సామ్రాజ్యం, ప్రస్తుతపు స్కోప్జే, ఉత్తర మేసిడోనియా)
మరణం1997 సెప్టెంబరు 5(1997-09-05) (వయసు 87)
జాతీయతఅల్బేనియా
వృత్తిరోమన్ కేథలిక్ సన్యాసిని, మానవతావాది[1]

మాల్కం ముగ్గేరిడ్జ్(Malcolm Muggeridge) చే రచింపబడిన సమ్ థింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ (Something beautiful for God) అనే పుస్తకం, డాక్యుమెంటరీ ద్వారా 1970 ల నాటికి మానవతా వాదిగా, పేద ప్రజలు, నిస్సహాయుల అనుకూలురాలిగా అంతర్జాతీయ కీర్తి పొందింది. ఈమె తన మానవ సేవకు గాను 1979లో నోబెల్ శాంతి పురస్కారాన్ని, 1980లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను పొందింది. మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ బాగా విస్తృతమై, ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి, హెచ్ఐవి/ఎయిడ్స్ (HIV/AIDS), కుష్టు, క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల, కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాథ శరణాలయాలను, పాఠశాలలను స్థాపించింది.

ఆమె అనేక మంది వ్యక్తులు, ప్రభుత్వాలు, సంస్థలచే ప్రశంసింపబడినప్పటికీ, అనేక రకాల విమర్శలను ఎదుర్కున్నది. ఆమె తన కార్యక్రమాలలో భాగంగా మత మార్పిడులను ప్రోత్సహించడం, గర్భ స్రావం పట్ల తీవ్ర నిరోధకత, పేదరికం పట్ల మతపరమైన నమ్మకాలను కలిగి ఉండడం, మరణశయ్యపై ఉన్నవారికి క్రైస్తవ మతాన్ని ఇవ్వడం వంటి ఆరోపణలను క్రిస్టఫర్ హిచెన్స్, మిఖాయెల్ పరేంటి, అరూప్ ఛటర్జీ వంటి వ్యక్తులు, విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలనుండి ఎదుర్కున్నారు. అనేక మెడికల్ జర్నల్స్ ఆమె ధర్మశాలలో అందుతున్న వైద్య ప్రమాణతను విమర్శించాయి. విరాళాల ధనాన్ని ఖర్చు పెట్టడంలో పారదర్శకత లేక పోవడం పట్ల కూడా వ్యాకులత వ్యక్తమైంది.[5] ఆమె మరణానంతరం పోప్ జాన్ పాల్ II చే దైవ ఆశీర్వాదం (బీటిఫికేషన్), బ్లెస్డ్ థెరెసా ఆఫ్ కలకత్తా బిరుదు పొందింది.

ప్రారంభ జీవితం

ఆగ్నెస్ గొంక్శే బోజక్షిహ్యు (Anjezë Gonxhe Bojaxhiu; గొంక్శే అనే పదానికి " అల్బేనియన్ భాషలో గులాబీ మొగ్గ అని అర్థం) 1910 ఆగష్టు 26న ఉస్కుబ్, ఒట్టోమన్ సామ్రాజ్యం(ఇప్పుడు స్కోప్జే, ఉత్తర మేసిడోనియా) ముఖ్య పట్టణం,లో జన్మించింది. ఆమె పుట్టిన మరునాడే ఆమెకు జ్ఞానస్నానం (Baptism) చేయించారు. అందువలన ఆమె ఆగష్టు 26 న జన్మించినప్పటికీ, క్రైస్తవమతం స్వీకరించిన ఆగష్టు 27ను తన నిజమైన జన్మదినంగా భావించే వారు. ఆమె అల్బేనియాలోని స్కోదర్ చెందిన నికోల్లే, డ్రాన బొజాక్షిహ్యు దంపతుల ఆఖరి సంతానం. ఈమె తండ్రి అల్బేనియా రాజకీయాలలో పాల్గొనేవాడు. 1919 లో, ఆగ్నెస్ కు ఎనిమిది సంవత్సరాల వయస్సున్నపుడు, స్కోప్జేని అల్బేనియా నుండి తొలగించే నిర్ణయం తీసుకున్న ఒక రాజకీయ సమావేశం తరువాత ఆమె తండ్రి జబ్బుపడి మరణించాడు.[6] ఆమె జీవిత చరిత్రలో రచయిత తండ్రి చనిపోయే నాటికి ఆమె వయస్సు 10 సంవత్సరాలని వ్రాయగా, ఆమె సోదరుని ఇంటర్వ్యూ ద్వారా, వాటికన్ పత్రాల ద్వారా ఆమె వయస్సు ఎనిమిది సంవత్సరాలు అయ్యే అవకాశం కూడా ఉండవచ్చని తెలుస్తూంది. ఆమె తండ్రి మరణం తరువాత తల్లి ఆమెను రోమన్ కథొలిక్ (Roman catholic) గా పెంచారు. జోన్ గ్రాఫ్ఫ్ క్లూకాస్ (Joan Graff Clucas) చే రచింపబడిన జీవితచరిత్ర ప్రకారం ఆమె తన బాల్యం లోనే మతప్రచారకుల జీవిత కథల పట్ల, వారి సేవల పట్ల ఆకర్షింపబడ్డారు. 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి తన జీవితాన్ని మతానికి అంకితం చేయాలని నిశ్చయించుకున్నారు. 18 సంవత్సరాల వయసులో ఇల్లు వదిలి సిస్టర్స్ అఫ్ లోరెటో (Sisters of Loreto) అనే ప్రచారకుల సంఘంలో చేరింది. తరువాతి కాలంలో తన తల్లిని కాని, సోదరిని కానీ కలవలేదు.

ప్రారంభంలో ఆమె సిస్టర్స్ అఫ్ లోరెటో భారతదేశంలో విద్యార్థులకు బోధించే ఇంగ్లీష్ను నేర్చుకోవడానికి ఐర్లాండ్ లోని రాట్ ఫారన్హమ్ (Rathfarnham) లో గల లోరెటో అబ్బీకి వెళ్లింది.[7] 1929 లో, ఆమె తన కొత్త శిష్యరికం ప్రారంభించడానికి భారత దేశంలో హిమాలయ పర్వతాల వద్ద నున్న డార్జిలింగ్ కి వచ్చింది.[8] 1931 మే 24 లో ఆమె సన్యాసినిగా తన మొదటి మతప్రతిజ్ఞ చేసింది. మత ప్రచారకుల సంఘం పోషక సెయింట్ ఐన తెరేసే డి లిసే (Thérèse de Lisieux) పేరు మీదుగా తన పేరును తెరెసాగా (Teresa) మార్చుకున్నది.[9][10] 1937 మే 14 లో తూర్పు కలకత్తాలోని లోరెటో కాన్వెంటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నపుడు తన పవిత్రప్రతిజ్ఞ చేసింది.[2][11]

పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఆనందించినప్పటికీ, కలకత్తా చుట్టుపక్కల పేదరికం ఆమెను కదిలించి వేసింది.[12] 1943 లో ఏర్పడిన కరువు కలకత్తా నగరానికి కష్టాలను, మరణాలను తీసుకురాగా, 1946 ఆగష్టులో ఏర్పడిన హిందూ/ముస్లిం హింస నగరాన్ని నిరాశ, భయాందోళనలకు గురిచేసింది.[13]

మిషనరీస్ అఫ్ చారిటీ

 
మిషనరీస్ అఫ్ ఛారిటీ సాంప్రదాయక చీరకట్టుతో.
 
కోల్కతాలో నిర్మల్ హృదయ్ (2005)

1946 సెప్టెంబర్ 10న తెరెసా తన సాంవత్సరిక విరామంలో భాగంగా కలకత్తా నుండి డార్జిలింగ్ లోని లోరెటో కాన్వెంటుకు ప్రయాణం చేస్తున్నపుడు తాను "పిలుపులో పిలుపు"గా పొందిన అనుభవాన్ని గురించి ఇలా తెలియ చేసారు. "నేను కాన్వెంటును వదిలి పేదల మధ్య నివసిస్తూ వారికి సేవ చేయాలి. ఇది ఒక ఆజ్ఞ. దీనిని పాటించకపోతే విశ్వాసాన్ని కోల్పోయినట్లే."[14] 1948 లో ఆమె తన సాంప్రదాయ లోరెటో అలవాటును వదిలి నిరాడంబరమైన, నీలపు అంచుగల తెల్లటి నూలు చీరను ధరించి, భారత పౌరసత్వము స్వీకరించి మురికి వాడలలో ప్రవేశించారు. ఆమె మొదట మొతిజిల్ లో ఒక పాఠశాలను స్థాపించారు; అటు వెంటనే అనాథల, అన్నార్తుల అవసరాలను తీర్చ సాగేరు.[15] తొందరలోనే ఆమె కార్యక్రమాలు అధికారుల దృష్టిని ఆకర్షించడంతో పాటు ప్రధానమంత్రి ప్రశంసలు అందుకునేలా చేసాయి.

తెరెసా తన డైరీలో తన తొలి సంవత్సరం కష్టాలతో నిండి ఉన్నట్లుగా వ్రాసుకున్నారు. ఆమెకు ఆదాయం లేకపోవడం వలన ఆహారం, ఇతర సరఫరాల కొరకు యాచించవలసి వచ్చేది. ఈ ప్రారంభ నెలలలో ఒంటరి తనము, ఆమెకు ఆశ్రమ జీవితంలోని సౌకర్యాలకు మరలి పోవాలనే ప్రేరేపణ, ఎంచుకున్న క్రొత్త దారి పట్ల సంశయమును కలిగించింది. ఈ విషయాలను తన డైరీలో వ్రాసుకున్నారు:

మా దేవుడు నన్ను పేదరికం అనే శిలువతో కప్పబడిన స్వేచ్ఛా సన్యాసినిగా వుండమంటున్నాడు. నేను ఈరోజు మంచి పాఠం నేర్చుకున్నాను. పేదల బీదరికం వారికి చాలా కష్టంగా వుండివుండాలి. ఒక ఇల్లు కొరకు వెతుకుతూ నా కాళ్లు చేతులు నొప్పిపుట్టేంతవరకూ నడిచాను. పేదవారు ఇంటికొరకు, ఆహారం , ఆరోగ్యం కొరకు వెతుకుతూ శరీరంలోను , ఆత్మలోను ఎంత బాధపడుతున్నారోనని అనుకున్నాను. అప్పుడు లోరెటో లో నున్న సుఖప్రధమైన జీవితం నన్ను లాలసకు గురిచేసింది. నీవు ఒక్క మాటంటే చాలు మరల ఆ పాత జీవితం మరలం నీదవుతుందని నన్ను లోంగదీసుకోనే గొంతు చెప్తున్నది. నా స్వేచ్ఛమైన మనస్సుతో దేవుడా, నీపై ప్రేమతో, నేను ఇక్కడే వుంటాను.నాగురించి నీ పవిత్ర ఇష్టాన్ని నెరవేరుస్తాను. నేను ఒక కన్నీటిబొట్టు కూడా రానివ్వలేదు.[16]

1950 అక్టోబరు 7 ఆమె వాటికన్ అనుమతితో మతగురువుల సంఘాన్ని ప్రారంభించారు. అదే తరువాత మిషనరీస్ అఫ్ ఛారిటీగా రూపొందింది. ఆమె మాటలలో "ఆకలిగొన్న వారల, దిగంబరుల, నిరాశ్రయుల, కుంటి వారల,కుష్టు వ్యాధి గ్రస్తుల, అందరూ త్యజించారని భావించే వారల, ప్రేమించబడని వారల, సమాజంచే నిరాకరింపబడిన వారల, సమాజానికి భారమైన వారల , అందరిచే విసర్జింపబడిన వారల "ను జాగ్రత్తగా చూడడమే ఈ సంఘం యొక్క కర్తవ్యం. ఇది కలకత్తాలో స్వల్ప స్థాయిలో 13 మంది సభ్యులతో మొదలైంది;నేడు ఇది 4,000 కు పైగా సన్యాసినులను కలిగి అనాథ శరణాలయాలు, ఎయిడ్స్ ధర్మశాలలు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తూ, శరణార్థులకు, అంధులకు, అంగవికలురకు, వృద్ధులకు, మద్యపాన వ్యసనగ్రస్తులకు, బీదవారికి , నిరాశ్రయులకు, వరద బాధితులకు, అంటువ్యాధులు , కరువు బాధితులకు సహాయం చేస్తోంది.

1952 లో మదర్ థెరీసా కలకత్తా నగరంచే ఇవ్వబడిన స్థలంలో మొదటి హోమ్ ఫర్ ది డయింగ్ (Home for the dying) ను ప్రారంభించారు. భారతదేశ అధికారుల సహాయంతో ఆమె ఒక పాడుబడిన హిందూ దేవాలయాన్ని పేద ప్రజల ధర్మశాలగా మార్చారు. ఆమె దానికి కాళీఘాట్ పరిశుద్ధ హృదయ నిలయం ( కాళీఘాట్ హోం ఫర్ ది డయింగ్) (నిర్మల్ హృదయ్) గా పేరు పెట్టారు. ఈ నిలయానికి తీసుకురాబడిన వారికి వైద్య సహాయాన్ని అందించి, వారి నమ్మకాల ప్రకారం ఆచార కర్మల ననుసరించి గౌరవంగా చనిపోయే అవకాశం కల్పించారు. ముస్లింలు ఖురాన్ చదివేవారు, హిందువులకు గంగా జలం అందించేవారు, కాథలిక్స్ కు వారి ఆచారం ప్రకారం అంత్యక్రియలు జరుపబడేవి.ఆమె మాటలలో అది "ఒక అందమైన చావు", "జంతువులలా బ్రతికిన మనుష్యులకు దేవతల వంటి చావును కల్పించడం-ప్రేమతో , అక్కరతో." ఆ వెంటనే మదర్ థెరీసా కుష్టు వ్యాధిగ్రస్తులకు శాంతి నగర్ అనే పేరుతో ధర్మశాలను ఏర్పాటు చేసారు.[17] మిషనరీస్ అఫ్ ఛారిటీ కుష్టు వ్యాధిని అధిగమించుట కొరకు కలకత్తా నగరవ్యాప్తంగా వైద్యశాలలను ఏర్పాటు చేసి, వైద్యాన్ని, కట్టు కట్టడానికి అవసరమైన వస్త్రాలను, ఆహారాన్ని అందచేసింది.

మిషనరీస్ అఫ్ ఛారిటీ అధిక సంఖ్యలో తప్పిపోయిన పిల్లలను చేరదీసింది. మదర్ థెరీసా వారికి ఆశ్రయాన్ని కల్పించాలని భావించారు. 1955 లో ఆమె అనాథలకూ, నిరాశ్రయులైన యువకుల కొరకు, పరిశుద్ధ హృదయ బాలల ఆశ్రయమైన నిర్మల శిశు భవన్ ను ప్రారంభించారు.

ఈ సంస్థ త్వరలోనే అనేకమంది కొత్త వ్యక్తులను, విరాళాలను ఆకర్షించింది. 1960 నాటికి భారతదేశ వ్యాప్తంగా అనేక ధర్మశాలలను, అనాథ శరణాలయాలను, కుష్టు వ్యాధి గ్రస్తులకేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగింది. మదర్ థెరీసా తన సంస్థలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. భారతదేశం వెలుపల వీరి మొదటి ఆశ్రయం వెనిజులాలో (Venezuela) 1965 లో ఐదుగురు సిస్టర్స్ తో మొదలైంది. తరువాత 1968 లో రోమ్, టాంజానియా, ఆస్ట్రియాలలో ; 1970 లలో ఆసియా, ఆఫ్రికా, యూరోప్లలో అనేక దేశాలలో, యునైటెడ్ స్టేట్స్ లో అనేక ఆశ్రయాలను, ఫౌండేషన్లను స్థాపించింది.

ఆమె తాత్త్వికత, ఆచరణలు కొంత విమర్శకు గురయ్యాయి. మదర్ థెరీసా ప్రజలను కేవలం బ్రతికి ఉంచేందుకు పరిమితమయ్యారు కాని వారి దారిద్ర్యాన్ని సమూలంగా తొలగించేందుకు ప్రయత్నించలేదని డేవిడ్ స్కాట్ (David Scott) వ్రాసారు.[18] బాధితుల పట్ల ఆమె దృక్పథంపై కూడా ఆమె విమర్శలను ఎదుర్కొన్నారు. అల్బెర్ట రిపోర్ట్ (Alberta report) లోని ఒక వ్యాసం, ఆమె, బాధ అనేది ప్రజలను క్రీస్తు సమీపానికి చేరుస్తుందని భావించారని తెలియచేసింది.[19] అంత్యదశలో ఉన్న రోగగ్రస్తులకు హోమ్ ఫర్ డయింగ్ లో అందించే సేవలు వైద్య పత్రికారంగ విమర్శలకు గురయ్యాయి, ప్రత్యేకించి ది లాన్సెట్], బ్రిటిష్ మెడికల్ జర్నల్ చర్మము క్రింద ఇచ్చే సూదులను తిరిగి వాడటాన్ని, దయనీయమైన నివాస పరిస్థితులను, రోగులందరికీ చన్నీటి స్నానాలను, సరైన రోగానిర్ధారణకు దోహదం చేయని భౌతికవాద వ్యతిరేక ధోరణిని విమర్శించాయి.[20]

ది మిషనరీస్ అఫ్ ఛారిటీ బ్రదర్స్ (Missionaries of Charity Brothers) సంస్థ 1963 లోను, ధ్యానపరులైన సిస్టర్ల సంస్థ 1976 లోను స్థాపించబడ్డాయి. సాధారణ కాథలిక్ లు, నాన్ కాథలిక్ లు కో-వర్కర్స్ అఫ్ మదర్ థెరీసాలో నమోదు చేసుకున్నారు. జబ్బులతో, వ్యాధులతో బాధపడుతున్నవారు ది లే మిషనరీస్ అఫ్ ఛారిటీలో చేరారు. 2007 నాటికి మిషనరీస్ అఫ్ ఛారిటీ ప్రపంచవ్యాప్తంగా 450 మంది సన్యాసులను, 5,000 మంది సన్యాసినులను కలిగి, 600 శాఖలను నిర్వహిస్తూ, 120 దేశాలలో పాఠశాలలను, ఆశ్రయాలను కలిగి ఉంది.[21]

అంతర్జాతీయ దాతృత్వం

1982 లో బీరూట్ (Beirut) ఆక్రమణకు గురైన సందర్భంలో, మదర్ థెరీసా ఇజ్రాయిల్ సైన్యానికి, పాలస్తీనా గెరిల్లాలకు మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించి ఒక వైద్యశాలలో చిక్కుకుపోయిన 37 మంది పిల్లలను కాపాడారు.[22] ఈ యువ రోగులను నాశనం కాబడిన వైద్యశాల నుండి బయటకు తీసుకు రావడానికి ఆమె రెడ్ క్రాస్ కార్యకర్తలతో కలిసి యుద్ధరంగంలో ప్రయాణించారు.[23]

1980 లలో తూర్పు ఐరోపా బాహ్య ప్రపంచంలోకి వచ్చినపుడు, అనేక కార్యక్రమాలను ప్రారంభింప చేసి ఆమె తన ప్రయత్నాలను కమ్యూనిస్ట్ దేశాలకు విస్తరించారు. గర్భస్రావం, విడాకుల పట్ల తన అభిప్రాయాలపై వచ్చిన విమర్శలను ఆమె స్థిరంగా ఎదుర్కొని, "ఎవరేమన్నా, చిరునవ్వుతో దానికి అంగీకరించి నీ పనిని నువ్వు చేసుకొని పోవాలి", అని పేర్కొనారు.

మదర్ థెరీసా ఇథియోపియాలో ఆకలి బాధితులకు, చెర్నోబిల్లో అణుధార్మికత పీడితులకు, అర్మేనియాలో భూకంపం వలన నష్టపోయిన వారికీ సహాయం చేసి ఓదార్చడానికి వెళ్లారు.[24][25][26] 1991 లో,మదర్ థెరీసా మొదటిసారి తన మాతృదేశానికి తిరిగి వెళ్లి అల్బేనియా లోని టిరానాలో మిషనరీస్ అఫ్ ఛారిటీ బ్రదర్స్ హోమ్ ని ప్రారంభించారు.

1996 నాటికి ఆమె 100కు పైగా దేశాలలో 517 శాఖలను నిర్వహించేవారు. ఈ కాలంలో మదర్ థెరీసా యొక్క మిషనరీస్ అఫ్ ఛారిటీ పన్నెండు శాఖల నుండి అనేక వేల శాఖలకు పెరిగి ప్రపంచ వ్యాప్తంగా కడుబీదల సేవ కొరకు 450 శాఖలను కలిగి ఉంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో మిషనరీస్ అఫ్ ఛారిటీ యొక్క మొట్ట మొదటి శాఖను సౌత్ బ్రోంక్స్, న్యూయార్క్లో ప్రారంభించారు; 1984 నాటికి దేశ వ్యాప్తంగా ఈ సంస్థలు 19 కి పెరిగాయి.[27]

విరాళాల ధనాన్ని వెచ్చించే విధానం పలువురి విమర్శలకు గురయ్యింది. క్రిస్తోఫేర్ హిచెన్స్ (Christopher Hitchens), జర్మన్ పత్రిక స్టెర్న్ (Stern వారపత్రిక) మదర్ థెరీసా, విరాళాల ధనాన్ని పేదరికం తొలగించడానికో లేక ధర్మశాలలలోని పరిస్థితులను మెరగుపరచడానికో కాక కొత్త మఠాలను ఏర్పాటు చేయడానికి మతపరమైన కార్యక్రమాలను పెంచడానికి వెచ్చించారని అన్నారు.[28]

అంతేకాక విరాళాలు సేకరించే విధానాలు కూడా విమర్శించబడ్డాయి. మదర్ థెరీసా హైతిలోని నిరంకుశ, అవినీతి పరులైన దువలిఎర్ (Duvalier) కుటుంబం నుండి విరాళాలను అంగీకరించి, వారిని బహిరంగంగా పొగిడారు. కీటింగ్ ఫైవ్ స్కాండల్ గా పేరుపొందిన కేసులో, మోసము, అవినీతి ఆరోపణలతో నిందితుడిగా ఉన్న చార్లెస్ కీటింగ్ (Charles Keating) నుండి 1.4 మిలియన్ డాలర్ల విరాళాన్ని అంగీకరించి, అరెస్టుకు ముందు, తరువాత కూడా అతనిని బలపరిచారు. లాస్ ఏంజిలిస్ నగర డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీ పాల్ టర్లీ, ప్రజల నుండి కీటింగ్ దొంగిలించిన విరాళాల సొమ్మును ప్రజలకు ఇచ్చి వేయవలసినదిగా వ్రాసారు. ఆ బాధితుల్లో ఒకరు పేద వడ్రంగి. ఆ విరాళాల దానం లెక్కలలో చూపబడలేదు, టర్లీ జవాబు అందుకోలేదు.

కలేట్టే లివేర్మోర్ (Colete Livermore), మిషనరీస్ అఫ్ ఛారిటీ పూవా సభ్యురాలు, తాను సంస్థను విడిచి పెట్టడానికి గల కారణాలను తన పుస్తకం హోప్ ఎండ్యుర్స్: లీవింగ్ మదర్ థెరీసా, లూసింగ్ ఫైత్, అండ్ సెర్చింగ్ ఫర్ మీనింగ్ (Hope Endures: Leaving Mother Teresa, Losing Faith, and Searching for Meaning)లో వివరించారు. మదర్ థెరీసా మంచితనం, ధైర్యం కలిగియున్న వ్యక్తి ఐనప్పటికీ ఆమె "బాధ వేదాంతము" దోష పూరితమైనదని అన్నారు. మదర్ థెరీసా తన శిష్యులకు, మతపరమైన ఉపదేశాలకంటే తమ చర్యల ద్వారా క్రీస్తు చరిత్రను వ్యాపింప చేయాలని ఆదేశించినప్పటికీ, సంస్థ లోని కొన్ని పద్ధతులు వీటితో సరిపోలనట్లు లివేర్మోర్ గుర్తించారు. నిబంధనల ప్రకారం కాకుండా వేళ తప్పి సన్యాసినుల సహాయార్థం వచ్చిన వారికి సహాయాన్ని నిరాకరించడం, వారు బాధపడే రోగాలకు సంబంధించి చికిత్సలో శిక్షణ పొందేందుకు సన్యాసినులను నిరాకరించుట(బలహీనులకు, అమాయకులకు దేవుడు శక్తినిస్తాడనే సమాధానంతో), స్నేహితుల నుండి దూరంగా బదిలీ చేయడం వంటి "అనుచితమైన" శిక్ష లను విధించేవారని ఉదాహరణలు ఇచ్చారు. లౌకిక పరమైన పుస్తకాలను, దినపత్రికలను చదవడాన్ని నిషేధించడం, సమస్యా పరిష్కారానికి స్వంత ఆలోచన లేకుండా విధేయతకు ప్రాముఖ్యతనివ్వడం వంటి వాటితో మిషనరీస్ అఫ్ ఛారిటీ తన సన్యాసినులను "శిశువులను" చేసిందని లివేర్మోర్ పేర్కొనారు.[29]

క్షీణించిన ఆరోగ్యం, మరణం

1983 లో పోప్ జాన్ పాల్ II (Pope John Paul II) సందర్శనార్థం మదర్ థెరీసా, రోమ్ వెళ్ళినప్పుడు గుండెపోటుకు గురయ్యారు. 1989 లో రెండవసారి గుండెపోటుకు గురైనపుడు ఆమెకు కృత్రిమ పేస్ మేకర్ ను అమర్చారు. 1991 లో మెక్సికోలో న్యుమోనియాతో పోరాడుతున్నపుడు ఆమె మరిన్ని హృదయ సమస్యలను ఎదుర్కున్నారు. మిషనరీస్ అఫ్ ఛారిటీ అధినేత పదవికి ఆమె తన రాజీనామాను సమర్పించారు. కానీ సంస్థ లోని సన్యాసినులు రహస్య ఎన్నిక ద్వారా ఆమె కొనసాగాలని కోరారు. సంస్థ అధిపతిగా కొనసాగడానికి మదర్ థెరీసా అంగీకరించారు.

1996 ఏప్రిల్,లో మదర్ థెరీసా క్రిందపడటం వలన ఆమె మెడ ఎముక విరిగింది. ఆగస్టులో ఆమె మలేరియాతో బాధ పడటంతో పాటు గుండె ఎడమభాగంలోని జఠరిక(గుండె) పనిచేయడం మానివేసింది. ఆమెకు గుండె శస్త్రచికిత్స జరిగింది కానీ ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్న విషయం వెల్లడైంది. తాను అనారోగ్యం పాలైనపుడు తన వైద్యశాలలలో ఏదో ఒక దానిలో చికిత్స పొందకుండా, కాలిఫోర్నియాలో అన్ని హంగులతో కూడిన వైద్యశాలను ఎంచుకొనడం వివాదాలకు దారితీసింది.[30] మార్చి 13, 1997 న ఆమె మిషనరీస్ అఫ్ ఛారిటీ అధినేత పదవి నుండి వైదొలిగారు, 1997 సెప్టెంబర్ 5 న మరణించారు.

మదర్ థెరీసాకు మొదటి సారి హృదయ సంబంధ సమస్యలు ఎదురైనపుడు తాను, ఆమె దెయ్యం యొక్క దాడికి గురైందని భావించి దెయ్యాన్ని వదలగొట్టడానికి ఆమె అనుమతితో ఒక ఆచార్యుని ఆజ్ఞాపించినట్లు కలకత్తా ఆర్చ్ బిషప్ (Archbishop) హెన్రీ సెబాస్టియన్ డి'సౌజా (Henry Sebastian D'Souza) చెప్పారు.[31]

ఆమె చనిపోయే నాటికి మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ 4,000 సన్యాసినులు, 300 మంది అనుబంధ సోదర సభ్యులు, 100,000 పైగా సాధారణ కార్యకర్తలను కలిగి, 123 దేశాలలో 610 శాఖలను కలిగి ఉంది. వీటిలో ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నవారి సంరక్షణ గృహాలు, హెచ్ఐవి/ఎయిడ్స్, కుష్టు వ్యాధి, క్షయ రోగులకు ఆవాసాలు,ఆహారకేంద్రాలు, అనాథ శరణాలయాలు, పాఠశాలలు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్త గుర్తింపు, ఆదరణ

భారతదేశంలో ఆదరణ

1962 లో పద్మశ్రీ బహూకరించడం ద్వారా శతాబ్ద మూడో భాగంలో అందరికంటే ముందుగా భారత ప్రభుత్వం ఆమెను గుర్తించింది. తరువాతి దశాబ్దాలలో వరుసగా ఆమె అంతర్జాతీయ అవగాహనకు గాను జవహర్లాల్ నెహ్రూ పురస్కారాన్ని 1972 లోను, భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను 1980 లోను అందుకున్నారు.ఆమె జీవిత చరిత్రను ఇండియన్ సివిల్ సర్వీసు అధికారి ఐన నవీన్ చావ్లా రచించి, 1992 లో ప్రచురించారు.[32]

అయితే భారతీయుల అభిప్రాయాలు మదర్ థెరీసాకు పూర్తిగా అనుకూలంగా లేవు. భారతదేశంలో పుట్టి, పెరిగి లండన్లో నివసించిన ఆమె విమర్శకుడు అరూప్ చటర్జీ మాటలలో, "ఆమె జీవిత కాలంలో ఎప్పుడూ ఆమె కలకత్తాలో ప్రముఖ వ్యక్తి కారు." తన స్వంత నగరానికి ఒక వికృతమైన రూపాన్ని వ్యాపింప చేసినందుకు చటర్జీ మదర్ థెరీసాను తప్పుపట్టారు. ఆమె హిందూ హక్కులకు వ్యతిరేకంగా ఉండటం వలన భారత రాజకీయ ప్రపంచంలో ఆమె పాత్ర, ఉనికి నిరసించబడ్డాయి. భారతీయ జనతా పార్టీ, క్రైస్తవ దళితుల, విషయమై ఆమెతో సంఘర్షించింది కానీ మరణానంతరం ప్రస్తుతించి అంత్యక్రియలకు దూతను పంపింది. మరోవైపు విశ్వ హిందూ పరిషత్ ఆమెకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఆ సంస్థ కార్యదర్శి గిరిరాజ్ కిషోర్, "ఆమె మొదటి విధి చర్చి. సామాజిక సేవ యాదృచ్చికంగా జరిగింది " అన్నారు. ఆమె క్రైస్తవులకు అనుకూలంగా ఉండటాన్ని, మరణించ బోయేవారికి "రహస్య మతమార్పిడి" చేయడాన్ని తప్పుపట్టారు.ఫ్రంట్ లైన్ అనే భారతీయ పక్ష పత్రిక తన ప్రథమ పుట వ్యాసంలో ఈ ఆరోపణలు "స్పష్టంగా నిరాధారమైనవని" కొట్టి పారేసింది. ఆమె కార్యక్రమాలలో, ప్రత్యేకించి కలకత్తాలో ప్రజాసేవ గురించి వారు గుర్తించలేదని అన్నది". ఈ వ్యాస రచయిత ఆమె "స్వలాభంలేని పరోపకారం", శక్తి, ధైర్యాన్ని ప్రస్తుతించినప్పటికీ, గర్భ స్రావానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నట్లు చెప్పుకోవడాన్ని విమర్శించారు.ఈ మధ్య కాలంలో భారత దినపత్రిక ది టెలిగ్రాఫ్ ఈ విధంగా ప్రచురించింది, "ఆమె పేద ప్రజల పరిస్థితుల ఉపశమనం కొరకు ఏమైనా చేసారా లేక ఒక నైతిక భావపరమైన కారణం కొరకు జబ్బుపడిన, మరణించిన వారికి సేవలు కల్పించారో శోధించాలని రోమ్ ని అడగటం జరిగింది."[33]

1997 సెప్టెంబర్ లో ఆమె అంత్యక్రియలకు ముందు మదర్ థెరీసా భౌతిక కాయాన్ని ఒక వారం రోజులపాటు సెయింట్ థామస్, కోల్‌కతాలో ఉంచడం జరిగింది. భారతదేశంలో అన్ని మతాల ప్రజలకు ఆమె చేసిన సేవలకు కృతజ్ఞతగా ప్రభుత్వం ఆమెకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలను జరిపించింది.[34]

ప్రపంచదేశాల ఆదరణ

 
1985 లో, వైట్ హౌస్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్, మదర్ థెరీసాకు ప్రెసిడెన్షియల్ మెడల్ బహుకరణ

దక్షిణ లేదా తూర్పు ఆసియా దేశాల వారికి ఇచ్చే ఫిలిప్పీన్స్ కు చెందిన రామన్ మాగ్సేసే (Ramon Magsaysay) పురస్కారాన్ని 1962 లో మదర్ థెరీసా అంతర్జాతీయ అవగాహనకు గాను అందుకున్నారు. ఆ పత్రంలో ఈ విధంగా ఉదహరించారు, "పరాయి దేశంలోని అతి పేద ప్రజల కొరకు ఆమె దయతో కూడిన ఆలోచనను, వారి సేవకై ఆమె స్థాపించిన నూతన సమాజాన్ని ఎంపిక మండలి గుర్తించింది." [35] 1970 ల నాటికి మదర్ థెరీసా అంతార్జాతీయంగా ప్రముఖ వ్యక్తి అయ్యారు. ఆమె కీర్తిలో చాలా భాగం మాల్కం ముగ్గేరిడ్జ్ చే నిర్మించబడిన 1969 లోని డాక్యుమెంటరీ సంతింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ కు, 1971 లో ఆయనచే అదే పేరుతో రచింపబడిన పుస్తకానికి దక్కుతుంది. ముగ్గేరిడ్జ్ ఆ సమయంలో తనదైన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నారు. ఈ డాక్యుమెంటరీ నిర్మాణ సమయంలో హోం ఫర్ ది డయింగ్ లో ఉన్న తక్కువ కాంతి వలన ఈ చిత్రీకరణ ఉపయోగపడదేమోనని నిర్మాణ వర్గం అభిప్రాయ పడింది. భారతదేశం నుండి తిరిగి వచ్చిన తరువాత ఈ భాగం మంచి కాంతివంతంగా కనిపించింది. ముగ్గేరిడ్జ్ ఆ తరువాత అది మదర్ థెరీసా యొక్క "దివ్య కాంతి"గా అభివర్ణించారు. నిర్మాణ వర్గంలో మిగిలిన వారు మాత్రం అతి సున్నితమైన కోడాక్ ఫిలిం వలన ఈ ఫలితం వచ్చినదని అన్నారు. ముగ్గేరిడ్జ్ ఆ తరువాత రోమన్ కాథలిక్ మతం తీసుకున్నారు.

ఈ సమయానికి, కాథొలిక్ ప్రపంచం బహిరంగంగా మదర్ థెరీసాను గౌరవించడం మొదలుపెట్టింది. పేద ప్రజల కొరకు ఆమె చేపట్టిన కార్యక్రమాలు, క్రైస్తవ ధర్మం, శాంతి పట్ల ఆమె కృషిని మెచ్చుకొని, 1971 లో పాల్ VI ఆమెకు మొదటి పోప్ జాన్ XXIII శాంతి బహుమతిని అందచేసారు. తరువాత ఆమె పసెమ్ ఇన్ టేర్రిస్ (Pacem in Terris) పురస్కారాన్ని (1976)అందుకున్నారు. ఆమె మరణం తరువాత దివ్యత్వం వైపు ఆమె అడుగులు త్వరగా వృద్ధి చెంది, ప్రస్తుతం దైవ ఆశీర్వాదం (బీటిఫై) పొందారు .

మదర్ థెరీసా ప్రభుత్వాలచేత, పౌరసంస్థలచేత గౌరవింప బడ్డారు. ఆస్ట్రేలియా సమాజానికి, మానవ సమాజానికి చేసిన సేవకు గాను ఆమెను ఆర్డర్ అఫ్ ఆస్ట్రేలియాకు గౌరవసహచరిగా నియమించారు.[36]యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనేక పురస్కారాలు అందచేసి చివరిగా 1983లో ఆర్డర్ అఫ్ మెరిట్, 1996 నవంబరు 16లో యునైటెడ్ స్టేట్స్ యొక్క గౌరవ పౌరసత్వం అందచేసారు. మదర్ థెరీసా స్వదేశమైన అల్బేనియా 1994లో ఆమెకు గోల్డెన్ ఆనర్ అఫ్ ది నేషన్ ను, ఆమెకు 1991 లో పౌరసత్వాన్ని ఇచ్చి గౌరవించింది.[37] ఈ బహుమతిని,హైతి ప్రభుత్వం ఇచ్చిన బహుమతిని ఆమె అంగీకరించటం వివాదాస్పదమైనది. దువలిఎరస్, చార్లెస్ కీటింగ్, రాబర్ట్ మాక్స్వెల్ (Robert Maxwell) వంటి అవినీతి పరులైన వ్యాపారులకు సంపూర్ణ మద్దతు అందించినందుకు మదర్ థెరీసా విమర్శలను, ప్రత్యేకించి వామపక్షాల నుంచి, ఎదుర్కున్నారు. కీటింగ్ కేసు విచారణలో ఆమె న్యాయాధికారికి అతని పై దయ చూపవలసినదిగా కోరుతూ వ్రాసారు.[20]

భారదేశపు, పశ్చిమ దేశాల విశ్వవిద్యాలయాలు ఆమెకు గౌరవ పట్టాలను అందచేశాయి. ఇతర పౌరపురస్కారాలలో మానవత్వాన్ని, శాంతిని, ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించినందుకు బల్జాన్ బహుమతి (Balzan Prize) (1978),[38] ఆల్బర్ట్ స్క్వీట్జేర్ (Albert Schweitzer) అంతర్జాతీయ బహుమతి (1975) మొదలైనవి ఉన్నాయి.[39]

శాంతికి విఘాతం కలిగించే పేదరికాన్ని, దుఃఖాన్ని తొలగించేందుకు ఆమె చేసిన కృషికి 1979 లో మదర్ థెరీసాకు నోబెల్ శాంతి బహుమతి అందచేసారు. బహుమతి గ్రహీతలకు మర్యాద పూర్వకంగా ఇచ్చే సాంప్రదాయ విందును నిరాకరించి $192,000 నిధులను భారత దేశం లోని పేద ప్రజలకు ఇవ్వవలసినదిగా కోరుతూ,[40] భౌతికపరమైన బహుమతులు ప్రపంచంలోని అవసరార్థులకు ఉపయోగపడినపుడే వాటికి ప్రాముఖ్యత వుంటుందని ఆమె అన్నారు. మదర్ థెరీసా ఈ బహుమతిని అందుకున్నపుడు ఆమెను "ప్రపంచశాంతిని పెంపొందించేందుకు మనము ఏమి చేయగలం?" అని అడిగారు."ఇంటికి వెళ్లి మీ కుటుంబాన్ని ప్రేమించండి" అని చెప్పారు. ఈ విషయం పై ఆమె తన నోబెల్ ఉపన్యాసంలో ఈ విధంగా అన్నారు:"పేద దేశాలలోనే కాక ప్రపంచం మొత్తంలో నేను పేదరికాన్ని చూసాను, కానీ పాశ్చాత్య దేశాలలోని పేదరికం తొలగించడం కష్టం. నేను వీధులలో ఆకలిగొన్న వానిని కలిసినపుడు అతనికి కొంత అన్నము, ఒక రొట్టెముక్క ఇచ్చి తృప్తిపడతాను. నేను అతని ఆకలిని తొలగించగలిగాను. కానీ ఒక వ్యక్తి గెంటివేయబడినపుడు, పనికిరాని వ్యక్తిగా భావించబడినపుడు, ప్రేమింపబడనపుడు, భీతిల్లినపుడు, సమాజంచే వెలివేయబడినపుడు-ఆ రకమైన పేదరికం చాల బాధాకరమైనది, నా దృష్టిలో తొలగించుటకు కష్టమైనది." గర్భ స్రావాన్ని 'ప్రపంచ శాంతికి అతి పెద్ద విఘాతంగా' ఆమె పేర్కొన్నారు.[41]

ఆమె జీవిత చరమాంకంలో మదర్ థెరీసా పాశ్చాత్య మీడియా యొక్క వ్యతిరేకతను ఎదుర్కున్నారు. క్రిస్టఫర్ హిచెన్స్ అనే విలేఖరి ఆమెను విమర్శించిన వ్యక్తులలో ముఖ్యులు. అరూప్ ఛటర్జీ ప్రోత్సాహంతో బ్రిటిష్ ఛానల్ 4 చే నిర్మించబడిన హెల్స్ ఏంజెల్ అనే డాక్యుమెంటరీకి ఆయన సహ-రచన, వ్యాఖ్యానం కొరకు ఆయన నియమింపబడ్డారు. కానీ ఆ డాక్యుమెంటరీ పూర్తైన తరువాత ఛటర్జీ దాని "సంచలనాత్మక విధానం" పై అసంతృప్తి వ్యక్తం చేసారు. 1995 లో తన ది మిషనరీ పొజిషన్ అనే గ్రంథంలో హిచెన్స్ తన విమర్శలను కొనసాగించారు.[42]

మదర్ థెరీసా జీవించి ఉన్నపుడు ఆమెగానీ, ఆమె జీవితచరిత్రకారులు గానీ తన పరిశోధనలకు సహకరించకపోవడమేగాక, పాశ్చ్యాత్య వార్తాసంస్థల విమర్శలను ఎదుర్కోవడంలో విఫలమయ్యారని చటర్జీ పేర్కొన్నారు. దీనికి ఉదాహరణలుగా " ఆమె అనాథ శరణాలయాలలోని పరిస్థితుల ..... [తో సహా ]తీవ్ర అనాదరణ , శారీరక , మానసిక హింసలపై బ్రిటన్లోని ది గార్డియన్ యొక్క ఖండితమైన(, వివరణాత్మకమైన) ఆరోపణను, మదర్ థెరీసా: టైం ఫర్ చేంజ్? అనే డాక్యుమెంటరీలను పేర్కొన్నారు ఇది అనేక యురోపియన్ దేశాలలో ప్రసారమైంది. ఛటర్జీ , హిచెన్స్ వారి వైఖరిపై విమర్శలను ఎదుర్కొన్నారు.

జర్మన్ పత్రిక ఐన స్టెర్న్ మదర్ థెరీసా తొలి సంవత్సరీకంపై విమర్శనాత్మక వ్యాసాన్ని ప్రచురించింది. ఇది ఆర్థిక వ్యవహారాలు, విరాళాల వినియోగంపై అభియోగాలకు సంబంధించినది. రోగుల అవసరాలపై ఆమె ప్రత్యేక ధోరణులు, ప్రాధాన్యతల పట్ల వైద్య పత్రికలు ఆమెపై విమర్శలను ప్రచురించాయి.[20] ఇతర విమర్శకులలో న్యూ లెఫ్ట్ రివ్యూ సంపాదకుల మండలి సభ్యుడైన తారిక్ అలీ, ఐరిష్ జాతీయుడైన పరిశోధనాత్మక విలేఖరి డోనాల్ మాక్ఇన్టైర్ఉన్నారు.[42]

లౌకికవాద సంస్థలూ, మతసంఘాలూ ఆమె మరణంపై సంతాపం ప్రకటించాయి. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఐన నవాజ్ షరీఫ్ తన సంతాపంలో "ఉన్నత ఆశయాలకోసం చిరకాలం జీవించిన అరుదైన, ప్రత్యేక వ్యక్తి అని శ్లాఘించారు. పేద, జబ్బుపడిన, అప్రయోజకుల కొరకు జీవితపర్యంతం ఆమె చూపిన శ్రద్ధ మానవసేవకు అత్యున్నత ఉదాహరణ అని కొనియాడారు.[43] మాజీ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ జేవియర్ పెరెజ్ డి క్యులర్ ఈ విధంగా అన్నారు:"ఆమే ఐక్యరాజ్యసమితి. ఆమె ప్రపంచంలోని శాంతి".[43] ఆమె జీవించి ఉన్నపుడూ, మరణించిన తరువాత కూడా గాల్లప్ ద్వారా అమెరికాలో అత్యధికంగా అభిమానించబడిన ఏకైక వ్యక్తిగా గుర్తించబడి, 1999 లో యునైటెడ్ స్టేట్స్ లో జరిగిన ఒక సర్వేలో "20 శతాబ్దపు అత్యధిక అభిమానం పొందిన వ్యక్తి"గా ఎన్నికయ్యారు. మిగిలిన అందరు అభ్యర్థుల కంటే ఎక్కువ వ్యత్యాసంతో ఆధిక్యత పొందటమే గాక, అతి పిన్న వయస్కులు తప్ప అన్ని జనాభా వర్గాలనుండి ప్రథమ స్థానం పొందారు.[44][45]

ఆధ్యాత్మిక జీవితం

ఆమె సాధించిన కార్యాలను, కృత్యాలను విశ్లేషిస్తూ జాన్ పాల్ II ఈ విధంగా అన్నారు :"ఇతరుల సేవకై తనను వినియోగించుకొనే శక్తినీ, పట్టుదలనూ మదర్ థెరీసా ఎక్కడ నుండి పొందుతారు? ఆమె దానిని తన ప్రార్థనలో , యేసు క్రీస్తు యొక్క నిశ్శబ్ద ధ్యానంలో, ఆయన పావన వదనంలో, పవిత్ర హృదయం లో పొందుతారు."[46] తనలోతనకి మదర్ థెరీసా యాభైసంవత్సరాల పాటు, తన జీవితపర్యంతం మతపరమైన తన నమ్మకాలపై సందేహాలను, ప్రయాసలను వ్యక్తం చేసారు. ఈ క్రమంలో "ఆమె దేవుడనేవాడు లేడని భావించారు. ఆమె హృదయంలోనే కాదు కృతజ్ఞతలో కూడా" అని ఆమె ప్రతిపాదకుడు (ఆమె పవిత్రీకరణకు ఆధారాలు సేకరించేందుకు బాధ్యుడైన అధికారి) రెవ.బ్రయాన్ కోలోదిఎజ్చుక్ అన్నారు.[47] మదర్ థెరీసా దేవుని ఉనికిపై ఉపేక్షింపరాని సందేహాలను వెలిబుచ్చి, తన అవిశ్వాసానికి బాధను వ్యక్తం చేసారు.

నా నమ్మకం ఎక్కడ? లోలోతులలో కూడా... శూన్యత , చీకట్లు తప్ప మరేమిలేదు ... దేవుడనే వాడుంటే నన్ను దయ చేసి క్షమించు. నేను స్వర్గలోకాన్ని గురించి ఆలోచించే ప్రయత్నం చేసినపుడు, అప్పుడు కనబడే శూన్యత ద్వారా నా ఆలోచనలు పదునైన కత్తులుగా తిరిగి వచ్చి నా ఆత్మని బాధిస్తాయి... ఈ తెలియని బాధ ఎంత బాధాకరమంటే - నాకు దేవునిపై నమ్మకం లేదు. తిరస్కరించబడి, శూన్యంగా, నమ్మకం లేకుండా, ప్రేమ లేకుండా , , నిరాసక్తత , ...నేను దేనికొరకు శ్రమిస్తున్నాను? దేవుడే లేకపోతే ఆత్మ వుండనే వుండదు. ఆత్మ లేకపోతే, యేసూ, నీవుకూడా నిజం కాదు.[48]
 
మెమోరియల్ ప్లేక్ డేడికేటేడ్ టు మదర్ థెరీసా అట్ అ బిల్డింగ్ ఇన్ వెన్స్స్లాస్ స్క్వేర్ ఇన్ ఒలోమొక్, చెక్ రిపబ్లిక్.

పై మాటలను బట్టి, ఆమె ప్రతిపాదకుడైన రెవ్. బ్రయాన్ కోలోదిఎజ్చుక్ (Kolodiejchuk), ఆమె అంతరార్థాన్ని కొందరు తప్పుగా వ్యాఖ్యానించే అవకాశం ఉంది కానీ దేవుడు తన ద్వారా సేవ చేయిస్తున్నాడనే ఆమె భావం చెరిగి పోనిది, ఆమె దేవుని ఉనికిని ప్రశ్నించక ఆయనతో తన బంధాన్ని నిలుపుకోవడానికి పరితపించింది అని వ్యాఖ్యానించారు.[49] ఇతర పరిశుద్ధులకు కూడా ఈ విధమైన మతపర సందేహాలు కలిగాయి, లేక వీటినే కాతోలిక్స్ ఆధ్యాత్మిక పరీక్షలుగా నమ్ముతారు. మదర్ థెరీసా పేరుగల తెరేసే అఫ్ లిసిఎఉక్ష్ దానిని "శూన్య రాత్రి" అన్నారు.[49] ఆమె వ్యక్తం చేసిన సంశయాలు కేననైజేషన్(పవిత్రాత్మగా అంగీకరించుటకు)కు అడ్డంకిగా మారతాయన్న కొందరి అనుమానాలకు విరుద్ధంగా, ఇతర మోక్షగాములకు కూడా కలిగిన ఈ విధమైన అనుభవాలతో ఈ సంశయాలు పోలి ఉన్నాయి.[49]

పది సంవత్సరాల సంశయం తరువాత, స్వల్పకాల పునర్ విశ్వాసాన్ని పొందానని మదర్ థెరీసా వివరించారు. 1958 లో మరణించిన పోప్ పియుస్ XII యొక్క స్మారక ప్రార్థనలో ఆమె ఈవిధంగా చెప్పారు, "సుదీర్ఘ అంధకారం:ఆ అవ్యక్తమైన బాధ" నుండి ఉపశమనం పొందాను. ఐతే, ఐదు వారాల తరువాత, విశ్వాసానికి సంబంధించి తన ఇబ్బందులను తిరిగి వ్యక్తీకరించారు.[50]

మదర్ థెరీసా 66 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో మతాధికారులకు, తన పైవారికి అనేక ఉత్తరాలను వ్రాసారు. ప్రజలు తన గురించి ఎక్కువగా, క్రీస్తు గురించి తక్కువగా ఆలోచిస్తారనే ఉద్దేశంతో ఆమె ఆ ఉత్తరాలను నాశనం చేయవలసినదిగా కోరారు.[51][52] ఏదేమైనా, ఆమె విన్నపానికి విరుద్ధంగా ఈ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ మదర్ తెరెసా: కం బి మై లైట్ (డబల్ డే)నందు క్రోడీకరించ బడ్డాయి.[51] బహిరంగ పరచబడిన ఒక లేఖలో ఆమె ఒక ఆధ్యాత్మిక విశ్వాసి ఐన రెవ్. మైఖేల్ వాన్ డెర్ పీట్,కు "క్రీస్తు నీ యందు ప్రత్యేక ప్రేమను కలిగి ఉన్నాడు" అని వ్రాసారు.[కానీ] నాకు మాత్రం, ఈ నిశ్శబ్దం, శూన్యం ఎంత గొప్పవంటే చూస్తాను గానీ దృష్టి పెట్టలేను, -వినీ వినలేను-నాలుక కదలుతుంది[ప్రార్థనలో] కానీ మాట్లాడలేను..... నీవు నా కోసం ప్రార్థించు-ఆయన నాకు తన స్వేచ్ఛాహస్తాన్ని అందించేటట్లు.

అనేక వార్త సంస్థలు మదర్ థెరీసా రచనలను "విశ్వాస క్లిష్టత"కు సూచనగా తెలిపాయి.[53] క్రిస్టఫర్ హిచెన్స్ వంటి కొంతమంది మదర్ థెరీసా విమర్శకులు ఆమె తన విశ్వాసాల, చర్యలద్వారా కాక ప్రచారం కోసం తన ప్రజాదరణను ఉపయోగించుకునేందుకు ప్రయత్నించిన సాక్ష్యంగా ఆమె రచనలను పేర్కొన్నారు. విశ్వాసులు ధైర్యంగా నిజాన్ని ఎదుర్కోవాలి, వారి నాయకురాలే తన విశ్వాసాన్ని కోల్పోయిందని లేదా చర్చి అయోమయానికి గురైన ఒక వృద్ధురాలిని మిగిలిన మార్గాలన్నీ మూసుకు పోవడం చేత ప్రజాదరణ కొరకు ఈ విధంగా నిలిపిందా?అనేది అన్నిటికంటే బాధించేది, అని హిచెన్స్ వ్రాసారు.[50] ఏదేమైనా, కం బి మై లైట్ యొక్క సంపాదకుడు, బ్రయాన్ కోలోదిఎజ్చుక్ వంటి కొంత మంది దీనికి 16 వ శతాబ్దానికి చెందిన మోక్షగామి సెయింట్ జాన్ అఫ్ ది క్రాస్ ను ఉపమానంగా చూపారు. వీరు దానిని "ఆత్మ యొక్క శూన్య రాత్రి"(డార్క్ నైట్ అఫ్ ది సోల్) గా, ఆధ్యాత్మిక వేత్తల ఎదుగుదలలో ఒక స్థితిగా పేర్కొన్నారు.[51] పరిశుద్ధురాలు అగుటకు ఆమె మార్గంలో ఈ ఉత్తరాలు అడ్డంకి కాబోవని వాటికన్ తెలియజేసింది.[54] నిజానికి ఈ పుస్తకానికి సంపాదకుడు ఆమె ప్రతిపాదకుడైన రేవ్.బ్రయాన్ కోలోదిఎజ్చుక్.[51]

తన మొదటి ఎన్సైక్లికల్ (encyclical) డ్యూస్ కారిటస్ ఎస్ట్ (Deus caritas est) లో, బెనెడిక్ట్ XVI తెరెసా అఫ్ కలకత్తాను మూడు సార్లు ఉదహరించారు. ఆమె జీవితాన్ని ఎన్సైక్లికల్ నివృత్తికి ముఖ్య విషయాలలో ఒకటిగా చెప్పారు. "దేవుని ప్రార్థనలో గడిపే సమయానికి, మన ఇరుగు పొరుగులకు ప్రేమతో సరైన సేవ చేయుట వలన దృష్టి మరలదు. నిజానికి ఆ సేవకు శాశ్వతమైన శక్తి నిచ్చేది అదే అనడానికి బ్లెస్డ్ తెరెసా అఫ్ కలకత్తా ఒక ఉదాహరణ".[55] మానసికమైన ప్రార్థన, ఆత్మపఠనం వలన మనం ప్రార్థన అనే బహుమతిని అందుకోవచ్చని మదర్ తెరెసా నిరూపించారు.[56]

మదర్ తెరెసా యొక్క సంస్థల నియమాలకు, ఫ్రాన్సిస్కాన్ నియమాలకు ప్రత్యక్ష సంబంధం లేకపోయినప్పటికీ, ఆమె సెయింట్ ఫ్రాన్సిస్ అఫ్ అస్సిసిని (St. Francis of Assisi) గొప్పగా అభిమానించేవారు.[57] దానికి తగినట్లుగా ఆమె ప్రభావం, జీవితం ఫ్రాన్సిస్కాన్ ప్రభావాన్ని చూపుతాయి. సిస్టర్స్ అఫ్ ఛారిటీ ప్రతి ఉదయం సమావేశం తరువాత ఉపకారస్తుతి సమయంలో సెయింట్ ఫ్రాన్సిస్ శాంతిప్రార్థన వల్లిస్తారు, అనేక ప్రమాణాలు, కార్యకలాపాలు ఒకేరకంగా ఉంటాయి.[57] సెయింట్ ఫ్రాన్సిస్ పేదరికం, విధేయత, పవిత్రత, క్రీస్తుపట్ల నమ్రతలపై దృష్టి పెడతారు. ఆయన కూడా తన జీవితంలో చాలా భాగం తాను నివసించే ప్రాంతంలోని పేద ప్రజలకు, ప్రత్యేకించి కుష్టువ్యాధిగ్రస్తులకు సేవ చేసారు.

అద్భుతం, ఆశీర్వాదం

దీవించబడిన కల్కత్తా థెరీసా
గౌరవాలురోమన్ కేథాలిక్
దైవత్వంఅక్టోబరు 19, 2003, సెయింట్ పీటర్స్ బాసిలికా, రోమ్ by పోప్ జాన్ పాల్ II
పెద్ద ప్రార్ధనామందిరముమదర్ హౌస్ (మిషనరీస్ ఆఫ్ చారిటీ)
విందుసెప్టెంబరు 5
పోషక ఋషిత్వంప్రపంచ యువదినోత్సవం

1997 లో మదర్ థెరీసా మరణించిన తరువాత హోలీ సీ మోక్షానందకరమైన (బీటిఫికేషన్) ప్రక్రియ మొదలు పెట్టింది. ఋషులుగా ప్రకటించటం (కానోనైజేషన్, Canonisation) జరుగుటకు ఇది రెండవ సోపానం. ఈ ప్రక్రియకు మదర్ థెరీసా మధ్యవర్తిత్వంతో జరిగిన ఒక అద్భుతాన్ని లేఖనము చేయవలసి ఉంటుంది. 2002 లో మోనికా బెస్ర అనే భారతీయ మహిళ కడుపులోని కణితిని మదర్ థెరీసా చిత్రం ఉన్న ఒక పతకాన్ని తాకించుట ద్వారా తొలగించి స్వస్తతనివ్వడం అనే అద్భుతాన్ని వేటికన్ గుర్తించింది. మోనికా బెస్ర ఆ పతకం నుండి వెలువడిన ఒక కాంతి పుంజం, కాన్సర్ కణితిని నయం చేసిందని పేర్కొన్నారు. బస్రా యొక్క వైద్య సిబ్బందిలో కొందరు, ఆమె భర్త కూడా ప్రారంభంలో సాంప్రదాయ వైద్యచికిత్సయే కణితిని నయం చేసిందని అన్నారు.[58] దీనికి వ్యతిరేకమైన చిత్రంలో మోనికా యొక్క సోనోగ్రామ్లు, మందుల చీటీలు, వైద్యుల సలహాలతో కూడిన వైద్యరికార్డులు చికిత్స అద్భుతమాకాదా అని తెలియచేస్తాయి. మోనికా అవన్నీ మిషనరీస్ అఫ్ ఛారిటీకి చెందిన సిస్టర్ బెట్ట వద్ద ఉన్నాయని చెప్పారు. సిస్టర్ బెట్ట ప్రచురణకర్తలకు "వ్యాఖ్యానము లేదు"(నో కామెంట్) అని సమాధానమిచ్చారు. మోనికా చికిత్స పొందిన బలుర్ఘాట్ హాస్పిటల్ అధికారులు, ఈ చికిత్సను అద్భుతంగా ప్రకటించాలని కాతోలిక్ సంస్థలు తమపై వత్తిడి తెచ్చాయని ఆరోపించారు.[59]

బీటిఫికేషన్, కానోనైజేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా వేటికన్ సాంప్రదాయ బద్ధమైన డెవిల్స్ అడ్వకేట్ విధానాన్ని రద్దు పరచినందున, ఆ పాత్రలో మదర్ థెరీసా యొక్క ఈ ప్రక్రియకు వేటికన్ పిలిచినా ఏకైక సాక్షి క్రిస్టఫర్ హిచెన్స్.[60] "ఆమె ఉద్దేశ్యం పేదలకు సేవ చేయడం కాదు" అని హిచెన్స్ వాదించారు. దాతలకు వారి విరాళాల వినియోగం గురించి ఆమె అబద్ధాలు చెప్పారు అని ఆరోపించారు. “ఆమె తో మాట్లాడిన తరువాత నేను ఆ విషయం తెలుసుకున్నాను. తాను పేదరికం తొలగించడానికి కృషి చేయడం లేదని ఆమె నాకు చెప్పారు" అని హిచెన్స్ తెలిపారు. “ఆమె కాథలిక్ల సంఖ్య పెంచేందుకు పని చేస్తున్నారు. నేను సామాజిక కార్యకర్తను కాను, అని చెప్పారు. నేను దానికోసం పని చేయడం లేదు. నేను క్రీస్తుకోసం పనిచేస్తున్నాను. నేను చర్చి కోసం పని చేస్తున్నాను,’" అని ఆమె చెప్పారు.[61] బీటిఫికేషన్ , కాననైజేషన్ కొరకు ఆమె అభ్యర్థిత్వాన్ని పరిశీలించే ప్రక్రియలో రోమన్ క్యురియ (ది వేటికన్)ఆమె జీవితం, కార్యకలాపాలపై ఎన్నో ముద్రిత, అముద్రిత విమర్శల లేఖనాలను పరిశీలించింది. హిచెన్స్ ఆరోపణలపై, అటువంటి వాటిపై దర్యాప్తు చేసేందుకు ఉన్న ప్రత్యేక సంస్థ, కాంగ్రెగేషన్ ఫర్ ది కాసెస్ అఫ్ సెయింట్స్ (Congregation for the Causes of Saints), పరిశోధిస్తుందని వేటికన్ అధికారులు చెప్పారు. మదర్ థెరీసా బీటిఫికేషన్ కు వాటిని వారు అడ్డంకులుగా భావించలేదు. ఆమె పై జరిగిన దాడులకు, కొంతమంది కాథలిక్ రచయితలు ఆమెను విరుద్ధ చిహ్నంగా అభివర్ణిస్తారు.[62] మదర్ థెరీసా యొక్క బీటిఫికేషన్ అక్టోబర్ 19, 2003, న జరిగింది, దానివలన ఆమెకు "బ్లెస్డ్"( ఆశీర్వదింప బడిన)అనే బిరుదు ఇవ్వడం జరిగింది.[63] ఏదైనా రెండవ అద్భుతం జరిగితే అది కాననైజేషన్ ప్రక్రియకు దారితీస్తుంది.

భారత అత్యుత్తమ వ్యక్తిగా ఎంపిక

2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్  భాగస్వామ్యంతో అవుట్ లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్ లో ఆమె ఐదవ స్థానంలో ఎంపికైయింది.[64]

జ్ఞాపక చిహ్నాలు

 
టిరానా అంతర్జాతీయ విమానాశ్రయము నేనే టెరేజా (అల్బేనియా)

మదర్ తెరెసా పేరుతో చాలా జ్ఞాపకచిహ్నాలు వెలిసాయి. అనేక సంగ్రహాలయాలు, అనేక చర్చిలకు పోషకురాలిగా, అనేక కట్టడాలకు, రహదారులకు అల్బేనియా అంతర్జాతీయ విమానాశ్రయనికి ఆమె పేరు పెట్టడం ద్వారా గుర్తు చేసుకోబడుతున్నది.

మదర్ థెరీసా మహిళా విశ్వవిద్యాలయము,[65] కొడైకెనాల్, తమిళనాడు, 1984 లో స్థాపించబడినది. ఆమె జీవితచరిత్ర రచయిత నవీన్ చావ్లా ద్వారా భారతదేశ వార్తాపత్రికలలో అనేక వ్యాసాలు ప్రచురింపబడ్డాయి.[66][67][68][69][70][71][72] భారతీయ రైల్వే "మదర్ ఎక్స్‌ప్రెస్", అనే పేరుతో 2010 ఆగష్టు 26 న శతజయంతి సందర్భంలో ప్రారంభించింది.[73]

2013 సెప్టెంబర్ 5 నాటినుండి, వర్ధంతి ఐక్యరాజ్య సమితి సాధారణ సభచే అంతార్జతీయ దాతృత్వ దినముగా పాటించబడుతున్నది.[74]

చిత్రాలు, సాహిత్యం

1969లో చిత్రానికి, 1972 పుస్తకం సమ్థింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ (Something Beautiful for God) కు మదర్ థెరీసా వస్తువైంది. 1997 లో మదర్ థెరీసా:ఇన్ దినేమ్ ఆఫ్ గాడ్స్ పూర్ ( Mother Teresa: In the Name of God's Poor), 2003 లో ఇటలీ సినిమా, 1994లో హిచెన్స్ వార్తాచిత్రం హెల్స్ ఏంజల్ (Hell's Angel) అనేవి మదర్ థెరీసా పేరిట నిర్మించిన ఇతర చిత్రాలు.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. PBS Online Newshour (September 5, 1997). Mother Teresa Dies, http://www.pbs.org. Retrieved August, 2007
  2. 2.0 2.1 స్పింక్, కాథ్రిన్(1997). మదర్ తెరెసా: ఎ కంప్లీట్ ఆథరైజ్ద్ బయోగ్రఫి . న్యూ యార్క్. హర్పెర్ కాలిన్స్, pp.16. ISBN 0-06-250825-3.
  3. మదర్ తెరెసా అఫ్ కలకత్తా (1910-1997)
  4. "మదర్ తెరెసా | హ్యుమానిటేరియన్". Archived from the original on 2010-07-24. Retrieved 2009-08-19.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-11-27. Retrieved 2009-08-19.
  6. మదర్ తెరెసా అఫ్ కలకత్తా (1910-1997)". వాటికన్ న్యూస్ సర్వీసు . రిట్రీవ్డ్ మే 30, 2007
  7. క్లూకాస్, జాయన్ గ్రాఫ్. 1988మదర్ తెరెసా . న్యూ యార్క్. చెల్సియా హౌస్ పబ్లికేషన్స్, pp. 28-29. ISBN 1-55546-855-1.
  8. క్లూకాస్, జాయన్ గ్రాఫ్. 1988మదర్ తెరెసా . న్యూ యార్క్. చెల్సియా హౌస్ పబ్లికేషన్స్, pp. 31. ISBN 1-55546-855-1.
  9. సేబా, అన్నే (1997).మదర్ తెరెసా: బియాండ్ ది ఇమేజ్ . న్యూ యార్క్. డబల్డే, p.35. ISBN 0-385-48952-8.
  10. బ్లెస్డ్ మదర్ తెరెసా అఫ్ కలకత్తా అండ్ సెయింట్ తెరేసే అఫ్ Lisieux: స్పిరిచ్యువల్ సిస్టర్స్ ఇన్ ది నైట్ అఫ్ ఫెయిత్
  11. క్లూకాస్, జాయన్ గ్రాఫ్. 1988మదర్ తెరెసా . న్యూ యార్క్. చెల్సియా హౌస్ పబ్లికేషన్స్, pp. 32. ISBN 1-55546-855-1.
  12. స్పింక్, కాథ్రిన్ (1997). మదర్ తెరెసా: ఎ కంప్లీట్ ఆతరైజేడ్ బయోగ్రఫి . న్యూ యార్క్. హర్పెర్ కాలిన్స్, pp.18-21. ISBN 0-06-250825-3.
  13. స్పింక్, కాథ్రిన్(1997). మదర్ తెరెసా: e Compleet ఆతరైజేడ్ బయోగ్రఫి . న్యూ యార్క్. హర్పెర్ కాలిన్స్, pp.18, 21-22. ISBN 0-06-250825-3.
  14. క్లూకాస్, జాయన్ గ్రాఫ్. 1988మదర్ తెరెసా . న్యూ యార్క్. చెల్సియా హౌస్ పబ్లికేషన్స్, pp. 35. ISBN 1-55546-855-1.
  15. క్లూకాస్, జాయన్ గ్రాఫ్. 1988మదర్ తెరెసా . న్యూ యార్క్. చెల్సియా హౌస్ పబ్లికేషన్స్, pp. 48-49. ISBN 1-55546-855-1.
  16. Spink, Kathryn (1997). Mother Teresa: A Complete Authorized Biography. New York. HarperCollins, pp.37. ISBN 0-06-250825-3.
  17. సేబా, అన్నే (1997).మదర్ తెరెసా: బియాండ్ ది ఇమేజ్ . న్యూ యార్క్. Doubleday, pp. 62-63. ISBN 0-385-48952-8.
  18. స్కాట్, డేవిడ్ ఎ రేవోల్యుషన్ అఫ్ లవ్: ది మీనింగ్ అఫ్ మదర్ తెరెసా చికాగో, లొయోల ప్రెస్, 2005. ISBN 0829420312 p.7ff "ఆమె వ్యాధిని (పేదరికమనే)మాత్రమే పట్టించుకుంటారు, నివారణను కాదు, కానీ పశ్చిమ దేశాల ప్రజలు ఆమెకు ధనాన్ని ఇస్తూనే ఉంటారు.
  19. Byfield, Ted (October 20, 1997), "If the real world knew the real Mother Teresa there would be a lot less adulation", Alberta Report/Newsmagazine, vol. 24, no. 45
  20. 20.0 20.1 20.2 లౌడొన్, మేరీ. (1996)ది మిషనరీ పోసిషన్: మదర్ తెరెసా ఇన్ థియరీ అండ్ ప్రాక్టీసు, బుక్ రివ్యూ, BMJ vol.312, no.7022, 6 జనవరి 2006, pp.64-5. రిట్రీవ్డ్ ఆగష్టు 2, 2007
  21. స్లవిసెక్, లూఇస్ (2007). మదర్ తెరెసా . న్యూ యార్క్; ఇన్ఫోబేస్ పబ్లిషింగ్, pp. 90-91. ISBN 0791094332.
  22. సీఎన్ఎన్ స్టాఫ్, "మదర్ తెరెసా: ఎ ప్రొఫైల్", రిట్రీవ్డ్ ఫ్రమ్ సిఎన్ఎన్ ఆన్ లైన్ Archived 2000-04-14 at the Wayback Machine ఆన్ మే 30, 2007
  23. క్లూకాస్, జాయన్ గ్రాఫ్. 1988మదర్ తెరెసా . న్యూ యార్క్. చెల్సియా హౌస్ పబ్లికేషన్స్, pp. 17. ISBN 1-55546-855-1.
  24. కూపర్, కెన్నెత్ జె. (సెప్టెంబర్ 14, 1997). "మదర్ తెరెసా లెయిడ్ టు రెస్ట్ ఆఫ్టర్ మల్టీ-ఫెయిత్ ట్రిబ్యూట్". ది వాషింగ్టన్ పోస్ట్ . రిట్రీవ్డ్ మే 30, 2007
  25. (మే 30, 2007) "ఎ వొకేషన్ అఫ్ సర్వీసు Archived 2016-01-24 at the Wayback Machine". ఎటర్నల్ వర్డ్ టెలివిజన్ నెట్వర్క్ . రిట్రేవ్డ్ ఆగష్టు 2, 2007.
  26. ఆర్మేనియా లో భారత రాయబార కార్యాలయ అధికారిక వెబ్సైటు Archived 2007-03-20 at the Wayback Machine. డిసెంబర్ 1988 లో ఆర్మేనియాలో భయంకరమైన భూకంపం వచ్చినపుడు మదర్ థెరీసా ఆ దేశంలో ఏ విధంగా ప్రయాణం చేసారో వివరిస్తుంది.ఆమె , ఆమె సంస్థలు అక్కడ ఒక అనాథ శరణాలయాన్ని స్థాపించాయి. పరిశీలించినతేది మే 30, 2007.
  27. క్లూకాస్, జాయన్ గ్రాఫ్ . 1988మదర్ తెరెసా . న్యూ యార్క్. చెల్సియా హౌస్ పబ్లికేషన్స్, pp. 104ISBN 1-55546-855-1.
  28. హిచెన్స్, క్రిస్టోఫర్(20 October 2003). "మొమ్మీ దేఅరేస్ట్ ". స్లేట్ మేగజైన్రిట్రీవ్డ్ మే 30, 2007.
  29. కేరాస్ థింక్ పోడ్కాస్ట్: లీవింగ్ మదర్ తెరెసా, లొసింగ్ ఫెయిత్ , అండ్ సీర్చింగ్ ఫర్ మీనింగ్. డిసెంబర్ 15, 2008.
  30. Irish Independent http://www.independent.ie/unsorted/features/easter-the-church-and-the-same-party-line-42461.html
  31. బింద్రా, సతిందర్ (సెప్టెంబర్ 7, 2001). "ఆర్చ్ బిషప్: మదర్ తెరెసా అండర్వెంట్ ఎక్సోర్సిసం Archived 2005-09-17 at the Wayback Machine". సిఎన్ఎన్ పరిశీలన తేది మే 30, 2007.
  32. "మదర్ తెరెసా: ది ఆథరైజ్డ్ బయోగ్రఫి" ISBN 978-0756755485.
  33. విక్టర్ బెనర్జీఎ కానోపి మోస్ట్ ఫాటల్ , ది టెలిగ్రాఫ్ , సండే, సెప్టెంబర్ 8, 2002.
  34. అస్సోసియేటెడ్ ప్రెస్ (సెప్టెంబర్ 14, 1997). ""India honors nun with state funeral". Archived from the original on 2005-03-06. Retrieved 2009-08-19.". హౌస్టన్ క్రానికల్ . రిట్రీవ్డ్ మే 30, 2007.
  35. రామోన్ మాగ్సేసే అవార్డు ఫౌండేషన్ (1962) సైటేషన్ ఫర్ మదర్ తెరెసా Archived 2012-01-14 at the Wayback Machine .
  36. [77]1}ఇట్స్ అన్ ఆనర్: AC
  37. మదర్ తెరేజా Archived 2011-08-19 at the Wayback Machine కు అల్బేనియన్ పౌరసత్వం ఇస్తూ, అల్బేనియా ప్రెసిడెంట్ జారీ చేసిన డిక్రీ.
  38. మదర్ తెరెసా అఫ్ కలకత్తా Archived 2006-05-14 at the Wayback Machine, ఒన్దజిఒనె ఇంటర్నజిఒనలే బల్జాన్, 1978 బల్జాన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ, పీస్ అండ్ బ్రదర్ హుడ్ అమాంగ్ పీపుల్స్. Retrieved 26 May 2007.
  39. జోన్స్, ఆలిస్ & బ్రౌన్, జోనాథన్ (7 మార్చ్ 2007). "ఆపోసిట్స్ అట్రాక్ట్? Archived 2007-12-23 at the Wayback Machineవెన్ రాబర్ట్ మాక్స్వెల్ మెట్ మదర్ తెరెసా Archived 2007-12-23 at the Wayback Machine". ది ఇండిపెండెంట్ . రిట్రీవ్డ్ 26 మే 2007.
  40. లాక్, మిచేల్లె ఫర్ ది అస్సోసియేటెడ్ ప్రెస్ (మార్చ్ 22, 2007). "బెర్కేలీ నోబెల్ లరేట్స్ డొనేట్ ప్రైజ్ మనీ టు ఛారిటీ Archived 2007-05-30 at the Wayback Machine". సాన్ ఫ్రాన్సిస్కో గేటు . రిట్రీవ్డ్ మే 26, 2007
  41. మదర్ తెరెసా (11 డిసెంబర్ 1979). "నోబెల్ ప్రైజ్ లెక్చర్". నోబెల్ ప్రైజ్.org. రిట్రీవ్డ్ 25 మే 2007.
  42. 42.0 42.1 MacIntyre, Donal (August 22, 2005), "The squalid truth behind the legacy of Mother Teresa", New Statesman, vol. 134, no. 4754, p. 24-25, archived from the original on 2011-11-27, retrieved 2009-08-19
  43. 43.0 43.1 (అక్టోబర్ 16, 2006) ఆన్ లైన్ మెమోరియల్ ట్రిబ్యూట్ టు మదర్ తెరెసా. ChristianMemorials.com . రిట్రీవ్డ్ ఆగష్టు 2, 2007.
  44. ఫ్రాంక్ న్యూపోర్ట్ (డిసెంబర్ 31, 1999). మదర్ తెరెసా వోటెడ్ బై అమెరికన్ పీపుల్ అస్ మోస్ట్ అడ్మైర్డ్ పర్సన్ అఫ్ ది సెంచరీ
  45. గ్రేటెస్ట్ అఫ్ ది సెంచరీ గాల్అప్/సీఎన్ఎన్ /యుఎస్ఎ టుడే పోల్. డిస. 20-21, 1999.
  46. John Paul II (20 October 2003). "Address of John Paul II to the Pilgrims Who Had Come To Rome for the Beatification of Mother Teresa". Vatican.va. Retrieved 13 March 2007.
  47. David Van Biema (23 August 2007). "Mother Teresa's Crisis of Faith". TIME. Archived from the original on 16 ఆగస్టు 2013. Retrieved 19 ఆగస్టు 2009.
  48. "Sermon – Some Doubted". Edgewoodpc.org. 19 June 2011. Archived from the original on 15 అక్టోబరు 2011. Retrieved 2011-08-28.
  49. 49.0 49.1 49.2 న్యూ బుక్ రెవీల్స్ మదర్ తెరెసాస్ స్ట్రగుల్ విత్ ఫెయిత్ బిలీఫ్ నెట్ , AP 2007
  50. 50.0 50.1 "Hitchens Takes on Mother Teresa". Newsweek. Retrieved 2008-12-11.
  51. 51.0 51.1 51.2 51.3 "Mother Teresa's Crisis of Faith". Time. Archived from the original on 2013-08-16. Retrieved 2007-08-24.
  52. "Mother Teresa's Crisis of Faith". Sun Times. Archived from the original on 2007-10-11. Retrieved 2007-08-26.
  53. "Mother Teresa's Crisis of Faith". Daily Telegraph. Archived from the original on 2008-04-10. Retrieved 2007-08-26.
  54. "Mother Teresa's canonisation not at risk". Daily Telegraph. Archived from the original on 2007-10-11. Retrieved 2007-08-26.
  55. పోప్ బెనెడిక్ట్ XVI (డిసెంబర్ 25, 2005). డ్యూస్ కారితాస్ Est Archived 2014-12-05 at the Wayback Machine . (PDF). Vatican City, pp.10. రిట్రీవ్డ్ ఆగష్టు 2, 2007.
  56. Mother Teresa (197). "No Greater Love". Google Books. Retrieved 2007-08-12.
  57. 57.0 57.1 "మదర్ తెరెసా అఫ్ కలకత్తా పేస్ ట్రిబ్యూట్ టు St. ఫ్రాన్సిస్ అఫ్ అస్సిసి" ఆన్ ది అమెరికన్ కాథలిక్ వెబ్సైట్ Archived 2010-06-05 at the Wayback Machine, రిట్రీవ్డ్ మే 30, 2007.
  58. ఓర్ర్, డేవిడ్ (మే 10. 2003 "మెడిసిన్ క్యూర్డ్ 'మిరకిల్' వుమన్ - నాట్ మదర్ తెరెసా, సే డాక్టర్స్" Archived 2008-04-10 at the Wayback Machine. ది టెలిగ్రాఫ్ . రిట్రీవ్డ్ మే 30, 2007.
  59. అనానిమస్ (అక్టోబర్ 14. 2002 వాట్స్ మదర్ తెరెసా గోట్ టు డో విత్ ఇట్?" Archived 2009-08-19 at the Wayback Machine. టైమ్ మగజైన్ . రిట్రీవ్డ్ అక్టోబర్ 10, 2008.
  60. హిచెన్స్, క్రిస్టఫర్ (జనవరి 6, 1996). "లెస్ థెన్ మిరక్యులస్ " Archived 2016-03-05 at the Wayback Machine. ఫ్రీ ఇంక్వైరీ మాగజైన్ . వాల్యూం 24, నెంబర్ 2.
  61. ది డిబేట్ ఓవర్ సెయింట్ హుడ్ Archived 2009-03-21 at the Wayback Machine. (9 అక్టోబర్ 2003). సిబిఎస్ న్యూస్ . రిట్రీవ్డ్ 26 మే 2007.
  62. షా, రస్సెల్. (సెప్టెంబర్ 1, 2005). అటాకింగ్ ఎ సెయింట్ Archived 2008-12-06 at the Wayback Machine, కాథలిక్ హెరాల్డ్ . రిట్రీవ్డ్ మే 1, 2007.
  63. వేటికన్ న్యూస్ రిలీజ్
  64. "A Measure Of The Man | Outlook India Magazine". web.archive.org. 2021-07-24. Archived from the original on 2021-07-24. Retrieved 2021-10-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  65. మదర్ థెరీసా మహిళా విశ్వవిద్యాలయము జాలస్థలి
  66. ""ది మిరకిల్ అఫ్ ఫెయిత్"". Archived from the original on 2007-11-04. Retrieved 2009-08-19.
  67. "of Mother Teresa"". Archived from the original on 2011-05-23. Retrieved 2009-08-19.
  68. "" Touch the Poor...". Archived from the original on 2010-09-03. Retrieved 2009-08-19.
  69. "" ది పాత్ టు సెయింట్ హుడ్"". Archived from the original on 2008-12-02. Retrieved 2009-08-19.
  70. "" ఇన్ ది షాడో అఫ్ ఎ సెయింట్". Archived from the original on 2008-12-02. Retrieved 2009-08-19.
  71. "మిషన్ పాసిబుల్ "
  72. " Mother Teresa and the joy of giving Archived 2008-08-28 at the Wayback Machine
  73. ""Mother Express" to be launched on Aug 26". IBN Live. 2 August 2010. Archived from the original on 12 ఆగస్టు 2011. Retrieved 5 August 2010.
  74. "Charity contributes to the promotion of dialogue, solidarity and mutual understanding among people". International Day of Charity: 5 September. United Nations.

గమనికలు

  • నవీన్ చావ్లా. మదర్ తెరెసా: అధికారిక జీవితచరిత్ర . డిఅన్ పబ్ కో. (1992 మార్చి). ISBN 978-0756755485. మొదటిసారి సింక్లైర్-స్టీవెన్సన్ చే, యు.కే.(1992)లో ప్రచురింపబడింది, తరువాత 14 భారతీయభాషలలో, విదేశాలలో అనువదింపబడింది.భారతీయ భాషల ముద్రణలలో హిందీ, బెంగాలీ, గుజరాతీ, మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ ఉన్నాయి. విదేశీ భాషల ముద్రణలలో ఫ్రెంచ్, జర్మన్, డచ్, స్పానిష్, ఇటాలియన్, పోలిష్, జపనీస్, థాయ్ ఉన్నాయి. భారతీయ, విదేశీ భాషలలో అనేక పునర్ ముద్రణలు జరిగాయి.వీటిమీద వచ్చే లాభం దానంగా ఇవ్వబడుతుంది .
  • ఐలీన్ ఎగన్ అండ్ కాథ్లీన్ ఎగన్, ఓ ఎస్ బి . ప్రేయర్ టైమ్స్ విత్ మదర్ తెరెసా: ఎ న్యూ అడ్వెంచర్ ఇన్ ప్రేయర్, డబల్ డే, 1989. ISBN 978-0385-26231-6.
  • బ్రయాన్ కోలోదిఎజ్చుక్ (ed.). మదర్ తెరెసా: కం బి మై లైట్, డబల్ డే, 2007, ISBN 978-0385-52037-9.
  • రఘు రాయ్ అండ్ నవీన్ చావ్లా. ఫెయిత్ అండ్ కంపాషన్: ది లైఫ్ అండ్ వర్క్ అఫ్ మదర్ తెరెసా . ఎలిమెంట్ బుక్స్ Ltd. (1996 డిసెంబరు). ISBN 978-1852309121. డుచ్, స్పానిష్ భాషలలోనికి అనువదించబడింది.

ప్రోత్సాహ పఠనం

  • అల్పిఒన్, గేజిం. మదర్ తెరెసా : సెయింట్ ఆర్ సెలెబ్రిటి ? . లండన్: రూట్లేడ్జ్ ప్రెస్, 2007. ISBN 0-415-39247-0
  • బెనేనట్, బెక్కి అండ్ జోసెఫ్ డురెపోస్(ఎడ్స్). మదర్ తెరెసా: నో గ్రేటర్ లవ్ (ఫైన్ కమ్యూనికేషన్స్, 2000) ISBN 1-56731-401-5
  • Bindra, Satinder (2001-09-07). "Archbishop: Mother Teresa underwent exorcism". CNN.com World. Archived from the original on 2006-12-17. Retrieved 2006-10-23.

బాహ్య లింకులు

 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
తెలుగు
ఆంగ్లం
Catholic Church titles
అంతకు ముందువారు
సుపీరియర్ జనరల్ ఆఫ్ ది మిషనరీస్ ఆఫ్ ఛారిటీ
1950–1997
తరువాత వారు
నిర్మలా జోషీ