పీలా కాశీ మల్లికార్జునరావు
మల్లికార్జునరావు (అక్టోబర్ 10, 1960 - జూన్ 24, 2008) తెలుగు సినీ, రంగ స్థల హాస్య నటులు.[1] ఆయన పూర్తి పేరు పీలా కాశీ మల్లికార్జునరావు. పాఠశాల దశనుంచే నాటకాల్లో నటించే వారు. 50 నుంచి 60 నాటకాలూ, ఏకపాత్రాభినయం పాత్రలూ ఆయనకు నటన మీద మంచి పట్టు లభించేదానికి దోహదపడ్డాయి.
మల్లికార్జునరావు | |
---|---|
![]() | |
జననం | పీలా కాశీ మల్లికార్జునరావు 1960 అక్టోబరు 10 |
మరణం | 2008 జూన్ 24 | (వయసు 47)
మరణ కారణం | రక్త కేన్సర్ |
ఇతర పేర్లు | బట్టల సత్తిగాడు |
వృత్తి | రంగస్థల నటుడు, సినిమా నటుడు |
రాజకీయ పార్టీ | తెలుగుదేశం |
పిల్లలు | ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు |
తొలి జీవితం సవరించు
భమిడిపాటి రాధాకృష్ణ రాసిన లెక్కలు తెచ్చిన చిక్కులు ఆయన తొలి నాటకం. ఆయన్ని రంగస్థలంపై నటుడిగా నిలబెట్టింది పలుకే బంగారమాయె. ఇందులో నిర్మాత వేషం మల్లికార్జునరావుకి ఎంతో గుర్తింపు నిచ్చింది. అనకాపల్లిలోనే ఎ.ఎమ్.వి.ఎమ్. ఆసుపత్రిలో కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. అక్కడి ట్రేడ్ యూనియన్కి నాయకత్వం వహించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
సినీ ప్రస్థానం సవరించు
దివంగత నటులు రావు గోపాలరావు సహకారంతో చిత్రసీమలోకి ప్రవేశించారు. 1972లో తులసి అనే చిత్రంలో చిన్నవేషం వేశారు. ఆ సమయంలోనే పార్వతీ పరమేశ్వరులు చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. తరువాత నాగమల్లి లాంటి కొన్ని చిత్రాల్లో నటించారు. వంశీతో ఏర్పడ్డ పరిచయం ఆయన సినీజీవితాన్ని మలుపు తిప్పింది.
వంశీ మొదటిచిత్రం మంచు పల్లకీలో చిన్న పాత్ర పోషించారు. అన్వేషణలో పులిరాజుగా మల్లికార్జునరావు నటన చిత్రసీమను ఆకట్టుకొంది. అదే సమయంలో తన తండ్రి అస్వస్థతకు లోనైతే అనకాపల్లి వెళ్లడం వల్ల అవకాశాలు కోల్పోయారు. 'లేడీస్ టైలర్'లో బట్టల సత్యం పాత్ర తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 350కి పైగా సినిమాల్లో నటించారు. తమ్ముడు సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డును పొందారు. ఏప్రిల్ ఒకటి విడుదల, కనకమాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ట్రూపు, హలో బ్రదర్, ఆలీబాబా అరడజను దొంగలు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, బద్రి, ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ఎవడి గోల వాడిది, మా ఆయన సుందరయ్య (2001) లాంటి చిత్రాలు ఆయనకెంతో పేరు తీసుకొచ్చాయి. మల్లికార్జునరావు నటనలో తనకంటూ ఓ పంథాను ఏర్పరచుకొన్నారు. తొలినాళ్లలో రావుగోపాలరావు ప్రభావం ఉండేది. తన సంభాషణ శైలిలో ఉత్తరాంధ్ర యాసని మేళవించడంతో జనాన్ని సులభంగా ఆకట్టుకోగలిగారు. ఆ యాసనీ, మాండలికాన్నీ సాధికారికంగా మాట్లాడగలిగిన నటుడిగా గుర్తింపు పొందారు. అలాగే గ్రామీణ నేపథ్యం ఉన్న పాత్రలకు జీవంపోసే నటుల్లో ఆయన ముందుండే వారు. చివరిగా ఆయన నటించిన చిత్రం మహా నగరంలో.
నటించిన చిత్రాలు సవరించు
- దాసన్నా (2010)
- అతడెవరు (2007)
- 143[2][3]
- ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి (2004)
- 6 టీన్స్ (2001)
- ప్రేమసందడి (2001)
- సాంబయ్య (1999)
- పవిత్ర ప్రేమ (1998)
- ఆలీబాబా అరడజను దొంగలు (1994)
పురస్కారాలు సవరించు
- తమ్ముడు సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు.[4]
- రఘుపతి వెంకయ్య బంగారు పతకం (ప్రముఖ నటుడు గుమ్మడి స్థాపించారు)
పదవులు సవరించు
- తెలుగుదేశం పార్టీతో సాంస్కృతిక విభాగానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా[1] ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి.
- మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్కు ప్రధాన కార్యదర్శిగా మూడు సార్లు ఎంపికయ్యారు.
మరణం సవరించు
57 సంవత్సరాల వయస్సులో మంగళవారం 24 జూన్, 2008 ఉదయం 10.30 ని.లకు రక్త కేన్సర్ (లుకేమియా) వ్యాధితో తుదిశ్వాస విడిచారు.[1]
బయటి లింకులు సవరించు
మూలాలు సవరించు
- ↑ 1.0 1.1 1.2 ఈనాడు దినపత్రిక వెబ్సైట్ నుండి నవ్వుల మల్లి ఇక లేరు Archived 2011-09-01 at the Wayback Machine వివరాలుజూన్ 25,2008న సేకరించబడినది.
- ↑ "143 review". idlebrain. Retrieved 16 May 2019.
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "143 (సినిమా)". telugu.filmibeat.com. Retrieved 16 May 2019.
- ↑ ఆంగ్లదిన పత్రిక ది హిందూ వెబ్సైట్ నుండి Comedy is his forte Archived 2008-06-27 at the Wayback Machine వివరాలుజూన్ 25,2008న సేకరించబడినది.