రెండవ ప్రపంచ యుద్ధం

1939–1945 మధ్య జరిగిన ప్రపంచ యుద్ధం
(రెండవ ప్రపంచ యుద్ధము నుండి దారిమార్పు చెందింది)

రెండవ ప్రపంచ యుద్ధం లేదా రెండవ ప్రపంచ సంగ్రామం (Second World War) అనేది 1939 నుండి 1945 వరకు ప్రపంచంలోని అనేక దేశాల నడుమ ఏక కాలంలో ఉమ్మడిగా, విడివిడిగా జరిగిన అనేక యుద్ధాల సమాహారం. దీనికి పూర్వ రంగంలో జరిగిన రెండు ప్రధాన సైనిక సంఘటనలు ఈ మహా యుద్ధానికి దారి తీశాయి. వాటిలో మొదటిది, 1937లో మొదలయిన రెండవ చైనా-జపాన్ యుద్ధం. రెండవది, 1939లో జర్మనీ దేశం పోలాండ్ పై జరిపిన దురాక్రమణ. రెండవ చైనా-జపాన్ యుద్ధం వివిధ ఆసియా దేశాల మధ్య యుద్ధానికి దారి తీస్తే, జర్మనీచే పోలాండ్ దురాక్రమణ ఐరోపా దేశాల మధ్య యుద్ధానికి కారణభూతమయింది. ఇది క్రమంగా ప్రపంచంలోని అనేక దేశాలు మిత్ర రాజ్యాలు, అక్ష రాజ్యాల పేరుతో రెండు ప్రధాన వైరి వర్గాలుగా మారి ఒక మహా సంగ్రామంలో తలపడేటట్లు చేసింది. ఈ యుద్ధంలో పాల్గొన్న సైనికుల సంఖ్య సుమారు పది కోట్లు. ఇందులో పాల్గొన్న దేశాలు ఒక రకమయిన పరిపూర్ణ యుద్ధ పరిస్థితిని ఎదుర్కొన్నాయి (అనగా, సైనిక-పౌర భేదాలు లేకుండా అందుబాటులో ఉన్న వారందరూ ఏదో ఒక రకంగా యుద్ధంలో పాలుపంచుకోవటం). ఆకారణంగా ఆయా దేశాల ఆర్థిక, పారిశ్రామిక, సాంకేతిక వనరులన్నింటినీ యుద్ధ ప్రయోజనాలకోసమే వాడవలసి వచ్చింది.

రెండవ ప్రపంచ యుద్ధం
రెండవ ప్రపంచ యుద్ధంలో దేశాల కూటములు
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో వివిధ దేశాల స్థానాలు.

ముదురు ఆకుపచ్చ — పెరల్ హార్బర్‌పై జపాన్ దాడికి ముందు మిత్ర పక్షాలు;
లేత ఆకుపచ్చ — పెరల్ హార్బర్‌పై జపాన్ దాడి తరువాత యుద్ధంలో చేరిన దేశాలు;
నీలం — అక్ష రాజ్యాలు;

బూడిద రంగు— యుద్ధ కాలంలో తటస్థంగా ఉన్న దేశాలు.
తేదీసెప్టెంబరు 1, 1939సెప్టెంబరు 2, 1945
ప్రదేశంయూరోప్, పసిఫిక్, ఆగ్నేయ ఆసియా, చైనా, మధ్య ప్రాచ్యం, మధ్యధరా ప్రాంతం, ఆఫ్రికా
ఫలితంమిత్ర రాజ్యాల విజయం. ఐక్య రాజ్య సమితి ఆవిర్భావం. అ.సం.రా., సోవియట్ యూనియన్‌లు అగ్ర రాజ్యాలుగా రూపొందాయి. ఐరోపాలో మొదటి ప్రపంచం, రెండవ ప్రపంచం అనే ప్రభావ ప్రాంతాల అవతరణ - దీని నుండి ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభం. (ఇంకా...)
ప్రత్యర్థులు
మిత్ర రాజ్యాలుఅక్ష రాజ్యాలు
సేనాపతులు, నాయకులు
మిత్ర రాజ్యాల నాయకులుఅక్ష రాజ్యాల నాయకులు
ప్రాణ నష్టం, నష్టాలు
సైనిక మరణాలు:
14,000,000 పైగా
పౌర మరణాలు:
36,000,000 పైగా
మొత్తం మరణాలు:
50,000,000 పైగా
...మరిన్ని వివరాలు.
సైనిక మరణాలు:
8,000,000 పైగా
పౌరుల మరణాలు:
4,000,000 పైగా
మొత్తం మరణాలు
12,000,000 పైగా
...మరిన్ని వివరాలు.

యుద్ధం స్వరూపం మార్చు

 
ప్రపంచంలో వివిధ దేశాలలో రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా మరణించిన వారి సంఖ్యను చూపే చిత్ర పటం.

సుమారు ఆరు కోట్లమంది మృతికి కారణమయిన ఈ యుద్ధం ప్రపంచ చరిత్రలోనే అత్యంత రక్త సిక్తమయినదిగా పేరొందింది.[1] రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించిన వారిలో మూడింట రెండు వంతులు సాధారణ పౌరులేనని ఒక అంచనా. వీరిలో సుమారు ఒక కోటిమంది వరకూ తూర్పు ఐరోపాలోనూ సోవియెట్ యూనియన్ లోనూ నాజీ జర్మనీ జరిపిన యూదు జాతి నిర్మూలన కార్యక్రమంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు [2] (దీనికే హోలోకాస్ట్ అని పేరు). ప్రపంచ వ్యాప్తంగా ఈ యుద్ధం కలిగించిన ఆర్థిక నష్టం సుమారు పది లక్షల కోట్ల అమెరిన్ డాలర్లు (1944 నాటి డాలరు విలువ ప్రకారం) ఉంటుందని అంచనా.[3][4]

1945లో మిత్ర రాజ్యాల కూటమి విజయంతో ఈ యుద్ధం ముగిసింది. ఈ కూటమికి నాయకత్వం వహించిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు, సోవియట్ సమాఖ్య యుద్ధానంతర కాలంలో ప్రపంచంలో రెండు అగ్ర రాజ్యాలుగా ఎదిగి ఒకరితో ఒకరు ప్రచ్ఛన్న యుద్ధానికి తలపడ్డాయి. ఈ ప్రచ్ఛన్న యుద్ధం సుమారు 45 సంవత్సరాల పాటు కొనసాగి, 1990లో సోవియట్ సమాఖ్య పతనంతో అంతమయింది.

రెండవ ప్రపంచ యుద్ధానంతరం అటువంటి మరో యుద్ధాన్ని నివారించే ఆశయంతో ఐక్య రాజ్య సమితి నెలకొల్పబడింది. కాగా, ఈ యుద్ధం రగిల్చిన స్వతంత్ర కాంక్ష కారణంగా అనేక ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఐరోపా వలస వాదులకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడచి ఆయా దేశాలు అనతి కాలంలోనే స్వాతంత్ర్యాన్ని పొందాయి. మరోవంక, ఈ యుద్ధం కారంణంగా ఐరోపా ఏకీకరణ దిశగా అడుగులు పడటం మొదలయింది.

సంక్షిప్తంగా మార్చు

1931 సెప్టెంబరులో జపాన్ దేశం చైనా అధీనంలోని మంచూరియా ప్రాంతంపై దాడి చేసి ఆక్రమించుకుంది. రెండేళ్ల తరువాత, 1933లో, జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ నేతృత్వంలో అతివాద నాజీ పార్టీ అధికారంలోకొచ్చింది. హిట్లర్ నాయకత్వంలో జర్మనీ శరవేగంగా సైనికంగా బలపడింది. 1938 నాటికి హిట్లర్ జర్మనీని తూర్పు దిశగా విస్తరించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

ఆరంభం మార్చు

 
1937లో షాంఘై యుద్ధంలో చైనావారి మెషిన్ గన్‌ల స్థావరం. (A Chinese machine gun nest).

1937 జులై లో జపాన్ చైనా ప్రధాన భూభాగంపై పెద్ద ఎత్తున దాడికి దిగింది. ఆ క్రమంలో షాంఘై, గువాంగ్-ఝౌ లపై బాంబులు కురిపించటమే కాకుండా, ఆ ఏడాది డిసెంబరులో నాంకింగ్లో నరమేధం జరిపి వేలాది మందిని బలితీసుకుంది. ఇదే సమయంలో, ఐరోపాలో జర్మనీ, ఫాసిస్టు నాయకుడు ముస్సోలినీ నాయకత్వంలోని ఇటలీ రెచ్చగొట్టే తరహా విదేశాంగ విధానాలను అవలంబించటం మొదలెట్టాయి. అయితే, నెవిల్ చాంబర్లీన్ నేతృత్వంలోని బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్టు పాలిత సోవియెట్ యూనియన్ను తమకు మరింత పెద్ద సమస్యగా భావించి శత్రువుకు శత్రువు మిత్రుడు అనే నానుడి ప్రకారం జర్మనీతో ఒక శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో ఫ్రాన్స్ కూడా పాలు పంచుకుంది. ఈ ఒప్పందం ప్రకారం తూర్పు దిశగా (సోవియెట్ యూనియన్ వైపు) జర్మనీ విస్తరణను ఇంగ్లాండ్, ఫ్రాన్స్లు చూసీ చూడనట్లు వ్యవహరిస్తాయి. ఆ విధంగా సోవియెట్ యూనియన్ ప్రాబల్యాన్ని అదుపులో ఉంచవచ్చని ఇంగ్లాండు భావించింది. అయితే, 1939 సెప్టెంబరులో ఇంగ్లాండ్ ను ఆశ్చర్య పరుస్తూ జర్మనీ, సోవియెట్ యూనియన్లు ఉమ్మడిగా పోలాండ్ పై దాడి జరిపి ఆక్రమించుకున్నాయి. పోలాండ్ పశ్చిమ భాగాన్ని జర్మనీ, తూర్పు భాగాన్ని సోవియెట్ యూనియన్ పంచుకున్నాయి. దానితో ఐరోపాలో మరో మహా యుద్ధానికి తెర లేచింది.

మొదట ఇంగ్లాండ్, ఫ్రాన్స్ రెండు దేశాలు జర్మనీతో సంప్రదింపుల ద్వారా సమస్య పరిష్కారానికి మొగ్గు చూపాయి. కానీ హిట్లర్ చర్చలకు దిగిరాకపోవటటంతో విధిలేని పరిస్థితిలో 1939 చలికాలంలో జర్మనీపై యుద్ధం ప్రకటించాయి. యుద్ధం అయితే మొదలయింది కానీ మొదటి ఏడు నెలలపాటు చెదురు మదురు కాల్పులు తప్ప పెద్ద ఎత్తున సైనిక సంఘటనలు ఎక్కడా జరగలేదు. ఈ కాలంలో ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాలు ఆయుధ సంపత్తిని పెంచుకోవటంలో దృష్టి పెట్టాయి.

తీవ్రతరం మార్చు

 
1940లో ఫ్రాన్స్ పరాజయం తరువాత పారిస్‌లో జర్మన్ సేనలు.

1940 మార్చి, ఏప్రిల్ మాసాల్లో జర్మనీ డెన్మార్క్, నార్వే దేశాలను ఆక్రమించుకుంది. ఆ ఏడాది వేసవికాలం మొదలయ్యేనాటికి బెల్జియం, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్ లతో పాటు ఫ్రాన్స్ లను కూడా ఆక్రమించింది. జూన్ నెలలో ఇటలీ కూడా మరోవైపు నుండి ఇంగ్లాండ్, ఫ్రాన్స్ లపై యుద్ధం ప్రకటించింది. ఆ విధంగా ఇంగ్లాండ్ పై దాడి మొదలయింది. జర్మనీ మొదట ఇంగ్లాండ్ కు నిత్యావసర వస్తు సరఫరా జరపకుండా నిరోధించి, తరువాత ఆకాశ మార్గంపై కూడా పట్టు సంపాదించి తద్వారా సముద్ర మార్గం ద్వారా ఇంగ్లాండ్ పై దాడికి మార్గం సుగమం చేసుకోవాలని వ్యూహ రచన చేసింది.

నౌకా యుద్ధమయితే జరగలేదు కానీ జర్మనీ పదే పదే భూమార్గం ద్వారా ఇంగ్లాండ్ పై దాడులు జరుపుతూ చికాకు పరచసాగింది. జర్మనీ దళాలను ఐరోపాలో ఎదుర్కొనే సామర్థ్యం ఇంగ్లాండ్ కు లేకపోయింది. దాంతో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ సహకారంతో మధ్యధరా ప్రాంతంలో జర్మనీ, ఇటలీల ఉమ్మడి దళాలతో పోరాటంపై ఎక్కువ శ్రద్ధ పెట్టింది. కానీ ఇక్కడ కూడా మిత్ర రాజ్యాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. బాల్కన్ యుద్ధంలో మిత్ర రాజ్యాలను మట్టి కరిపించి గ్రీస్, అల్బేనియా, యుగోస్లేవియాలను అక్ష రాజ్యాలు వశపరుచుకోగా, ఎడారి యుద్ధంగా పేరొందిన ఆఫ్రికా యుద్ధంలో గెలుపు ఇరువర్గాల మధ్యా దోబూచులాడింది (ఎడారి యుద్ధం ఈజిప్టు, లిబియా, ట్యునీషియా వంటి ఆఫ్రికా దేశాలపై పట్టుకోసం ఉద్దేశించినది).

మలుపులు మార్చు

 
1942 జూన్ - జపాన్ క్రూజర్ నౌక Mikuma పై దాడి చేస్తున్న అమెరికన్ డైవ్ బాంబర్ (SBD Dauntless) - Battle of Midway, జూన్ 1942.

మిత్ర రాజ్యాలకు మొదటిసారిగా చెప్పుకోదగ్గ విజయం 1941 మార్చి నెలలో లభించింది. ఆ నెల 27 నుండి 29 వరకూ మూడు రోజుల పాటు మధ్యధరా సముద్రంలో జరిగిన పోరాటంలో ఇంగ్లాండ్ నేతృత్వంలోని ఆంగ్ల, ఆస్ట్రేలియా సంకీర్ణ దళాలు పలు ఇటలీ యుద్ధ నౌకలను ముంచివేశాయి. తద్వారా నౌకా మార్గం పై పట్టు బిగించాయి.

1941 జూన్ లో యుద్ధం మరింత విస్తరించింది. ఆ నెలలో జర్మనీ సోవియట్ యూనియన్ మీద దాడి చేయటంతో సోవియెట్ యూనియన్ కూడా జర్మనీకి వ్యతిరేకంగా మిత్ర రాజ్యాల కూటమితో చేతులు కలిపింది. మొదట్లో కొద్ది కాలం పాటు సోవియెట్లపై యుద్ధ రంగంలో జర్మన్లు ఆధిక్యం సంపాదించారు. ఈ కాలంలో వారు కొంత సోవియట్ భూభాగాన్ని కూడా తమ అదుపులోకి తెచ్చుకున్నారు. కానీ ఆ ఏడాది చలికాలంనాటికి సోవియెట్ యూనియన్ లో జర్మనీ విజయాలకు అడ్డుకట్ట పడింది.

ఈ లోగా ఆసియా ఖండంలో జపాన్ ఆక్రమణలు కొనసాగాయి. 1940లో జపాన్ ప్రధాన చైనా భూభాగాన్ని, ఫ్రాన్స్ అధీనంలోని ఇండో-చైనా భాగాన్నీ ఆక్రమించింది. దాంతో జపాన్ పై అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్ ఆర్థిక ఆంక్షలు విధించాయి. జపాన్ ఒక వంక ఈ ఆంక్షల ఎత్తివేతకు దౌత్య రాయబారాలు నడుపుతూనే ఊహించని విధంగా అమెరికా నౌకా యుద్ధ కేంద్రం పెర్ల్ హార్బర్ పైనా, బ్రిటన్ అధీనంలోని ఆగ్నేయాసియా భూభాగాలపైనా మెరుపు దాడులు జరిపింది. పెర్ల్ హార్బర్ దాడి జరిగిన నాలుగు రోజుల పిదప జర్మనీ కూడా అమెరికా పై యుద్ధం ప్రకటించింది. విధిలేని పరిస్థితిలో అమెరికా మిత్ర రాజ్యాలతో చేతులు కలిపి యుద్ధ రంగంలోకి ప్రవేశించింది. అమెరికా చేరికతో అప్పటి వరకూ ఆసియా, ఆఫ్రికా, ఐరోపాలలో విడివిడిగా జరుగుతున్న యుద్ధాలు ఇప్పుడు అమెరికా ఖండానికి కూడా పాకినట్లయి, రెండవ ప్రపంచ యుద్ధంగా రూపు దిద్దుకుంది.

అక్ష రాజ్యాలు మొదట విజయాలు సాధించినప్పటికి, 1942 నుండి ఈ కూటమికి పరాజయాలు మొదలయ్యాయి. ఆ ఏడాది జూన్ నెలలో పసిఫిక్ మహాసముద్రంలో జరిగిన నౌకా యుద్ధంలో అమెరికన్ దళాలు జపాన్ కు చెందిన నాలుగు విమాన వాహక యుద్ధ నౌకలను ముంచి వేయటం ద్వారా జపాన్ కు మొదటి ఓటమిని రుచి చూపించాయి. అదే సమయంలో ఆఫ్రికాలో జర్మనీ దళాలు ఆంగ్లో-అమెరికన్ దళాల చేతిలో ఓడిపోయి ఆక్రమిత భూభాగాల నుండి తరిమివేయబడ్డాయి. జర్మనీ ఆ వేసవిలో సోవియెట్ భూభాగంలో పునఃప్రారంభించిన సైనిక చర్య కూడా సత్ఫలితాలనివ్వలేదు. ఆ మరుసటి ఏడాది జర్మనీకి స్టాలిన్ గ్రాడ్ వద్ద సోవియెట్ సేనల చేతిలో ఘోర పరాజయం ఎదురయింది. దాని వెంటనే కర్స్క్ వద్ద కూడా సోవియెట్ సేనల ధాటికి జర్మనీ చేతులెత్తేసింది. కర్స్క్ వద్ద జరిగిన పోరాటాన్ని సైనిక చరిత్రలో అతి పెద్ద ట్యాంకుల యుద్ధంగా పరిగణిస్తారు.

ఇదే ఏడాది జర్మన్ దళాలు ఆఫ్రికా నుండి తరిమికొట్టబడ్డాయి. ఐరోపాలో, మిత్ర రాజ్యాలు ఉత్తర దిశగా పురోగమించి సిసిలీని వశపరచుకుని ఇటలీలో అడుగుపెట్టాయి. కొద్దిరోజుల్లోనే దక్షిణ ఇటలీ మిత్ర రాజ్యాల అధీనంలోకొచ్చింది. విధిలేని పరిస్థితిలో 1943 సెప్టెంబర్ 8న ఇటలీ మిత్ర రాజ్యాలతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది. పసిఫిక్ మహా సముద్రంలో, అమెరికన్ దళాలు ఒకదాని వెనుక ఒకటిగా అనేక ద్వీపాలను జపాన్ నుండి వశపరచుకున్నాయి.

ముగింపు మార్చు

 
అణు విస్ఫోటనం- 1944- నాగసాకి, జపాన్

1944లో యుద్ధం పూర్తిగా మిత్ర రాజ్యాలవైపు మొగ్గింది. సోవియెట్ సేనలు అప్రతిహతంగా పురోగమిస్తూ జర్మన్ దళాలను రష్యా నుండి పారదోలడమే కాకుండా పోలాండ్, రుమేనియాలలోకి చొచ్చుకుపోయాయి. అదే సమయంలో అమెరికా-బ్రిటన్-ఫ్రాన్స్ ఉమ్మడి సేనలు ఐరోపా ప్రధాన భూభాగంలోకి ప్రవేశించి ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్ లను విముక్తం చేశాయి. తూర్పు నుండి సోవియెట్ సైన్యాలు, పశ్చిమం నుండి మిత్ర రాజ్యాల సైన్యాలు ఏక కాలంలో ముట్టడించటంతో జర్మనీ ఊపిరాడని స్థితిలో చిక్కుకుంది. మరో వైపు జపాన్ మాత్రం విజయ పరంపర కొనసాగిస్తూ చైనాలో చాలాభాగాన్ని ఆక్రమించింది. కానీ అమెరికన్ బలగాలు టోక్యో సమీపంలోని వైమానిక స్థావరాలను వశపరచుకుని జరిపిన బాంబుదాడిలో జపాన్ నౌకా దళం భారీ నష్టాలను చవిచూసింది.

యుద్ధానంతరం మార్చు

 
1945 ఫిబ్రవరి నెలలో జరిగిన యాల్టా సమావేశంలొ పాల్గొన్నమిత్రరాజ్యాల అధినేతలు మధ్యలో అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్. డి. రూజ్వెల్ట్. ఎడమవైపు రష్యా అధ్యక్షుడు స్టాలిన్. కుడివైపు బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్.
 
యుద్ధానంతరం జర్మనీలో వివిధ సేనల ఆక్రమణలో ఉన్న భూభాగాలు.

1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. ఆ ఏడాది మొదటి నెలల్లో ఐరోపా పడమటి భాగంలో జర్మనీ చివరి సారిగా మిత్ర రాజ్యాల సేనలపై చేసిన పలు ఎదురు దాడులు విఫలమయ్యాయి. ఆ ఏడాది మే మాసంలో సోవియెట్ సేనలు జర్మనీ రాజధాని బెర్లిన్ నగరాన్ని ఆక్రమించటంతో హిట్లర్ ఆత్మ హత్య చేసుకున్నాడు. దానితో జర్మనీ మిత్ర రాజ్యాలకు లొంగిపోయింది. పసిఫిక్ దీవులు ఒక్కటొక్కటే జపాన్ నుండి అమెరికన్ సేనల అధీనంలోకి వచ్చాయి. ఆగ్నేయాసియాలో బ్రిటిష్ దళాలు జపాన్ సేనలను ఓడించి తరిమికొట్టాయి. అప్పటికీ జపాన్ మొండిగా పోరాటాన్ని కొనసాగించింది. ఆ ఏడాది ఆగస్టు నెలలో మిత్ర రాజ్యాల విజ్ఞప్తి మేరకు సోవియెట్ యూనియన్ జపాన్ తో తమకు గల తటస్థ ఒప్పందాన్ని ఉల్లంఘించి జపాన్ అధీనంలోని మంచూరియా, ఉత్తర కొరియా ప్రాంతాలపై దాడికి దిగి వశపరచుకుంది. అదే సమయంలో అమెరికా జపాన్ ప్రధాన నగరాలైన హిరోషిమా, నాగసాకీ లపై అణుబాంబులను ప్రయోగించటంతో తప్పని పరిస్థితిలో జపాన్ కూడా లొంగిపోయింది.

విపులంగా మార్చు

సాంకేతిక కారణాల వల్ల ఈ వ్యాసాన్ని పలు భాగాలుగా విభజించి ఒక్కో భాగం మిత్రరాజ్యాల విజయ పరంపర గా ఒక్కో పేజీలో రాయటమైనది. ఈ క్రింది లింకులు ఆయా భాగాలకు తీసుకు వెళతాయి. ఎక్కువ వివరాల జోలికి పోదలుచుకోని వారికోసం ఇదే పేజీలో (పైన) రెండవ ప్రపంచ యుద్ధం గురించి సంక్షిప్తంగా పొందుపరచబడింది.

మూలాలు, వనరులు మార్చు

  1. Dunnigan, James. Dirty Little Secrets of World War II: Military Information No One Told You About the Greatest, Most Terrible War in History, William Morrow & Company, 1994. ISBN 0-688-12235-3
  2. Florida Center for Instructional Technology (2005). "Victims". A Teacher's Guide to the Holocaust. University of South Florida. Retrieved 2008-02-02.
  3. Mayer, E. (2000) "World War II" Archived 2012-11-27 at the Wayback Machine course lecture notes on Emayzine.com (Victorville, California: Victor Valley College)
  4. Coleman, P. (1999) "Cost of the War," World War II Resource Guide (Gardena, California: The American War Library)