ఏనుగుల వీరాస్వామయ్య

తెలుగు రచయిత, యాత్రికుడు

ఏనుగుల వీరాస్వామయ్య (1780 - 1836) తెలుగు రచయిత, యాత్రికుడు. ఇతడు కాశీయాత్ర చరిత్ర విశేషాలు పుస్తకరూపంగా వెలువరించిన వ్యక్తిగా సుప్రసిద్ధుడు. కాశీయాత్ర చరిత్ర మొదటిసారి అచ్చు అయినపుడు కోమలేశ్వరం శ్రీనివాసపిళ్ళై వ్రాసిన ముందుమాట వలన, తన రచనలో సందర్భానుసారంగా వీరాస్వామయ్య పేర్కొన్న విషయాల వలన, దిగవల్లి వేంకటశివరావు, ముక్తేవి లక్ష్మణరావు సంపాదకత్వంలో వెలువడిన కాశీయాత్ర చరిత్ర గ్రంథాలలోని పీఠికల ద్వారా వీరాస్వామయ్య జీవిత విశేషాలు తెలుస్తున్నాయి.

బాల్యం మార్చు

ఏనుగుల వీరాస్వామయ్య తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబంలో శ్రీవత్స గోత్రంలో 1780 ప్రాంతంలో జన్మించాడు. తండ్రి పేరు సామయమంత్రి. 9వ యేటనే వీరాస్వామయ్య తండ్రి గతించాడు. వారి కుటుంబం కొన్ని తరాలుగా మద్రాసులో ఉండేది.

ఉద్యోగం మార్చు

12 యేళ్ళకే వీరాస్వామయ్య ఆంగ్లం ధారాళంగా చదవడం నేర్చుకొన్నాడు. ఆ వయసులోనే "బోర్డ్ ఆఫ్ ట్రేడ్"లో "వాలంటీరు"గా ఉద్యోగంలో కుదిరాడు. అప్పటిలో ఇంగ్లీషు నేర్చుకొన్నవారు అధికంగా వాలంటీరు గానే చేరి, తమ శక్త్యానుసారం పై ఉద్యోగాలకు ఎదిగేవారు. అతి చిన్న వయసులోనే అతని ప్రతిభ చూసి పై అధికారులు అతనిని తమ వద్ద పనిచేయించు కోవాలని పోటీ పడేవారట. తెలుగు, తమిళ, ఇంగ్లీషు భాషలలో కూడా అతను మంచి ప్రతిభ సాధించి ఉండవచ్చును. 13వ యేట తిరునల్వేలి జిల్లా కలెక్టరు ఆఫీసులో ద్విభాషి గా ఉద్యోగంలో కుదిరాడు. అప్పట్లో కలెక్టరు చాలా చాలా పెద్ద ఉద్యోగం. అంత చిన్నవయసులో కలెక్టరు ఆఫీసులో చేరగలగడం వీరాస్వామయ్య ప్రతిభకు తార్కాణం.

రెండు సంవత్సరాల తరువాత వీరాస్వామయ్య చెన్నపట్నం చేరి, అనేక వ్యాపార సంస్థలలో పనిచేసి, బుక్‌ కీపింగ్ లాంటి అనేక విద్యలలో నిపుణుడయ్యాడు. బోర్డ్ ఆఫ్ ట్రేడ్‌ లో ఎకౌంటెంట్‌గా పని చేశాడు. ఈ సమయంలోనే సంస్కృతంలోను, జ్యోతిష్యం, ఖగోళం, స్మృతులు, పురాణాలు వంటి అనేక విషయాలలో పండితుడైనట్లున్నాడు. 15యేళ్ళ బాలుడు బాధ్యత గల ఉద్యోగంలో పై అధికారుల మెప్పును పొందుతూ అంత శాస్త్రవిజ్ఞానం సంపాదించడం ఆశ్చర్యకరం. అతని ప్రతిభను గుర్తించి మద్రాసు సుప్రీం కోర్టువారు అతనికి "హెడ్ ఇంటర్ప్రిటర్" ఉద్యోగాన్ని ఇచ్చారు. ఇది చాలా గొప్ప ఉద్యోగంగా భావింపబడేది. పాశ్చాత్య చట్టాలను, స్థానిక ధర్మ సంప్రదాయాలను, ఆచారాలను సమన్వయపరుస్తూ విచారణ జరపడానికి బ్రిటిషు జడ్జీలకు ద్విభాషీలు సహాయపడేవారు. క్రొత్త ఉద్యోగంలో చేరేముందు పాత సంస్థవారు అతనికి ఘనమైన వీడ్కోలు ఇస్తూ బంగారపు నశ్యపు డబ్బాను బహూకరించారు. అప్పటిలో బ్రిటషు పాలనలో ఉన్న ప్రాంతాలలోని బలమైన చట్టాల వలన నెలకొన్న స్థిరత్వానికి, ఇతర పాలకుల ప్రాంతాలలో జరిగే అరాచకాలకు మధ్య భేదాన్ని వీరాస్వామయ్య యాత్రా చరిత్రలో స్పష్టంగా గమనించవచ్చును.

అప్పటికి కృష్ణా గోదావరి నదులపై ఆనకట్టలు కట్టలేదు. 19వ శతాబ్ది ఉత్తరార్థంలో తీవ్రమైన కరువు కాటకాలు వచ్చాయి. ప్రజల ఆకలి తీర్చడానికి "గంజిదొడ్లు" (ఆహార సహాయ కేంద్రాలు) ఏర్పాటు చేశారు. అలాంటి గంజిదొడ్ల దగ్గర ఒక తపస్విలా తన బాధ్యత నిర్వహించి వీరాస్వామయ్య వీలయినంతమందికి సహాయపడ్డాడు.

సర్ రాల్ఫు ఫాల్మరు దొర, ఆయనకు వ్రాసి యిచ్చిన టెష్టిమోనియల్ అనే యోగ్యతా పత్రికలో - అయన కోర్టులో నున్ను, చేంబరులో నున్ను, అలసట లేక బహు నెమ్మదితో పనులు గడుపుచు వచ్చెననిన్ని, ఆయన తన గొప్ప ఉద్యోగపు పనులను మిక్కిలి నమ్మకముగా జరిపించెననిన్ని, మరిన్ని ప్రజల మేలు కోరి స్మృతిచంద్రిక మొదలైన పుస్తకములకు అనువాదము చేసెననిన్ని, నేనెరిగినంతలో ప్రభుత్వవారి విశేష కృపకు యీ పురుషుడు పాత్రుడైనట్లు హిందు పెద్దమనుషులలో ఎవరున్ను ఎక్కువైనవారు లేరని నాకు తోచియున్నదనిన్ని వ్రాయబడియున్నది.

పాండిత్యం మార్చు

ఆంగ్ల విద్య, పాశ్చాత్య విజ్ఞానాల అవసరం వీరాస్వామయ్య బాగా గుర్తించాడు. అప్పటికి విశ్వవిద్యాలయాలు లేవు. కొద్దిపాటి కళాశాలలు కూడా లేవు. ఆ కాలంలోనే తన పలుకుబడితో "హిందూ లిటరరీ సొసైటీ" స్థాపించి వీరాస్వామయ్య ఆధునిక విద్యకు బాట వేశాడు. మద్రాసులో విశ్వవిద్యాలయం స్థాపించాలనే భావనకు ఈ చర్య పునాది వేసింది. (ఇదంతా లార్డ్ మెకాలేకు చాలా ముందుకాలం.)

అచ్చు పుస్తకాలు లేని ఆ కాలంలో వీరాస్వామయ్య సంపాదించిన పాండిత్యం ఆశ్చర్యకరంగా ఉంటుంది. సందర్భానుసారంగా తన రచనలో అతను ఉదహరించిన విషయాలు శృతి, స్మృతులపై అతని జ్ఞానాన్ని, అతని తార్కిక లక్షణాన్ని, సత్యశోధన పట్ల నిబద్ధతను తెలియజేస్తాయి. సౌరమాన, చాంద్రమాన విధానాలలో అధిక, క్షయ మాసాల గురించి అతని ఉపన్యాసాన్ని ఖగోళ శాస్త్ర విషయాల గురించిన పండిత సభలో హర్షించి, పండితులు రత్నహారాన్ని బహూకరించారు. స్మృతులు, శృతులు ఎన్ని అన్న విషయంపై ధర్మ నిర్ణయం చేయవలసినదని అతని యాత్రా సమయంలో గయలో ఒక జడ్జి అతనిని కోరాడు. ఆ పండిత సభలో సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చి, ఈ విషయంపై ఉన్న భిన్నాభిప్రాయాలను, నిశ్చయమైన ప్రమాణాలను, అస్పష్టతకు కారణాలను వివరించాడు. అతను ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా పరిశీలించేవాడు.

వ్యక్తిత్వం, హోదా మార్చు

కష్టాలు పడి, స్వయంకృషితో ఉన్నత స్థానానికి ఎదిగిన వీరాస్వామి పండితుడు, వివేకవంతుడే కాక వినయశీలి. ఇంగ్లీషు దొరలవద్ద ఉద్యోగం చేస్తూ వారి అభిమానాన్ని చూరగొన్నాగాని తన మతం, సంప్రదాయం పట్ల తన భావాలను నిర్భయంగా ప్రకటించేవాడు. ఎంత పెద్ద దొరతోనైనా వాదానికి దిగి భిన్న మతతత్వాలకు సమన్వయం కుదిర్చే ప్రయత్నం చేసేవాడు. అయినా వారి అభిమానాన్ని అతను నిలుపుకొన్నాడు.

ఉన్నత ఉద్యోగంలో తనకున్న విశేష స్థాయిని అతను ఎప్పుడూ చెప్పుకోలేదు. సందర్భానుసారంగా మాత్రమే మనం గ్రహించాలి. తన యాత్ర ఆరంభంలో అప్పటి విధానం ప్రకారం వీరాస్వామయ్య మద్రాసు దొరలనుండి "క్యారక్టర్లు" (ఇతర స్థలాలలో ఉండే అధికారులకు తనగురించిన పరిచయ పత్రాలు కావచ్చును) తీసుకొని వెళ్ళాడు. అవి చూసి, దేశమంతటా దొరలు, సంస్థానాధీశులు వీరాస్వామయ్యను విశేషంగా మన్నించి అతని అవసరాలన్నీ సమకూర్చారు. గవర్నరు లాంటి హోదా ఉద్యోగులు కూడా అతనిని మన్నించారు. ఆ కాలంలో సంస్థానాధీశులకు మాత్రమే వారి పరివారం ఆయుధాలు ధరించడాని అనుమతి ఉండేది. అలాంటి సదుపాయం వీరాస్వామి పరివారానికి కలుగజేశారు. గంగను దాటే ముందు వీరాస్వామయ్య సామానులను తనిఖీ చేయాలని పట్టు బట్టిన కస్టమ్స్ ఉద్యోగిని ఆపే కమిషనర్ వెంటనే డిస్మిస్ చేశాడు. అయితే అతనిని క్షమించమని వీరాస్వామయ్య కోరాడు.

తన యాత్ర తనకొక్కడికే పుణ్యవంతం కావాలని అతను కోరుకొనలేదు. నూరు మందికి పైగా ఉన్న తన పరిజనం చేత యాత్రా ఫలసిద్ధికి కావలసిన విధులు, కర్మలు అన్నింటినీ చేయించాడు. దారిలో తన పరిజనానికి ఆయనే వైద్యుడు కూడాను. దారిలో అస్వస్థతకు గురైన నౌకర్లు కూడా యాత్రను పూర్తి చేయాలని స్థానికి కూలీల ద్వారా డోలీలు ఏర్పాటు చేయించాడు. ఆఖరికి స్థానికంగా తెచ్చుకొన్న తాత్కాలిక కూలీకి జ్వరమొస్తే అతనిని మోసుకెళ్ళడానికి మరో నలుగురు కూలీలను నియమించాడు. కాశీలో చలికాలంలో రక్షణ కోసం అందరికీ తగు వస్త్రాలు, నూనెలు కొని ఇచ్చాడు.

తన యాత్రా ఫలాన్ని తనకొకడికే పరిమితం చేసుకోలేదు. నలభై బిందెల గంగా జలాన్ని పది బాడుగ గుర్రాలమీద చెన్నపట్నం పంపించే ఏర్పాటు చేయించాడు. అయినా ఆ జలం రవాణాకు ఏమయినా అంతరాయం కలుగుతుందేమోనని మరొక ఎనిమిది బిందెల తనవెంట రెండు బండ్లలో తీసుకొని వచ్చాడు. ఆ పుణ్య తీర్ధాన్ని మద్రాసులో ఇంటింటికి పంచాడు.

దాన గుణానికి వీరాస్వామి పెట్టింది పేరు. తన శక్తికి మించిన దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమాలను తలకెత్తుకొని విజయవంతంగా పూర్తి చేశాడు. తనకెవరైనా కొంచెమైనా సహాయపడితే అది మరచి పోకుండా గుర్తుంచుకొని అంతకు ఎన్నోరెట్ల సహాయం చేసేవాడు. తన కూతురి వివాహానికి, బంధువుల ఆక్షేపణను లక్ష్యపెట్టుండా, సమస్త జాతులవారికి భోజనాలు ఏర్పాటు చేసెను. ఇంత ఖర్చు చేసేబదులు పిల్లదానికి కొంత ఆస్తి ఏర్పరుచవచ్చునుగదా అని బంధువులు ప్రశ్నించారు. చిన్నదాని పోషణ నిమిత్తము ద్రవ్యమును మనుష్యాధీనముగా నుంచుటకు బదులుగా ఈశ్వరుని చేతిలో భద్రంగా ఉంచుతున్నాని చెప్పాడు వీరాస్వామయ్య.

కాశీయాత్ర మార్చు

వీరాస్వామయ్య కాశీయాత్ర జర్నల్ మొదటి వాక్యం ఇది -

జగదీశ్వరుండు నాచేత కొంత దేశాటనము జేయింపదలచి నన్నునేలుచున్న సూప్రీం కోరటు దొరలగుండా సెలవిప్పించినాడు. గనుక నేను కాశీయాత్ర బోవలెనని 1830 సంవత్సరము మే నెల 18వ తేదీ కుజవారము రాత్రి 9 ఘంటలకు చెన్నపట్టణము విడిచి మాధవరము చేరినాను. అది తండయారు వీధిలోనుండే నా తోటకు 3 గడియల దూరము.

ఇలా 1830 మే 18న అతని కాశీయాత్ర ప్రారంభమైంది. సుమారు 15 నెలలు సాగిన ఈ యాత్రలో అతని కుటుంబ స్త్రీ జనం, బంధువులు, పరిజనులు సుమారు 100 మంది పైగా ఉన్నారు. వారు తిరుపతి, కడప, కర్నూలు, హైదరాబాదు, నాగపూరు, ప్రయాగల మీదుగా కాశీ చేరుకొన్నారు. ప్రయాణం అధికంగా పల్లకీలు మోసే బోయల ద్వారా జరిగినట్లు తెలుస్తున్నది. వారు కాశీ నుండి గయ ద్వారా కలకత్తా నగరానికి చేరారు. తరువాత ఉత్కళ ప్రాంతం భువనేశ్వరం, బరంపురంల మీదుగా శ్రీకాకుళం చేరారు. రాజమహేంద్రవరం, బందరు, నెల్లూరుల గుండా తిరిగి చెన్నపట్నం చేరుకున్నారు. అప్పటికి రైళ్ళు లేవు. రోడ్లు కూడా సరిగా లేవు. కంకర రోడ్లసలే లేవు. "బాట సరాళము" అంటే మనుషులు, బండ్లు నడవడానికి వీలుగా ఉన్నదని అర్ధం చేసుకోవాలి. అతని యాత్రలో సందర్శించిన కొన్ని ఊళ్లు, మజిలీలు, స్థలాలు ఇలా ఉన్నాయి. ఇక్కడ వ్రాసిన తేదీలు వాటి ప్రక్కన ఇచ్చిన ఏదో ఒక ఊరి మజిలీకి చెందినవవుతాయి.

  • 1830 మే 18 - చెన్న పట్నం, మాధవరం, పాలవాయి సత్రం, వెంకటేశనాయుడి సత్రం (పెదపాళెము), తిరువళ్ళూరు, కనకమ్మ సత్రం (కార్వేటి నగరం), బుగ్గగుడి, పుత్తూరు, వడమాలపేట సత్రం, అలమేలు మంగాపురం.
మే 1830
జూన్ 1830
  • జూన్ 2 - అహోబిళం, శ్రీరంగాపురం, రుద్రవరము, మహానంది, బండాతుకూరు, వెలపనూరు, ఓంకారము, వెంపెంట, ఆత్మకూరు, నాగులోటి, పెద్ద చెరువు
  • జూన్ 16 - శ్రీశైలము, భీముని కొల్లము, పెద్దచెరువు
  • జూన్ 20 - నివృత్తి సంగమం (కృష్ణ దాటడం), ముసలిమడుగు
  • జూన్ 21 - సిద్ధేశ్వరం ఘాటు, పెంటపల్లి, పానగల్లు, చిన్నమంది, వనపర్తి, గణపురం, చోళీపురం, మనోజీపేట, జడచర్ల, నాగనపల్లె (బాలనగరం), జానంపేట (ఫరక్కునగరం), షాపురం
  • జూన్ 29 - హైదరాబాదు (బేగం బజారు)
జూలై 1830
  • జూలై 8 - సికింద్రాబాదు, గోల్కొండ
  • జూలై 20 - మేడిచర్ల, మాషాపేట, బిక్కనూరుపేట, కామారెడ్డిపేట, మల్లుపేట, యాదలవాయి, జగనంపల్లె, వేములవాడ, దూదుగాం, స్వర్ణ, ఆర్మూరు, రామనపేట
  • జూలై 31 - (గోదావరి దాటడం), నిర్మల (కుశ దర్పణం)
ఆగస్టు 1830
  • ఆగస్టు 2 - వొడ్డూరు, విచ్చోడా, యేదులాబాదు (పిన్నగంగ దాటడం), గూంగాం
  • ఆగస్టు 14 - నాగపూరు
  • ఆగస్టు 21 - కామిటి
  • ఆగస్టు 26 - రామటెంకి
సెప్టెంభరు 1830
  • సెప్టెంబరు 6 - నర్మదావది దాటడం, తిలవారా
  • సెప్టెంబరు 8 - జబ్బల్ పూరు
  • సెప్టెంబరు 13 - గోసలపూరు
  • సెప్టెంబరు 22 - రీమా
  • సెప్టెంబరు 29 - మిరిజాపూరు
అక్టోబరు 1830
  • అక్టోబరు 9 - వింధ్యవాసిని
  • అక్టోబరు 12 - ప్రయాగ (అలహాబాదు)
  • అక్టోబరు 23 - గంగమీద ప్రయాణం
  • అక్టోబరు 27 - కాశీ, హరిద్వాఱము, గంగోత్రి, బదరీ నారాయణము, కాశ్మీరము
  • డిసెంబరు 17 - గయకు ప్రయాణం, గాజీపూరు
  • డిసెంబరు 28 - పట్నా, జ్వాలా ముఖి, దేవప్రయాగ
  • 1831 జనవరి 1 - పున:పునః నది, నీమా నదామా
  • జనవరి 4 - గయ
  • ఫిబ్రవరి 18 - పట్నా
  • మార్చి 5 - గంగానదిపై ప్రయాణం, మూంగేరి (మాంఘీరు), భాగల్పూరు
  • మార్చి 17 - రాజా మహాలు
  • ఏప్రిల్ 1 - కృష్ణనగరు
  • ఏప్రిల్ 9 - కలకత్తా
  • జూన్ 3 - వుడుబడియా, భద్రకాళి, రాణీసరాయి
  • జూన్ 18 - మహానది దాటడం, కటకం (కటక్), పిప్పిలి
  • జూన్ 21 - జగన్నాధము (భువనేశ్వరం)
  • జూన్ 27 - నరసింగగాటు
  • జూన్ 28 - మాణిక్యపట్టణం, చిలక సముద్రం
  • జూన్ 30 - గంజాం (ఋషికుల్య నది)
  • జూలై 1 - నాయుడిపేట, ఛత్రపురం, బరంపురం
  • జూలై 3 - ఇచ్ఛాపురం, గంజాం జిల్లాలోని రేవులు, కంచర్ల, పలాస, రఘునాధపురం, హరిశ్చంద్రపురం, నరసన్నపేట, రావులవలస
  • జూలై 7 - శ్రీకాకుళం, శ్రీకూర్మము
  • జూలై 9 - వెజ్జపురం, గిరివాడిపాళెం, గంజాం, విజయనగరం తాలూకాలలోని అగ్రహారాలు, మహాస్థలాలు
  • జూలై 10 - విజయనగరం, ఆలమంద, సబ్బవరం, సింహ్వాచలము, కసంకోట, అనకాపల్లి, యలమంచిలి, దివ్యల, నక్కపల్లి, వుపమాకా, తుని, నాగలాపల్లి, యానాం, నీలపల్లి, యింజరము, మాదయ పాళెము, వుప్పాడా
  • జూలై 20 - పిఠాపురము, పెద్దాపురము
  • జూలై 21 - రాజానగరము
  • జూలై 21 - రాజమహేంద్రవరము, కాకినాడ, కోనసీమ, ధవిళేశ్వరం, భద్రాద్రి, కోరంగి
  • జూలై 28 - గోదావరి దాటడం, వాడపల్లి, రాల (ర్యాలి), ఆచంట, శింగవృక్షము, బొండాడ, యేలూరిపాడు, కలిదండి. తుమ్మడి
  • ఆగస్టు 2 - మచిలీ బందరు
  • కొత్తపాళెం - చల్లపల్లి, కళ్ళేపల్లి
  • ఆగస్టు 19 - కృష్ణానదిని దాటడం, కనగాల, భట్టుప్రోలు, లంజదిబ్బ, చందవోలు, బాపట్ల, వేటపాళెం, చినగంజాం, అమ్మనబోలు, ఆకులల్లూరు, వెలగపూడి సత్రము, కరేడు, కొత్త సత్రము, జువ్వులదిన్నె, పంటల్లూరు, కొడవలూరి సత్రం
  • ఆగస్టు 14 - పినాకినీ నదిని దాటడం, నెల్లూరు
  • ఆగస్టు 27 - మనుబోలు, గూడూరు, నాయుడుపేట, బ్రాహ్మణపుదూరు, దొరవారి కోనేరు, మన్నారు పోలూరు (కోటపోలూరు), చిలకలపూడి రామస్వామి సత్రం, సుళూరుపేట, గుమ్మడిపూడి
  • సెప్టెంబరు 1 - పొన్నేరి, విచ్చూరు
  • సెప్టెంబరు 2 - తిరువట్టూరు
  • 1831 సెప్టెంబరు 3 - చెన్నపట్టణము

చివరి అధ్యాయంలో కొన్ని వాక్యాలు:

3వ తేదీ సాయంకాలము 5 గంటలకు బయలువెళ్ళి యిష్టులతో గూడా చెన్నపట్టణమునకు అరకోశెడు దూరములో తండయారువేడులో ఉండే నాతోటయిల్లు ఆరు గంటలకు చేరినాను. ... ... నేను స్వస్థలమును వదలి మళ్ళీ చేరిన కాలము 15 మాసాలు 15 దినాలు 10 నిముషాలు. నా స్వస్థలము వదలి దూర దేశమును సంచరించి మళ్ళీ వచ్చినట్టు నాకు నా పరివారానికిన్ని తోపచేయక వొకరికి కాలిలో ముల్లు గూడా నాటినట్టు తోపచేయకుండా తృణానికి తక్కువ అయిన నన్ను రాజఠీవిగానే స్థలము చేర్చినాడు గనుక అవ్యాజముగా ఈశ్వరుడు తృణాన్ని మేరువు చేస్తాడనే మాట సత్యం సత్యం పునఃసత్యమని నా సహోదరులైన లోకులు నమ్మవలసినది. (తరువాత చెన్నపట్నం చరిత్ర గురించి వ్రాసాడు రచయిత)

కాశీయాత్ర చరిత్ర మార్చు

యాత్రా విశేషాలను ఒక జర్నలుగా వ్రాసి పంపవలెనని వీరాస్వామయ్య కాశీయాత్రకు బయలు దేరే ముందు అతని మిత్రుడు శ్రీనివాస పిళ్ళై కోరాడు. అలా వ్రాసిన సంగతులను 1838లో అచ్చు వేయించాడు. 1869లో ప్రభుత్వ ఉత్తరువుల ప్రకారం పునర్ముద్రింపబడింది. 1941లో దిగవల్లి వేంకటశివరావు కొంత పరిశోధించి, మరిన్ని సమగ్రమైన వివరణలతో పునర్ముద్రింపజేశాడు. 19వ శతాబ్దం ఆరంభ కాలానికి సంబంధించిన విశేషాలను తెలుసుకోవడానికి ఈ పుస్తకంలా మరే తెలుగు పుస్తకమూ ఉపకరించడంలేదు. ఆ కాలంలో జీవనం గురించి, భాష గురించి, పాలనా వ్యవస్థ గురించి అనేక విషయాలు ఈ పుస్తకం ద్వారా తెలుస్తున్నాయి.

యాత్రా విశేషాలు వ్రాయడం 19వ శతాబ్దంలో ఈ పుస్తకానికి ముందు లేదనే చెప్పవచ్చును. తెలుగులో యాత్రా చరిత్రకు వీరాస్వామయ్య ఆద్యుడు అనవచ్చును. అప్పటిలోనే ఇది తమిళ మరాఠీ భాషలలోకి తర్జుమా చేయబడింది.


మూలాలు, వనరులు మార్చు

  • ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్ర తొలి మూడు ముద్రణలు: మొదట 1838లో మద్రాసు నుండి ప్రచురింపబడిన ఈ పుస్తకం 1869 లో మరల మద్రాసునుండి, 1941లో విజయవాడ నుండి ముద్రింపబడింది. 1941లో ఇది దిగవల్లి వేంకటశివరావు సంపాదకత్వంలో ఏసియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, న్యూఢిల్లీ, మద్రాసు వారిచే ముద్రింపబడింది. ఈ మూడవ ముద్రణలో దిగవల్లి వేంకటశివరావు గ్రంథకర్త గురించి, ఆకాలంలో దేశ పరిస్థితుల గురించి వివరంగా వ్రాశాడు. బ్రౌన్ దొరకు, వీరాస్వామయ్యకు మధ్య నడచిన ఉత్తర ప్రత్యుత్తరాలు, వాటి ఫొటోలు ఇచ్చాడు. 1838 నాటి పుస్తకం నుండి తీసుకొన్న బొమ్మకు ఆంధ్రజ్యోతివారు క్రొత్త బ్లాకు చేసి ఇచ్చారు. ఏనుగుల వీరాస్వామయ్య గారి మిత్రుల గురించి కూడా సంపాదకుడు వివరమైన వ్యాసం వ్రాశాడు.
  • కాశీయాత్రా చరిత్ర - ఏనుగుల వీరాస్వామయ్య , 1992లో ముక్తేవి లక్ష్మణరావు చే సంక్షిప్తీకరింపబడిన ముద్రణ: 1992లో తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారిచే ప్రచురింపబడింది. ఇందులో పాత పుస్తకంలో ఉన్న విషయాలు ఆధారంగా సంపాదకుడు ముక్తేవి లక్ష్మణరావు వీరాస్వామయ్య జీవితం, కాలం గురించి సుదీర్ఘమైన వ్యాసం సంపాదకీయం వ్రాశాడు. మూల ప్రతిలో కొంత భాగాన్ని (ముఖ్యంగా ఉత్తరాది ప్రయాణంలో భాగాన్ని) వదలివేసి, తక్కిన భాగాన్ని మాత్రం ప్రచురించాడు. మూల ప్రతిలో ఉన్న తెలుగు అంకెలు స్థానే ప్రస్తుతం అధికంగా వినియోగంలో ఉన్న ఇంగ్లీషు అంకెలు వాడాడు.

యివి కూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు