పొంగూరు నారాయణ (జననం: జూన్ 15, 1956) ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు, నాలుగేళ్ల కిందట వచ్చిన ఈ పదవి కన్నా ముందే ఆసియాలో అతిపెద్ద విద్యాసంస్థకు బీజం వేసిన విద్యావేత్తగా ఆయన తెలుగు ప్రజలకు చిరపరిచితం. విద్యారంగంలో పి.నారాయణ సాధించిన విజయాలు ఆయనలోని ఓ పార్శ్వాన్ని స్పృశిస్తే, ఇప్పుడు నూతన రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న సేవలు నారాయణ లోని ఇంకో కోణాన్ని చూపిస్తున్నాయి. ఎంచుకున్న రెండు రంగాల్లో అద్వితీయ విజయాలు సాధించిన పొంగూరు నారాయణ జీవితం పూల పాన్పు కాదు. కష్టం, చిత్తశుద్ధి, ప్రణాళికతో పేదరికం నుండి ఒక్కో మెట్టు ఎక్కి విజయ శిఖరాలు చేరుకున్నారు. ఆయన టీడీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ పట్టణాభివృద్ధి, అర్బన్‌ హౌసింగ్‌ శాఖల మంత్రిగా పని చేశాడు.[1]

పొంగూరు నారాయణ
పొంగూరు నారాయణ,ప్రస్తుత చిత్రం
జననంపొంగూరు నారాయణ
(1956-06-15) 1956 జూన్ 15 (వయసు 67)
హరనాధపురం, నెల్లూరు
ఇతర పేర్లునారాయణ
వృత్తిప్రముఖ విద్యావేత్త, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి
రాజకీయ పార్టీతెలుగుదేశం
పిల్లలుDr. సింధూరి, శరణి , నిషిత్
బంధువులుగంటా శ్రీనివాసరావు (వియ్యంకుడు)
తండ్రిసుబ్బరామయ్య పొంగూరు

బాల్యం మార్చు

నారాయణ 1956 జూన్ 15న నెల్లూరు లోని హరనాథపురంలో జన్మించారు. ఎంఎస్‌సి అనంతరం పిహెచ్‌డి చేశారు. 1977లో సాంఖ్యకశాస్త్రం (స్టాటిస్టిక్స్‌) లో బంగారు పతకం సాధించారు, 1979లో తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం లో పీజీ పూర్తి చేశారు.దేశంలో విద్యారంగాన్ని గట్టిగ ప్రభావితం చేసి విజయ పతాకం ఎగరేసిన డాక్టర్ పి.నారాయణ ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చారు. ఆయన తండ్రి ఓ ప్రైవేటు బస్ కండక్టర్. బాల్యం పేదరికంలో గడిచింది. అయితే, విద్యలో ఎన్నడూ వెనకబడలేదు. చదివిన ప్రతీ క్లాస్ లో ఆయనే ఉత్తమ విద్యార్థిగా ఉపాధ్యాయుల మన్ననలు పొందారు. కాలేజీ లో చదివేటప్పుడే ట్యూషన్లు చెప్పేవారు. చిన్నపిల్లలే కాదు, తన క్లాస్ విద్యార్థులు, సీనియర్లు కూడా నారాయణ ట్యూషన్ కి వచ్చేవాళ్ళు.పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టాటిస్టిక్స్ విభాగంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి బంగారు పతకం సాదించారు పొంగూరు నారాయణ. పి.జి పూర్తయిన వెంటనే ఆయన నెల్లూరులోని వి.ఆర్ కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్ గా పనిచేశారు. అప్పుడు ఆయన గంటపాటు పాఠం చెబితే ఆరు రూపాయలు ఇచ్చేవాళ్ళు. అలా మూడు నెలలు పనిచేస్తే 120 రూపాయలు జీతం మాత్రమే దక్కింది.

నారాయణ విద్యాసంస్థలు మార్చు

 
పి.నారాయణ, పాత చిత్రం

ఎంచుకున్న రంగంలో అత్యున్నత శిఖరాలు అందుకోవాలన్న దీక్షతో ప్రతీ అడుగు ముందుకు వేసే పి.నారాయణ కొత్తగా ఏదైనా చేయాలని తలపోశారు. ఆ ప్రస్థానంలో ఎన్ని కష్టాలు ఎదురైనా అధిగమించారు. ఎదురైన కష్టాల్ని,ఒడిదుడుకుల్ని చిరునవ్వుతో ఎదుర్కున్నారు. ఆ ఫలితమే ఇప్పుడు యావద్దేశంలో తలెత్తుకొని నిలబడ్డ నారాయణ విద్యాసంస్థలకు బలమైన పునాదిగా నిలిచింది. 1979 లో ఓ చిన్న అద్దె గదిలో నారాయణ ట్యూషన్ సెంటర్ మొదలైంది. నెల్లూరు హరనాథపురంలో ఏర్పాటైన ఈ ట్యూషన్ సెంటర్ మొదలు కేవలం అయిదుగురు విద్యార్థులతో ప్రారంభమైంది. ఆ సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ పోయింది. అతి కష్టమైన, క్లిష్టమైన లెక్కల్ని విద్యార్థులకు సులువుగా అర్ధమయ్యేలా చెప్పేందుకు నారాయణ చేసిన కృషి వృధాగా పోలేదు. నారాయణ ట్యూషన్ సెంటర్లో గణితం భలే చెబుతున్నారన్న విషయం ఆ నోటా ఈ నోటా పాకి రాష్ట్రమంతా తెలిసిపోయింది. దీంతో, ఈ సెంటర్ లో మాథ్స్ నేర్పించాలని హైదరాబాద్, విశాఖపట్నం నుండి కూడా పిల్లలను తల్లిదండ్రులు తీసుకు రావడం మొదలయ్యింది. దీంతో, గణితంతో పాటూ ఇతర సబ్జెక్ట్స్ కూడా భోదించే ఉపాధ్యాయుల్ని కూడా తన బృందంలో చేర్చుకున్నారు. అలా ఓ చిన్న ట్యూషన్ సెంటర్ గా మొదలైన ఆ ప్రస్థానం అనతి కాలంలోనే ఓ కోచింగ్ సెంటర్ గా రూపుదిద్దుకుంది. డాక్టర్ నారాయణ ప్రణాళిక, చిత్తశుద్ధి, కృషితో పాటు బోధనా రంగంలో ఎంచుకున్న వినూత్న పద్దతులు, అద్భుత ఫలితాలు ఇచ్చాయి. నారాయణ కోచింగ్ సెంటర్ లో చదువుకున్న విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించడం మొదలైంది. ఇంజనీరింగ్ విభాగంలో అయితే నారయణకు పోటీ కూడా లేకుండా పోయింది. ఎంసెట్ తో పాటు ఐ.ఐ.టి పోటీ పరీక్షల్లోనూ నారాయణ విద్యార్థులు విజయ దుదుంభి మోగించారు. ఒకప్పుడు ఐ.ఐ.టి సీట్ అంటే తెలుగు విద్యార్థులకు సాధ్యమా అనుకునే పరిస్థితి నుండి ఆ విభాగంలో అత్యధిక స్థానాలు ఇక్కడి విద్యార్థులే సాధించే పరిస్థతి వచ్చింది. ఈ విషయంలో నారాయణ విద్యాసంస్థల పాత్ర ఎంత ఉందో ఆ సంస్థ విద్యార్థుల విజయాలే ఢంకా బజాయించి మరీ చెబుతాయి. వివిధ పోటీ పరీక్షల్లో విద్యార్థులని సన్నద్ధం చేసేందుకు మైక్రో షెడ్యూల్స్ రూపకల్పన చేయడానికి ఆయన ఆద్యుడు. దీంతోపాటు, ఏ పోటీ పరీక్షకు ఎలా సిద్ధం కావాలి అన్నదానిపై నారాయణ నిర్దేశకత్వంలో సంస్థ ఎన్నో ప్రయోగాలు చేసి అద్భుత ఫలితాలు చూపింది. దానికి సాక్ష్యమే ఇప్పుడు ఐ.ఐ.టి విద్యాసంస్థల్లో 15 నుండి 20 శాతం దాకా తెలుగు విద్యార్థులు చదువుకోవడం. నారాయణ విద్యాసంస్థ విజయాలతో పాటు అక్కడి క్రమశిక్షణ, బోధనా పద్దతుల గురించి తెలియడంతో విద్యార్థులు సంఖ్య బాగా పెరిగింది. నెల్లూరులో ఓ చిన్న అద్దెగదిలో మొదలైన నారాయణ సంస్థ ఇప్పుడు దేశమంతటా విస్తరించింది. ఓ ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థగా ఆవిర్భవించింది. దాదాపు 14 రాష్ట్రాల్లో 4 లక్షల మందికి పైగా విద్యార్థులు, 40 వేల మంది సిబ్బందితో విద్యాప్రస్థానం సాగిస్తున్నది. నారాయణ విద్యా సంస్థలో చదువుకుంటున్న విద్యార్థులు ఐ.ఐ.టి-జే.ఇ.ఇ, నీట్, బిట్ శాట్, ఏ.ఎఫ్.ఎం.సి, ఎయిమ్స్, జిప్ మర్ వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల్లో రాణిస్తున్నారు.

1979లో నెల్లూరులో నారాయణ కోచింగ్ సెంటర్‌గా మొదలైన ఈ సంస్థ రాష్ట్ర స్థాయి ఎంట్రెన్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు కోచింగ్ ఇచ్చేది. ప్రారంభించింది మొదలుగా గుర్తింపు పొందిన నారాయణ కోచింగ్ సెంటర్ నారాయణ ఆధ్వర్యంలో 1983 నాటికి పూర్తిస్థాయి విద్యాసంస్థగా అవతరించింది. 1990లో ఉన్నత పాఠశాల ప్రారంభించారు. 1993లో నెల్లూరులో నారాయణ మహిళా కళాశాల పేరిట బాలికల రెసిడెన్సియల్ కాలేజిని స్థాపించారు. 1999లో జూనియర్ కాలేజిని స్థాపించారు. అదే సంవత్సరం నెల్లూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో ఐఐటీ-జేఈఈ కోచింగ్ కేంద్రాలను స్థాపించారు. 1990ల చివర్లో నారాయణ విద్యాసంస్థ ప్రొఫెషనల్ విద్యారంగంలో అడుగుపెట్టింది. 1998లో నెల్లూరులో 2001లో గూడూరులో ఇంజనీరింగ్ కాలేజీలను స్థాపించారు. 1999లో వైద్య కళాశాలను, 2001లో దంతవైద్య కళాశాలను స్థాపించారు. 2002లో మెడికల్ కాలేజీలో పారామెడికల్ విభాగాన్ని ప్రారంభించారు. అదే సంవత్సరం జూనియర్ కాలేజీలు, ఎంసెట్ కోచింగ్ సెంటర్లను తిరుపతి, కర్నూలు, అనంతపురం, రాజమండ్రి, కాకినాడ పట్టణాల్లో ప్రారంభించారు. ఉత్తర భారత దేశం లో ని వివిధ ప్రాంతాల్లో లో పిఎమ్‌టి, ఐఐటి-జేఈఈ కోచింగ్ సెంటర్ల ఏర్పాటుతో నారాయణ విద్యాసంస్థల నేతృత్వం మరింత బలోపేతమయింది. ఈ సంస్థ 2004-05లో కరెస్పాండెన్స్ విభాగాన్ని, 2007లో అఖిలభారత టెస్ట్ సీరీస్‌ ఆన్‌లైన్ వెర్షన్‌ను ప్రారంభించింది. నారాయణ విద్యాసంస్థలన్నింటికీ వెన్నెముకగా నిలిచినవారు డాక్టర్ పి.నారాయణ.[2]

ప్రశ్నా పత్రాల లీకేజ్‌ మార్చు

2021-22 విద్యాసంవత్సరం పదవ తరగతి వార్షిక పరీక్షల ప్రశ్నా పత్రాల లీకేజ్‌ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థలపై మాల్‌ ప్రాక్టీస్‌ నిరోదక చట్టం 408 ఐపిసి కింద ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల కేసులు నమోదయ్యింది. ఇదిలా ఉండగా నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణను ఏపి సీఐడీ పోలీసులు 2022 మే 10న అదుపులోకి తీసుకున్నారు.[3] అయితే 2014లోనే నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్‌ పదవికి ఆయన రాజీనామా చేసినట్లు ఆధారాలు ఉండడంతో వ్యక్తిగత పూచీకత్తుతో అదేరోజు బెయిల్‌ మంజూరు అయింది.

రాజకీయాలు మార్చు

విద్యారంగంలో తనదైన ముద్ర వేసిన డాక్టర్ పొంగూరు నారాయణ సేవారంగంలోను విశిష్టత నిలుపుకున్నారు. నెల్లూరు నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో రోజుకి దాదాపు 13 వందల మంది నిరుపేద రోగులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ నారాయణ తాను విద్యాభ్యాసం చేసిన ఓరుగంటి రుక్మిణమ్మ మెమోరియల్ స్కూల్ కోసం మూడు అంతస్థుల ఆధునాతన భవనాన్ని నిర్మించి ఇవ్వడంతో పాటు ఆ పాఠశాల నిర్వహణ బాధ్యతలని కూడా స్వీకరించారు. ఆ పాఠశాలలో అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసి కార్పొరేట్ స్కూల్ స్థాయిలో ఈ..లెర్నింగ్ మాడ్యూల్స్ ద్వారా బోధన చేయిస్తున్నారు. ఆ పాఠశాలలో చదివే విద్యార్ధులకి యూనిఫార్మ్స్ , టెక్స్ట్ బుక్స్ , నోట్ బుక్స్ ఉచితంగా ఇవ్వడంతో పాటు నేటి పోటీ ప్రపంచంలో ఎదురయ్యే ప్రతి సవాల్ ని దీటుగా ఎదుర్కొనేలా విద్యార్థుల్ని తీర్చిదిద్దే అనేక విధానాలు ఆ స్కూల్ లో పాటిస్తున్నారు. విద్యారంగంలో విశిష్ట స్థానం పొందిన డాక్టర్ పి. నారాయణ తదుపరి అడుగు రాజకీయ రంగంలో పెట్టడం ఆశ్చరకరం. సమాజానికి ఏదైనా చేయాలన్న తపనతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తి అని చెప్పుకోవచ్చు. ఆయనతో పరిచయం డాక్టర్ నారాయణ ని రాజకీయాల వైపు తిప్పింది. తొలుత టీడీపీ సర్వే విభాగానికి తన మేధోశక్తిని వినియోగించిన నారాయణ క్రమంగా క్రియాశీల రాజకీయాల వైపు అడుగులు వేశారు. 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్ష పాత్రకే పరిమితం అయిన టీడీపీ వెన్నంటి ఆయన చేసిన సేవలు కొద్ది మందికే తెలుసు.అయితే కష్టకాలంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలవడంతో పాటు ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే నారాయణ తపన , పట్టుదల చూసి ఆయన్ని చంద్రబాబు కూడా ఎంతగానో ప్రోత్సహించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడంతో చంద్రబాబు , డాక్టర్ నారాయణకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. కొత్త రాష్ట్రం అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడంలో కూడా నారాయణకు భాగస్వామ్యం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ , పట్టణాభివృద్ధి శాఖలతో పాటు నూతన రాజధాని అమరావతి నిర్మాణంలోనూ నారాయణ కీలక పాత్ర పోషిస్తున్నారు.

దేశంలోనే అత్యంత సంపన్నమైన మంత్రి మార్చు

ఎన్నికల అఫిడవిట్‌లో రూ. 477 కోట్ల ఆదాయాన్ని చూపించిన మంత్రి నారాయణ, తద్వారా భారతదేశంలోనే అత్యంత సంపన్నమైన మంత్రిగా నిలిచారు.

వియ్యం మార్చు

2015 అక్టోబరు 30, శుక్రవారం నారాయణ, గంటా శ్రీనివాసరావుతో వియ్యం అందుకున్నారు.. నారాయణ కుమార్తె శరణి, గంటా కుమారుడు రవితేజల వివాహం నెల్లూరులోని నారాయణ వైద్య కళాశాల ప్రాంగణంలో జరిగింది. రాత్రి 10.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో నవ వధూవరులు ఒక్కటయ్యారు. అనంతరం నూతన దంపతులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీర్వదించారు. ఈ వేడుకకు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్, ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్, మండలి చైర్మన్‌ చక్రపాణి, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు, ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు కామినేని శ్రీనివాస్‌, అయ్యన్నపాత్రుడు, పరిటాల సునీత, కొల్లు రవీంద్ర, యనమల రామకృష్ణుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్‌ కృష్ణయ్య, రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్‌ చిరంజీవి, ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ, ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.[4]

మూలాలు మార్చు

  1. Sakshi (3 April 2017). "ఏపీ మంత్రుల శాఖలు ఇవే". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
  2. http://www.andhraprabha.com/andhra-pradesh/p-narayana-taken-oath-as-minister/18531.html[permanent dead link]
  3. "Former Minister Narayana Arrested by AP CID Police at Hyderabad - Sakshi". web.archive.org. 2022-05-10. Archived from the original on 2022-05-10. Retrieved 2022-05-10.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "పొంగూరు' ఇంట.. పెళ్లి 'గంటా' మోగింది!'". ఆంధ్రజ్యోతి. 2015-10-31. Archived from the original on 2015-11-02. Retrieved 2015-10-31.

బయటి లంకెలు మార్చు

  • సాక్షి దినపత్రిక - 9-6-2014