అనంతపురం జిల్లా
అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా. ఇది తొలిగా 1882లో బళ్లారి జిల్లా నుండి విడదీసి ఏర్పాటు చేసారు. 2022 లో ఈ జిల్లా ను విడదీసి కొత్తగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలోని వ్యవసాయం ప్రధానంగా వర్షాధారితం. ఇక్కడ పండించే ముఖ్య పంటలు వేరుశనగ, వరి, పత్తి, జొన్న, మిరప, నువ్వులు, చెరుకు. పట్టు. ఇక్కడి ముఖ్యమైన పరిశ్రమలు సున్నపురాయి, ఇనుము, వజ్రాల త్రవ్వకం, ఆటోమొబైల్.Map
అనంతపురం జిల్లా | |
---|---|
పెనుకొండ కోట | |
![]() | |
నిర్దేశాంకాలు: 14°42′N 77°35′E / 14.7°N 77.59°ECoordinates: 14°42′N 77°35′E / 14.7°N 77.59°E | |
దేశం | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
ప్రాంతం | రాయలసీమ |
ప్రధాన కార్యాలయం | అనంతపురం |
విస్తీర్ణం | |
• మొత్తం | 10,205 కి.మీ2 (3,940 చ. మై) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 22,41,100 |
• సాంద్రత | 220/కి.మీ2 (570/చ. మై.) |
భాషలు | |
• ఆధికార | తెలుగు |
కాలమానం | UTC+5:30 (IST) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 0( ) |
జాలస్థలి | ananthapuramu |
జిల్లా చరిత్రసవరించు
ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్ర విజయనగర సామ్రాజ్యం ఆరంభంతో మొదలైంది. ఈ నగరానికి కర్ణాటకకు చెందిన వడియార్ వంశమునకు చెందిన అనంతరసు అనే రాజు పేరు మీద అనంతపురము అనే పేరు వచ్చింది. అంతకు ఎంతో కాలం ముందు విజయనగర సామ్రాజ్య సంస్థాపకులైన హరిహరరాయలు బుక్కరాయలలోని బుక్కరాయల పేరు మీదుగా ఇక్కడ ఒక చెరువు త్రవ్వించిన కారణంగా బుక్కరాయసముద్రం అను పట్టణం ఏర్పడింది.
మొట్టమొదటగా ఈ ప్రదేశాన్ని అశోకుడు పాలించాడని తెలుస్తుంది. క్రీ.పూ.258 ప్రాంతంలో అశోకుడు ఈ ప్రాంతాన్ని పాలించినట్టు తెలుస్తుంది. అశోకుడి తర్వాత నలలు ఏడవ శతాబ్దం ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని మడకశిర తాలూకాలోని రత్నగిరి నుండి పాలించారు. ఆ తరువాత నొలంబులు అనంతపురం జిల్లాని తమ స్వాధీనం లోకి తెచ్చుకున్నారు. ఈ నొలంబులు పల్లవుల తెగకు చెందిన వారు. బళ్ళారి జిల్లా నుండి పాలిస్తున్న రాష్ట్రకూటులకు వీరు సామంతులు. గుత్తి వరకు వీరి రాజ్యం వ్యాపించి ఉందని తెలుస్తోంది.
పదవ శతాబ్దంలో నొలంబులను జయించి అనంతపురం జిల్లాను గంగరాజులు స్వాధీనం చేసుకున్నారు. అమరసింహుడు వీరిలో ముఖ్యుడు. ఆపై తంజావూరు నుండి చోళులు వచ్చి వీళ్ళని జయించారు. పదవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దం నడుమ పశ్చిమ చాళుక్యులు నైజాములోని కళ్యాణి నుండి ఈ ప్రాంతాన్ని పాలించారు. ఆపై హోయసలులు, యాదవులు మొదలగు వారి తరువాతి శతాబ్ద కాలం ఈ జిల్లాను పాలించారు.
తర్వాత ఢిల్లీ నుండి పరిపాలన చేస్తున్న అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ దేశంపై దండయాత్ర చేసాడు. అతని సేనాధిపతి మాలిక్ కాఫర్ వచ్చి హోసలులను, యాదవులను తరిమివేసాడు. 1310లో నైజాం రాజ్యంలో ఉన్న ఓరుగల్లులోని ద్వారసముద్రాన్ని కొల్లగొట్టి స్వాధీనం చేసుకున్నాక ప్రతాపరుద్రుడ్ని ఖైదీగా చేసి పట్టుకుపోయారు. ప్రతాపరుద్రుని ధనాగారంనకు కాపలాగా ఉన్న హరిహరరాయలు, బుక్కరాయలు లను కూడా బంధించి తీసుకుపోగా సుల్తాను వారిని కొంత సైన్యమిచ్చి తిరిగి కర్నాటక రాజ్యమునకు పంపివేసాడు. అలా తిరిగి వచ్చిన హరిహరబుక్కరాయలిరువురు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. 1258 నుండి పదహారో శతాబ్దం వరకూ విజయనగరాధీశుల పాలనలో ఈ జిల్లా ఉంది.
1677 లో అనంతపురం జిల్లా మొగలుల పాలనలోకి వెళ్లింది. 1723 లో అసఫ్ జాహి వంశస్థులు దీనిని తమ పాలనలోనికి తెచ్చుకున్నారు. 1799 లో జరిగిన మైసూర్ యుద్ధంలో నిజాం నవాబు దీనిని స్వాదీనపరచు కున్నాడు. 1800 సంవత్సరంలో వచ్చిన సైన్య సహకార పద్ధతి కారణంగా నిజాం నవాబు దీన్ని బ్రిటిష్ వారికి ఇచ్చేశాడు. ఆ తర్వాత 1882 లో బ్రిటిష్ వారు ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. అంతకు ముందు ఈ ప్రాంతం కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లా విస్తీర్ణంలో భాగంగా కడప జిల్లాలోని కదిరి,మదిగుబ్బ,నల్లమాడ,నంబులిపులికుంట,తలుపుల,నల్లచెరువు, ఓబులదేవరచెరువు,తనకల్లు,ఆమడగూరు మండలాలు 1910లో అనంతపురం జిల్లాలో కలిశాయి.తిరిగి బళ్ళారి జిల్లాలో భాగంగా ఉన్న రాయదుర్గం, డి.హిరేహాల్, కణేకల్లు, బొమ్మనహళ్, గుమ్మగట్ట ప్రాంతాలను అనంతపురం జిల్లాలో చేర్చి విస్తరించారు.[2][3]
శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటుసవరించు
శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటుకు 29 మండలాలను విడదీశారు. [4] [1]
భౌగోళిక స్వరూపంసవరించు
జిల్లా విస్తీర్ణం: 10,205 చ.కి.మీ [1]
జనాభా వివరాలుసవరించు
2011 జనాభా లెక్కల ప్రకారం 2022 లో సవరించిన అనంతపురం జిల్లా జనాభా 22.411 లక్షలు.[1]
రెవెన్యూ డివిజన్లు, మండలాలుసవరించు
భౌగోళికంగా జిల్లాను 3 రెవెన్యూ డివిజన్లుగాను,31 మండలాలుగా విభజించారు. గుంతకల్ రెవిన్యూ డివిజన్ కొత్తగా ఏర్పాటైంది. [4]
మండలాలుసవరించు
- అనంతపురం రెవిన్యూ డివిజన్
- కల్యాణదుర్గం రెవిన్యూ డివిజన్
- గుంతకల్ రెవిన్యూ డివిజన్
- అనంతపురం జిల్లాలో మొత్తం 503 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి. [5]
పట్టణ స్థానిక సంస్థలుసవరించు
నగరపాలక సంస్థసవరించు
పురపాలక సంఘాలుసవరించు
నగర పంచాయితీసవరించు
రాజకీయ విభాగాలుసవరించు
లోకసభ నియోజకవర్గాలుసవరించు
- అనంతపురం
- హిందూపురం లోని రాప్తాడు శాసనసభ నియోజకవర్గం పరిధిలో రాప్తాడు, అనంతపురం రూరల్, ఆత్మకూరు మండలాలు. [4]
శాసనసభా నియోజక వర్గాలుసవరించు
మొత్తం 8 శాసనసభ నియోజకవర్గాలుండగా, రాప్తాడు నియోజకవర్గంలోని మూడు మండలాలను (కనగానపల్లి, చెన్నే కొత్తపల్లి, రామగిరి) శ్రీ సత్యసాయి జిల్లా లో చేర్చారు.[4]
రవాణా వ్యవస్థసవరించు
జాతీయ రహదారులు యన్.హెచ్. 44, యన్.హెచ్ 43, అనంతపురం గుండా పోతున్నాయి. అనంతపురం నుండి హైదరాబాదు, బెంగుళూరు,ముంబాయి, న్యూ ఢిల్లీ,అహ్మదాబాద్, ఆదోని, జైపూర్, భువనేశ్వర్, పూనా, విశాఖపట్నం, చెన్నై మొదలైన నగరాలకు నేరుగా రైళ్ళు ఉన్నాయి. అనంతపూరుకు దక్షిణంగా 80 కిలోమీటర్ల దూరంలో పుట్టపర్తి విమానాశ్రయం ఉంది. అలాగే 168 కిలోమీటర్ల దూరంలో బెంగుళూరు లోని దేవనహళ్ళి వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. దక్షిణ మధ్య రైల్వేలో 3 వ పెద్ద డివిజన్ గుంతకల్లు ఇదే జిల్లాలో ఉంది.ఇక్కడినుండి ప్రతి రోజు వేల సంఖ్యలో ప్రయాణిస్తూంటారు. ముంబై-చెన్నై ప్రధాన రైలు మార్గం గుంతకల్లు డివిజన్ గుండా వెళ్తుంది. అంతే కాకుండా గుంతకల్లు రైల్వే స్టేషను నుండి నాలుగు ప్రధాన రైలు మార్గాల ద్వారా ప్రయాణికుల రైళ్ళు వెళతాయి. దక్షిణ మధ్య రైల్వేలో ఎక్కువ ఆదాయం వచ్చే డివిజన్ గా గుంతకల్లుకు మంచి పేరు ఉంది. అనంతపురం నుండి గుంతకల్లు 85 కిలోమీటర్ల దూరంలో ఉంది.
సంస్కృతిసవరించు
- రాగి సంకటి, జొన్నరొట్టె ఎక్కువగా తీసుకుంటారు
పరిశ్రమలుసవరించు
- యాడికి గత దశాబ్దకాలంగా ధర్మవరం తరువాత అతిపెద్ద పట్టు, జౌళి పరిశ్రమల కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది.
- జిల్లాలో గాలులు చాలా వేగంగా వీస్తూ ఉంటాయి. ముఖ్యంగా మే-సెప్టెంబరు కాలంలో గాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కాలాన్ని స్థానికంగా గాలికాలం అని అంటారు. అందుచేత పవన విద్యుత్తు కేంద్రాలు జిల్లాలో విస్తృతంగా ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం స్థాపక శక్తిలో 75 శాతం ఒక్క అనంతపురం జిల్లాలోనే ఉంది. శింగనమల, వజ్రకరూరు జిల్లాలోని కొన్ని ముఖ్య పవనవిద్యుత్కేంద్రాలు.
- పారిశ్రామికపరంగా గ్రానైటును శుద్ధి చేయు పరిశ్రమ, సిమెంటు పరిశ్రమ, ఉక్కు కార్మాగారం, బీడీల పరిశ్రమ, మోటారు కారు (కియా)
- జిల్లాలోని వజ్రకరూరు వజ్రాల వెలికితీతకు ప్రసిద్ధి.
- సప్తగిరి కేంఫర్ (దక్షిణ భారతదేశంలోని అతి పెద్ద కర్పూరపు ఫ్యాక్టరీ )
విద్యాసంస్థలుసవరించు
అనంతపురం లోని గవర్న్మెంట్ ఆర్ట్స్ కాలేజిని 1916లో స్థాపించారు.సర్వేపల్లి రాధాకృష్ణన్, నీలం సంజీవరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కరరెడ్డి వంటి వ్యక్తులు ఈ కాలేజీలో చదివారు.
దర్శనీయ ప్రదేశాలుసవరించు
అనంతపురం జిల్లాలోని జైన క్షేత్రాలుసవరించు
- కొనకొండ్ల ఈ కొనకొండ్ల, అనంతపురం జిల్లా, వజ్రకరూరు మండలానికి చెందిన గ్రామం. శాసనపరంగాను జినకథనం పరంగాను చూస్తే కుందకుందాచార్యుడు కొనకొండ్ల దాపున గల కొండపై నివసించినట్లు బోధపడుతున్నది. ఇంద్రనంది శృతావతారం పద్మనంది అనే జినగురువు ఇక్కడ నివచించినట్లు తెలుస్తున్నది. దీని అసలు పేరు కుంద కుంద పురం, కుందకుందాచార్యుని అసలు పేరు పద్మనంది అనియు అక్కడ లభించన శాసనాల వలన తెలుస్తున్నది. ప్రస్తుతం ఇక్కడ జినావాశేషములన్నియు కొనకొండ్ల దాపునగల రససిద్ధుల గుట్టపై మనం ఇప్పటికీ చూడవచ్చును. ఇందులో కాయచ్చర్గ భంగిమ బాగా ప్రసిద్ధి చెందినది. నిటారుగా ఏ వంపులు లేకుండా నిలబడి రెండు చేతులను మోకాలివరకు తిన్నగా వ్రేలాడువేయు భంగిమను కాయచ్చర్గ భంగిమ అంటారు. జిన మతానుసారం ఋషభనాధుడు, నేమినాఢుడు, మహావీరుడు మినహా మిగిలిన 21 తీర్ధంకరులు ఈ భంగిమలోనే సిద్ధి పొందారు. ఇక్కడ సిద్దచక్రం చెక్కబడి ఉంది.
- రాయదుర్గం రాయదుర్గం అంటే రాజాగారికోట. ఈ కోటదాటి ఉత్తరదిశగా 1 కి.మీ. పయనిస్తే మనకు శిద్ధుల గుట్ట కావవస్తుంది. ఇది అసలు జినక్షేత్రం. ఇది యాపనీయ శాఖకు చెందినది.యాపనీయులు జైనమతాచారాలన్నిటినీ సరళంచేసి సామాన్య ప్రజలకు సైతం ఆచరణయోగ్యంగా చేసేవారు.అటువంటి యాపనీయ సంఘమునకు చెందిన జినక్షేత్రం ఇది.జినులు స్త్రీలను మోక్షానికి అనర్హులుగా యెంచి వారిని జైనమతంలో చేర్చుకొనకపోతే యాపనీయులు స్త్రీలుకూడా మోక్షానికి అర్హులేఅని స్త్రీలకు జైనమతంలో ప్రవేశం కల్పించిరి.
- కంబదూరు ఇది కల్యాణదుర్గంలో తాలూకాలోనిది.ఇక్కడ ఉన్న మల్లేశ్వరస్వామి దేవాలయం ఒకప్పటి జినాలయం. జైన వీరశైవ మత కలహాల తరుణంలో వీరశైవులు విజృంభించి ఇక్కడ ఉన్న జిన్నమతాన్ని ఛ్హిన్నాభిన్నం చేసిరి.అందుకే ఈ ఆలయంలో ఇంకా జినప్రతిమలు కనబడుతున్నవి.శిక్షరం పైన పరియం కాసానం (పద్మాసనం) లో ఉన్న జైనమునిని మనం చూడవచ్చును. ఇక్కడే ఉన్న అక్కమగుడి ఆలయాకృతినిబట్టి ఇదికూడా జినాలయం అని తెలియుచున్నది.
- అమరాపురం ఈగ్రామం బాలేందు మలధారి అనే జినగురువుచే ప్రభావితమైనది.ఇతడు మూలసంఘము, దేశీయగుణము, పుస్తక్ గుఛ్చ, ఇనగలి బలికి చెందిన జిన సంఘారామానికి గురువు.జైనమతంలో కూడా బౌద్ధమతంలో వలే అనేక సంఘారామశాఖలు ఉన్నాయి. ప్రతి జినగురువును తెలిసేటప్పుడు ఆతని సంఘము, గుణము, గుఛ్ఛము విధిగా తెలుపవలెను.ఈ గ్రామం మొత్తం ఒకప్పటి జిన క్షేత్రం.
- రత్నగిరి ఇది విజయనగర రాజుల కాలంలో పరసిద్ధిగాంచిన జినక్షేత్రం. ఇచ్చట శాంతినాధుని దేవాలయం ఉంది.ఇది చాలా పెద్దది.స్థానిక జైనులతో మరమ్మత్తులు చేయించుకొనబడింది.శాంతినాధుడు జైనుల 16వ తీర్ధంకరుడు.
- తాడిపత్రి సా.శ. 12వ శతాబ్దంలో ఇది జైనుల క్షేత్రమని తెలియుచున్నది.సా.శ.1198లో ఉదయాదిత్యుడనే సామంత ప్రభువు ఇచ్చటగల చంద్రనాధ పార్స్వనాధ జినాలయానికి భూమిదానమిచినట్లు ఇక్కడ ఒక శాసనం ఉంది.
- తొగరకుంట సా.శ. 11-12వ శతాబ్దంలో ఇది జైనుల చంద్రప్రభువు తీర్ధంకరుడి క్షేత్రమని తెలియుచున్నది. ఆరవ చాళుక్య విక్రమదిత్యుడు రాజ్యం చేస్తున్న తరుణంలో ఆతని సామంతరాజు ఇక్కడ జినాలయమునకు భూమిని దానం చేసినట్లు ఇక్కడ లభించిన శాసనం తెలుపుచున్నది.
- పెనుగొండ ఇది ప్రఖ్యాత జినక్షేత్రమని జినసారస్వతంలో కీర్తించబడింది.పైగా పెనుగొండ యావద్భారతంలో గల నాలుగు జినవిద్యాకేంద్రాలలో ఒకతిగా జిన కథన,ఉలు తెలుపుచున్నవి.మిగిలిన్ మూడు ఢిల్లీ, కొల్హాపూర్, జినకంచి.విజయనగర రాజుల పాలనలో కూడా పెనుగొండ జినక్షేత్రంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ అజితనాధుని, పార్స్వనాధుని బసదులను లేదా జినాలయములు ఇప్పటికీ తెలుయుచున్నవి.అజితనాధుడు రెండవ తీర్ధంకరుడు. ఏనుగు ఆతని లాంచనము.పార్స్వనాధుడు 23వ తీర్ధంకరుడు. ఇచట కల అజితనాధ దేవాల్యం దక్షిణ శిఖరం కలిగి ఉంది.అంటే హిందూ దేవాలయాల శిఖరాలను పోలిన శిఖరాకృతి. ఈ అజితనాధ జినాలయం శీఖరం మార్పు జైనమతం చివరి దశలో జరిగి ఉండవచ్చును.అదియును విజయనగర రాజులలోనే ఈ మార్పు జైరిగి ఉండవచ్చును.
పర్యాటక ఆకర్షణలుసవరించు
అనంతపురం జిల్లా లోని పర్యాటక ఆకర్షణల్లో
- తాడిపత్రికి 28కిలోమీటర్లదూరంలో ఉన్న బెలూం గుహలు (ప్రకృతి సిద్ధమైన గుహలు).
- పెద్దవడుగూరు మండలంలో కోటకొండ ఇక్కడి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పేరొందినది.
- గుత్తి పట్టణంలో పురాతన కట్టడాల్లో ఒకటైన కోట ప్రసిద్ధిగాంచింది. ఈ కోటలో సుమారు 101 దిగుడు బావులు ఉన్నాయి. తరచు పలువురు సందర్శకులు ఈ ప్రసిద్ధ కోటను సందర్శిస్తుంటారు.
- ఉరవకొండ పెన్న అహోబిళంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం ప్రసిద్ధి గాంచింది.
- హెమావతి గుడి 8- 10 దశాబ్దంలో కట్టారు. ఇది చాలా పెద్ద గుడి
- గుంతకల్లు సమీపంలోని కాసపురంలో ఉన్న హనుమాన్ ఆలయం.
- అనంతపురంలో కొండశిఖరం మీద ఆలయం ఉన్న ఒకేఒక కొండ దేవరకొండ.
- జాతీయరహదారి 7లో నగరశివార్లలో ఉన్న ఇస్కాన్ ఆలయం.
- అనంతపురానికి 10కిలోమీటర్ల దూరంలో కందుకారు గ్రామంలో త్రవ్వకాలలో బయట పడిన పురాతనమైన శ్రీ శివాలయం.
- అనంతపురానికి 70కిలోమీటర్లదూరంలో పెనుకొండ :(ఘనగిరి) హజారత్బాబా మసీదు (దర్గా), పెనుకొండ ప్రవేశంలో ఉన్న 14వ శతాబ్ధానికి చెందిన పెద్ద హనుమాన్ విగ్రహం, కోటగోడ, తిమ్మరుసు సమాధి, పెద్ద నరసింహస్వామి ఆలయం, కొండశిఖరం మీద ఉన్న కోనేరు, పచే పరస్వంతాలయం (ఇది ఒక పురాతన జైన ఆలయం), గగన్ మహాల్ (కృష్ణదేవరాయ వేసవి విడిది) మొదలైన ఈ అధ్యాత్మిక పట్టణంలో ఉన్నాయి.
- ఉరవకొండ సమీపంలో జారుట్ల రామపురంలో ఉన్న శ్రీ రామలింగేశ్వరాలయం. ఈ ఆలయం అనంతపురం నుండి 65 కిలోమీటర్లు ఉరవకొండ నుండి 15 కిలోమీటర్ల దూరంలో అలాగే పెన్న అహోబిలం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఊరికి దూరంగా ఉండే ఈ ఆలయంలో శివలింగం నుండి సదా ఉత్తర దక్షిణాలుగా నీరు ప్రవహిస్తూఉండం ఒక ఆధ్యాత్మిక అద్భుతం. అందుకనే ఈ ఆలయానిని దక్షిణ కాశిగా పిలువబడుతుంది. ఈ ఆలయానికి ఒక పక్క పెద్ద కొండ, పెద్ద అడవి (500 ఎకరాలు పైగా విస్తరించి ఉంది) వెనుక పక్క పెన్నా నది ప్రహిస్తుంటుంది. అలాగే ఎమ్ పి ఆర్ ఆనకట్ట కూడా ఉంది.
- గుంతకల్ మండలంలోని కలశాపురం (కసాపురం) గ్రామంలో శ్రీ మధ్వాచార్య ప్రతిష్ఠిత వీరాంజనేయ స్వామి దేవస్థానం ఉంది.
క్రీడలుసవరించు
అనంతపురం జిల్లాలో క్రీడలకు అధికమైన వసతులు ఉన్నాయి. 1963-1964 లో ఇరానీ కప్పుకు ఆతిధ్యం ఇచ్చి క్రీడలను నిర్వహించింది. సంజీవరెడ్డి స్టేడియంలో జరిగిన రంజీ ట్రోఫీలో విజేతలైన ముంబాయి జట్టుకు ఎదురుగా ఆడిన రెస్టాఫ్ ఇండియా అతి తక్కువ స్కోరు 83 మాత్రమే చేసింది. అలాగే పలు బాస్కెట్ బాల్, బ్యాట్మింటన్ రంజీ ట్రోఫీ క్రీడలు రంజీ ట్రోఫీ టోర్నమెంట్స్కు అనంతపురం ఆతిథ్యం ఇచ్చింది. స్పెయిన్ దేశ టెన్నిస్ క్రీడాకారుడైన రఫేల్ నాడల్ అనంతపురం లోని స్పోర్ట్స్ విల్లేజ్ లో నాడల్ టెన్నిస్ పాఠశాలను (ఎన్ టి ఎస్) స్థాపించాడు. ఇలాంటి పాఠశాల ప్రపంచంలో ఇదే మొదటిది.
ది అనంతపుర్ స్పోర్ట్స్ విలేజ్ (ఎ ఎస్ వి) జాతీయ రహదారి 7 పక్కగా ఉంది. ఇక్కడ ప్రధాన క్రీడా లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన సదుపాయాలు ఉన్నాయి. 40 ఎకరాలలో ఏర్పాటు చేసిన అనంతపురం క్రికెట్ గ్రౌండ్ అనంతపురంలో ఉంది.
జిల్లా ప్రముఖులుసవరించు
- పూర్వ భారత రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (రెండుమార్లు), లోక్సభ స్పీకరు (రెండుమార్లు), ఆంధ్రరాష్ట్ర ఉపముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, నీలం సంజీవరెడ్డి.
- కమ్యూనిస్టు నాయకుడు, తాకట్టులో భారతదేశం పుస్తక రచయిత, పూర్వ లోక్సభ సభ్యుడు, తరిమెల నాగిరెడ్డి.
- పూర్వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం నుండి రాష్ట్ర శాసనసభకు ప్రాతినిధ్యం వహించాడు.
- తెలుగు సినీ దర్శకుడు కె. వి. రెడ్డి జిల్లాలోని తాడిపత్రి పట్టణంలో జన్మించాడు.
- ప్రముఖ రంగస్థల నటులుబళ్ళారి రాఘవ తాడిపత్రికి చెందిన వారు
- మైక్రోసాఫ్ట్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) సత్య నాదెళ్ళ ఈ జిల్లాకు చెందిన వ్యక్తి.
- మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి
- హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చల్లా కోదండరామ్, జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ తాడిపత్రికి చెందిన వారు
- వాహిని స్టూడియో అధినేత మూల లక్ష్మీ నారాయణ తాడిపత్రికి చెందిన వారు
చిత్రమాలికసవరించు
- ఫొటో గ్యాలరీ
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
- ↑ కలవటాల జయరామారావు (1928). "అనంతపురం జిల్లా చరిత్ర" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2014-01-02.
- ↑ కొమర్రాజు లక్ష్మణరావు, ed. (1934). ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం (ద్వితీయ సంపుటం). వికీసోర్స్.
- ↑ 4.0 4.1 4.2 4.3 "సరికొత్త అనంత". ఆంధ్రజ్యోతి. 2022-04-04. Retrieved 2022-04-18.
- ↑ "అనంతపురం జిల్లా హోమ్". Retrieved 2022-04-20.
బయటి లింకులుసవరించు
Wikimedia Commons has media related to అనంతపురం జిల్లా. |