కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం
తెలంగాణ లోని 17 లోక్సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. బద్దం ఎల్లారెడ్డి, ఎం.సత్యనారాయణ, జువ్వాడి చొక్కారావు, సి.హెచ్.విద్యాసాగర్ రావు. కె.చంద్రశేఖర్ రావు లాంటి నాయకులు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.


దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు సవరించు
- కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం
- చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
- వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం
- సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం
- మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
- హుజురాబాదు అసెంబ్లీ నియోజకవర్గం
- హుస్నాబాదు అసెంబ్లీ నియోజకవర్గం
- కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం
నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు సవరించు
లోక్సభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ మొదటి[1] 1952-57 బద్దం ఎల్లారెడ్డి పి.డి.ఫ్ 1952-57 ఎం.ఆర్. కృష్ణ ఎస్.సి.ఎఫ్ రెండవ[1] 1957-62 ఎం.ఆర్. కృష్ణ భారత జాతీయ కాంగ్రెస్ 1957-62 ఎం. శ్రీరంగారావు భారత జాతీయ కాంగ్రెస్ మూడవ 1962-67 జువ్వాడి రమాపతిరావు భారత జాతీయ కాంగ్రెస్ నాల్గవ 1967-71 జువ్వాడి రమాపతిరావు భారత జాతీయ కాంగ్రెస్ ఐదవ 1971-77 ఎం. సత్యనారాయణరావు తెలంగాణా ప్రజా సమితి ఆరవ 1977-80 ఎం. సత్యనారాయణరావు భారత జాతీయ కాంగ్రెస్ ఏడవ 1980-84 ఎం. సత్యనారాయణరావు భారత జాతీయ కాంగ్రెస్ ఎనిమిదవ 1984-89 జువ్వాడి చొక్కారావు భారత జాతీయ కాంగ్రెస్ తొమ్మిదవ 1989-91 జువ్వాడి చొక్కారావు భారత జాతీయ కాంగ్రెస్ పదవ 1991-96 జువ్వాడి చొక్కారావు భారత జాతీయ కాంగ్రెస్ పదకొండవ 1996-98 ఎల్.రమణ తెలుగుదేశం పార్టీ పన్నెండవ 1998-99 సి.హెచ్.విద్యాసాగర్ రావు భారతీయ జనతా పార్టీ పదమూడవ 1999-04 సి.విద్యాసాగర్ రావు భారతీయ జనతా పార్టీ పదునాల్గవ 2004-06 కె.చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి (ఉపఎన్నిక) 2006-08 కె.చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి (ఉపఎన్నిక) 2008-2009 కె.చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి 15వ 2009-2014 పొన్నం ప్రభాకర్ భారత జాతీయ కాంగ్రెసు 16 వ 2014-2019 బి. వినోద్ కుమార్ తెలంగాణ రాష్ట్ర సమితి
1971 ఎన్నికలు సవరించు
1971 లోకసభ ఎన్నికలలో తెలంగాణ ప్రజాసమితి తరఫున పోటీచేసిన ఎం.సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి.జగపతిరావు పై విజయం సాధించాడు. సత్యనారాయణరావుకు 47.2% ఓట్లు రాగా, జగపతిరావుకు 43.2% ఓట్లు లభించాయి.
2004 ఎన్నికలు సవరించు
2004 ఎన్నికల్లో ఫలితాలను చూపే "పై" చిత్రం
- 2004 ఎన్నికలలో వివిధ అభ్యర్థులు సాధించిన ఓట్లు
భారత సాధారణ ఎన్నికలు,2004:కరీంనగర్ | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
తెలంగాణా రాష్ట్ర సమితి | కె.చంద్రశేఖరరావు | 451,199 | 51.59 | +51.59 | |
భారతీయ జనతా పార్టీ | చెన్నమనేని విద్యాసాగర రావు | 320,031 | 36.60 | -13.13 | |
Independent | మామిడిపల్లి గంగరాజం | 59,686 | 6.83 | ||
బహుజన సమాజ్ పార్టీ | కొత్తపల్లి సాంద్రి మేనయ్య | 43,582 | 4.98 | ||
మెజారిటీ | 131,168 | 14.99 | +64.72 | ||
మొత్తం పోలైన ఓట్లు | 874,498 | 65.12 | -1.64 | ||
తెరాస గెలుపు | మార్పు | +51.59 |
2006 ఉపఎన్నికలు సవరించు
లోక్సభ సభ్యుడిగా ఉన్న కె.చంద్రశేఖర్రావు రాజీనామా చేయడంతో 2006లో ఉపఎన్నిక అనివార్యమైంది. 2004లో కాంగ్రెస్ పార్టీ మద్దతు పొందిన కెసిఆర్ ఈ సారి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయిననూ తెలంగాణా భావన అధికంగా ఉండుటచే సునాయాసంగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించాడు. సమీప ప్రత్యర్థి కాంగ్రేస్ పార్టీకి చెందిన టి.జీవన్ రెడ్డిపై రెండులక్షలకుపైగా మెజారిటీపొంది లక్ష్యం నెరవేర్చుకున్నాడు.
2008 ఉపఎన్నికలు సవరించు
తెలంగాణా రాష్ట్ర సమితి సభ్యుల మూకుమ్మడి రాజీనామాల వలన జరిగిన ఆంధ్రప్రదేశ్లో జరిగిన 4 లోక్సభ, 18 శాసనసభ స్థానాలలో (రెండు శాసన సభ స్థానాలలో సభ్యుల మరణాల వల్ల జరిగాయి) 2008లో ఉపఎన్నికలు జరిగాయి. ఈ లోక్సభ నియోజకవర్గం నుంచి వరుసగా మూడో పర్యాయం తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఎన్నికల రంగంలోకి దిగాడు. తెరాసతో పాటు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు కూడా ఈ స్థానంకై ఇంతకు క్రితం పోటీచేసిన అభ్యర్థులను నిలబెట్టాయి. భారతీయ జనతా పార్టీ మాత్రం ఈపోటీలకు దూరంగా ఉండటమే కాకుండా ఎవరికీ అధికారికంగా మద్దతు ప్రకటించలేదు. తెరాస క్రితం సారి సాధించిన భారీ మెజారిటీతో, తెలంగాణా అంశంతో ఉత్సాహంగా బరిలోకి దిగగా, కాంగ్రెస్, తెలుగుదేశాలు కూడా ఈ స్థానం చేజిక్కించుకొనుటకు చాలా ప్రయత్నించాయి. ఏడాది లోపలే సాధారణ ఎన్నికలు ఉండటంతో ఈ ఎన్నికలను ప్రాధాన్యత ఏర్పడింది. హోరాహోరీగా జరిగిన పోరులో చివరికి తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు విజయం సాధించిననూ ఆధిక్యం మాత్రం బాగా తగ్గిపోయింది. కేవలం 15,765 ఓట్ల తేడాతో చంద్రశేఖరరావు సమీప సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన టి.జీవన్ రెడ్డిపై గెలిచాడు.
అభ్యర్థి/పార్టీ | పొందిన ఓట్లు |
---|---|
కె.చంద్రశేఖరరావు (తె.రా.స) | 2,69,452
|
టి.జీవన్రెడ్డి (కాంగ్రెస్) | 2,53,687
|
ఎల్.రమణ (తె.దే.పా) | 1,73,400
|
2009 ఎన్నికలు సవరించు
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పొన్నం ప్రభాకర్,[2] ప్రజారాజ్యం పార్టీ తరఫున వెలిచాల రాజేందర్[3] మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన బి.వినోద్ కుమార్[4] పోటీచేశారు. తొలుత కె.చంద్రశేఖరరావు కుమారుడు కె.తారక రామారావును ఇక్కడి నుండి పోటీ చేయించాలనుకున్ననూ చివరి దశలో సిరిసిల్ల అసెంబ్లీ టికెట్టు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన బి.వినోద్ కుమార్ పై 50243 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.[5]
2014 ఎన్నికలు సవరించు
2014 ఎన్నికల్లో ఫలితాలను చూపే "పై" చిత్రం
భారత సాధారణ ఎన్నికలు,2014:కరీంనగర్ | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
తెలంగాణా రాష్ట్ర సమితి | బి.వినోద్ కుమార్ | 505358 | 44.85 | ||
భారత జాతీయ కాంగ్రెస్ | పొన్నం ప్రభాకర్ | 300706 | 26.68 | ||
భారతీయ జనతా పార్టీ | సి.హెచ్.విద్యాసాగరరావు | 215828 | 19.15 | ||
వెల్ఫేర్ పార్టీ | షేక్ మహమ్మద్ | 39380 | 3.5 | ||
మెజారిటీ | 204652 | 18.16 | |||
మొత్తం పోలైన ఓట్లు | 1126724 | ||||
తెరాస గెలుపు | మార్పు |
నియోజకవర్గ ప్రముఖులు సవరించు
- సి.హెచ్.విద్యాసాగర్ రావు
- విద్యాసాగర్ రావు తొలిసారిగా 1980లో ఈ నియోజకవర్గం నుంచి జనతా పార్టీ తరఫున పోటీచేసి ఎం.సత్యనారాయణ (ఎమ్మెస్) చేతిలో ఓడిపోయాడు. ఆ తరువాత ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మెట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున వరుసగా 3 సార్లు (1985, 89 , 94) గెలుపొందినాడు. 1998 లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రమణపై, 1999లో కాంగ్రెస్ అభ్యర్థి ఆనందరావుపై విజయం సాధించాడు. అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో సహాయమంత్రిగానూ పనిచేశాడు. ఇతడు కరీంనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించాడు. తెలంగాణ రాష్ట్ర సమితి అవరతణ తరువాత ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు కరీంనగర్ లోక్సభ నుంచే పోటీచేయడంతో 2004లో , 2006 ఉపఎన్నికలలో కెసిఆర్ చేతిలో ఓడిపోయాడు. 2008లో జరిగిన ఉపఎన్నికలలో కూడా పోటీ చేయలేదు.
- కె.చంద్రశేఖర రావు
- తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడైన కె.చంద్రశేఖర్ రావు ప్రత్యేక తెలంగాణ సాధనకై తెలుగుదేశం పార్టీని వదిలి ప్రత్యేకపార్టీని ఏర్పాటుచేశాడు. ఇతని స్వస్థలం మెదక్ జిల్లా సిద్ధిపేట్ అయిననూ కరీంనగర్ లోక్సభ స్థానాన్ని ఎంచుకొని 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకొని విజయం సాధించాడు. 2006లో లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి 2 లక్షలకు పైగా మెజారిటీతో ఘనవిజయం పొందినాడు. 2008లో మళ్ళీ తెరాస సభ్యులందరూ రాజీనామా చేయడంతో జరిగిన ఉపఎన్నికలలో కూడా విజయం సాధించిననూ మెజారిటీ 15వేలకే పరిమితమైంది.