వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2012)

2012 సంవత్సరంలో "ఈ వారం వ్యాసం" శీర్షికలో ప్రదర్శించిన వ్యాసాలు

ప్రస్తుత ప్రతిపాదనలు, జాబితా కోసం వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా చూడండి.


1వ వారం

గుంటూరు జిల్లా


గుంటూరు జిల్లా 11,391 చ.కి.మీ. ల విస్తీర్ణములో వ్యాపించి, 48,89,230 (2011 గణన) జనాభా కలిగిఉన్నది. జిల్లాకు తూర్పు, ఈశాన్యాన కృష్ణా నది ప్రవహిస్తూ జిల్లాను కృష్ణా జిల్లా నుండి వేరు చేయుచున్నది. ఆగ్నేయాన బంగాళాఖాతము, దక్షిణాన ప్రకాశం జిల్లా, పశ్చిమాన మహబూబ్ నగర్ జిల్లా, మరియు వాయువ్యాన నల్గొండ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. దీని ముఖ్యపట్టణం గుంటూరు

ఈ జిల్లాకు అతి పురాతన చరిత్ర వుంది. మౌర్యులు, శాతవాహనులు, పల్లవులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు పరిపాలించారు. పల్నాటి యుద్ధం ఇక్కడే జరిగింది. మొగలు సామ్రాజ్యం, నిజాం పాలన, ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ తరువాత మద్రాసు ప్రసిడెన్సీలో భాగమైనది. స్వాతంత్ర్య సమరంలో పెదనందిపాడు పన్నుల ఎగవేత, సైమన్ కమీషన్ వుద్యమం లాంటి ఎన్నో చారిత్రక ఘట్టాల ఈ జిల్లాలో జరిగాయి. స్వాతంత్ర్యం తరువాత ఆంధ్రరాష్ట్రంలో, ఆ తదుపరి ఆంధ్రప్రదేశ్ లో భాగమైంది.

విద్యా కేంద్రంగా అనాది నుండీ పేరు పొందింది.నాగార్జున విశ్వవిద్యాలయం, బాపట్ల వ్యవసాయ కళాశాల, పలు ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలు, పలు ప్రైవేట్ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు వున్నాయి. వరి, పొగాకు, ప్రత్తి మరియు మిర్చి జిల్లా యొక్క ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు. కృష్ణ ముఖ్య నది. చంద్రవంక, నాగులేరు, గుండ్లకమ్మ జిల్లాలో ముఖ్య వాగులు. జిల్లా లోని ముఖ్య చారిత్రక స్థలాలలో పేరుపొందినవి అమరావతి, భట్టిప్రోలు, ఉండవల్లి గుహలు మరియు గుంటూరు లోని మ్యూజియం,

చరిత్ర

గుంటూరు ప్రాంతంలో పాత రాతి యుగము నాటినుండి మానవుడు నివసించినాడనుటకు ఆధారములు కలవు. పాత రాతియుగపు (పేలియోలిథిక్) పనిముట్లు గుంటూరు జిల్లాలో దొరికాయి. వేంగీ చాళుక్య రాజు అయిన అమ్మరాజ (922-929) యొక్క శాసనాలలో గుంటూరు గురించిన ప్రధమ ప్రస్తావన ఉన్నది. 1147 మరియు 1158 నాటి రెండు శాసనాలలో కూడ గుంటూరు ప్రసక్తి ఉన్నది.


ఇంకా....పూర్తివ్యాసం పాతవి

2వ వారం

కాలజ్ఞాన తత్వాలు

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళ పత్ర గ్రంధాలలో రచించి భద్రపరచారు. వీటినే కాలజ్ఞాన తత్వాలు అంటారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం వినడం మనకు పరిపాటే. ఇలా చెప్పినవారు ప్రపంచమంతా లేకపోలేదు పఠిష్టమైన కుటుంబ వ్యవస్థ ప్రాచీన నాగరికత సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాలలో అనేక పేర్లు వెలుగులో ఉన్నా ప్రపంచమంతా పరిచయమున్న పేరు మాత్రం నోస్ట్రడామస్. ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల విశ్వాసం. ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారిలానే మర్మంగా ఉంటాయి. అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయ పరచుకుంటారు.

బ్రహ్మంగారు ఆంధ్రుల ఇంట జన్మించిన కారణంగా ఆయన సరస్వతీ నదీ తీరప్రాంతంలో జన్మించారనిన చెప్పిన కాలజ్ఞానంలో ఆంధ్రదేశంలో పలు ప్రదేశాలు చోటు చేసుకున్నాయి. అనేక దేవతలు కూడా చోటు చేసుకున్నారు. గాంధి మహాత్ముని జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచింపబడింది. ఆంగ్లేయ మరియు మహమ్మదీయ పాలన విజయనగర పతనం లాంటి చారిత్రక మరియు రాజకీయ పరిణామాలు సూచింప బడ్డాయి. ప్రకృతి ప్రకోపాలు వింతలూ చోద్యాలు బాబాల రాక అనేక విధాలుగా ప్రజలు వంచనకు గురికావడం లాంటి సామాజిక విషయాలు వీటిలో చోటు చేసుకున్నాయి. ఆయన కలియుగాంతాన తిరిగి వస్తానని పదేపదే పునరుద్ఘాటించాడు. ఆయన వచ్చే ముందు కలిగే ఉత్పాదనలు సూచింప బడ్డాయి. ఒక సందర్భంలో ఆయన పూర్వజన్మల వాటి కాలం ఆయన వివరించిన తీరు నమ్మడం సామాన్యులకు కష్టమే. వీర బ్రహ్మేంద్ర స్వామి కాల జ్ఞానాన్ని వివిధ శైలులను ఉపయోగించి కూర్చారు, అందులో శ్లోకాలు,పద్యాలు, వచనం మొదలైనవి.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి

3వ వారం

భారతీయ రైల్వేలు భారత ప్రభుత్వ విభాగము. భారత దేశంలో రైల్వేలు మొదటిసారిగా 1853లో ప్రవేశపెట్టబడ్డాయి. 1947 (స్వతంత్రం వచ్చే) నాటికి దేశంలో మొత్తం 42 రైల్వే సంస్థలు నెలకొల్పబడి వున్నాయి. 1951లో ఈ సంస్థలన్నింటినీ కలుపుకొని భారత రైల్వే, ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే సంస్థలలో ఒకటిగా ఆవిర్బవించింది. భారత రైల్వే దూర ప్రయాణాలకు మరియు నగరాలలో దగ్గరి ప్రయాణాలకు (సబర్బన్ (suburban) అనగా పట్టణపు పొలిమేరల వరకు) అవసరమైన రైళ్ళను నడుపుతోంది.

రైలు మార్గాలు భారతదేశపు నలుమూలలా విస్తరించి వున్నాయి. భారతీయ రైలు మార్గాలపై ప్రభుత్వానికి ఏకఛ్ఛత్రాధిపత్యం ఉంది. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి. రైలు మార్గాలు మొత్తం దూరం సుమారుగా 1,14,500 కి.మీ. ఇది సుమారు 65,000 కి.మీ రూటుపై వుంది మరియు 7,500 స్టేషన్లు వున్నాయి. 2011 నాటికి రైల్వేల వద్ద 2,40,000 వాగన్లు 69,000 కోచ్‌లు, 9,000 ఇంజిన్లు వున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను కలిగి వున్న సంస్థలలొ భారతీయ రైల్వేది (సుమారు పదనాలుగు లక్షలు) ద్వితీయ స్థానము.

భారతీయ రైల్వే కంప్యూటరీకరణలో అన్నిటిలో ప్రథమ స్థానంలో వుంది. ముందస్తుగా ప్రయాణం ఖరారు చేసుకునేందుకు మరియు మార్పులు చేసుకునేందుకు సౌకర్యం అందిస్తోంది. ఈ విభాగాన్ని భారతీయ రైల్వే ఆహార నిర్వహణ మరియు పర్యాటక సంస్థ నిర్వహిస్తుంది. ఇది భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ కింద పని చేస్తూ భారత రైల్వే రవాణా వ్యవస్థను నిర్వహిస్తూ ఉంటుంది. రైల్వే మంత్రిత్వ శాఖ కేంద్ర రైల్వే మంత్రి (కేబినెట్ హోదా) నిర్వహణలో ఉండే రైల్వే విభాగం, రైల్వే బోర్డు కింద పని చేస్తుంది. దీనిని పరిపాలనా సౌలభ్యం కోసం 17 జోన్లుగా విభజించారు. ఇంకా…

4వ వారం
గుమ్మడి

తెలుగు సినిమా రంగములో గుమ్మడిగా ప్రసిద్ధి చెందిన గుమ్మడి వెంకటేశ్వరరావు (జ.జూలై 9, 1927 మ.జనవరి 26, 2010 ) తెలుగు చలనచిత్రరంగంలో ఐదు దశాబ్దాలకు పైగా అనుభవమున్న నటుడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బహూకరించే రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. ఈయన 500కు పైగా సినిమాలలో విభిన్న తరహా పాత్రలు పోషించాడు. చలనచిత్ర రంగానికి ఈయన చేసిన సేవలను గుర్తిస్తూ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.

గుమ్మడి వెంకటేశ్వరరావు అంటే తెలియని వారు తెలుగునాట ఉన్నారంటే అది అతిశయమే. అద్వితీయమైన గుణచిత్రనటనతో ఆయన తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ముద్రవేసుకున్నాడు. పౌరాణిక చిత్రాలు, సాంఘిక చిత్రాలు, జానపద చిత్రాలు, చారిత్రక చిత్రాలు ఏవిధమైన చిత్రమైనా అయన తనవేషంలో జీవించాడు. తండ్రిగా, అన్నగా, తాతగా వేషమేదైనా దానిని తన నటనతో పండించడం అతడికి కరతలామలకం. అన్ని రకాల వేషాలు ఆయన ధరించినా సాత్విక వేషాలలో ఆధిక్యత సాధించి ప్రేక్షకులను మెప్పించాడు. అయన తన పూర్తి పేరుతో కంటే ఇంటి పేరైన గుమ్మడి పేరుతోనే తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచి పోయాడు. ఆంధ్రుల పంచకట్టులోని హందాతనాన్ని ప్రతిబింబించిన ఏకైక నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు.

ఎన్ టి ఆర్ తో నటించిన తోడు దొంగలు (1954) మరియు మహామంత్రి తిమ్మరుసు (1962) సినిమాలు గుమ్మడికి బాగా గుర్తింపునిచ్చాయి. రాష్ట్రపతి బహమతి మొదటిదానికి రాగా, రెండవదానికి జాతీయ స్థాయిలో ఉత్తమ సహ నటుడు గా ఎంపికయ్యాడు. మాయా బజార్ (1957), మా ఇంటి మహలక్ష్మి (1959), కులదైవం (1960), కుల గోత్రాలు(1962), జ్యోతి(1977), నెలవంక (1981), మరో మలుపు(1982),ఏకలవ్య(1982), ఈ చరిత్ర ఏ సిరాతో? (1982), గాజు బొమ్మలు (1983), పెళ్లి పుస్తకం (1991) గుమ్మడికి పేరుతెచ్చిన సినిమాలలో కొన్ని. తెలుగు విశ్వవిద్యాలయం మహామంత్రి తిమ్మరుసు(1962)లో కధానాయకుడి పాత్రకు జీవం పోసిన గుమ్మడిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. ఇంకా…

5వ వారం
సింధు లోయ నాగరికత
వెలికి తీయబడ్డ మొహంజో-దారో శిథిలాలు

సింధు లోయ నాగరికత (క్రీ.పూ2700 - క్రీ.పూ.1750) ప్రస్తుత పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా మరియు సింధూ నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాధమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్ మరియు పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది. ఈ నాగరికతకు చెందిన హరప్పా నగరము మొదటగా వెలికి తీయుటచే ఇది సింధులోయ హరప్పా నాగరికత అని పిలువబడుతున్నది. సింధూ నాగరికత మెసొపొటేమియా మరియు ప్రాచీన ఈజిప్టు కంచు యుగాలకు సమకాలికమైన అతి ప్రాచీన నాగరికతల్లో ఒకటి. అత్యంత అభివృద్ధి చెందిన దశగా గుర్తించబడిన నాగరికతను హరప్పా నాగరికతగా పేర్కొంటారు. ఈ నాగరికతకు సంబంధించిన తవ్వకాలు 1920వ సంవత్సరం నుండి జరుగుతున్నా అత్యంత ప్రాముఖ్యత కలిగిన వివరాలు మాత్రం 1999లోనే వెలువడ్డాయి.

ఈ నాగరికతనే ఒక్కోసారి సింధూ ఘగ్గర్-హక్రా నాగరికత అని లేదా సింధూ-సరస్వతి నాగరికతగా కూడా అభివర్ణిస్తారు. ఋగ్వేదంలో వర్ణించబడిన సరస్వతి నదిని ఘగ్గర్ హక్రా నదిగా గుర్తించడం వల్ల ఇలా పిలవబడుతున్నది.

సాంకేతికంగా బాగా అభివృద్ధి చెందిన పట్టణపు నాగరికత ఈ ప్రాంతంలో విలసిల్లినట్లుగా స్పష్టమైన చారిత్రక ఆధారాలు ఇక్కడి త్రవ్వకాల్లో దొరికాయి. ఇక్కడి మునిసిపల్ టౌన్ ప్లానింగ్ ప్రమాణాలను పరిశీలిస్తే వీరు పట్టణాలను అభివృద్ధి చేయడంలో సిద్ధహస్తులని, పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చేవారని తెలుస్తోంది. ఈ కాలంలో జీవించిన ప్రజలు పొడవు, ద్రవ్యరాశి, కాలాలను మొదలైన రాశులను చాలావరకు ఖచ్చితంగా కొలవగలిగినట్లు ఆధారాలున్నాయి. అనేక రకాలైన శిల్పాలు, ముద్రలు, పింగాణీ మరియు మట్టి పాత్రలు, ఆభరణాలు, మానవశరీర శాస్త్రాన్ని వివరంగా విపులీకరించే అనేక టెర్రాకోట బొమ్మలు, ఇత్తడి వస్తువులు మొదలైనవి ఎన్నో త్రవ్వకాలు జరిపిన ప్రదేశంలో లభించాయి. సింధు లోయ ఆహారోత్పత్తిలో స్వయం సంవృద్ధి కలిగి ఉండేదని తెలుస్తోంది. మేర్గర్ ప్రజలు ఆ ప్రాంతంలోనే పండించిన గోధుమలు, బార్లీలు వాడినట్లు ఋజువైంది. 400కి (600 దాకా ఉండవచ్చునని కొద్దిమంది భావన) పైగా గుర్తులు వివిధ ముద్రల్లోనూ, పింగాణీ పాత్రలపైనా, ఇంకా కొన్ని వస్తువుల పైనా కనుగొనబడ్డాయి. ధోలవిరా పట్టణానికి లోగడ ఉన్న కోట ద్వారం వద్ద వేలాడదీసిన పలక మీద కొన్ని గుర్తులు ముద్రించబడి ఉన్నవి.

క్రీ.పూ 1800 వచ్చేసరికి నెమ్మదిగా ఈ నాగరికత బలహీనపడటం ఆరంభించింది. క్రీ.పూ 1700 శతాబ్దానికల్లా దాదాపు అన్ని నగరాలూ పాడుబడిపోయాయి. కానీ సింధూ లోయ నాగరికత ఉన్నట్టుండి మాయమైపోలేదు. దీని ప్రభావాలు తరువాత వచ్చిన నాగరికతల్లో కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా…

6వ వారం
ఎలెక్ట్రికల్ ఇంజనీర్లు సంక్లిష్టమైన విద్యుత్ వ్యవస్థలతో పనిచేస్తారు

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్

ఎలెక్ట్రిసిటీ, ఎలెక్ట్రానిక్స్ మరియు ఎలెక్ట్రోమాగ్నెటిజమ్ విషయాలకు సంబంధించన అధ్యయనమే ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ . పందొమ్మిదవ శతాబ్దం చివరి దశలో ఎలెక్ట్రికల్ టెలిగ్రాప్ మరియు విద్యుత్ శక్తి సరఫరా వాణిజ్యపరంగా ప్రారంభంతో ఇది ప్రత్యేక వృత్తిగా గుర్తింపు పొందింది. దీనిలో పవర్, ఎలెక్ట్రానిక్స్, కంట్రోల్ సిస్టమ్స్, సిగ్నల్ ప్రాసెసింగ్ మరియు టెలికమ్యూనికేషన్ అనే ఉపవిభాగాలు వున్నాయి. భారతదేశంలో ఎలెక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ తక్కువస్థాయి వ్యవస్థలను కంప్యూటర్ మరియు ఇంటిగ్రేటెడ్ సర్కూట్స్ తో పనిని సూచించడానికి వాడతారు, ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్, భారీ స్థాయి వ్యవస్థలను అనగా విద్యుత్ శక్తి వుత్పాదన మరియు పంపిణీ, యంత్రాల నియంత్రణ వంటి వాటికి వాడతారు.

17వశతాబ్ది తొలి దశనుండి శాస్త్రవేత్తలు విద్యుత్ పై అధ్యయనం చేసేవారు. అలెస్సాండ్రో వోల్టా 1775 లో స్థితి విద్యుత్ చార్జీ తయారీ యంత్రం, 1800లో వోల్టాయిక్ పైల్ అనగా ఆధునిక బ్యాటరీకి మూలరూపం తయారు చేశాడు. జార్జి ఓమ్ 1827 లో కరెంటుకి వోల్టేజికి సంబంధాన్ని కనుగొన్నాడు. 1831 లో , మైఖేల్ ఫారడే ,ఎలెక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మరియు , 1873లో జేమ్స్ క్లార్క్ మాక్స్వెల్ విద్యదయాస్కాంత సూత్రాలు కనుగొన్నాడు. 1882 లో థామస్ అల్వా ఎడిసన్ రపంచంలో తొలిసారి విద్యుత్ ప్రసార నెట్వర్క్ తయారుచేశాడు. 1887 లో, నికోలా టెస్లా ఆల్టర్నేటింగ్ కరెంట్ అనబడే విద్యుత్ ప్రసార విధానాన్ని కనుగొన్నాడు. ఇది తరువాత ప్రాచుర్యం పొందింది. వీరికృషి తో ఇండక్షన్ మోటార్ , టెలిగ్రాఫ్ లాంటివి అభివృద్ధి పరచబడ్డాయి.

చాలా మంది శాస్త్రవేత్తలు రేడియో అభివృద్ధికి కృషిచేసారు. 1897 లో కార్ల్ ఫెర్డినాండ్ బ్రాన్ కేథోడ్ రే ట్యూబ్ ని ఆసిలోస్కోప్ కొరకు కనుగొన్నాడు. ఇదే తరువాత టెలివిజన్ కి దారితీసింది. 1895 లో గుగ్లియెల్మో మార్కోని ఒకటిన్నర మైళ్లదూరం వైర్లెస్ సిగ్నల్ ను పంపించాడు. 1941 లో కొన్రాడ్ జూస్ Z3 కంప్యూటర్ తయారు చేశాడు. ట్రాన్సిస్టర్ ను 1947 లో విలియమ్ బి షాక్లీ జాన్ బార్డీన్ మరియు వాల్టర్ బ్రాటెయిన్ తయారు చేశారు. 1958 లో జాక్ కిల్బీ మరియు 1959 లో రాబర్ట్ నోయిస్ (వేర్వేరుగా) ఒకటి కంటే ఎక్కువ ట్రాన్సిస్టర్లు వుండే సమీకృత వలయం (ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్) 1968 లో టెడ్ హాఫ్ నేతృత్వంలో ఇంటెల్ మైక్రోప్రాసెసర్ తయారీచేయడంతో పర్సనల్ కంప్యూటర్ తయారీకి మార్గం సుగమం అయ్యింది. ఇంకా…

7వ వారం

భూటాన్ రాజ్యం దక్షిణాసియాలోని భూపర్యవేష్టిత (ల్యాండ్ లాక్) దేశం. ఇది హిమాలయాల తూర్పు వైపు ఆఖరు భాగంలో హిమాలయ పర్వత శ్రేణుల మధ్య ఉంది. భూటాన్‌కు దక్షిణ, తూర్పు మరియు పడమట సరిహద్దులలో భారత భూభాగము, ఉత్తర సరిహద్దులలో చైనా దేశంలో భాగమైన టిబెట్ ఉన్నాయి. భూటాన్‌ను నేపాల్ నుండి భారత దేశంలోని రాష్ట్రమైన సిక్కిం వేరుచేస్తుంది. భూటానీయులు తమ దేశాన్ని డ్రక్ యూ (ఉరుముల డ్రాగన్ భూమి) అని పిలుస్తారు.

భూటాన్ ఒకప్పుడు ప్రంచానికంతటికీ దూరంగా ఏకాంతంగా ఉండే దేశాలలో ఒకటి. కానీ ప్రస్తుతం దేశంలో సాంకేతిక మరియు ఇతర అభివృద్ది కారణంగా ప్రపంచానికి భూటాన్ ద్వారాలు తెరువబడ్డాయి. ఇంటర్‌నెట్ (అంతర్జాలం), మొబైల్ ఫోన్లు, కేబుల్ టీవి కార్యక్రమాలు మరియు అంతర్జాతీయ విమానసేవలు భూటాన్‌ను ప్రపంచంతో అనుసంధానం చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. సనాతన ధర్మాలు సంస్కృతిని కాపాడుతూ అధునికతకు మారుతూ సమతూకాన్ని కాపాడుతూ భూటాన్ అభివృద్ధి పధంలోకి నడుస్తూ ఉంది. భూటాన్ పరిసరాలకు కీడు కలిగించే కార్యాలకు అనుమతి లభించదు. భూటాన్ ప్రభుత్వం సంస్కృతి రక్షణ, పరిసరాల రక్షణ, తమ ప్రత్యేకత కాపాడటానికి ప్రాముఖ్యత నిస్తుంది. 2000లో భూటాన్ వ్యాపార వారోత్సవాల (బిజినెస్ వీక్) తరవాత భూటాన్ అత్యంత ఆనందకరమైన దేశంగా వరల్డ్ మ్యాప్ ఆఫ్ హ్యాపీనెస్ 2000 సంవత్సరపు పరిశీలన ద్వారా గుర్తించబడింది.

భూటాన్ భూభాగం దక్షిణంలో సమశీతోష్ణ మండల మైదానాలు, ఉత్తరాన ఉన్న హిమాలయ శిఖరాలు వీటి ఎత్తు సముద్ర మట్టానికి 7,000 మీటర్లు (23,000 అడుగులు) ఉంటుంది. భూటాన్ దేశం యొక్క మతం వజ్రయాన బౌద్దం. బుద్దమతావలంబీకుల సంఖ్య అధికం. రెండవ స్థానంలో హిందూ మతం ఉంది. రాజధాని పెద్దనగరం తింఫూ. దీర్ఘ కాలిక రాజపాలన తరవాత 2008 మార్చిలో మొట్టమొదటగా ప్రజా ప్రభుత్వం అమలు చేయడానికి కావలసిన ఎన్నికలు నిర్వహించింది. అంతర్జాతీయ అసోసియేషన్ లలో భూటాన్‌కు ఐక్యరాజ్య సమితి సభ్యత్వం ఉంది, ఆసియా అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్‌లో భూటాన్‌కు సభ్యత్వం ఉంది. పరిపాలనలో ఎక్కువ రోజులు ఉన్న సౌత్ ఆసియా దేశాలలో భూటాన్ ఆఖరుది. అసియాలో ఎప్పుడూ కాలనీ ఆధీనంలో లేని కొన్ని దేశాలలో భూటాన్ ఒకటి. ఇంకా…

8వ వారం

మహాశివరాత్రి

హిందూ మతం పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉన్నది.

ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. ఈనాడు శివభక్తులు తెల్లవారుజామున లేచి, స్నానం చేసి, పూజలొనర్చి, ఉపవాసం ఉండి రాత్రి అంతయు జాగరణము చేసి మరునాడు భోజనం చేయుదురు. రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుదురు. అన్ని శివక్షేత్రము లందు ఈ ఉత్సవము గొప్పగా జరుగును. పూర్వం శ్రీశైలం క్షేత్రమందు జరుగు ఉత్సవమును పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రము లో విపులముగా వర్ణించాడు. శైవులు ధరించు భస్మము/విభూతి తయారుచేయుటకు ఈనాడు పవిత్రముగా భావిస్తారు.

మహాశివ రాత్రి వృత్తాంతం

మహాశివ రాత్రి మహాత్య వృత్తాంతం శివ పురాణములోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది.

గంగా యమునా సంగమ స్థానమైన ప్రయాగలో (నేటి అలహాబాదు) ఋషులు సత్రయాగం చేస్తున్నసమయంలో రోమర్షణమహర్షి అని పేరు గాంచిన సూతమహర్షి అక్కడకు వస్తాడు. ఆలా వచ్చిన సూతమహర్షికి అ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పుమనగా అతను తనకు గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాధను వివరించడం ప్రారంభిస్తాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరమున ధ్యానం చేస్తుంటాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్ళుతుంటాడు. దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మ కుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాధను తెలుపుమంటాడు.

అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మ కుమారుడైన సనత్ కుమారుడు తనకు, నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా , నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు.
ఇంకా…

9వ వారం
ప్రముఖ వ్యంగ్యచిత్రకారుడు జయదేవ్ గీసిన చిత్రం

జయదేవ్ ప్రముఖ తెలుగు వ్యంగ్య చిత్రకారుడు. 1940 సెప్టెంబర్ 13న కడపలో జన్మించాడు. ఇతని పూర్తి పేరు సజ్జా జయదేవ్ బాబు. 1959వ సంవత్సరం నుండి కార్టూన్లు (వ్యంగ్య చిత్రాలు) చిత్రిస్తూ ఉన్నాడు. గీతల్లో ఒడుపే కార్టూన్ కు ప్రాణం అన్నమాటను నిత్య సత్యం చేస్తూంటాయి ఆయన కార్టూన్లు. ఈయన తన బాల్యంలో ఎక్కువ భాగం మదరాసు లోని పాత చాకలి పేటలో గడిపాడు. చదువుకొనే రోజుల్లోనే స్వతహాగా చిత్రాలు గీయటం ప్రారంభించాడు. ఆచార్యుడిగా జంతుశాస్త్రాన్ని మదరాసులోని సర్ త్యాగరాయ కాలేజీ లో 1997 వరకు బోధించాడు.

ఆంధ్రపత్రిక సచిత్ర వార పత్రికలో 1959లో మొదలు పెట్టి, తెలుగులో వచ్చిన దాదాపు అన్ని వార, మాస పత్రికలన్నిటిలోనూ తన వ్యంగ్య చిత్రాలను ప్రచురించాడు. అన్ని ప్రముఖ పత్రికలు, ముఖ్యంగా యువ దీపావళి సంచికలలో ఈయన కార్టూన్లు లేకుండా ప్రచురించబడేవి కాదు. 2002 వరకు ఆయన చిత్రీకరించిన వ్యంగ్య చిత్రాల సంఖ్య 40,000 పైగా ఉన్నాయి. జయదేవ్ కార్టూన్లతో వుత్తేజంపొంది ఆయనకు ఏకలవ్య శిష్యులుగా చాలా మంది తెలుగు కార్టూనిష్టులు ఏర్పడ్డారు. వారినందరిని వీలైనంతవరకు ముఖాముఖిగా కలిసి ప్రోత్సహించేవాడు. కార్టూన్ల సంకలనాలు, "గ్లాచ్చూ మీచ్యూ" అనే ఆత్మకధ రచించాడు. వివిధ సంస్థలచే సత్కరించబడ్డాడు. ధూమపానం వల్ల వచ్చే దుష్పరిణామాలను గురించిసామాజిక స్పృహ కల్గించే వ్యంగ్య చిత్రాలు కూడా గీశాడు. వ్యంగ్యచిత్రాల కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేశాడు. నేపాళం, భూపాళం, (తాగుబోతు) బ్రహ్మం, మిస్టర్ నో, బాబాయ్-అబ్బాయ్ వంటి పాత్రలను కార్టూన్లలో సృష్టించి పాఠకులను అలరించాడు. అంతర్జాలంలో వ్యంగ్యచిత్రాల వెబ్సైట్ లను నిర్వహించాడు. తోటి కార్టూనిస్టులను కూడా అంతర్జాలాన్ని అధునిక సాంకేతికతలను వాడటానికి ప్రోత్సహించాడు. (ఇంకా…)

10వ వారం

హోలీ అనేది రంగుల పండుగ, వసంత కాలంలో వచ్చే ఈ హిందువుల పండుగను భారత దేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్ లలోనూ మరియు ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. భారత దేశంలోని పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్‌లలో దీన్ని దోల్‌యాత్రా (దోల్ జాత్రా) లేదా బసంత-ఉత్సబ్ (వసంతోత్సవ పండుగ) అని అంటారు. హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మథుర, బృందావనం, నందగావ్ మరియు బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు. హోలీ పండుగ సందర్బంగా ఈ ప్రదేశాలు 16 రోజులు పాటు పర్యాటక కేంద్రాలుగా సందర్శకులతో చాలా రద్దీగా ఉంటాయి.

దుల్‌హేతి, ధులండి మరియు ధులెండి అని కూడా పిలిచే ముఖ్యమైన రోజు హోలీ ఉత్సవ రోజున ప్రజలు రంగుల పొడిని మరియు రంగు నీళ్ళను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ఘనంగా జరుపుకుంటారు. ముందు రోజున హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు. దీనిని హోలిక దహన్ (హోలికను కాల్చడం) లేదా చోటీ హోలీ (చిన్న హోలీ) అని అంటారు. హిరణ్యకశిపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి ప్రహ్లాదుడిని మంటలలో వేసినప్పుడు దైవలీలతో తప్పించుకుంటాడు అందుకే భోగి మంటలు అంటిస్తారు. హోలిక ఈ మంటలలో దహనమయ్యింది కానీ విష్ణువుకు పరమ భక్తుడైన ప్రహ్లాదుడు, అతని అపార భక్తితో ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకుంటాడు. ఆంధ్ర ప్రదేశ్లో హోలిక దహన్‌ను కామ దహనం అని అంటారు.

సాధారణంగా శీతాకాలం చివర్లో, ఫిబ్రవరి లేదా మార్చి నెలల తదుపరి వారాల్లో, వచ్చే చివరి ఫాల్గుణమాసము (ఫిబ్రవరి/మార్చి) (ఫాల్గుణ పూర్ణిమ), పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. కొన్ని రోజుల తరువాత, ఫాల్గుణ బహుళ పంచమి (పౌర్ణమికి ఐదవ రోజు)న పండుగ ముగింపున సూచిస్తూ రంగులతో రంగ పంచమి ఉత్సవాన్ని జరుపుకుంటారు. (ఇంకా…)

11వ వారం
కుబనెల్లే మిరపకాయలు

మిరపకాయ నాహూటల్‌ చిల్లీ నుంచి ఉద్భవించిన ఈ పదాన్ని చిల్లీ పెప్పర్ మరియు చిల్లీ అని అనేక రూపాల్లో సంభోదిస్తుంటారు. ఇది సొలనేసి కుటుంబం, మిరప కాప్సికమ్ తరగతికి చెందిన మొక్కలకు కాచే కాయ.

మిరపకాయలనేవి మొదట అమెరికాల్లో వెలుగుచూశాయి. అమెరికాలో యూరోపియన్లు కాలిడిన తర్వాత, మిరపకాయలకు సంబంధించిన అనేక రకాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో పాటు ఆహారం మరియు ఔషధాల తయారీల్లో ఉపయోగించడం ప్రారంభమైంది. భారతదేశంలో గుంటూరు మిరపపంటకు ప్రసిద్ధి. ఇవి ఘాటుగా వుంటాయి. మిరపకాయలను వంటలలో, వైద్యపరంగా, రక్షణకు, మనస్సుని దిటవు పరచుకోటానికి , ఆహర రక్షణకు వాడుతారు.ఇంకా…

12వ వారం

ఉగాది తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఉదయాన్నే లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. దేవస్థానములకు వెళ్ళి పూజలు చేయిస్తారు. కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు.

ఈ పండగ ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగా నూ, తమిళులు పుత్తాండు అనే పేరుతోనూ, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు. (ఇంకా…)

13వ వారం

చేయి అనగా మానవులు, చింపాంజీలు, కోతులు మరియు లెమూర్లకు గల శరీరభాగమునకు వేళ్లు కలబాహ్యంగము. కోలా చేతికి ఎదురెదురుగా వున్న రెండు బొటనవ్రేళ్లు వుంటాయి కాబట్టి దాని శరీరభాగాన్ని కూడా చేయి లేక 'పా'లు అంటారు.

చుట్టూవున్న పర్యావరణంతో క్రియాశీలమవటానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇవి స్థూల కదిల్చే నైపుణ్యాలు ( పెద్ద వస్తువుని పట్టుకోవడం)మరియు సూక్ష్మ కదిల్చే నైపుణ్యాలు (చిన్న రాయిని పట్టుకోవడం) ప్రదర్శించడంలో ప్రముఖపాత్ర వహిస్తాయి. చేతి వేళ్లమొనలు, చాలా నాడీకొనలతో వుండి, స్పర్శకి ప్రధానపాత్ర వహిస్తాయి మరియు స్థానాన్ని తెలియచేయడంలో శరీర అంగాలలోముఖ్యమైనవి. ఇతర జతగావుండే శరీరభాగాలవలె, ప్రతి చేయి దాని వ్యతిరేఖ దిశలోని మెదడుతో నియంత్రించబడుతుంది. చేతివాటం మెదడు పనిచేసేతీరుని తెలుపుతుంది,

మానవుని చేతిలో మణికట్టు, అరచేయి మరియు వేళ్ళు చేతిలోని ప్రధానమైన భాగాలు. మన రెండు చేతులు ఎముకలు, కీళ్ళు, కండరాలు, నాడులు, రక్తనాళాలు మొదలైన వాటితో చేయబడినవి.మానవుని చేతిలో 27 ఎముకలు, వాటిలో వేళ్లకు 14 ఫలాంజిస్ (దగ్గరి, మద్యస్థ మరియు దూరపు) ఎముకలు వుంటాయి. మెటాకార్పల్ ఎముకలు వేళ్లని మణికట్టుకి కలుపుతుంది. ఇవి ఐదు. (ఇంకా…)

14వ వారం

గుడ్ ఫ్రైడే ఇది క్రీస్తును శిలువ వెయ్యటం మరియు కాల్వరి వద్ద అతని మరణం యొక్క జ్ఞాపకాలను గుర్తుచేసుకొనే క్రైస్తవమత విశ్వాసకులకి ప్రాధమికంగా ఒక సెలవు దినం. ఈ సెలవు దినం పవిత్ర వారం సమయంలో పవిత్రమైన మూడు రోజులలో భాగంగా ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరించబడుతుంది మరియు తరచుగా పాసోవర్ పై యూదుల అభిప్రాయంతో సరిపోలుతుంది. హోలీ ఫ్రైడే , బ్లాక్ ఫ్రైడే లేదా గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలువబడుతుంది,

సువార్తల ఆధారంగా క్రీస్తును శిలువ వెయ్యటం దాదాపుగా శుక్రవారమే జరిగింది. రెండు వేర్వేరు సమూహాలచే గుడ్ ఫ్రైడే యొక్క సంవత్సరం క్రీ.శ. 33 గా అంచనా వెయ్యబడింది మరియు వాస్తవానికి బైబిలికల్ మరియు జూలియన్ క్యాలెండర్ల మధ్య ఉన్న వ్యత్యాసాలు మరియు చంద్రవంక ద్వారా ఐజాక్ న్యూటన్ చే క్రీ.శ. 34 గా చెప్పబడింది. మూడవ విధానం ఏంటంటే, శిలువ వేసినప్పుడు చంద్రుని కాంతి తగ్గిపోయి చీకటి అవ్వటం మరియు అదే తేదీన అనగా శుక్రవారం ఏప్రిల్ 3, క్రీ.శ. 33 న గ్రహణం ఏర్పడటం (2:20 చట్టాలలో "మూన్ ఆఫ్ బ్లడ్" పై అపోస్తిల్ పీటర్ యొక్క సూచనతో సంబంధం కలిగి ఉంటుంది) ఆధారంగా చెప్పబడిన ఒక పూర్తి వైవిధ్యమైన ఖగోళపరమైన విధానం. (ఇంకా…)


15వ వారం
దస్త్రం:Anna Hazare.jpg

అన్నా హజారే గా సుప్రసిద్ధుడయిన కిసాన్ బాబూరావ్ హజారే , ఒక భారతీయ సామాజిక కార్యకర్త, భారతదేశం లోని మహారాష్ట్రలో ఉన్న అహ్మద్‌నగర్‌ జిల్లాలో రాలెగాన్ సిద్ధి గ్రామ అభివృద్ధికి చేసిన తోడ్పాటుకు ఈయన ప్రత్యేక గుర్తింపు పొందారు, దీన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దటానికి తను చేసిన ప్రయత్నాలకు గుర్తుగా 1990 లొ పద్మశ్రీ అవార్డు తోనూ మరియు 1992లో భారత ప్రభుత్వం ఆయనను పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై పోరాడేందుకోసం తను చేపట్టిన కృషిలో భాగంగా అన్నా, భారత్‌లో సమాచార హక్కు లక్ష్యం కోసం పాటుపడిన ప్రముఖ వ్యక్తులలో ఒకరిగా నిలిచారు.

5 ఏప్రిల్ 2011 న జనలోక్పాల్ బిల్లుకు పోలినట్లు లోక్పాల్ అవినీతి నిరోధక బిల్లు తేవాలని ప్రభుత్వాన్ని కోరుతూ నిరవధిక నిరాహరదీక్ష చేపట్టాడు. దేశమంతా దీనికి మద్దతులభించింది. 9 ఏప్రిల్ 2011 న ప్రభుత్వము అంగీకరించినతరువాత నిరాహారదీక్ష విరమించాడు. ప్రభుత్వం ఒక పౌరసమాజం ప్రతినిధులు మరియు ప్రభుత్వ ప్రతినిధులతో సంయక్త కమిటీ ఏర్పాటుచేసింది. 2011 సంవత్సరానికి విదేశవిధానాల పత్రిక ప్రపంచంలో 100 మేధావేత్తలలో ఒకరిగా నిర్ణయించింది.అదే సంవత్సరంలో ముంబైలో అత్యంత ప్రభావశీలిగా డిఎన్ఎ పత్రిక గుర్తించింది. అతని న్యాయ నిర్ణయంలో నియంతృత్వ ధోరణులు (ఉదా అవినీతి ఉద్యోగస్తులను వురితీయాలనడం, కుటుంబ సంక్షేమానికి బలవంతపు గర్భనిరోధకఆపరేషన్ల అమలుపరచాలనటం) విమర్శలకు లోనయ్యాయి.(ఇంకా…)

16వ వారం

అమరావతి కధలు సత్యం శంకరమంచి రచించిన తెలుగు కధాసంపుటి . అమరావతి గ్రామం, అక్కడి ప్రజలు ఇతివృత్తంగా రచించిన ఈ 100 కధలు మొదట ఆంధ్రజ్యోతి వారపత్రికలో సుమారు రెండు సంవత్సరాలు 1975-77 మధ్య ప్రచురించబడ్డాయి.ఏ కథా కూడ ఒక పేజి కంటే ఎక్కువ ఉండేది కాదు. అప్పట్లో ముద్రణ కాయితం కరువు ఉండేది. ఆ కారణాన,ఆంధ్రజ్యోతి పత్రిక ప్రస్తుతపు వారపత్రిక సైజులో కాకుండా అందులో సగం సైజులో అంటే చందమామ మాసపత్రిక సైజులో కొన్నాళ్ళు వచ్చింది. కారణమేమయినా, కథలన్నీ కూడ రచయిత చక్కగా కుదించి వ్రాశారు. అంత చిన్నకథలో కూడ ఎంతో కథా శిల్పాన్ని ప్రదర్శించిన రచయిత సత్యం శంకరమంచి అభినందనీయులు. శంకరమంచి సత్యంచక్కని తేట తెలుగులో, సరళమైన భాషలో గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించుతూ, ప్రజల వేషభాషలు, ఆచారవ్యవహారాలు, కష్టసుఖాలు, జీవన విధానం గురించి విపులం వ్రాసాడు .

ఈ కథా సంపుటికి 1979వ సంవత్సరానికి ఆంధ్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ప్రముఖ సినీ దర్శకులు శ్యామ్ బెనగళ్ ఈ కథలను హిందీలో ధారావాహికగా చిత్రీకరించారు. ఈ ధారావాహిక దూరదర్శన్ లో ప్రసారం అయ్యి ఈ కథా సంపుటి ప్రాచుర్యం మరింత పెంచింది. ఈ ధారావాహిక అమరావతిలోనే చిత్రీకరించబడటం విశేషం.

17వ వారం
ప్రశాంతి నిలయం, పుట్టపర్తి, ఆం.ప్ర.
ప్రశాంతి నిలయం, పుట్టపర్తి, ఆం.ప్ర.

ప్రశాంతి నిలయం సత్య సాయి బాబా యొక్క ముఖ్య ఆశ్రమం పేరు. ఇది సముద్రమట్టమునుండి 800 మీటర్ల (2624 అడుగులు) ఎత్తులో ఉంది. "ప్రశాంతి నిలయము యొక్క పట్టణవాటిక శ్రీ సత్య సాయి బాబా జన్మించిన పుట్టపర్తి అనే గ్రామములో ఉంది. ఈ ప్రదేశము దక్షిణ భారతదేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురము జిల్లాలో ఒక భాగము. ప్రశాంతి నిలయం అంటే "మహోన్నత శాంతి యొక్క దామము". జీవించి ఉన్నప్పుడు సత్య సాయి ఈ ఆశ్రమములో ప్రతిరోజూ వేలకొలది తన భక్తులకు దర్శనము ఇచ్చేవాడు. ఆ సమయంలో సత్య సాయి బాబాసాధారణంగా జూన్ మొదలు నుండి మార్చ్ మధ్య వరకు ప్రశాంతి నిలయములో ఉండేవాడు. ఆయన గతించాక ఇక్కడి సాయి కుల్వంత్ హాల్ లో సమాధి చేయబడ్డాడు. (ఇంకా…)


18వ వారం

మహబూబ్ నగర్ జిల్లాకేంద్ర స్థానమైన మహబూబ్ నగర్ పట్టణం భౌగోళికంగా జిల్లా మధ్యలో రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు నైరుతి వైపున 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. చుట్టూ ఎత్తయిన కొండలు, గుట్టలచే ఆవరించబడిన ఈ పట్టణానికి రవాణా పరంగా రోడ్డు మరియు రైలు మార్గాన మంచి వసతులున్నాయి. వ్యవసాయికంగా మరియు పారిశ్రామికంగా ఈ పట్టణం అంతగా అభివృద్ధి చెందలేదు. పట్టణ పాలన స్పెషల్ గ్రేడు పురపాలక సంఘంచే నిర్వహించబడుతుంది. జిల్లా కేంద్రం కావడంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పట్టణంలో ఉన్నాయి. పాలమూరు అని కూడా పిల్వబడే ఈ పట్టణానికి చరిత్రలో రుక్కమ్మపేట అని పేరు ఉండేది. 1883 నుండి ఈ పట్టణం జిల్లా కేంద్రంగా సేవలందిస్తున్నది. (ఇంకా…)


19వ వారం

ప్రత్తి అనేది మెత్తని, మృదువైన దారముగా అవగల పీచు పదార్థము. నూలును తయారు చేయుటకు ఉపయోగించే 'ప్రత్తి' లేదా 'పత్తి' (దూది) ఈ మొక్కలనుండే లభిస్తుంది. ఇది వాటి విత్తనాల చుట్టూ ఒక బంతిలాగా ఏర్పడుతుంది. ప్రత్తి మొక్క అనేది అమెరికా, ఆఫ్రికా మరియు భారత దేశాలకు చెందిన పొద లాంటి మొక్క. ఇది ఉష్ణ,సమశీతోష్ణ మండలాలలో మాత్రమే పెరిగే మొక్క. ఈ మొక్క పీచును వడికి దారాలుగా చుట్టి, గుడ్డలు నేయటానికి వాడతారు. ప్రపంచంలో గుడ్డలు నేయటానికి అత్యధికంగా వాడబడే ప్రకృతి సహజమైన పీచుపదార్థము. ఇలా నేసిన గుడ్డ మృదువుగా, గాలి ఆడేటట్లు ఉంటుంది. (ఇంకా…)


20వ వారం

రామోజీ ఫిల్మ్ సిటీ రెండు వేల ఎకరాలలో విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరం ( ఫిలింసిటీ)గా పేరుగాంచినది. ఇది హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్ళు 9వ నెంబరు జాతీయ రహదారి ప్రక్కన హైదరాబాదు నుండి 25 కిలోమీటర్ల దూరములో ఉన్నది. రామోజీ గ్రూపు అధిపతి రామోజీరావు 1994లో స్థాపించిన ఈ ఫిలింసిటి పర్యాటక ప్రదేశం గానూ పేరుగాంచినది. ఇందులో తెలుగు సినిమాలే కాకుండా దేశ, విదేశాలకు చెందిన అనేక భాషా చిత్రాలు, టెలివిజన్ సీరియళ్లు నిర్మించబడ్డాయి. హైద్రాబాదు నుండి బస్సు సౌకర్యంకలదు. దీనిలో వివిధ దేశాలలోని ఉద్యానవనాల నమూనాలు, రకరకాల దేశ విదేశీ శిల్పాలు, సినిమా దృశ్యాలకు కావలసిన రకరకాల రంగస్థలాలు వున్నాయి. సందర్శకులకు ఆనందాన్ని కల్గించటానికి ప్రత్యేక సంగీత,నృత్య కార్యక్రమాలు రోజూ వుంటాయి. (ఇంకా…)


21వ వారం

బెర్ముడా ట్రయాంగిల్ వాయువ్య అట్లాంటిక్ మహాసముద్రం లోని ఒక ప్రాంతం. దీనినే "డెవిల్స్ ట్రయాంగిల్" అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. చాలా సంవత్సరాల నుంచీ ఈ ప్రదేశం మీదుగా ఎగిరే విమానాలు, ఆ భాగంలో ప్రయాణించే నౌకలు అనుమానాస్పద రీతిలో అదృశ్యం అవుతుండడం వలన ఇది ఒక ప్రమాదకరమైన ప్రదేశంగా పరిగణించబడింది. ఇక్కడ జరిగిన సంఘటనల గురించి అనేక కధలు, సిద్ధాంతాలు, ఊహలు ప్రచారంలో ఉన్నాయి.

సామాన్యమైన మానవ తప్పిదాలు లేదా ప్రకృతి సహజమైన భౌతిక విషయాలు ఇక్కడి ఘటనలకు సంతృప్తికరమైన కారణాలను చెప్పలేకపోతున్నాయని పలువురి భావన. కనుక గ్రహాంతర వాసులు, అసాధారణమైన ప్రాకృతిక నియమాలు ఇక్కడ పనిచేస్తున్నాయని విస్తృతమైన అభిప్రాయాలున్నాయి. ఇక్కడి ఘటనలపై విస్తారంగా పరిశోధనలు జరిగినాయి. చాలా ఘటనల గురించి ప్రజలలో ఉన్న అభిప్రాయాలు అపోహలని, వాటిని రిపోర్టు చేయడంలో అసత్యాలు కలగలిసి పోయాయని తెలుస్తున్నది. అయినాగాని, ఇతర ప్రాంతాలలో జరిగే ఇటువంటి ప్రమాదాలు లేదా ఘటనలతో పోలిస్తే ఇక్కడ జరిగినవి కొంత భిన్నంగా ఉన్నాయని, వీటికి సరైన వివరణలు లభించడం లేదని వివిధ నివేదికలలో పేర్కొనబడింది. (ఇంకా…)


22వ వారం

1860 లో మొదలైన వెయ్యి మంది సాహసికుల యాత్ర అనే దండయాత్రకు తిరుగుబాటు జనరల్ గిసేప్పి గరిబాల్ది నేతృత్వం వహించాడు. ఈ స్వచ్ఛంద సైనికుల దళం రెండు సిసిలీల రాజ్యాన్ని ఓడించింది. దీని వలన ఆ రాజ్యం రద్దు రద్దుచెయబడి సార్దీనియాకు స్వాధీనం చెయడం జరిగినది, ఇది ఏకీకృత ఇటలీ రాజ్యం ఏర్పడటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ సాహసయాత్ర యొక్క సంఘటనలు ఇటలీ ఏకీకరణ మొత్తం ప్రక్రియలో భాగంగా జరిగాయి. ఇటలీ ఏకీకరణ ప్రక్రియను సార్దీనియా-పీడ్మొంట్ ప్రధాన మంత్రి అయిన కామిల్లో కావూర్ ప్రారంభించాడు. ఇది అతని జీవిత లక్ష్యం. దీనిలో ఎక్కువ భాగాన్ని ఆయనే సాధించాడు. టుస్కానీ, మోడేనా, పార్మా, రోమాగ్నా సంస్థానాలను మార్చి 1860 సంవత్సరానికి పీడ్మాంట్ రాజ్యం ఆక్రమించింది. తరువాత ఇటాలియన్ జాతీయవాదుల చూపు రెండు సిసిలీల రాజ్యంపై పడింది. రెండు సిసిలీల రాజ్యంలో దక్షిణ ఇటలీ ప్రధాన భూభాగం మరియు సిసిలీ ద్వీపం కలిసి ఉన్నాయి. సిసిలీల రాజ్యం ఆక్రమణ ఆనేది ఇటలీ ఏకీకరణలో తదుపరి దశ. (ఇంకా…)

23వ వారం
వ్యవసాయంలో సాయం చేస్తున్న యెద్దులు, బండికి కట్టబడినవి
వ్యవసాయంలో సాయం చేస్తున్న యెద్దులు, బండికి కట్టబడినవి

వ్యవసాయం అనేది ఒక నిర్ధిష్టమైన పద్ధతిలో మొక్కలను, జంతువులను పెంచి, పోషించి తద్వారా ఆహారాన్ని, మేత, నార మరియు ఇంధనాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియ. వ్యవసాయం యొక్క చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద అంశము. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్ధిక ప్రగతిలో వ్యవసాయభివృద్ధి ఒక కీలకాంశము. వేటాడటం ద్వారా ఆహార సముపార్జన చేసుకొనే స్థితిలో ఉన్న సంస్కృతులలో కనిపించని సంపద సమకూర్చుకోవటం మరియు సైనిక కలాపాలవంటి ప్రత్యేకతలు వ్యవసాయం అభివృద్ధి చెందటంతోనే ప్రారంభమయ్యాయి. సమాజంలోని కొందరు రైతులు తమ కుటుంబ ఆహార అవసరాలకు మించి పండిచటం ప్రారంభించడంతో తెగ/జాతి/రాజ్యంలోని మిగిలిన వ్యక్తులకు ఇతర వ్యాపకాలను పోషించే వెసలుబాటునిచ్చింది. ప్రపంచములోని శ్రామికులలో 42% మంది వ్యవసాయ రంగములో పనిచేస్తున్నారు అందుచేత వ్యవసాయం, ప్రపంచములోనే అధిక శాతం ప్రజల యొక్క వృత్తి. అయితే వ్యవసాయ ఉత్పత్తి ప్రపంచ ఉత్పాదనలో (అన్ని దేశాల సమిష్టి ఉత్పాదనల కూడిక) కేవలం 5% మాత్రమే. (ఇంకా…)


24వ వారం
దుర్ఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత దృశ్యం
దుర్ఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత దృశ్యం

జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారత దేశంలోని అమృత్‌సర్ పట్టణంలో ఒక తోట.ఏప్రిల్ 13, 1919 న బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు మరియు పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000 కి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు.(ఇంకా…)


25వ వారం

ముంబై

ముంబయి (మరాఠీ: मुंबई) , పూర్వము దీనిని బొంబాయి అని పిలిచేవారు. ఇది భారత దేశంలోని ఒక ప్రముఖ నగరము. ఇది మహారాష్ట్ర రాష్ట్రము యొక్క రాజధాని మరియు ప్రపంచంలో రెండవ అత్యంత జన సమ్మర్ధం గల నగరము. దీని ప్రస్తుత జనాభా 13 మిలియన్లు (ఒక కోటి ముప్పై లక్షలు ). ఇది మహరాష్త్రలోని పశ్చిమ సముద్ర తీరంలోని సాష్టీ ద్వీపంలో ఉన్నది. ఆధునిక భారతదేశ విభిన్నతను ఈ నగరంలో చూడచ్చు. ఈనగర సినీ పరిశ్రమ, రాజకీయాలు, నేరస్తులు కలసిపోయి భవిష్యత్తు గురించి ఆందోళన కలిగిస్తుంది అదే సమయంలో ఈనగర వాసుల సాహసము ఆశ కలిగిస్తుంది.దక్షిణ ఆసియా లొ ముంబాయ్ అతి పెద్ద నగరము.(ఇంకా…)


26వ వారం

సచిన్ టెండుల్కర్


ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన భారతీయ ఆటగాడు సచిన్ రమేష్ టెండుల్కర్.ఇతను బాంద్రా లోని సరస్వతీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. క్రికెట్ క్రీడకు భారతదేశం లో అత్యధిక జనాదరణకు కారకుడై, చిన్న పిల్లలు మొదలు ముసలివాళ్ళ మనసులను సైతం దోచుకున్న వర్తమాన క్రికెటర్ టెండుల్కర్ ఏప్రిల్ 24, 1973 న జన్మించాడు. ఈనాడు భారత్ లో ఈ క్రీడకు ఇంత జనాదరణ ఉందంటే అదంతా సచిన్, అతని ఆట తీరే కారణం. 1990 దశకంలో భారత క్రికెట్ లో మెరుపులు మెరిపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆటగాడు సచిన్. భారత జట్టుకు ఆపద్భాందవుడిగా ఎన్నో విజయాలు అందజేసిన ఈ ముంబాయి కి చెందిన బ్యాట్స్‌మెన్ ను పొగడని వారు లేరనే చెప్పవచ్చు. ఇతను ప్రస్తుతం రాజ్యసభ ఎం.పీ గా నామినేట్ అయ్యి,ప్రమాణ స్వీకారం కూడా చేశారు. 39 ఏళ్ళ వయసులో కూడా ఇప్పటికీ జట్టు విజయాలకై శాయశక్తుల ప్రయత్నిస్తూ వెన్నెముకలా నిలబడ్డాడు. 2002 లో విజ్డెన్ పత్రిక టెస్ట్ క్రికెట్ లో ఆస్ట్రేలియా కు చెందిన డాన్ బ్రాడ్‌మెన్ మరియు వన్డే క్రికెట్ లో వెస్ట్‌ఇండీస్ కు చెందిన వివియన్ రిచర్డ్స్ ల తర్వాత క్రికెట్ క్రీడా ప్రపంచంలోనే సచిన్ ను రెండో అత్యున్నత బ్యాట్స్‌మెన్ గా ప్రకటించింది.(ఇంకా…)


27వ వారం
దస్త్రం:Mountfujijapan.jpg

జపాన్ అనేది తూర్పు ఆసియా ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం. ఇది చైనా, కొరియా, రష్యా దేశాలకు తూర్పు దిశగా ఉంది. జపాన్ దేశపు ఉత్తరాన ఉన్న సముద్ర భాగాన్ని ఓఖోట్‌స్క్ సముద్రం అని, దక్షిణాన్న ఉన్న సముద్ర భాగాన్ని తూర్పు చైనా సముద్రం అనీ అంటారు. జపాన్ భాషలో ఆ దేశం పేరు (నిప్పన్)ను వ్రాసే అక్షరాలు "సూర్యుని పుట్టుక"ను సూచిస్తాయి. కనుక జపాన్‌ను "సూర్యుడు ఉదయించే దేశం" అని అంటుంటారు.


జపాన్ దేశంలో షుమారు 3,000 పైగా దీవులు ఉన్నందున ఇది నిజానికి ఒక ద్వీపకల్పం. ఈ దీవులలో పెద్దవైన నాలుగు దీవులు హోన్షూ, హొక్కయిడో, క్యూషూ మరియు షికోకూ కలిపి మొత్తం దేశం భూభాగంలో 97% వైశాల్యం కలిగి ఉన్నాయి. ఎక్కువ దీవులు పర్వత మయాలు లేదా అగ్ని పర్వత భాగాలు. జపాన్‌లోని అత్యంత ఎత్తైన ఫ్యూజీ పర్వతం కూడా ఒక అగ్నిపర్వతమే.

128 మిలియన్ల జనాభా కలిగిన జపాన్ ప్రపంచంలో జనాభా ప్రకారం పదవ స్థానంలో ఉన్నది. టోక్యో, మరియు దాని పరిసర ప్రాంతాలు కలిపితే 30 మిలియన్ల జనాభాతో ప్రపంచంలో అతిపెద్ద మెట్రొపాలిటన్ స్థలం అవుతుంది.(ఇంకా…)


28వ వారం

రాజా రవి వర్మ భారతీయ చిత్రకారుడు. అతను రామాయణ, మహాభారతములలోని ఘట్టాలను చిత్రాలుగా మలచి మంచి గుర్తింపు పొందాడు. భారతీయ సాంప్రదాయిక, పాశ్చాత్య చిత్రకళా మెళకువల సంగమానికి అతని చిత్రాలు చక్కని మచ్చుతునకలు. చీరకట్టుకున్న స్త్రీలను అందంగా, చక్కని వంపు సొంపులతో చిత్రించడంలో అతనికి అతనే సాటి. 1873 లో జరిగిన వియన్నా కళా ప్రదర్శనలో మొదటి బహుమతిని గెలుచుకున్నప్పుడు ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది. భారతీయ చిత్రకళా చరిత్రలో గొప్ప చిత్రకారునిగా గుర్తింపు పొందిన రాజా రవి వర్మ, 1906లో, 58 సంవత్సరాల వయసులో మధుమేహంతో మరణించాడు. ఈయన మరణించేనాటికి కిలామానూరు ప్యాలెస్‌లో 160 దాకా రవివర్మ చిత్రాలు ఉండేవని ప్రతీతి. ఆ తరువాత వాటిని అధికారికముగా తిరువనంతపురములోని చిత్రా ఆర్ట్ గ్యాలరీకి అందజేశారు.(ఇంకా…)

29వ వారం

సాక్షి వ్యాసాలు

పానుగంటి లక్ష్మీ నరసింహారావు (1865-1940) రచించిన ప్రసిద్ధ తెలుగు వ్యాసాల సంపుటి. ఈ వ్యాసములన్ని కూడ చిక్కనైన గ్రాంధిక భాషలో వ్రాయబడినాయి. తెలుగు మాతృభాష గల వారు కూడ అర్ధం చేసుకోవటానికి కొంత శ్రమ పడితేకాని అర్థం కావు. వ్యాసాలన్నీ కూడ కొంత వినోదపూర్వక భావంతోనే వ్రాయబడినప్పటికి, అప్పటి సామాజిక పరిస్థితులను ఎండగడుతూ ఉంటాయి. ప్రతి వ్యాసము ఏదో ఒక సామాజిక విషయాన్ని స్పృశిస్తూనే ఉంటుంది. వ్యాసాలన్నీ కూడ, 1913 - 1933 మధ్య కాలంలో వెలువడినాయి. 1711 - 12 లో స్పెక్టేటర్ అనే ఆంగ్ల పత్రికలో జోసెఫ్ అడ్డిసన్, రిచర్డ్ స్టీల్ వ్రాసిన స్పెక్టేటర్ పేపర్స్ వ్యాసాలతో ప్రేరణ పొందినపానుగంటి స్పెక్టేటర్ క్లబ్ తరహాలో సాక్షి సంఘం అని పేరుపెట్టాడు.(ఇంకా…)

30వ వారం

ఎం.ఎస్. సుబ్బలక్ష్మి

ఆమె పాడకపోతే దేవుళ్ళక్కూడా తెల్లవారదు!?
ఆమె పాట వినబడకపోతే దేశమే తానైన ఏ పల్లే లేవదు !?

తన సుప్రభాత గీతంతో భగవంతుణ్ణి నిదురలేపే ఆ సంగీత ఆధ్యాత్మిక స్వరం ఆమెకు ఒక వరం.

" కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవ మాహ్నికమ్ .....

.....అంటూ సాగే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం తెలుగువాడి గుండెల్లో భక్తిభావాల్ని కలిగిస్తుంది. ఆమె పాటలు వింటుంటే మనసు ప్రశాంతంగా, హాయిగా వుంటుంది. అభిమానులు ప్రేమగా ఎం.ఎస్ అని పిలిచుకొనే మధురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మిదేశములో మొట్ట మొదటి సారిగా భారతరత్న పురస్కారం అందుకున్న గాయకురాలుగా చరిత్ర సృష్టించి ఎందరికో స్ఫూర్తినిచ్చి చరిత్రలో తన గానంతో అజరామరురాలు అయ్యారు.ప్రపంచం లో ఎవరైనా ఒకవేళ భారతీయుల సాంప్రదాయ వస్త్రధారణ ఎలా వుంటుందని అడిగితే ఒక్క మాటలో చెప్పగలిగే సమాధానమే ఎమ్మెస్. నేను 'ఎమ్మెస్ సుబ్బ లక్ష్మి'కి సమకాలీకుడనని చెబితే యముడు 'నువ్వు సకల స్తోత్రాలూ,మంత్రాలూ,కవచాలూ,సుప్రభాతాలూ..,అన్నీ వినే వుంటావు.ఇక నీకిక్కడ పని ఏమిటి స్వర్గానికి పో అంటాడు.మాతాతయ్య గాంధీని చూసానని చెప్పేవారు.నేను నా మనుమలకు ఎమ్మెస్ ని చూసానని గొప్పగా చెప్పుకొంటాను.పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారి 'నాహం కర్తాః-హరిః కర్తాః'అనే పుస్తకం చదివితే,ఆమెపై గౌరవం మరింత పెరుగుతుంది..(ఇంకా…)

31వ వారం

వరంగల్ జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్త్రం లో ఒక జిల్లా. ఇది రాష్ట్ర రాజధాని అగు హైదరాబాదునకు ఉత్తర దిశలో 157 కి.మి దూరంలో ఉన్నది. వరంగల్ జిల్లా కు ముఖ్య పట్టణం - వరంగల్. కాకతీయ విశ్వవిద్యాలయము కాకతీయ మెడికల్‌ కాలేజి, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (పూర్వపు రీజినల్ ఇంజనీరింగ్ కాలేజ్), కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్,కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మొదలైన ప్రముఖ విద్యా సంస్థలు వరంగల్లులో ఉన్నాయి. పీపుల్స్‌వార్‌ గ్రూపు, (ప్రస్తుత మావోయిస్టుల)కు వరంగల్లు జిల్లా ఒకప్పుడు గట్టి స్థావరం. వరంగల్లు ఆంధ్ర ప్రదేశ్ లోకెల్లా ఐదవ అతి పెద్ద నగరము. (ఇంకా…)

32వ వారం

శ్రీకృష్ణుడు హిందూమతంలో అర్చింపబడే ఒక దేవుడు. విష్ణువు యొక్క పది అవతారాలలో తొమ్మిదవ అవతారము. హిందూ పురాణాలలోను, తాత్త్విక గ్రంథాలలోను, జనబాహుళ్యంలోని గాధలలోను, సాహిత్యంలోను, ఆచార పూజా సాంప్రదాయాలలోను కృష్ణుని అనేక విధాలుగా భావిస్తుంటారు, చిత్రీకరిస్తుంటారు. చిలిపి బాలునిగాను, పశువులకాపరిగాను, రాధా గోపికా మనోహరునిగాను, రుక్మిణీ సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగాను, గొపికల మనసు దొచుకున్నవాదిగాను యాదవరాజుగాను, అర్జునుని సారథియైన పాండవ పక్షపాతిగాను, భగవద్గీతా ప్రబోధకునిగాను, తత్త్వోపదేశకునిగాను, దేవదేవునిగాను, చారిత్రిక రాజనీతిజ్ఞునిగాను ఇలా బహువిధాలుగా శ్రీకృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం చిత్రీకరింపబడినాయి. మహాభారతం, హరివంశం, భాగవతం, విష్ణుపురాణం - ఈ గ్రంథాలు కృష్ణుని జీవితాన్ని, తత్త్వాన్ని తెలిసికోవడానికి హిందువులకు ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు. (ఇంకా…)

33వ వారం

విశ్వనాథ సత్యనారాయణ (1895-1976) "కవి సమ్రాట్" బిరుదాంకితుడు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. 20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు.- కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. ఆయన మాటలలోనే "నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింప బడినవాని సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును " . ఆయన రాసిన రచనలన్నీ కలిపితే లక్షపుటలుండవచ్చును .

విశ్వనాధ మాట్లాడే వెన్నెముక అని శ్రీశ్రీ వర్ణించాడు. జి.వి. సుబ్రహ్మణ్యం ఇలా చెప్పాడు - "ఆధునికాంధ్ర జగత్తులో విశ్వనాధ ఒక విరాణ్మూర్తి. వచన కవిత్వం వినా ఆయన చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. పట్టింది బంగారం చేయని పట్టూ లేదు. గేయం వ్రాసినా, పద్యం రచించినా, ముక్తం వ్రాసినా, మహా కావ్యాన్ని రచించినా విశ్వనాధ కృతిలో ఆయనదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనంలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్ష్యం వెల్లివిరుస్తుంది. మహాకవిగా మనుగడ సాగించడానికి ఉండవలసిన మొదటి లక్షణం ఈ వ్యక్తిత్వం." (ఇంకా…)

34వ వారం
మక్కా లోని మస్జిద్ అల్ హరామ్.
మక్కా లోని మస్జిద్ అల్ హరామ్.

ఇస్లాం మతం : ఏకేశ్వరవాద ప్రాతిపదిక పైన ముహమ్మద్ ఏడవ శతాబ్దంలో స్థాపించిన ఒక మతము. 140 నుండి 180 కోట్ల జనాభాతో క్రైస్తవం తరువాత ఇస్లాం మతం రెండవ అతి పెద్ద మతం.ఇస్లాం అనునది మతము, ముస్లిం అనగా ఇస్లాం మతావలంబీకుడు. ఇస్లాం అనే పదానికి మూలం అరబీ భాషాపదం 'సలెమ', అనగా శాంతి, స్వఛ్ఛత, అర్పణ, అణకువ మరియు సత్ శీలత. ధార్మిక పరంగా చూస్తే ఇస్లాం అనగా భగవదేఛ్ఛకు అర్పించడం మరియు అతడి ధర్మానికి అనుగుణంగా నడచుకోవడం. ముస్లిం అనగా భగవదేఛ్ఛకు లోబడి, స్వయాన్ని భగవంతుడికి అప్పగించేవాడు, శాంతి కాముకుడు, శాంతి స్థాపకుడు. మహమ్మద్ ప్రవక్త ప్రవచించిన మార్గాన్ని, ధర్మాన్ని అవలంబించువాడు. ముస్లిం లకు పరమ పవిత్రం దేవుని (అల్లాహ్) వాక్కు, ఆదేశము ఖురాన్, మరియు మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు/ఉల్లేఖనాలు హదీసులు. అల్లాహ్ వాక్కు ఖురాను ప్రకారం ఆదమ్ ఆది పురుషుడు మరియు ప్రథమ ప్రవక్త. ముహమ్మద్ చివరి ప్రవక్త..(ఇంకా…)

35వ వారం

గిడుగు రామమూర్తి

తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామమూర్తి. గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్దితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమంవల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది.గిడుగురామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం” గా జరుపుకుంటున్నాము. (ఇంకా…)

36వ వారం
యానాం, పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతములోని ఒక జిల్లా మరియు ఆ జిల్లా యొక్క ముఖ్య పట్టణము. ఈ జిల్లా ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో 30 చ.కి.మీల విస్తీర్ణములో ఉంటుంది. ఇక్కడ నివసించే 32,000 జనాభాలో, చాలామంది తెలుగు మాట్లాడతారు. 1954 లో ఫ్రాంసు నుండి భారతదేశానికి ఇవ్వబడినా ఫ్రెంచి యానామ్ గా గుర్తింపు వుంది. దీనికి 300 సంవత్సరాల చరిత్ర వుంది. ఫ్రెంచి మరియు తెలుగు సంస్కృతుల మేళవింపు యానామ్ లో కనిపిస్తుంది. ఫ్రెంచి పరిపాలనలో జనవరిలో యానాం ప్రజల పండగ రోజులలో మంగళవారం సంత లో విదేశి మరియుదొంగతనంగా దిగుమతిఅయిన సరకు కొనటానికి తెలుగు వారు యానాం వెళ్లేవారు. ఇంతకు ముందు కళ్యాణపురం అనేవారు ఎందుకంటే బ్రిటీషు వారు 1929 లో శారదా చట్టం ద్వారా బాల్యవివాహాలు నిషేధించినతర్వాత, ఇక్కడకు పెళ్లిల్లు జరిగేవి. 1936 లో యానాం జనాభా 5220. 1995-2005 అభివృద్ధి నివేదికలప్రకారం, పాండీచేరీలో ఉత్తమ నియోజకవర్గంగా గుర్తించబడింది. కొత్త పథకాలకు ప్రయోగాత్మక కేంద్రంగా వుండేది.

(ఇంకా…)

37వ వారం

బాబు తెలుగులో మంచి వ్యంగ్య చిత్రకారులలో ఒకడు. "బాబు" కలం (కుంచె) పేరు. అసలు పేరు కొలను వెంకట దుర్గాప్రసాద్‌. ఇతని కార్టూన్లను 1963 సంవత్సరం నుండి మొదలు పెట్టి పుంఖాను పుంఖాలుగా అన్ని ప్రముఖ పత్రికల్లోను ప్రచురించారు. ఇతని కార్టూన్లు ఆంధ్రపత్రిక లో మొదట ప్రచురించబడ్డాయి. తరవాత్తరువాత, స్వాతి పత్రిక ప్రచురించబడుతున్నాయి. ఇతను వ్యంగ్య చిత్రాలను చిత్రించటమే కాకుండా కథానికల రచయిత కూడా. ఆపైన, వార పత్రికలలో ప్రచురితమయ్యే కథలు, కథానికలు, శీర్షికలు మరియు ధారావాహికలకు చక్కటి అర్ధవంతమయిన చిత్రాలను గీస్తుంటాడు. (ఇంకా…)

38వ వారం

వినాయక చవితి భారతీయ పండుగలలో ఒకటి. పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టిన రోజు. పురాణ గాధలలో శివుడు వినాయకుడిని అందరు దేవతలలోకి మిన్నగా ప్రకటించిన రోజు. వినాయకుని జ్ఞానానికి, సంపత్తికి మరియు మంచి అదృష్టానికి దేవతగా మరియు ప్రయాణం ప్రారంభించేటప్పుడు, లేక కొత్త పనులు చేపట్టేటప్పుడు ప్రార్థించటం సర్వసాధారణం. ఈ పండుగ భాద్రపద మాసంలో శుక్ల చతుర్థి (చందమామ వృద్ధిచెందే 4వ రోజున) ప్రారంభమవుతుంది. 19 ఆగష్టు నుండి 15 సెప్టెంబరు మధ్యలో ఈ రోజు ఉంటుంది. ఈ పండుగ 10 రోజులపాటు అనంత చతుర్దశి (వృద్ధిచెందే చందమామ 14వ రోజున) ముగుస్తుంది.

మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, గోవా రాష్ట్రాలలో ప్రముఖంగా ఈ పండుగను ఆచరిస్తారు. నేపాల్, అమెరికా, కెనడా, మారిషస్, సింగపూర్, థాయిలాండ్, కంబోడియా, బర్మా, ఫిజీ దేశాల్లో హిందువులు పండుగను ఆచరిస్తారు. (ఇంకా…)

39వ వారం

భారత నావికా దళం

క్రీస్తు పూర్వం, 2300లో ప్రస్తుత గుజరాత్‌లోని మంగ్రోల్ దగ్గర మొట్టమొదటి నౌకాతీరం నిర్మించబడినది. క్రీ.పూ. 4వ శతాబ్దంలో మౌర్య సామ్రాజ్యంలో మొదటిసారి నౌకా విభాగాన్ని ఏర్పరిచారు. చంద్రగుప్త మౌర్యుడి ప్రధానమంత్రి అయిన చాణక్యుడు తాను రచించిన అర్థశాస్త్రంలో 'నవాధ్యక్ష' (నౌకల నిర్వాహకుడు) పేరుతో నదీజలాల వినియోగం గురించి నిర్దేశించాడు. చుట్టూ ఉన్న దేశాలతో రాకపోకలకు, పలు రకార సంస్కృతులకు ఈ జలదారులు ప్రధాన కారణం. భారతదేశ చరిత్రలో మౌర్య, శాతవాహన, చోళ, విజయనగర, కళింగ, మరాఠా మరియు మొఘల్ సామ్రాజ్యాల నౌకా వ్యవస్థలు పేరెన్నికగన్నవి.

బ్రిటీషు ప్రభుత్వం భారతదేశాన్ని పాలిస్తున్నపుడు ది బ్రిటీష్ ఇండియన్ నేవీని ఏర్పరిచారు. ఇది 1946 నాటికి 78 ఓడలు 2,000 సిబ్బంది కలిగి ఉండేది. జనవరి 26, 1950న భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చిన రోజున నౌకాదళానికి ఇండియన్ నేవీగా , వాహకాలకు ఇండియన్ నావల్ షిప్స్ (INS) గా పేరు పెట్టారు. భారత రక్షణ వ్యవస్థలో భాగమయిన భారత నావికా దళం (ఇండియన్ నేవీ) 55,000 సిబ్బందితో ప్రపంచంలో నాలుగవ అతి పెద్ద నావికా దళం. కేవలం దేశరక్షణకే కాకుండా మానవతా సహాయాలకు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు సహాయం కొరకు భారత ప్రభుత్వం నేవీని వినియోగిస్తుంది.(ఇంకా…)

40వ వారం

కె.బాలచందర్ గా ప్రసిద్ధిచెందిన కైలాసం బాలచందర్ ప్రముఖ దక్షిణ భారతదేశ సినిమా దర్శకుడు, రచయిత మరియు నిర్మాత. వీరు 1930 సంవత్సరంలో తంజావూరు దగ్గర నన్నిలం గ్రామంలో జన్మించాడు. తొలుత అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయంలో పనిచేసేవాడు. అక్కడ ఉద్యోగం చేస్తూనే పలు నాటకాలు రాశాడు. ఎంజీఆర్‌ కథానాయకుడిగా నటించిన దైవతాయ్‌ చిత్రానికి సంభాషణల రచయితగా చలనచిత్ర రంగంలో ప్రస్థానం ప్రారంభించాడు. 45 ఏళ్లలో తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో 100కు పైగా చిత్రాలను రూపొందించాడు. రజనీకాంత్, కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ వంటి నటుల్ని చిత్రపరిశ్రమకు పరిచయం చేశాడు.

భారత చలనచిత్ర రంగం అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గాను 2010 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. (ఇంకా…)

41వ వారం

వేమన

"విశ్వదాభిరామ వినురవేమ" అనే మాట వినని తెలుగు వాడు ఉండడు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. వేమన చరిత్ర చాలా మంది పరిశోధకులు కృషి చేసినా అస్పష్టంగా వుంది.

వేమన వదిన నగలను అభిరాముడనే విశ్వబ్రాహ్మణుడు చేసేవారు. ఆ అభిరాముడు ఒక యోగిని సేవించి ఆతని అనుగ్రహానికి పాత్రుడయ్యారు. అయితే చివరి రోజున యుక్తిగా అభిరామయ్యను తమ భవనంలో కట్టడి చేసి, ఆ యోగి అవసాన సమయంలో వేమన వెళ్ళి బీజాక్షరాలు తన నాలుకపై రాయించుకొన్నారు. తిరిగి వచ్చి అభిరామయ్య కాళ్ళపైబడి క్షమించమని వేడుకొన్నారు. తరువాత అభిరామయ్య పేరు చిరస్థాయిగా ఉండేలా తన పద్యాలలో చెప్పాడు. ఆ తరువాత వేమన దేశమంతటా తిరిగి మఠాలు కట్టించారు. తత్వాన్ని బోధించాడు. అందరి యెదుటా యోగి సంప్రదాయంలో మహాసమాధి చెందారు. (ఇంకా…)

42వ వారం

నరేంద్ర మోడి


1950 సెప్టెంబర్ 17న జన్మించి నరేంద్ర మోడి ప్రస్తుతం గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. డిసెంబర్ 2007 శాసనసభ ఎన్నికలలో విజయభేరి మ్రోగించి వరుసగా మూడవ సారి గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్ని చేరువైనారు. 1990లలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఆర్గనైజర్‌గా ఉంటూ రాష్త్రంలో పార్టీ అభివృద్ధికై విశేష కృషి సల్పినారు. దాని పలితమే 1995లో గుజరాత్‌లో భాజపా అనూహ్యమైన విజయం సాధించింది. పార్టీ అధికారంలోకి రావడాన్కి కృషి చేసిననూ వెంటనే అధికార పీఠం దక్కలేదు. 2001లో కేశూభాయి పటేల్ ఉప ఎన్నికలలో భాజపా ఓటమిని నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోడికి అధికార పగ్గాలు లభించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో మోడికి తిరుగులేకుండా పోయింది. అప్పటి నుంచి నేటి వరకు కూడా ఆయనే ముఖ్యమంత్రి అధికార పీఠంపై ఆసీసులై ఉన్నారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలోకి నడిపిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగిస్తున్నారు. అత్యుత్తమ భారతీయ పరిపాలన సామర్థ్యానికి గుజరాత్ నిదర్శనమని అమెరికా అభివర్ణించింది.(ఇంకా…)

43వ వారం

హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాధల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. (ఇంకా…)

44వ వారం
పోరాడుతున్న భారతీయ సైనికులు

భారత్ పాకిస్తాన్ యుద్ధం 1947
భారత్ పాక్ ల మధ్య 1947లో జరిగిన యుద్ధాన్ని మొదటి కాశ్మీర్ యుద్ధం అని వ్యవహరిస్తారు. కాశ్మీర్ ప్రాంతం కోసం జరిగిన యుద్ధం 1947లో మొదలై 1948లో ముగిసింది. భారత్ పాక్ ల మధ్య జరిగిన నాలుగు యుద్ధాలలో ఇది మొదటిది. యుద్ధం అప్పుడే కొత్తగా స్వాతంత్ర్యం పొందిన రెండు దేశాల మధ్య జరిగింది. ఈ యుద్ధ పరిణామాలు ఇప్పటికీ ఇరు దేశాల భౌగోలిక రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి.(ఇంకా…)

45వ వారం

భారతదేశంలో మహిళలు

గత కొన్ని సహస్రాబ్దాలుగా భారతదేశంలో మహిళ ల పాత్ర అనేక గొప్ప మార్పులకు లోనయ్యింది. పురుషులతో సమాన స్థాయి కలిగివున్న భారతీయ మహిళలు మధ్యయుగంలో అధమ స్థాయికి అణిచివేయడటం, అనేకమంది సంఘ సంస్కర్తలు తిరిగి వారికి సమాన హక్కుల కల్పన కోసం కృషి చేయడం, ఇలా భారతదేశంలో మహిళల చరిత్ర అనేక సంఘటనల సమాహారంగా ఉంది. ఆధునిక భారతదేశంలో మహిళలు దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, ప్రతిపక్ష నాయకురాలు వంటి అత్యున్నత పదవులను అలంకరించారు. భారతదేశపు ఇటీవలి రాష్ట్రపతి ఒక మహిళ.(ఇంకా…)

46వ వారం
దీపావళి ముగ్గులు

దీపావళి
భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. చీకటిని త్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమవాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు. (ఇంకా…)

47వ వారం

విలియం షేక్‌స్పియర్, ఒక ఆంగ్ల కవి, నాటక రయయిత మరియు నటుడు. ప్రస్తుతము చాలామంది ఇతన్ని గొప్ప ఆంగ్ల రచయితగానూ, ప్రపంచ నాటక రచయితలలో మిన్నైన వానిగానూ గుర్తిస్తున్నారు ఇతన్ని తరచూ ఇంగ్లాండు జాతీయ కవిగానూ, బార్డ్ ఆఫ్ అవాన్ (కవీశ్వరుడు) గానూ పిలుస్తారు. ఇతని రచనల్లో ప్రస్తుతం 34 నాటకాలు, 154 చతుర్పాద కవితలుసొన్నెట్ - పద్యాలురెండు పెద్ద వ్యాఖ్యాన కవితలు మరియు ఇంకా చాలా ఇతర కవితలు లబిస్తున్నాయి. ఇతని నాటకాలు ప్రపంచంలోని అన్ని ముఖ్య భాషల్లోకీ తర్జుమా చెయ్యబడినాయి, అంతే కాకుండా ఏ ఇతర నాటకాలూ ప్రదర్శించనన్నిసార్లు ప్రదర్శించబడినాయి. (ఇంకా…)

48వ వారం

లాస్ ఏంజలెస్ (లాస్ ఏంజిల్స్) అమెరికా సంయుక్త రాష్ట్రాల లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన నగరము. ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాలలో న్యూయార్క్ తరవాత అత్యధిక జనాభా కల్గిన పెద్ద నగరము. పడమటి తీర నగరాలలో ఇది అతి పెద్దది. ఎల్.ఎ. (LA) సంక్షిప్త నామము కల్గిన ఈ పట్టణము ప్రపంచ నగరాలలో ఆల్ఫా నగరముగా గుర్తించబడినది. ఈ నగరము 469.1 చదరపు మైళ్ళ విస్తీర్ణము కల్గి 2006 నాటి అంచనా ప్రకారము 38,49,368 జనసంఖ్యను కల్గి ఉంది. కాలిఫోర్నియా దక్షిణ ప్రాంతంలో పసిఫిక్‌ మహాసముదపు తీరాన ఉన్న ఈ నగరము మద్యధరా ప్రాంతపు శీతోష్ణస్థితిని కల్గి ఉంటుంది. గ్రేటర్ లాస్ ఏంజలెస్ అనబడే నగరపాలిత ప్రాంతమైన లాస్ ఏంజలెస్, లాంగ్ బీచ్, శాంటా అన్నా ప్రాంతము లో ఒక కోటీ ముప్పది లక్షల మంది నివాసము ఉంటారు. ప్రపంచము నలుమూలల నుండి వచ్చి చేరిన ఇక్కడి ప్రజలు షుమారు నూరు విభిన్న భాషల వరకు మాట్లాడుతుంటారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల లోనే పెద్ద జిల్లా(కౌంటీ)అయిన లాస్ ఏంజలెస్ జిల్లాకు ఈ నగరము కేంద్రము. ఏంజలాన్స్ అనబడే పూర్వీకులు ఇక్కడ నివసించినట్లు గుర్తించారు. ఈ నగరానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యమున్న ముద్దుపేరు సిటీ ఆఫ్ ఏంజల్స్(దేవతల నగరము). (ఇంకా…)

49వ వారం

నిజామాబాదు జిల్లా

నిజామాబాదు జిల్లా భారత దేశము లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము యొక్క తెలంగాణ ప్రాంతము నందు ఉన్నది. నిజామాబాదు నగరము ఈ జిల్లా ముఖ్య పట్టణము. నిజామాబాదు ను పూర్వము ఇందూరు మరియు ఇంద్రపురి అని పిలిచేవారు. బోధన్, కామారెడ్డి, ఆర్మూరు ఇతర ప్రధాన నగరములు. నిజామాబాదు నగరం హైదరాబాదు, వరంగల్ తరువాత తెలంగాణాలో అతిపెద్ద నగరం.

నిజామాబాద్ ను 8వ శతాబ్దములొ రాష్ట్రకూట వంశానికి చెందిన ఇంద్రవల్లభ పాంత్యవర్ష ఇంద్ర సొముడనే రాజు పరిపాలించాడు. అతని పేరుపైననే ఈ ప్రాంతానికి ఇందూరు అని పేరు వచ్చినది. తరువాత 1905వ సంవత్సరములో ఈ ప్రాంతములో నుండి (సికింద్రాబాద్ నుండి మన్మాడ్ వరకు) రైలు మార్గము ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడి ప్రాంతానికి అప్పటి రాజు నిజాం-ఉల్-ముల్క్ పేరు పెట్టి,నిజామాబాద్ గా మార్చడం జరిగింది.

జిల్లాలో చారిత్రక శిల్పసంపదకు కొదవలేదు. రాజులు ఏలిన సంస్థానాలలో నేటికీ చారిత్రక కట్టడాల ఆనవాళ్ళు దర్శనమిస్తున్నాయి. క్రీ.పూ.3000 నాటికే జిల్లాలో మానవుల ఉనికి ఆధారాలున్నాయి. అందుకు చరిత్రకారులకు దొరికిన 'కైరన్'(చనిపోయిన వారిని వారికి ఇష్టమైన వస్తువులతో కలిపి పూడ్చిపెట్టి దాని చుట్టూ కొన్ని గుర్తులను అమర్చడం)లే నిదర్శనం. దీని ద్వారానే ప్రాచీన కట్టడాలైన రాష్ట్ర కూటులు, బోధన్ చాళుక్య, కల్యాణి చాళుక్యులు, కాకతీయుల ఆలయాలు, ముస్లిం నిర్మాణాలు తెలిశాయి.

(ఇంకా…)

50వ వారం

లాల్ కృష్ణ అద్వానీ
భారతదేశపు ప్రముఖ రాజకీయ నాయకులలో ఒకడైన లాల్ కృష్ణ అద్వానీ 1927 నవంబర్ 8న సింధ్ ప్రాంతంలోని కరాచిలో జన్మించాడు. 15 సం.ల వయస్సులోనే ఆర్.ఎస్.ఎస్.లో ప్రవేశించాడు. ఆ తరువాత దేశ రాజకీయాలకే అంకితమయ్యాడు. భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి అనతి కాలంలొనే ముఖ్య పదవులు పొందినాడు. 1967లో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షుడైనాడు. 1977లో మురార్జీ దేశాయ్ ప్రభుత్వంలో మంత్రిపదవికి పొందినాడు. 1980లో భాజపా ఏర్పడిన తరువాత దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించే అవకాశం లభించింది. అటల్ బిహారి వాజపేయి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కీలకమైన హోంశాఖ పదవిని నిర్వహించాడు. 2009 ఎన్నికలకు ముందే భాజపా ప్రధాని అభ్యర్థిగా ప్రకటింబడ్డాడు. (ఇంకా…)

51వ వారం

కమల్ హాసన్

కమల్ హాసన్ (తమిళం : கமல்ஹாசன்) నవంబర్ 7, 1954 లో తమిళనాడు రాష్ట్రం రామనాథ పురం జిల్లాలోని పరమక్కుడి లో,పుట్టెను. కమల్ 6 యేళ్ళ పసి వయసులోనే చిత్ర రంగంలోకి ప్రవేశించారు. ఆయన మొదటి చిత్రం "కలత్తూర్ కన్నమ్మ". బాల్యంలోనే ఆయన శాస్త్రీయ కళలను అభ్యసించారు. నూనుగు మీసాల వయసులో సినిమాలలో నృత్య దర్శకుడిగా పని చేసారు. అదే సమయంలో ప్రసిద్ధ తమిళ సినీ దర్శకుడు కె.బాలచందర్ తో ఆయనకు ఏర్పడిన అనుబంధం తరువాత సుదీర్ఘ గురు-శిష్య సంబంధంగా మారింది. కమల్ నేపధ్య గాయకుడిగా కూడా శిక్షణ పొందాడు. ఇటీవలి కొన్ని చిత్రాలలో పాటల రచయితగా కూడా పని చేసారు. భరత నాట్యం ప్రదర్శించటంలో ఆయనకి ఆయనే సాటి. కమల్ హాసన్ జాతీయ నటుడు. బహుముఖ ప్రజ్ఞగల ఈ నటుడు ప్రధానంగా దక్షిణ భారత చిత్రాలలో, అందునా ఎక్కువగా తమిళ చిత్రాలలో నటించినప్పటికీ భారత దేశ మంతటా సుపరిచితుడు. (ఇంకా…)

52వ వారం

యేసు
యేసు (Jesus) (క్రీ.పూ 7–2 నుండి క్రీ.శ 26–36 వరకు) నజరేయుడైన యేసుగా కూడా పిలవబడే ఈయన పేరిట క్రైస్తవ మతము పౌలు గారిచే అంతియొకయలో ప్రారంబించబడింది.ఈయన యేసు క్రీస్తుగా కూడ వ్యవహరించబడతాడు. క్రీస్తు అన్న పదము గ్రీకు భాషలో క్రీస్తోస్ ("ఆభిషిక్తుడు")నుండి పుట్టింది.ఇది హీబ్రూలో "మెసయ్యా"కు సమానం.

కొత్త నిబంధన గ్రంథం లోని నాలుగు సువార్తలుమత్తయి, మార్కు, లూకా మరియు యోహాను సువార్తలలో యేసు జీవితము మరియు బోధనలకు సంబంధించిన సమాచారం ఉంది.చాలా మంది బైబిలు పరిశోధకులు మరియు చరిత్రకారులు యేసు, గలిలయకు చెందిన ఒక యూదు మత బోధకుడని,బాప్తిస్మమిచ్చు యోహానుచే బాప్తిస్మము పొందాడనీ, తనను తాను దేవుని ఎకైక అద్వితీయ కుమారుడని తద్వార దేవునికి సమానుడనే, రోమన్ సామ్రాజ్యాన్ని మాయచేస్తున్నాడనే ఆరోపణలతో రోమన్ అధికారి పొంతి పిలాతు ఆజ్ఞానుసారము శిలువ వేయబడ్డాడని అంగీకరిస్తారు.

యేసుక్రీస్తుపై విభిన్న క్రైస్తవ ధృక్కోణాలు పాతనిబంధన గ్రంథం లేదా యూదు తోరాహ్ లో వస్తాడని చెప్పిన మెసయ్య లేదా క్రీస్తు ఈయనే అని, ఈయన సిలువవేయబడిన తరువాత సమాధి నుండి లేచి వచ్చాడనే భావనల పై కేంద్రీకృతమై ఉన్నాయి. అధిక శాతం క్రైస్తవులు యేసుని, తమ పాప ప్రక్షాళన కొరకు మరియు దేవునితో సమాధానపరుచుటకు పంపబడిన దేవుని కుమారుడిగా భావిస్తారు. త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మే క్రైస్తవులు యేసుని దేవుని యొక్క అవతారంగా భావిస్తారు.యేసు దైవత్వము సంబంధంచిన గూఢార్థాల విద్యను క్రిస్టోలొజి అని పిలుస్తారు.కన్యకు పుట్టటం,పరలోక ప్రయాణం , రెండవ రాకడ.అద్భుతాలు. యేసు పాత నిబంధన గ్రంథం లోని ప్రవచనాలను నెరవేర్చారని నమ్ముతారు. (ఇంకా…)

53వ వారం

మహా విస్ఫోటం
మహా విస్ఫోటం లేదా బిగ్ బేంగ్( Big Bang), అనేక స్వతంత్ర పరిశీలనల ఫలితంగా ఏర్పడిన వాదము. దీని ప్రకారం, విశ్వం, మహా ద్రవ్యరాశి మరియు ఉష్ణస్థాయి నుండి నేటి వరకు గల వ్యాప్తి చెందింది. సాధారణ ఉపయోగకరమైన పరిశీలన ఏమనగా విశ్వం గేలక్సీలను మోస్తూ తనంతట తాను వ్యాప్తిచెందుతూ వుంది.ఇది విశ్వం యొక్క ఖగోళ భౌతిక నమూనా . 1929 లో ఎడ్విన్ హబుల్ పరిశీలనలలో 'గేలక్సీల మధ్య దూరాలు వాటి రెడ్ షిఫ్ట్ కు అనులోమానుపాతంగా వున్నాయని గుర్తించాడు. ఈ పరిశీలనన ఫలితంగా 'విశ్వం విస్తరిస్తూ ఉంది' అనే నిర్ధారణకు రావడం జరిగింది. నేటికినీ విశ్వం విస్తరిస్తూ ఉంది అనగా, అది ప్రారంభ దశలో విపరీతమైన ద్రవ్యరాశి మరియు ఉష్ణాలను కలిగి వుండేదని తేటతెల్లమౌతుంది.

(ఇంకా…)


ఇవి కూడా చూడండి మార్చు